ఇంటర్వ్యూలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సమాజంలో సంపూర్ణమైన మార్పు తీసుకువచ్చేది ఆర్థిక రాజకీయ శక్తులే – రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1          మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా చెప్పండి

మా ఊరు తిరుపతికి దక్షిణంగా ఆరు కిలోమీటర్ల దూరంలోని కుంట్రపాకం. మా నాయన రామిరెడ్డి, అమ్మ మంగమ్మ. మా అమ్మ నాన్నలకు నలుగురం సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మా అమ్మ నాకు రెండు రెండున్నర ఏళ్ళ వయసులో చనిపోయింది. ఆమె ఎలా ఉండేదో నాకు తెలియదు. అనివార్యంగా మా నాయన రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆమె రాజమ్మ. ఆమె మమ్మల్ని అసలైన తల్లిలాగే పెంచి పెద్ద చేసింది.  సినిమాలో పిన్న తల్లిలాంటిది కాదు. ఆమెకు నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అలా మేము ఎనిమిది మందిమి.

మాది వ్యవసాయ కుటుంబం. మా నాయన కష్టజీవి. నన్ను వ్యవసాయంలో బాగా తీర్చిదిద్దారు. నాకు వ్యవసాయంలోని అన్ని ప్రక్రియలు తెలుసు. బి.. పాసయ్యేదాకా వ్యవసాయం చేస్తూనే చదువుకున్నాను. నా ప్రాథమిక విద్య మా గ్రామంలోనే. ఆరు, ఎస్ ఎస్ ఎల్ సి  తప్ప తక్కిన విద్య ఏడవ తరగతి నుండి పిహెచ్ డి దాకా తిరుపతిలోనే చదువుకున్నాను. ఉదయం అయిదుకు నిద్రలేచి పొలంలోకి పోయి పొలం పనులు చేసి ఏడుగంటలకు ఇంటికి వచ్చి, చద్దన్నం తిని, ఆ చద్దన్నాన్నే క్యారియర్ లో తీసుకొని తిరుపతికి నడుచుకుంటూ  పోయి, సాయంకాలం నాలుగు గంటలకు తిరుపతిలో బయలుదేరి ఊరికి వచ్చి, వెంటనే పొలంలోకి పోయి, కొంత పని చేసి, పశువులకు గడ్డి తీసుకొని వచ్చేవాడిని. కాలినడకన పొలాల మీదుగా స్వర్ణముఖి నదిలో నడిచిపోయి వచ్చేవాడిని.

నాకు 1974లో పెళ్ళైంది. లక్ష్మీకాంతమ్మ నా భార్య. మాకు ఇద్దరు సంతానం. ఆ యిద్దరు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు. మా వియ్యంకులు అతిసామాన్యులే.

1977 ఆగష్టులో నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్‌గా చేరాను. 2008 అక్టోబర్ లో ఆచార్యుడిగా ఉద్యోగ విరమణ చేశాను. వెంటనే కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నన్ను ఆహ్వానించింది. అక్కడ ఏడేళ్ళు పనిచేశాను. ఇప్పుడు ఇంటిలోనే ఉన్నాను.

నేను ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధం మీద పరిశోధన చేశాను. ఆ తర్వాత ఆధునిక సాహిత్యంలోకి ప్రవేశించాను. ఇప్పటిదాకా నేను 30 విమర్శగ్రంథాలు, నాలుగు కావ్యాలు, పది అనువాద గ్రంథాలు, ప్రచురించాను. ఇరవై గ్రంథాలకు సంపాదకత్వం వహించాను. ఆం.ప్ర. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షకుడిగా ఉన్నాను. నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్రసాహిత్య అకాడమీలలో తెలుగు సలహామండలి సభ్యుడిగా పని చేశాను. ఆం.ప్ర. అధికార భాషాసంఘంలో సభ్యుడిగా పనిచేశాను. ఇప్పుడు కేంద్రసాహిత్య అకాడమీ  జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాను. ప్రజాశక్తి బుక్ హౌస్ గౌరవ సంపాదకుడిగా ఉన్నాను.

నా పర్యవేక్షణలో 25 మంది పిహెచ్ డీలు, 20మంది ఎం.ఫిల్ లు  చేశారు. 1910 నుండి 2000 దాకా వచ్చిన కథల మీద దశల వారిగా పరిశోధన చేయించాను. యోగివేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ సాహిత్యం మీద ప్రక్రియల వారిగా, దశలవారిగా పరిశోధన చేయించే ప్రణాళికను అక్కడి అధ్యాపకులతో అమలు చేయించాను.   

విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేర్పించడంలో కృషిచేశాను. నా సూచనను మొదట అమలు చేసింది కాత్యాయనీ విద్మహేగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో. ఆ తర్వాత ఉస్మానియా, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, యోగివేమన విశ్వవిద్యాలయాలు అమలు చేశాయి. ఇటీవల శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా రాయలసీమ సాహిత్యాన్ని బోధిస్తున్నది.

అలాగే భారతీయ సాహిత్యం అనే పేరు కూడా దాదాపు నాలుగు విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టించాను.

నేను 16.10.1948న పుట్టాను. ఇప్పుడు నాకు 72వ ఏడాది జరుగుతున్నది.

2          మీరు సాహిత్య రంగంలోకి రాకముందు, వచ్చిన తర్వాత మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?

నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను గనుక సేద్యం చేస్తూనే చదువుకున్నాను. అందువల్ల అప్పుడు పాఠ్యాంశాలుగా ఉన్న సాహిత్యమే తప్ప, ప్రత్యేకంగా సాహిత్యం చదువుకునే అవకాశం రాలేదు. 1972లో ఎం.ఏ పాసయ్యేదాకా నేను సిలబస్ లోని సాహిత్యమే చదువుకున్నాను. 1977 ఫిబ్రవరిలో ప్రభావతీ ప్రద్యుమ్నం మీద పిహెచ్ డి  పూర్తి చేశాను. అప్పుడు కనీసం 20 విమర్శ గ్రంథాలు చదివాను. అవన్నీ సంప్రదాయ విమర్శ గ్రంథాలే. అప్పటికి నాకు ఏ సాహిత్య సంస్థతోనూ సంబంధం లేదు.

1977 ఆగష్టులో నేను అనంతపురం కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్ గా చేరాను. అప్పటికి నేను సాహిత్యంలోనే కాదూ, వ్యక్తిగతంగా కూడా సంప్రదాయవాదినే. అప్పటినుంచి నేను మంచి భక్తుడినే అనంతపురం వచ్చేదాకా. తిరుపతిలో భూమన్ బి.ఏలో నా సహవిద్యార్థి. ఆయన అప్పటికే భౌతికవాది.  త్రిపురనేని మధుసూదనరావు గారి ప్రసంగాలు కొన్ని అక్కడే విన్నాను. గోవింద రాజస్వామి కోనేటి కట్టమీద కమ్యూనిస్టు ప్రసంగాలు విని ఉన్నాను. ఇవన్నీ నాకు నచ్చేవికావు.

