ఇంటర్వ్యూలు

(March,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ప్రవాహ శీలతే స్త్రీవాదానికి ప్రధాన బలం - వి. ప్రతిమ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు వి. ప్రతిమ  గారు ఇచిన ఇంటర్వ్యూ 

1.     అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    అంతర్జాతీయ మహిళా దినాన్ని శ్రామిక మహిళా పోరాట దినంగానే, మహిళా హక్కు పోరాట దినంగానే మనం అర్థం చేసుకోవసి వుంటుంది. అయితే 1975లో మార్చి 8 ని  అంతర్జాతీయ మహిళా దినంగా, ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించే నాటికి వాళ్ళు, వీళ్ళు ఆ వర్గమూ, ఈ కులమూ అన్న తేడా  లేకుండా చీకట్లలో వున్న స్త్రీలంతా తమ గాయాలను, కన్నీళ్ళనూ, అవమానాలను, అపజయాలను తడుముకుంటూ అసమానతలు  లేని ఒక దోపిడి పిడనలు  లేని సమాజాన్ని కలగంటూ ఆశావహంగా మహిళలంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని స్వంతం చేసుకోవడం జరిగింది. కానీ క్రమంగా దాన్ని శ్రామిక మహిళకు ఏ మాత్రం సంబంధం  లేనట్లుగా, ఒక సరదా అయిన రోజుగా, ఒక ఉత్సవంలాగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి స్త్రీలు  జరుపుకునేట్లుగా చేశాయి ప్రభుత్వాలూ, రాజ్యాంగేతర శక్తులూ, విజువల్  మీడియా కలిసి.  స్త్రీని స్వీయ ప్రగతి కోసం ఆలోచించనీయకుండా వారి  మీద రాజకీయ, ఆర్థిక, మతదాడులూ, హింసా అలా తమ పని తాము చేసుకుంటూ పోతు వుంటాయి... అధవా  ఎవరయినా ఒకరు మాట్లాడాలని ప్రయత్నించిన వారిని సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా అవమానాల పాలుచేసి, వ్యక్తిత్వ హననాలకు పాల్పడి  మిన్నకుండేట్టు చేస్తారు. స్త్రీ సమస్య గురించి మాట్లాడే వారినెవరినీ రాజ్యం సహించదు. నిలవరించదానికి వారిపై రకరకాల  దాడులను ప్రయోగిస్తున్నారు. మరీ దళిత, గిరిజన, ఆదివాసి మహిళల మీదయితే జీవించే హక్కును కూడ లేకుండా చేసి కరడుగట్టిన దౌర్జన్యాన్ని వారిపై ప్రకటిస్తుంది.
    దశాబ్ది చైతన్యం కావొచ్చు, నిరంతర హింస నుండి పొడసూపిన చైతన్యం కావచ్చు మధ్య తరగతి మహిళలే కాక, శ్రామిక మహిళలు  కూడ చిన్న చిన్న సముహాలుగా ఏర్పాడి ఎక్కడికక్కడ తమ హక్కుల కోసం ప్రయత్నిస్తూ చేస్తోన్న ఉధ్యమాలు, పోరాటాలు  మార్చి ఎనిమిదిని పదనెక్కిస్తున్నయని అర్థం చేసుకోవాలి.  ఆశను కలిగిస్తున్న షాహిన్‌ బాగ్  వంటి నిరంతర పోరాటాలే, యుద్దాలే మార్చి ఎనిమిదికి నిజమైన అర్ధాన్ని చెప్పగలవు.
    2.  స్త్రీవాదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 
     ఈ పితృస్వామ్య సమాజం వేలయేళ్ళుగా పెంచి పోషిస్తోన్న పురుషుడి అధీకృత, స్త్రీ ఆధీన సంబంధాలను గుర్తించి, ఏ అంగీకృతమై పోయిన భావజాలాన్ని ఆమోదించడం వ్ల స్త్రీలు  తమకు తెలియుండానే తాము విలువల  గుప్పిట్లో,  సంకెళ్ళలో బందీలవుతూ వచ్చారో... స్త్రీలను నియంత్రిండం, పీడనకు గురిచేసి అణిచి వేయడమనే ప్రక్రియ ఎంత సార్వజనీనంగా సాగుతూ వచ్చిందో, అధ్యయనంచేసి, మొత్తంగా ఈ సమాజంలో స్త్రీ స్థానమేమిటి అన్నది అర్థం చేసుకోవసి వుంటుంది. స్వేచ్ఛ అన్నది నిజానికి ఒక కఠోరమైన బాధ్యత... అది ఎప్పటికప్పుడు తన విస్తృతిని పెంచుకుంటూ పోతుంది. మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త అణచివేతను, కొత్త హింసారూపాలను గుర్తిస్తూ, దానినుంచి బయటపడే, స్వేచ్ఛను పొందే యుద్ధం నిరంతరం చేసుకుంటూ పోవల్సిందే... ఈ ప్రవాహ శీలతే స్త్రీవాదానికి ప్రధాన బలం.