అనంతపురం వచ్చినాక నేను కన్యాశుల్కం నాటకం మా విద్యార్థులకు పాఠం చెప్పవలిసి వచ్చింది. అప్పటిదాకా నేను ఆ నాటకాన్ని చదవలేదు. పాఠం కోసం చదివితే అందులో భాష, జీవితం నాకు పరిచయం లేనివి. కెవి.రమణారెడ్డి గారి 'మహోదయం' సర్దేశాయి తిరుమలరావు గారి 'కన్యా శుల్క నాటక కళ’ ఇతర విమర్శ గ్రంథాలు కొన్ని చదివి, పాఠం చెప్పాను. రెండేళ్ళు చెప్పినాక గురజాడ సాహిత్యం మొత్తం పాఠం చెప్పాను. నాకు కొత్త ప్రపంచం కనిపించింది. కొత్త ఆలోచనలు కలిగాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వామ పక్ష  విద్యార్థి సంఘాల ప్రాభల్యం, అనంతపురంలోని ఆధునిక యువరచయితలు పరిచయం, వామపక్షాల ప్రభావం, హేతువాద సంఘ బాధ్యత, కత్తి పద్మారావు, రంగనాయకమ్మ, జ్వాలాముఖి వంటి వాళ్ళ సభలు, ఎన్.శేషయ్య పరిచయం, విశాలాంధ్ర బుక్ హౌస్ తో సంబంధం, అరుణతార పత్రిక, తెలంగాణ నుంచి మా దగ్గర చదువుతున్న జూలూరు గౌరీశంకర్, కె.నాగేశ్వరాచారి వంటి విద్యార్థుల పరిచయం - ఈ వాతావరణమంతా తోడై నన్ను కదిలించాయి. నాగేశ్వరాచారి నిరంతరం ప్రశ్నించేవాడు. గౌరీశంకర్ భగత్ సింగ్ వర్ధంతులలో వేదికలెక్కించే వాడు. కేతవరపు రామకోటిశాస్త్రి, కాత్యాయనీ విద్మహే గార్ల పరిచయం నా మార్పునకు మరింత దోహదం చేసింది. ఇంతలో అభ్యుదయ రచయితల సంఘంతో అనుబంధం ఏర్పడింది. విశాలాంధ్ర ద్వారా అనేక వామపక్ష గ్రంథాల పరిచయం కలిగింది. గురజాడ, అనంతపురం నా మార్పునకు మూలకారణాలు. చేరా, మహీధర రామమోహనరావుగారి ఈ దారి ఎక్కడికి? అనే నవల మీద మంచి వ్యాసం రాశారు. అది చదివి ఆయన నవలలన్నీ చదివాను. శ్రీశ్రీ, తిలక్, ఆరుద్ర, దాశరథి, కుందుర్తిలకు పాఠం చెప్పిన అనుభవం నా మార్పును వేగవంతం చేసింది. గుర్రం జాషువా శతజయంతి, బి.ఆర్ అంబేద్కర్ శతజయంతి సందర్భంగా అనేక సభలు నిర్వహించడం, వాళ్ళ రచనలను, ప్రచారం చేయడంతో కుల సమస్య తీవ్రత అవగాహన లోకి వచ్చింది. కొలకలూరి ఇనాక్ గారు నా సీనియర్. ఆయన పాఠ్య ప్రణాళికను ఆధునీకరించారు. మా విశ్వవిద్యాలయంలో ఆయన తర్వాత నేను కొంత ఆధునీకరించాను. రారా ‘సారస్వతి వివేచన’ చదివి నేను విమర్శ రాయడం కొంత కాలం ఆపేశాను. అలా రాయడం చేత కాదని, వివి సిద్ధాంత   గ్రంథపఠనం, ప్రజాసాహితి తెలంగాణ పోరాట కథల సంచిక వంటి వాటి పరిచయం నన్ను మరింతగా మార్పు వైపు నడిపించాయి. ఇలా ఎహైన్ బర్గ్ 'రచయితా శిల్పమూ', గోర్కీ సాహిత్య వ్యాసాలు, ప్రేంచంద్ సాహిత్య వ్యాసాలు నన్ను మార్చిన గ్రంథాలలో మరికొన్ని.

3          మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మీరు విమర్శకులుగా మారడానికి తోడ్పడ్డాయి?

నేను విమర్శకుడు కావడానికి మీరు చెప్పినంత పెద్ద నేపథ్యం ఉందనుకోను. తిరుపతిలో పి.హెచ్.డి చేస్తున్నప్పుడు నేను సర్దేశాయి తిరుమలరావు గారి "సాహిత్యతత్వము – శివభారత దర్శనముఅనే విమర్శా  గ్రంథం చదివాను. అప్పటికి ఆయనతో నాకు పరిచయం లేదు. ఉద్యోగం కోసం అనంతపురం వచ్చినప్పుడు, అక్కడ నేను ఆయన్ని కలుసుకొన్నాను. ఆ సమయంలో ఆయన తనకన్యాశుల్కనాటక కళగ్రంథాన్ని నాకు ఇచ్చారు. ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. రూపనగుడి నారాయణరావు గారని ఒకాయన ఉండేవారు. ఆయనకావ్యవిదానము” అని ఒక విమర్శా  గ్రథం రాశారు. దానికి తిరుమల రావుగారు ముందు మాట రాశారు. అందులో “కోస్తా ప్రాంతం నుండి భావ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం వచ్చాయి. తెలంగాణ నుండి అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు వచ్చాయి. రాయలసీమలో సాహిత్య విమర్శకులు ఎక్కుగా ఉన్నారని నేను భావిస్తాను” అని అన్నారు. ఈ మాట నా బుర్రకెక్కినట్లుంది. ఈయన ఎందుకిలా అన్నారని చూస్తే కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వెంకటశేషశాస్త్రి, భూపతి లక్ష్మీనారాయణరావు, కుంటిమద్ది శేషశర్మ, కవిత్వవేది, చిలుకూరి నారాయణరావు, రారా, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సోదుం రామోహన్, ఆర్వీయార్, నూతలపాటి గంగాధరం, త్రిపురనేని మధుసుదనరావు, సర్దేశాయి తిరుమలరావు, ఆర్వీఎస్ సుదర్శనం, తిమ్మావజ్జుల కోదండరామయ్య, సముద్రాల నాగయ్య  వంటి సంప్రదాయ, ఆధునిక, అభ్యుదయ, విప్లవ సాహిత్య విమర్శకులంతా మదిలో మెదిలారు. అప్పుడు నేను సాహిత్య విమర్శ రాయాలి అనుకుని రాశాను. మా విద్యార్థులకు పాఠం చెప్పడంలో కలిగిన అనుభవాలను వ్యాసాలుగా రాయాలనిపించి విమర్శ రాయడం ఆరంభించాను.

4          మీ రచనల గురించి చెప్పండి?

నేను ఇప్పటిదాకా 30 విమర్శ గ్రంథాలు ప్రచురించాను. వాటిలోశిల్పప్రభావతి” (నా పరిశోధన గ్రంథం), "ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు - అభిరుచులు,తెలుగు కవిత్వం - నన్నయ్య ఒరవడిఈ మూడు ప్రాచీన సాహిత్య విమర్శలు. ఇవి 1980 - 95 మధ్యవచ్చాయి. ఆ తర్వాత కూడా  శ్రీనాధుడు, వేమన, నన్నయ్య, అన్నమయ్య వంటి వాళ్ల మీద మారిన దృక్పథంతో కొన్ని వ్యాసాలు రాశాను. ఇటీవల పోతులూరి వీరబ్రహ్మంగారి 'కాళికాంబాశప్తశతిలోని అ పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. తక్కిన 26 గ్రంథాలు “ఆధునికాంధ్ర కవిత్వం - ఉద్యమాలు, సందర్భాలు, కొన్ని కావ్యాలు - కొందరు కవులు,ప్రతిఫలనం, "కవుల తెలంగాణం,కవిత్వావరణం”, “ఎన్.గోపి సాహిత్యానుశీలనం”, సినారె కవిత్వా శీలనం”, “గుర్రం జాషువ స్వప్నం - సందేశం”, “విశ్వనరుడు గుర్రం జాషువావంటి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథాలుదీపదారి గురజాడ అన్నది గురజాడపైన విమర్శగ్రంథం,కథాంశం,గురజాడ తొలికొత్త తెలుగుకథలు” “మన నవలలు – మన కథానికలుతెలుగు కల్పన సాహిత్య విమర్శలు.  “చర్చ”, “మరోచర్చ” “విమర్శ 2009”, విమర్శ 2011” ఈ నాలుగు తెలుగు సాహిత్య విమర్శ మీద విమర్శ గ్రంథాలు. "తులనాత్మక దాక్షిణాత్య విమర్శ వ్యాసాలుఅన్నది తులనాత్మక విమర్శ గ్రంథం. నేను రాసిన పీఠికలురాచపాళెం పీలికలు”,రాచపాళెం ముందు మాటలుపేరుతో అచ్చయినాయి. "సాహిత్య పరిశోధన సూత్రాలుపేరుతో రిసర్చిమెథడాలజీ మీద ఒక పుస్తకం రాశాను.దరి - దాపుపేరుతో తొమ్మిది సాహిత్య సిద్ధాంత వ్యాసాలను జూలూరి గౌరీశంకర్ ప్రచురించాడు. అందులో రచయిత - నిబద్ధత, సమాజ చైతన్యం - సాహిత్య చైతన్యం, సామాజిక సమస్యలు - రచయితల పరిష్కారాలు, రచయిత - కంఠస్వరం వంటి మంచి వ్యాసాలున్నాయి.

నేను పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు తిరుపతి కోనేటికట్ట మీద విన్న కమ్యూనిస్టుల ప్రసంగాల ప్రభావంతో 'అంతరాలు' అనే కవిత రాశాను. బహుశ అది 1973 - 74 ప్రాంతాల్లో.  తర్వాత అనంతపురం వచ్చినాక ఇరాన్లో మతోన్మాదులు ప్రజలు సినిమా చూస్తుండగా ఒక థియేటరుకు  అగ్గి పెట్టేశారని వార్తా వచ్చింది. అప్పుడు 'ఆలోచించండి' అనే కవిత రాశాను. 1990 తర్వాత రాయలసీమలో విపరీతంగా ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. కరువు తీవ్రతరం అయింది. గుజరాత్ సంఘటన జరిగింది. రాయలసీమ కరువు కాటకాల మీద కొన్ని కవితలు రాశాను.స్వర్ణభారతి సాక్షిగాఅనే పేరుతో చిన్నపుస్తకం ప్రచురించాను. తర్వాత మరికొన్ని రాసిరెండు ప్రపంచాలుపేరుతో ప్రచురించాను.సీమ కన్నీల్లుఅన్న మరొక సంపుటం. మా నాయన జీవితం వస్తువుగాపొలిఅనే కావ్యం రాశాను. అదినాకు బాగా నచ్చిన కావ్యం. అది ఆంగ్లం, హిందీ భాషలలోకి  అనువాదమైంది. తా.పి. రమేశ్ నారాయణ, తాజూటరు షరీఫ్ దానిని అనువదించారు.

తెలుగు సాహిత్య విమర్శ మీద రాసిన 25 వ్యాసాలు, ముందుమాటలు మరో 50 పుస్తకాలుగా రావలసి ఉంది. అలాగే "రచయిత - రాజ్యంపేరుతో కొన్ని తెలుగు కవితలను తీసుకొని వర్తమాన దృక్పథంతో వ్యాఖ్యానించిన వ్యాసాలు 25 దాకా ఉన్నాయి.

నేను చేసిన అనువాదాలుకూడా ఉన్నాయి. 1. దేవుడే బాలుడైతే - కిషన్ చందర్ నవలిక  2. పున్నమిచంద్రుడు మరికొన్ని కథలు - కిషన్ చందర్  3. ఎన్నిక చేసిన కథలు - కర్తార్ సింగ్ దుగ్గల్            4. దేవుళ్ళు దెయ్యాలు భూతాలు - అబ్రకంటి కనపూర్ వ్యాసాలు  5. మహర్షి దేవేంద్రనాథ టాగూర్ సాహిత్య అకాడమీ మోనో గ్రాఫ్  6. నెత్తురునది - ఇందిరాపార్థసారధి నవల - తమిళం అనువాదం పూర్తయింది         7. రాజేంద్రసింగ్ బేడికథల్ని అనువాదం చేస్తున్నాను  8. గజ్జెల మల్లారెడ్డి  9. త్రిపురనేని మధుసూదన రావుల మీద మోనోగ్రాఫ్ లు రాస్తున్నాను.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రను వర్తమాన దృక్పథంతో రాయించమని 70 శీర్షికలతో ఒక ప్రతిపాదన సమర్పించాను. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు పేరుతో 50 మంది మీద విశ్లేషణ వ్యాసాలు రాద్దామని ప్రయత్నిస్తున్నాను.

తెలుగు కథానిక - స్త్రీ” “దక్షణ భారత నవలల మీద స్వాతంత్ర్యోద్యమ ప్రభావం - అన్న రెండు యు.జి.సి రిసెర్చి ప్రాజెక్టులు చేశాను.

5          రాయలసీమ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద వేసిన ప్రభావం ఏమిటి?

ఈ ప్రశ్న ఆసక్తికరమైనదేగాక సమాధానం చెప్పడం కష్టమైనది కూడా.  ప్రాంతీయత అన్నది ఒక గౌరవనీయ కొలమానంగా గుర్తింపు పొందింది గనక ఈ ప్రశ్న వచ్చింది. ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో రాయలసీమది సింహభాగం. నేటి భాషలో గ్రేటర్ రాయలసీమ ఆనుకొని ప్రకాశం నెల్లూరు జిల్లాలను కలుపుకుంటే ప్రాచీన తెలుగు సాహిత్యంలో సగానికి సగం రాయలసీమదే అవుతుంది. నాలుగు జిల్లాలకే పరిమితమై మాట్లాడినా, రాయలసీమ నుండి వచ్చిన ప్రాచీన సాహిత్యం తక్కువైందేమీకాదు. కొన్ని విశిష్టతలను పేర్కొంటాను.