    3.  తెలుగులో స్త్రీవాద సాహిత్యం వెలువడ్డానికి భూమిక ఏమిటి? స్త్రీవాద సాహిత్య అవసరం ఈ నాటికీ వున్నదనుకుంటున్నారా?  80,90ల్లో బలంగా రావడానికి కారణాలేమిటి?
    పైన చెప్పుకున్న స్త్రీవాద సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు చెప్పుకున్న జవాబే స్త్రీవాద సాహిత్య ఆవిర్భవానికి భూమికగా మనం చెప్పుకోవచ్చు... ఐక్యరాజ్య సమితి 1975లో అంతర్జాతీయ మహిళ సంవత్సరాన్ని, ఆ తర్వాత మహిళా దశాబ్దాన్ని జరపాలని ప్రకటించడంలో మహిళకు తాము జీవిస్తోన్న జీవితం పట్ల ఒక అవగాహన, కొత్త వూపిరి పీల్చుకునే మార్పు పట్ల అభిలాష పదునెక్కడం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో మీదే స్త్రీలు  తమకు తెలీయకుండానే తమ జీవితాలు  ఎట్లా పురుషుడి  ప్రమేయంతో అల్లుకు  పోయివుంటాయో గుర్తించి  ఆ భ్రమన్నింటినీ చెదరగొడుతూ, శరీర రాజకీయాలను అర్థం చేసుకుంటూ స్త్రీలు  రాయడం మొదలు పెట్టారు... ఒక విధంగా స్త్రీవాద ఉద్యమానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా, ఒక వాహికగా చేసుకున్నారు  స్త్రీవాదులు.   రాయడం అన్నది రాయడం కోసంకాక, సమాజంలో స్త్రీ పరిస్థితి గుణాత్మకంగా మారడమే ధ్యేయంగా, ముఖ్యోద్దేశంగా సాగింది. అది 80, 90  నాటికి స్పస్టమైన రూపాన్ని తీసుకుని అస్తిత్వవాద ఉద్యమాల  నేపథ్యంలో నుండి బలమైన ఉద్యమంగా  ఎదిగిందని చెప్పవచ్చు.. ఆ క్రమంలో స్త్రీవాదులు  అధ్యయనం, రచయిత్రులను సమావేశపరచడం, ఉపన్యాసాలు, చర్చలు  సాధనాలుగా చేసుకుని అలా స్త్రీవాద ఉద్యమ నిర్మాణ క్రమంలో కార్యకర్తలే రచయిత్రులుగా, రచయిత్రులే కార్యకర్తలుగా పనిచేసిన సందర్భం అది.
    పితృస్వామ్యపు కుదుళ్ళను ఉత్తరించి, సన్నని వేర్లుకూడా మిగలకుండా ఏరివేయగలిగితేనే తప్ప స్త్రీవాద సాహిత్య అవసరం ఏనాటికయినా మిగిలే వుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోన్న హింసను గుర్తించి పోరాడాల్సిన అవసరం వున్నప్పుడు సాహిత్యం కూడా ఆ యుద్ధంలో భాగమే కదా... ఏమైన స్త్రీవాద సాహిత్య అవసరం లేకుండా పోయే రోజు కోసం ఎదురుచూద్దాం.
    4.  స్త్రీవాదానికి, మహిళా జన జీవన అధ్యయనాలకు వున్న సంబంధ మేమిటి?