నన్నెచోడుడు  కుమారసంభవ కవి. ఈయన రాయలసీమవాసి. ఈయన నన్నయ్యకన్నా పూర్వీకుడని ప్రతిపాదిస్తూ బి.ఎన్.శాస్త్రిగారు, పరిశోధన చేశారని, పర్యవేక్షకుడు దానిని ఆమోదించకపోవడంతో ఆయన సిద్ధాంత  గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించలేదని విన్నాం. వాస్తవిక దృష్టిలేని పండితోధ్యాపకుల వల్ల ఆది కవి ( లభిస్తున్నంతలో) రాయలసీమ వాడు అనే విషయం మరుగున పడిపోయింది.

రాయలసీమ నుండి రాజాస్థాన, ఆస్థానేతర సాహిత్యాలలో రెండూ పోటీపడి వచ్చాయి. భూస్వామ్య, వర్గవ్యవస్థను చిత్రించే సాహిత్యం, దానిని ప్రతిఘటించే సాహిత్యం రెండు రాయలసీమ నుండి విశేషంగా వచ్చాయి. పాల్కురికి  సోమన, తాళ్ళపాక అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంలు ఆస్థానేతర కవులలో ప్రముఖులు. సోమన తెలంగాణవాసి. తక్కిన ముగ్గురు సీమవాళ్ళు ప్రాచీన కాలంలో కవయిత్రులు పరిమితంగా కనిపిస్తున్నారు. వాళ్ళలో సీమ వాళ్ళే అధికులు. శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె గంగాదేవి, మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క, తరిగొండ వెంగమాంబ ప్రముఖులు.

ప్రబంధ సాహిత్యంలో రాయలసీమది ఎంత? తక్కిన ప్రాంతాలది ఎంత? రాయలు, పెద్దన, తిమ్మన, ధూర్జటి, రామరాజ భూషణుడు, కందుకూరు రుద్రకవి, సంకుసాల  నృసింహకవి, తెనాలి రామకృష్ణుడు వంటి వాళ్ళు సీమ నుండే ప్రబంధాలు రాశారు.

జాగ్రత్తగా పరిశీలిస్తే, బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వైరుధ్యాలు చాలా అంతర్లీనంగా వాటి సాహిత్యంలో ఎలా కొనసాగాయో ప్రాచీన రాయలసీమ సాహిత్యం రుజువు చేస్తుంది. ఈ విశిష్టతలను అలా ఉంచి ప్రభావం దగ్గరికి వస్తే 1980 తర్వాత ప్రాంతీయ అస్తిత్వ స్పృహకు రాయలసీమ పునాది వేసిందనుకుంటాను.సీమ కథలుసంకలనం ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వచ్చిన తొలికథా సంకలనంగా చాలా మంది గుర్తించారు. అయితే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం ముందు కొంత మరుగున పడింది. కరువు సాహిత్య రచనకు రాయల సీమ మార్గం చూపిందనుకుంటాను. 1956 నాటి 'పెన్నేటిపాట' కు (విద్వాన్ విశ్వం) రాళ్ళపల్లి అనంత కృష్ణశాస్త్రి రాసిన ముందు మాటలో సీమ అస్తిత్వ వేదన కనిపిస్తుంది. అయితే ఆంధ్రరాష్ట్రం 1953లో ఏర్పడినప్పుడు గుర్రం జాషువా  కావ్యం రాశారు. అందులో రాయలసీమ కరువును ప్రస్తావించి రాయలసీమ కరువును నివారించి ప్రవహించమని విజ్ఞప్తి చేశారు కృష్ణనదిపై. 1899నాటి కట్టమంచి రాసిన "ముసలమ్మ మరణంవిషాధాంత కావ్యం.  పైగా సమిష్టికోసం వ్యక్తి త్యాగం అనే స్పృహతో రాయబడిన తొలికావ్యం. 1914నాటి 'కవిత్వతత్వ  విచారం' (కట్టమంచి) ఆధునిక సాహిత్యం విమర్శ తొలి సాధికారక నమూనాగా పేరు పొందింది. ఈ గ్రంథం సాహిత్య విమర్శకు సంబంధించిన అనేక ఆరోగ్యకర సూత్రాలు అందించింది. సాహిత్యాన్ని వాస్తవిక దృక్పథంతో చూడడం ఇది నేర్పింది.దేశ చరిత్రమును భాషా చరిత్రమును నిత్య సంయోగములు,విషయము శైలి రెండునూ  ముఖ్యములు, "పాత్రములు వికల్పముగా ఉండవలెనుమొదలైన సూత్రాలను ఈ గ్రంథం అందించింది. 1914 తర్వాత తెలుగు మార్క్సిజం, అంబేద్కరిజం, ఫెమినిజం వంటి అనేక రాజకీయ సిద్ధాంతాలు తెలుగు సాహిత్య విమర్శ మీద ప్రభావం చూపినా, కట్టమంచి ప్రతిపాదించిన కొన్ని మౌలిక సాహిత్య సూత్రాలను అవి ఆమోదిస్తూనే వచ్చాయి. బహుశా రాయలసీమ తెలుగు సాహిత్య విమర్శ గమనాన్ని నిర్దేశించిందని చెప్పవచ్చు. (వెనక్కి నెట్టివేయబడిన మూడు తెలుగు ప్రాంతాల నుండి వ్యాపార సాహిత్యం గణనీయంగా రాకపోవడం గుర్తించవలిసిన అంశం) కట్టమంచి తర్వాత ఇద్దరు మార్క్సిస్టులు రా.రా, త్రిపురనేని మధుసూదనరావు గారలు అభ్యుదయ విప్లవ సాహిత్య విమర్శలకు ఒరవడిదిద్దారు. త్రిపురనేని పుట్టుకతో కృష్ణాజిల్లా వాసి అయినా, ఆయన జీవితమంతా తిరుపతిలోనే గడిచిపోయింది. అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత అస్తిత్వవాద సాహిత్య విమర్శలో నిబద్దత అనే ఒక కొత్త అంశాన్ని చేర్చిన వారు కొలకలూరి ఇనాక్ గారు. వీరు పుట్టుకతో గుంటూరు వాసి అయినా, సాహిత్య జీవితమంతా రాయలసీమలో గడిచిపోయింది. తెలుగు సాహిత్య చరిత్రలను రాజులపేరు మీద, కవుల పేరు మీద యుగవిభజన చేయడం ఒక సంప్రదాయంగా ఉన్న కాలంలో కల్లూరి వెంకట నారాయణరావు ( కవిత్వవేది ) అనే రాయలసీమ వాసి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి ఒక శాస్త్రీయమైన మార్గం చూపించారు. ఇలాంటివన్నీ రాయలసీమ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

6          బాలవ్యాకరణం సాహిత్య విమర్శలో ఏ మేరకు ఉపయోగపడుతుంది?

బాలవ్యాకరణం సంప్రదాయ కావ్యభాషకు చెందిన వ్యాకరణం. సంప్రదాయ సాహిత్య విమర్శలో కూడా బాలవ్యాకరణం పాత్ర అత్యల్పం. ప్రాచీన కావ్యభాషను వ్యాకరణ శాస్త్రం ప్రమాణాలతో విమర్శించే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అటువంటి విమర్శ తెలుగులో అరుదుగానే వచ్చింది. ప్రాచీన సాహిత్యాన్ని సామాజిక భాషాశాస్త్ర దృష్టితో పరిశీలించడానికి బాలవ్యాకరణం ఎంత వరకు ఉపయోగపడుతుందో భాషాశాస్త్రజ్ఞులు చెప్పాలి. ప్రాచీన సాహిత్యంలో గానీ, ఆధునిక సాహిత్యంలోగానీ, వస్తు, శిల్ప విమర్శకు బాలవ్యాకరణం ఉపయోగపడదు. ప్రాచీన కాలంలోనే ఒక శ్లోకం ఉంది.

నైవ వ్యాకరణజ్ఞ మేతి పిత‌రం ,సభ్రాతరమ్ తార్కికమ్.

దూరాతోసంకంచితీవ గచ్ఛతి వపుః ,చండాలవత్ ఛాందసాత్.

మీమాంసానిపుణం నపుంసకమితి ,జ్ఞాత్వానిరస్యాదంతో.

కావ్యాలంకరణజ్ఞ మేవ  కవితాకన్యావృణీతే స్వయమ్. ----దీనిని కాణాద పెద్దన తెలుగులోకి అనువాదించాడు.

 

తనరన్ వ్యాకరణజ్ఞు దండ్రియనుచుం ,దర్కజ్ఞునిన్ భ్రాతయం

చును ,మీమాంసకునిన్ నపుంసకుడటంచున్వీడి ,దూరంబునం

గని యస్పృశ్యునిబోలె ఛాందసుని ,వేడ్కం గావ్యలీలారస

జ్ఞు నిజేచ్ఛం గవితావధూమణి వరించున్ భావగర్భంబునన్ (ముకుందవిలాసం అవతారిక - 15)

ఈ పద్యంలో ఇవాళ మనం అభ్యుంతరం చెప్పే పదాలున్నాయి. ప్రాచీన కాలంలోనే కావ్యానికి వ్యాకరణానికి ఉండే సంబంధం ఎలాంటిదో ఇవి సూచిస్తున్నాయి.

7          అలంకార శాస్త్రం ఆధునిక విమర్శకులు అధ్యయనం చేయాలంటారా?

అధ్యయనానికి విధినిషేధాలు ఉండవలసిన అవసరం లేదు. రచయితలకు, విమర్శలకు తెలియకూడని విషయాలంటూ ఉండవు. ఆధునిక సాహిత్య విమర్శకులకు సామాజిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞానం, సాహిత్య చరిత్ర జ్ఞానం, సాహిత్య శాస్త్రజ్ఞానం, సాహిత్య విమర్శ శాస్త్రజ్ఞానం, సాహిత్య విమర్శ చరిత్రజ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అలంకార శాస్త్రజ్ఞానం ఉంటే, దానిని ఆమోదించడమో, తిరస్కరించడమో తర్వాతి విషయం. అసలు ఆ జ్ఞానమే లేకపోతే విమర్శకుల జ్ఞానంలో వెలితి ఉంటుంది.

అలంకారశాస్త్రం కావ్య, నాటకశాస్త్రం, సంస్కృత సాహిత్యం ఆధారంగా చేసుకొని వచ్చినవే అలంకార శాస్త్రాలు. తెలుగులో వచ్చిన అలంకార శాస్త్రాలు వాటి నీడలే. అలంకార శాస్త్రంకావ్యం ఎలా ఉండాలో చెబుతుంది. విమర్శ శాస్త్రం కావ్యం ఎలా ఉండాలో చెబుతుంది. విమర్శ శాస్త్రం కావ్యం ఎలా ఉందో చెబుతుంది. ప్రాచీన కాలంలోనూ, ఆధునిక కాలంలోనూ సంప్రదాయ సాహిత్య పరామర్శకు అలంకార శాస్త్రన్నే ఉపయోగించుకున్నారు. అద్దేపల్లి రామమోహనరావుగారు, మిరియాల రామకృష్ణగారు, ముదిగంటి సుజాతారెడ్డి గారు ఆధునిక సాహిత్యానికి సంప్రదాయ అలంకార శాస్త్రాలకు అన్వయించే ప్రయత్నం చేశారు. కాని వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు.నాటక లక్షణ కర్తలు శాసన కర్తల స్థాయిలో రచయితల్ని రాచరిక వ్యవస్థ చిత్రణకి నిర్బంధించారుఅన్నారు. త్రిపురనేని మధుసూదనరావుగారు నాటక ప్రయోజనం - అధ్యయన పద్ధతి. (సృజన, మార్చి1983)  సంస్కృత అలంకార శాస్త్రాలన్నీ సంస్కృత సాహిత్యం ఆధారంగా పుట్టినవే. అదంతా రాచరిక వ్యవస్థనే ప్రతిబింబించింది. సంస్కృత సాహిత్యాన్నిగానీ, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని గానీ ఆధునిక విమర్శకులు పరిశీలించే  పద్ధతి మారిపోయింది. ఈ మారిపోయిన పధ్ధతికి  అలంకార శాస్త్రం ఉపయోగపడదు. వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారువిమర్శాశిల్పంఅనే గ్రంథంలో అలంకారశాస్త్రాలను గురించి తీవ్రమైన అభిప్రాయాలు చెప్పారు. 1. మన ప్రాచీనాలంకారికులెవరూ సమాజానికి సాహిత్యానికి ఉన్న వివిధ సంబంధాలను గురించి చర్చించలేదు. 2. సమకాలీన వాస్తవిక జీవితంపట్ల అనాదరణ భారతీయ - ఆలంకారిక సంప్రదాయం . 3. అలంకార శాస్త్రాన్ని ఆలోచనా రహితంగా సృజనాత్మక సాహిత్యం మీద రుద్దడం చేత మన సాహిత్యానికి జరిగిన అపకారాన్ని సమీక్షించాలి. సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి, విలువ కట్టడానికి సహకరించవలిసిన అలంకార శాస్త్రం క్రమక్రమంగా రచయిత సృజన శక్తికి సంకెళ్లలగా తయారయింది. 4. అలంకార శాస్తా సాహిత్యం మార్గదర్శకంగా అంగీకరిచడం వల్ల రచయిత తనకు నచ్చిన కావ్యవస్తువును తీసుకొని, దాన్ని తనకు నచ్చిన వ్యక్తిగత దృష్టికోణం నుంచి పరిశీలించే స్వాతంత్ర్యం దాదాపు లేకుండా పోయింది. రచయిత సృజనశక్తి ఈ విధంగా మేకుబందీ అయిపోవటంచేత, తన వ్యుత్పత్తిని చాటుకోవటం తప్ప అతని కీర్తికి వేరే దారిలేకపోయింది. ఇవీ  ఆయన అభిప్రాయాలు. అదే సమయంలో వల్లంపాటి వారికి రస, ధ్వని  సిద్ధాంతాలలోని అనవసరమైన వర్గీకరణాలను విస్మరించి జాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రాచీన సాహిత్యధ్యయనానికి ఇవి పరిమితంగా పనికి వస్తాయని కూడా అన్నారు. కాని త్రిపురనేనిగారు సంస్కృత సాహిత్యం ఆధారంగా వచ్చిన అలంకార శాస్త్రాలను ప్రాచీన తెలుగు సాహిత్యధ్యయనానికి ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించారు.