     ఇవి రెండూ నిజానికి ఒక దానితో మరొకటి అనుసంధానించబడినివి... సమస్యను గుర్తించి లోతులకెళ్ళి అధ్యయనం చేయడం... నిజానికి  పరిమిత అధ్యయనం, వ్యక్తీకరణ ( ఏ రూపం లోనయినాగాని ) యివన్నీ ఒక దానితో ఒకటి మిళితమైన పోరాట సాధానాలు ... ఈ పితృస్వామిక వ్యవస్థలో పురుషుడు తన అధిక్యతను నిలుపుకోవడానికి స్త్రీలను ఎట్లా మెట్లుగా వాడుకున్నాడో... స్త్రీలను వస్తూత్పత్తి క్రములో ప్రత్యక్ష సంబంధం కోల్పోయేట్టు చేసి, సంతానోత్పత్తి ఇంటిపని వంటి స్త్రీలు  నిర్వహించే విధున్నింటినీ ప్రవేటీకరించి వాటిని వ్యక్తిగత సమస్యలుగా లేక కుటుంబ సమస్యలుగా ప్రక్కకి పెట్టడం, అంతే కాకుండా స్త్రీల అదనపు శ్రమని విస్మరించిన ఆర్థిక సూత్రాలు, స్త్రీ ఇంటి చాకిరీని మినహాయించిన మార్కెట్‌ నమూనా, వారిపై కుటుంబ హింస, వారి హోదా, స్థితి గతులపై ఆర్థిక విధానాల ప్రభావం, శ్రామిక స్త్రీల పై పేదరిక భారం యివన్నీ కూడ లోతుకెళ్ళి చర్చించగల  అవగాహనని అధ్యయనం కలిగించింది. స్త్రీలను వంటింటి  బానిసలుగా మార్చివేసిన క్రమం, ఆమె మొదలు పాచిపట్టి  పోవడం, ఇంటిచాకిరి కోసం స్త్రీలు  ఇరవై చేతులు  మొలిపించుకోడం యివన్నీ కూడా మహిళా జనజీవన అధ్యయనం లోంచి అవగాహన కొచ్చినవే... అధ్యయనంలోంచి అంకురించిందే ఉద్యమం...
    5.  స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంతవరకూ ప్రభావితం చేసింది?
     స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యపు ప్రధాన స్రవంతిలో  ధీటుగా నిలబడిందని  చెప్పకతప్పదు. ఆ క్రమంలో అనేక రకాల  దాడులను, ఆటుపోట్లను, అపవాదులనూ, అవమానాలను ఎదుర్కొని మరీ నిబడిరది. తొగు సాహిత్యన్నే కాదు, తెలుగు సమాజాన్ని కూడ ప్రభావితం చేసింది. వంద మంది పురుషులు  స్త్రీవాద సాహిత్యాన్ని చదివి స్త్రీ పురుష సంబంధాలను, సమాజంలో స్త్రీ హోదా, స్థితి గతులను లోతుగా అవగాహన చేసుకుని చైతన్య వంతుయిన సందర్భాలున్నాయి.  స్త్రీ ఉధ్యమపు అంతిమ ధ్యేయం అదేకదా.  స్త్రీల  స్థితి గతుల  పట్ల పురుషులని చైతన్యవంతుల్ని చేయడం స్త్రీ, పురుషలిరువురు శత్రువు కాదన్న అవగాహనని  కలిగించడం... నిజానికి పురుషుడు కూడ ఈ వ్యవస్థ గుప్పిట్లో బంధీగా వున్నాడన్న విషయాన్ని ఎరుకపరిచి స్త్రీ, పురుషులిరువురూ బంధనాలు  తెంచుకుని విముక్తి దిశగా సాగి కొత్త వ్యవస్థని నిర్మించుకోవాన్నదే స్త్రీవాద ఉధ్యమ ధ్యేయం, లక్ష్యం... అందుకోసం స్త్రీవాదులు  పురుషులని, తద్వారా సమజాన్ని చైతన్యపరిచే సాహిత్య భవంతులని నిర్మించివుంచారు. ఆ భవంతులు  తెలుగు సాహిత్యపు ప్రధాన స్రవంతికి ధీటుగా నిబడ్డాయనే చెప్పాలి.
    6.  ఇప్పుడు విధిగా,  ప్రత్యేకంగా, స్త్రీవాదం పేరిట ఉన్నతంగా రచనలు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు?