అలంకార శాస్త్రం ప్రకారం నాయకుడు శ్రామిక వర్గానికి చెందినవాడు కారాదు. రసం ఆ నాయకుని చుట్టూ తిరుగుతుంది. అందువల్ల అధునిక సాహిత్యానికి అలంకార శాస్త్రం ఉపయోగపడదు. ప్రాచీన సాహిత్యంలో కూడా నాయికానాయకులు ఎవరు? వారు ఎలాంటివారు? ప్రధాన అప్రధాన రసాలు ఏవి వంటి పరిశీలనకే పనికి వస్తాయి. వస్తు  పరిశీలనకు పనికిరావు.           అయినప్పటికీ నేటి విమర్శకులకు అలంకారశాస్త్రజ్ఞానం ఉండడం మాత్రం అవసరం.

8)         విమర్శ బలంగా లేదు గనుక బలమైన సాహిత్యం వెలువడడం లేదు అంటున్నారు దీనినెట్లా చూడాలి?  సాహిత్యం బలహీనంగా ఉంది గనుక విమర్శకూడా బలహీనంగా ఉంది అంటున్నారు. నిజమేనా?

ఈ రెండు ప్రశ్నలనూ కలిపి ఆలోచిద్దాం. సాహిత్యంగానీ, సాహిత్య విమర్శగానీ ఏకాలంలోనూ నూటికి నూరు పాళ్ళు బలంగానూ, నూటికి నూరు పాళ్ళు బలహీనంగానూ వచ్చాయనడం శాస్త్రీయమైన అవగాహన కాదు. ఎప్పుడైనా బలమైన రచనలూ, బలహీనమైన రచనలూ తోడుగానే వస్తాయి. అలాగే సాహిత్య విమర్శ కూడా సాహిత్య విమర్శలో ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఒక కొత్త రకం  సాహిత్యం పుట్టినప్పుడూ, దానిని తూచడానికి కొత్త తూకపురాళ్ళు అవసరమౌతాయి. వాటిని సృష్టించుకోడానికి కొంత సమయం పట్టుతుంది. ఈ గ్రాఫ్  లో విమర్శ బలహీనపడినట్లు అనిపిస్తుంది. సాహిత్యం బలహీనపడినప్పుడు బలమైన విమర్శ రావడం వల్లనే తులసిదళాలు తగ్గిపోయాయనేది మనం గుర్తించాలి. వస్తున్న సాహిత్యంలోంచి బలమైన సాహిత్యాన్ని, వస్తున్న విమర్శలోంచి బలమైన విమర్శను మనం ఏరుకోవాలి తప్పదు.

9          సాహిత్య విమర్శకులు రాజకీయ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉందా?

రాజకీయ అర్థశాస్త్రాన్ని సాహిత్య విద్యార్థులకు తప్పనిసరి అంశంగా చేరిస్తే ఎలా ఉంటుంది?

రాజకీయార్థిక శాస్త్రం గురించి, నేను నామిత్రుడు ఎస్. శేషయ్య మాట్లాడడం విన్నాను. వి.వి, త్రిపురనేని వంటి వాళ్ళ వ్యాసాలలో చదివాను. అయితే ఈ విషయంలో నేనింకా విద్యార్థినే. సాహిత్యం రాజకీయం లేకుండా ఉండదు. ఆర్థికాంశం సమాజానికి పునదిగా ఉంటుంది. గనుక రాజకీయార్థిక శాస్త్ర అధ్యయనం అవసరమే. సాహిత్య విమర్శ బలంగా రావడానికి అది ఉపయోగ పడుతుంది. అయితే ఈ అంశాన్ని సాహిత్య విద్యార్థులకు సిలబస్లో బోధించడం సాధ్యం కాకపోవచ్చు. సాహిత్య పాఠాలే కిటకిటలాడుతున్నాయి. విడిగా చదువుకోవలసిందే.

10        మార్క్సిజంలో ఖాళీలు ఉన్నాయంటున్నారు కదా! దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

మార్క్సిజం మార్పును ఆమోదించే వాదం, సిద్ధాంతం. ప్రతిదీ మారుతుందనే వాదం మార్క్సిజం. అది ప్రకృతికి, ప్రపంచనికేగాదు, తాత్విక వాదాలకు కూడా వర్తిస్తుంది. ఏ వాదమైనా స్థల కాల బద్ధంగానే పుడుతుంది. ఒక కాలం నుండి మరో కాలానికి, ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళ్ళే సరికి ఆ వాదంలో మార్పులు అవసరమౌతాయి. ఈ సార్వజనీనమూ, సార్వకాలికమూ అయిన విలువ ఏదీ ఉండదని మార్క్సిస్టులు నమ్ముతారు. మార్క్సిజం కూడా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ రూపొందించిన మార్క్సిజం కూడా స్థలకాలాలను బట్టి అన్వయించుకోవాలి. ఆ అన్వయించుకోవడంలో జరిగిన ఆలస్యాన్ని ఖాళీ అని అంటున్నామా?  ప్రధానంగా యూరోపియన్ సమాజ పరిస్థితులు, చరిత్ర ఆధారంగా మార్క్సిజం రూపొందింది. వర్గసిద్ధాంతం పుట్టింది. భారతదేశానికి కూడా ఆ సిద్ధాంతం అన్వయించింది. అయితే భారతదేశంలోని కుల వ్యవస్థను పరిగణనలోకి తీసుకోకుండా, ఆర్థిక వర్గదృక్పథమే కలిగి ఉండడంవల్ల సమస్యలు ఏర్పడ్డాయి. అందువల్ల కుల వ్యవస్థను కలుపుకొని వర్గపోరాటం చేయడమే మార్క్సిజం లోని ఖాళీలను పూరించడమని భావిస్తున్నాను.

11        కళాసాహిత్యాల సృజనకు మూలం వ్యవస్థీకృతమైన వాస్తవమా? మరి ఇంకేదైనా ఉందా?

కళాసాహిత్యాలకు మూలం వాస్తవికత. సామాజిక వాస్తవికత. అది వ్యవస్థీకృతమైనా, కాకపోయినా అదే మూలం. దానిని కళగా మార్చే నైపుణ్యం కూడా అవసరం కల్పనా శక్తి వాస్తవికతను కళగా మారుస్తుంది. కేవలం వాస్తవికతే కళ అయిపోదు. వాస్తవికతను కల్పన తోడైతేనే కళ సంపూర్ణమౌతుంది. మానవాతీతమైనది అని అనుకోవలసిన అవసరం లేదు. కల్పన కూడా సమాజంలోంచే లభిస్తుంది. అందుకే వస్తువు, శిల్పం రెండూ సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలే అని మార్క్సిజం చెబుతుంది.

12        ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని ఒక విమర్శకుడిగా ఎలా చూస్తున్నారు?

తెలుగులోనే కాదు, ఏ భాషా సాహిత్యంలోనైనా రెండు పాయలు ప్రవహిస్తూ ఉంటాయి. 1. భావవాద సాహిత్య పాయ. 2. భౌతికవాద సాహిత్య పాయ. తెలుగు ప్రాచీన కాలంలో దాదాపు అంతా భావవాద సాహిత్యమే వచ్చింది. ఆధునిక కాలంలో ఈ రెండు పాయాలు మొదటినుంచి ప్రవహిస్తునే ఉన్నాయి. ఇవాల్టికీ కూడా అంతే ఇప్పుడే మన కళ్ళముందు కదలాడుతున్న కరోనా వైరస్ విషయం చూడండి కరోనా వైరస్ ను అర్థం చేసుకోవడంలో భావ, భౌతికవాదులు ఘర్షణ పడుతున్నారు. సాహిత్య రంగంలోనూ అంతే. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పద్యం, ఆదేశ్ రవిగారి పాట ఈ రెండు పాయలకూ ప్రతినిధులు.

13        సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనా? ఇంత వరకు మీ అనుభవం ఏమిటి?

సమాజంలో సంపూర్ణమైన మార్పు తీసుకువచ్చేది ఆర్థిక రాజకీయ శక్తులే. సాహిత్యం ఆ శక్తులు మార్పులు తీసుకొని రావడానికి అవసరమైన భావ ప్రచారం చేస్తుంది. సమాజంలో మార్పు రావలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. వస్తున్న మార్పులను ఆహ్వానిస్తుంది. మారకుండా మిగిలిపోయిన పార్శ్వా లను ఎత్తి చూపుతుంది. సామాజిక పరివర్తనకు సాహిత్యం విశ్వసనీయమైన ఆయుధం. సాహిత్యం తనంతట తానుగా సమాజాన్ని మార్చగలిగిన శక్తి కలిగుంటుంది. నా అనుభవమే చెబుతాను. 1977లో ఉద్యోగంలో చేరినప్పటి భావజాలం భావవాద భావజాలం. నాలుగేళ్ళు గురజాడను పాఠంగా చెప్పే క్రమంలో నా భావజాలం కదలబారింది. గురజాడ నన్ను మార్చారు. స్త్రీవాద సాహిత్యం మొదలైనాక స్త్రీల పట్ల మొగవాళ్ళ దృక్పథంలో, ఆచరణలో చాలా మార్పులు వచ్చాయి. ప్రగతి శీల మొగవాళ్ళకు సైతం స్త్రీపట్ల చిన్నచూపు ఉండేది. అది ఇవాళ తగ్గిపోయింది. దళితులపట్ల ఇంతకు ముందున్నంత చులకనభావాన్ని దళిత సాహిత్యం మార్చివేసింది. మార్క్సిస్ట్  సాహిత్యం పేదలు కూడా మనుషులే అనే అవగాహన కలిగించింది.

14        కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చిన తర్వాత మీ రచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా?

ఇప్పటి దాకా నేనిచ్చిన సమాధానాల్లో గతంలోని రాచపాళెంకు, నేటి రాచపాళెంకు ఏమైనా తేడా కనిపిస్తున్నదా?  మనం వాట్సప్ గ్రూపులలో మాట్లాడుకుంటున్నాం. మీకేమైనా తేడా కనిపిస్తున్నదా? మనువాద పత్రికలలో నన్ను గురించి ఒకరిద్దరు దూషిస్తూ రాసిన రాతలే నేను నా మార్గం నుండి పక్కకు పోలేదని రుజువు చేస్తున్నాయి. నాకు తెలిసి నేనేమీ వెనక్కి పోలేదు. "సాహిత్య విమర్శ, పరిశోధనగ్రూవులో భోజరాజీయంలోని ఆవు - పులి కథ మీద నా అభిప్రాయం మీరు చదివే ఉంటారు.

15        సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యానికి తన కార్యక్రమాల ద్వారా చేస్తున్న కృషి గురించి తెలపండి?

కేంద్రసాహిత్య అకాడమీ తెలుగుతో పాటు 28 భారతియభాషలలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సాహిత్య అవార్డు మన తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడమనేది తెలుగు సలహామండలి చేసే ప్రయత్నాలమీద ఆధారపడి ఉంటుంది. గత పది పన్నెండేళ్ళుగా సాహిత్య అకాడమీ తెలుగుకు కూడా దగ్గరైంది. ఇందుకు కారణం తెలుగు సలహామండలి చురుకుగా పనిచేయడమే. ప్రతిభాషలోనూ ప్రసిద్ధులైన రచయితల మీద భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికలో అకాడమీ మోనోగ్రాఫ్లు ప్రచురిస్తుంది. తెలుగులో ఇప్పటి దాకా కనీసం 75 మోనోగ్రాఫ్లు  వచ్చి ఉంటాయి. తెలుగు మోనోగ్రాఫుల్లో  చాలా  వరకు ఇతర భారతీయ భాషలలోకి అనువాదం కూడా అవుతూ ఉంటాయి. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథాలను అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి, అకాడమీ ఇతర భారతీయ భాషలలోకి అనువదింప జేస్తుంది. అలా తెలుగు గ్రంథాలు చాలా వరకు ఇతర భారతీయ భాష పాఠకులకు చేరాయి. క్లాసికల్ టెక్స్ట్ ల పేరుతో ఒక్కొక్క భాషలో కొన్ని గ్రంథాలను, అకాడమీ, ఇతర భారతీయ భాషలలోకి అనువదింపజేస్తుంది. ఈ మార్గంలో కూడా కొన్ని తెలుగు రచనలు ఇతర భారతీయ భాషలలోకి వెళ్ళాయి. చాలా కాలం క్రితమే అకాడమీ, సాహిత్య చరిత్రలు ప్రచురించింది. గిడుగు సీతాపతి తెలుగు సాహిత్య చరిత్ర రాశారు. అది ఇతర భారతీయ భాషలలోకి వెళ్ళింది. ఆయన బహుశా 1950దాకా వచ్చిన సాహిత్య చరిత్ర రాశారు. ఆ తర్వాత భాగాన్ని ఇప్పుడు రాయించే ప్రయత్నం చేస్తున్నది. అకాడమీ 2013 - 17 మధ్య అయిదేండ్లలో అకాడమీ ద్వారా దాదాపు 200 తెలుగు సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఈ ఒరవడి కొనసాగుతున్నది. కరోనా అడ్డుపడింది. అకాడమీ ద్వారా కొన్ని కవిత్వ, కథా సంకలనాలు కూడా వచ్చాయి. సెమినార్ పేపర్లు కూడా పుస్తకాలుగా వస్తున్నాయి.