పితృస్యామ్యం ఉత్పత్తి క్రమంలో, సమాజ సందర్భాలలో తమని  భాగస్వామ్యం చేయకుండా వంటిల్ల  లోకి నెట్టి వేసినప్పటికి, ఈ ప్రపంచం ఏ మాత్రం సిగ్గూలేకుండా తమ పడగ్గదుల్లోకి ప్రవేశించి, తమని శాసిస్తోన్న క్రమాన్ని స్త్రీలు  త్వరగా గుర్తించారు. రూపాలు  మార్చుకుంటూ తమని కబళిస్తోన్న కొత్త హింసల్ని గుర్తించి అటువైపుగా తమ పోరాటాన్ని విస్తరించారు. తాము సమాజంలో ఒక భాగం తమని  తాము నిలబెట్టుకుంటూ మారుతున్న చలన సూత్రాలతో పాటు అడుగులు వేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తమని చెల్లాచెదురు చేయడానికి పెద్ద ప్రయత్నం చేసిన విశ్వకరణకి  వ్యతిరేకంగా తాము ఒక ఐక్యసంఘటనగా నిలబడ్డాం కాబట్టి వేగవంతమైన సమాజ మార్పుతో పాటు స్త్రీవాదం తన మార్గాన్ని మళ్ళించుకుందే  తప్ప ఉదృతంగా రచనలు  రావడం లేదని చెప్పలేం ...ఇవ్వాళ యువరచయితరులు  ఆ వేగవంతమైన సమాజ మార్పుల్ని పట్టుకుని స్త్రీ దృష్టికోణం నుండి సాహిత్యానికి చేర్పుచేయడం అభినందనీయం.    
    7.  స్త్రీ వాదం ఎక్కువగా తనకు మద్దతు యిచ్చే ఉద్యమాను, ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నించింది. కాని పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం. దీని గురించి మీరేమంటారు?
     ప్రత్యక్షంగా పాలకులను ప్రశ్నించక పోయినప్పటికీ స్త్రీవాదపు సెగలు  ప్రభుత్వాలదాకా పాకాయనే చెప్పుకోవాలి. 1975 మహిళ సంవత్సరం, ఆ తర్వాత మహిళ దశాబ్ది నేపథ్యంలోంచి, ప్రాంతీయ మహిళ ఉద్యమాల  మూలంగా స్త్రీల  జీవితాలలో అభ్యుదయకరమైన మార్పు గురించి ప్రభుత్వాలు  పట్టించుకోక తప్పలేదు. ఫలితంగా మహిళా సాధికారత, స్వావంబన భావనలు బలంగా, స్పష్టంగా ప్రజల  విధానాలుగా ముందుకొచ్చాయని చెప్పాలి. మానవ జాతి అభివృద్దికి స్వాతంత్య్రం, సమానత్వం చాలా  అవసరమని, అసమానతలు  లేని స్త్రీ, పురుష సంబంధాలను ఏర్పరచుకోవాననీ,  స్త్రీలు  కూడ సమాజంలో పురుషులతో పాటు సమాన పాత్ర నిర్వాహించే అవకాశాలు  కల్పించాలనీ, స్త్రీ, పురుషులందరూ కలిసి నడుస్తూ సాధించే అభివృద్ధి మీదనే సమాజాభివృద్ధి ఆధారపడి వుంటుందని ప్రభుత్వాలకు అర్థం చేయించిన సందర్భం  అది.
    అక్షరాస్వతా కార్యక్రము మూలంగా గ్రామీణ స్త్రీలు చైతన్యవంతులయి సాగించిన సారా ఉద్యమం కేవలం స్త్రీల  ఆలోచనలో నుండి, వారి సంఘటిత శక్తులలో నుండి రూపొందించిబడిన ఉద్యమం ... మొత్తంగా సమాజాన్ని, ప్రభుత్వాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలుసు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి ఎన్నో ప్రాంతీయ మహిళా ఉద్యమాలు  సార్వజనీనమై పాలకులను ప్రశ్నించాయనే చెప్పుకోవాలి.
    8.  నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియ కంటే స్త్రీవాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడ్డానికి కారణాలేంటి?
    నిజమే స్త్రీల ధిక్కారస్వరం మొదటగా కవిత్వంలోనే పదునెక్కిన బాణంలా దూసుకుచ్చింది... తమ అసంతృప్తులను, ఆవేశ, కావేశాలను వ్యక్తం చేయడానికి, తమ స్థితి, గతుల్ని సమాజానికి ఎరుక పరచడానికి చాలా  దగ్గరి మార్గంగా కవిత్వాన్నే ఎన్నుకున్నారు. 
    ‘‘సారం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తానని
    పంతుగారన్నప్పుడే భయమేసింది... 