లిటరరీ ఫోరం అని ఒక కార్యక్రమం ఉంది. అయిదు మందితో ఒక కార్యక్రమం నిర్వహించడం. నేను గత ఏడేళ్ళలో దాదాపు 25 కార్యక్రమాలు నిర్వహించాను. కవిసంధి, కథాసంధి శీర్షిక మీద చాలా మంది కథకులు, కవులు తమ రచనలు చదివారు. వాటి పైన చర్చలు జరిగాయి. రచయితతో ముఖాముఖి, విమర్శకునితో సాయంకాలం శీర్షికల ద్వారా చాలా మంది తెలుగు రచయితలు వాళ్ళ రచనానుభవాలను చెప్పుకున్నారు. విమర్శకులు తమ విమర్శనానుభవాలను చెప్పారు.నా దృష్టిలోఅని  ఒక కార్యక్రమం ఉంది. ఒక పూర్వ రచయితను ఒక వర్తమాన విమర్శకుడు సమకాలీన దృక్పథంతో అంచనా కట్టే కార్యక్రమం. మధురాంతకం  రాజారాం అబ్బూరి ఛాయా దేవి మొదలైన వారిమీద ఈ కార్యక్రమాలు జరిగాయి. రచయితల శత జయంతులను సాహిత్య అకాడమీ విరివిగా నిర్వహిస్తుంది. నాకు తెలిసీ  శ్రీశ్రీ మొదలుకొని అనేక మంది తెలుగు రచయితల శతజయంతులు జరిగాయి. ఒక్కరచయిత మీద పదేసి ప్రసంగాలు ఉంటాయి. 40 ఏళ్ళలోపు వయసుగల రచయితలకు అకాడమీ ట్రావెల్ గ్రాంటు మంజూరు చేస్తుంది. వాళ్ళు ఇతర భాషా రచయితలతో వారం రోజులు ఉండి వాళ్ళ సాహిత్య విశేషాలను చిత్రించుకొని రావచ్చు. ఏడాదికి నలుగురు యువరచయితలు ఒక్కోభాష నుండి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే తక్కెడశిల జానీ అనే కవి కేరళకు వెళ్ళి వచ్చాడు. అక్కడి అనుభవాలను "మట్టినైపోతానుపేరుతో కవిత్వంగా రాసి ప్రచురించాడు. ఏడాదికి ఒకటి రెండు రోజుల సదస్సు ప్రతిభాషా నిర్వహించుకోవచ్చు. నేనుతెలుగు సాహిత్య విమర్శ - భావజాల అధ్యయనంఅనే అంశం మీద సదస్సు నిర్వహించాను.తెలుగులో వ్యవసాయ సాహిత్యంమీద సదస్సు నిర్వహించవలసి ఉంది. సాహిత్య అకాడమీని  మన సలహామండలి ఎంత వరకైనా ఉపయోగించుకోవచ్చు.  ఉపయోగించుకుంటున్నది.

16        ఇటీవలి కాలంలో విస్తృతంగా వస్తున్న అంతర్జాల పత్రికల్లోని సాహిత్యాన్ని గురించి విమర్శకులు పట్టించుకున్నారా?

దిన వార మాస పత్రికలలో కన్నా అంతర్జాలం మీద ఆధారపడిన మధ్యమాలలోనే ఎక్కువ సాహిత్యం వస్తున్నది ఇవాళ. అయితే ఈ అంతర్జాల సాహిత్యం మీద విమర్శకుల దృష్టి ఎంత వరకు పడిందన్నది పరిశీలించవలసింది. నాకు నేను ఈ అంతర్జాల విద్యలో అర్భకుణ్ణి. వాట్సప్ లో వచ్చే సాహిత్యం మీద ప్రశంసల జల్లు బాగా కురుస్తున్నది. గంభీరమైన చర్చ అయితే కొంత వరకు సాగుతున్నది. ఫేస్ బుక్, వెబ్ పత్రికలతో నాకు సంబంధంమే లేదు. అందువల్ల వాటిని గురించి నేనేమీ చెప్పలేను. యూట్యూబ్ లో కొన్ని ఫేస్ బుక్ విమర్శలు పెడుతుంటారు. పుట్ల హేమలతగారు తెలుగు అంతర్జాల సాహిత్యం మీద పరిశోధన చేశారు. ఇంకా కొందరు చేస్తూ ఉండవచ్చు.

17        అంతర్జాల పత్రికలు ప్రజాస్వామ్యబద్ధంగా విస్తృత ప్రాతిపదికన రచనల ఎంపికను చేయడం ద్వారా ఎంతో మంది రచయితులు వెలుగులోకి వస్తున్నారు. ఇంకా ఎందరో తమ రచనలను కొనసాగిస్తున్నారు.

ఈ పరిణామం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

ఇంతకు ముందే చెప్పినట్లు నేను అంతర్జాల విమర్శలో ఆరితేరినవాడిని కాదు గనక, ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. అయితే అంతర్జాలంలో పేపరు ప్రసక్తి ఉండదు గనుక ఎక్కువ మంది రచనలు ఒకేసారి రావడానికి అవకాశముంది. అయితే అంతర్జాల సాహిత్యం అంతర్జాలంలో నైపుణ్యం ఉన్న వారికే చేరుతుంది.

18        మీ సాహిత్య విమర్శ జీవితంలో మీకు బాగా ఆనందం కలిగించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

ఉన్నాయి. ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యం మీద పరిశోధన చేస్తున్న సమయంలో నాకు పర్యవేక్షకులు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. ఆయన ప్రతి అధ్యాయాన్ని మూడేసి సార్లు రాయించే వారు. ఇప్పటి సాహిత్య పరిశోధకులు దీనిని గర్తుపెట్టుకోవాలి. అభ్యాసం కూసు  విద్య. రాసిన అధ్యాయాన్ని నేనే చదివి వినిపించాలి. అలా చదివే క్రమంలో నా వాక్య నిర్మాణం, నా వాదనా  పటిమ నాకర్థమౌతూ వస్తాయి. నా సిద్దాంత  గ్రంథంలో 'కథానిర్మాణం శిల్పం' అనేది ఒక అధ్యాయం. దానిని 50 పేజీలలో రాశాను. గరువుగారికి చదివి వినిపించాను. వినిన ప్రతిసారీ ఇంకో సారి ఆలోచించు అనేవారు. ఈ అధ్యాయన్నీ మారోసారి విన్నాక కూడా ఇంకో సారి ఆలోచించు అన్నారు. వారం రోజులు ఆలోచించాను. ఒక రోజు అర్ధరాత్రి పూట 'కథానిర్