ఆఫీసులో నా మొగుడున్నాడు 
అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమొచ్చింది.... అంటూ పెళ్ళి, మొగుడు అన్న పదాల  అర్థాలని విడమరుస్తూ మొత్తంగా ఈ వివాహా వ్యవస్థ ఎట్లా బందిపోట్లలా  స్త్రీలను పీడించుకు తింటోందో కేవలం  పదివాక్యాలలో శిల్ప రూపాలను మిళితం చేసి అర్థం చేయిస్తుంది ‘‘బందిపోట్లు’’ కవిత... ఖైదుమెట్లయిన వంటగదుల్లో ప్రేతాల్లా తేలుతుండే స్త్రీలు, నడుస్తున్న వంట గదుల్లా వుండే స్త్రీలు, లేబర్‌ రూములూ, సర్పపరిష్వంగాలు, అబార్షన్‌ స్టేట్‌మెంట్లూ, మెహందీ స్త్రీల  విజ్ఞప్తులూ, ఒంటి నిట్రాడి గుడిసెలు, అనార్కలి సమాధులు, మూడురాళ్ళ పొయ్యిలూ  యిలా మొత్తంగా కుటుంబ, సమాజ హింసమీద అల్పాక్షరాలలో అనల్ప  పోరాటాన్ని సాగించడానికి తక్షణ స్పందనగా స్త్రీవాదులు  కవిత్వాన్ని ఎన్నుకుని ఉండొచ్చు ... మారుతున్న విలువలకు అనుగుణంగా  ప్రతిస్పందిస్తూ సామాజిక చైతన్యపు వెలుగులోకి ప్రయాణించే  క్రమంలో తమ సమస్యలను చర్చించడానికి ఒక విస్తృతమైన కాన్వాస్‌ అవసరమనిపించి కథని, నవలని, నాటకాన్ని ఆశ్రయించారు.
    9.  స్త్రీవాదం పట్ల మీరెలా ఆకర్షితుయ్యారు?
     మీ అందరికీ తెలిసిందే...నాలుగ్గోడల  నడుమా వుంటూ వుంటూ సాహిత్యంతో స్నేహం చేసి మా సామాజిక  వర్గంలోని స్త్రీల  స్థానాన్ని ( ఈ సమాజంలో ) అంచనా వేస్తూ, అధ్యయనం చేస్తూ, అర్ధం చేసుకుంటూ వారి స్థితిగతుల్ని వ్యక్తం చేయడానికి సాహిత్యాన్ని ఒక వాహికగా, సాధనంగా చేసుకున్నానేమో  అన్పిస్తుంది... అందరివలె తొలుత కవిత్వంతో నా ఆలోచనల  విస్తృతి పెరిగేకొద్దీ కథని ఆలంబన చేసుకుని ఉండొచ్చు... మహిళ జనజీవన అధ్యయనంతోనే నేను స్త్రీవాదానికి దగ్గరయ్యాను. నా పరిమితుల్లో నుండి సాధ్యమైనంత పనిని స్త్రీవాద సాహిత్యానికి చేర్పు చేశానని భావిస్తున్నాను... కాలమే చెప్పాలి.
    10. దళిత స్త్రీవాదం గురించి చెప్పండి.
    అగ్రకుల  స్త్రీవాదం వెలివాడ స్త్రీల  జీవితాలను పట్టించుకోలేదనీ, మూడురాళ్ళ పొయ్యి గమ్యం తాకలేదనీ వచ్చిన ఆరోపణలతో స్త్రీవాదులు  తమని తాము విమర్శకి పెట్టుకోవసిన అవసరం ఏర్పడింది ...
    మనం ఎంతో నాగరీకమని భావిస్తోన్న ఈ సమాజానికి అంచున జీవిస్తోన్న ఒకానొక సామాజిక వర్గపు అణిచివేత గురించీ, అవమానాల  గురించీ, అక్కడ కూడా బానిసకు బానిసకు బనిసయిన స్త్రీల  జీవితాల  గురించి ఈ సభ్య సమాజానికి ఎరుక పరిచి వేలతరాలుగా మొద్దుబారి పోయిన చర్మాలను ములుగర్రతో పొడిచింది దళిత స్త్రీ సాహిత్యం...క్రిస్టియన్‌ మైనారిటీ, ముస్లిం మైనారిటీ  అయితేనేమి...కేవలం  కథలు  రాయడం కోసమో, పేరుకోసమో వాళ్ళు సాహిత్య సృజన చేయలేదు. వారికి సాహత్య సృజన అంటే కేవలం  బయటి విషయం కాదు. లోలోపలి అవసరం అనివార్యం... తమలోపలికి తాము తొంగి చూసుకుంటూ, ఒక గురుతర బాధ్యతతో దళిత స్త్రీకోణం నుండి సాహిత్యాన్ని వెలువరించారు. 
    లింగ వివక్ష మాత్రమే కాదు వర్గమూ, కులమూ, లింగమూ అన్న మూడు బండరాళ్ళను నెత్తిన మోస్తోన్న స్త్రీ జీవన విషాదాన్ని నగ్నంగా మన కళ్ళముందు పరిచి మనం ఉలిక్కిపడి తలలు  దించుకునేలా చేస్తుంది వారి సాహిత్యం.
    వేల  ఏళ్ళుగా ఈ సమాజపు నరనరాల్లోకి పాకిపోయి, జీర్ణించుకు పోయివున్న వర్గ, వర్ణాశ్రమ విలువలు, ఆ కేటాయింపుల  వెనుకనున్న మర్మం, కుట్ర, చతురత, సాధారణ మైనది కావన్న విషయాన్ని గుర్తెరిగి ఒక స్పష్టమైన సామాజిక ఎరుకని స్వంతం చేసుకుని రాయడం మొదు పెట్టారు వారు... పైన చెప్పుకున్న కేటాయింపుల్లో కూడ అట్టడుగు మెట్టుమీద నిల బడిపోయి, అస్సలేమీ దక్కకుండా ఒట్టి చేతులతో కేవలం  తమ శరీరాలతో మాత్రమే మిగిలిపోయిన  దళిత స్త్రీలు  అట్టడుగున పడిపోయి,  చైతన్యవంతుల  కంటికి కూడ కనీసం కనబడకుండా పోవడం ఒక సామాజిక విషాదం. అంటరాని స్త్రీల  తరతరాల  దు:ఖం కన్నీళ్ళు, ఆవేశం, ఆకలి, అవమానం అన్నింటినీ కూడ తమలోపలికి తీసుకుని అనుభవించి, ఆరాటపడి, ఆవేశంతో చేసిన ఆగ్రహ ప్రకటన దళిత స్త్రీ సాహిత్యం...
    తరాలుగా నిరక్షరాస్యులుగా, సామాజిక జ్ఞానంనుండి వెలివేయబడిన వారిలో వారిదయిన జీవన సంస్కృతి, వారిదైన నాగరికత, వారివైన చారిత్రక జీవనానుభవాలు  మొత్తంగా దళిత స్త్రీలు  అత్యంత శక్తివంతులన్న విషయం మనకి అవగాహనకొస్తుంది. నేను విడిగా దళిత స్త్రీ రచయితని గురించి కానీ, వారు పరిచయం చేసి అవాక్కు పరిచిన పాత్రని కానీ పేర్కొనడం లేదు గానీ రాయక్క, చిన్ని, చిదంబరం భార్య ( ఆమెకి పేరులేదు ) రామి, మరియ, ఎస్తేర్‌ వీళ్ళందరినీ ఎప్పటికీ మరిచిపోలేం.
    ముసుగు వేసుకున్నప్పటికీ మనందరికీ తెలుసు.  ఆధునిక అభివృద్ధి ఫలాలు  ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫలాలు  కూడ అందరికీ సక్రమంగా, సమానంగా అందడంలేదని, ప్రభుత్వాలు  మారినా, సంస్కరణలు  జరిగినట్టు పైకి కన్పిస్తోన్న అట్టడుగు వర్గాల, వర్ణాల  వారి పరిస్థితి మెరుగు పడిరదేమీ లేదు... ఈ సామాజిక వర్గాల  పైన ముఖ్యంగా స్త్రీల  పైనా జరుగుతోన్న దాడులు, అణిచివేతలు, దోపిడీలు, అవమానాలు, అసమనతలు, అస్పృశ్యతలూ  ఏ మాత్రం మారకపోగా మరింత గట్టిగా, మరింత బలంగా నిర్మించబడుతోన్న ఆ గోడల్ని బద్దలు  కొట్టాల్సిన అవసరాన్ని చెప్తుంది దళిత స్త్రీవాదం...
    సాహిత్యమైనా, ఉద్యమమైనా అంకితభావంతో, ఆశయంతో ప్రయాణించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది... మహిళ విముక్తి శ్రామిక మహిళా విముక్తితో ముడిపడి వుందన్న విషయాన్ని గుర్తేరిగి ఆలోచనాపరుల  వద్దకు, మధ్యతరగతి, శ్రామిక  మహిళల  వద్దకు ఈ అంశాను తీసుకెళ్ళాల్సిన అవసరం వుంది.


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు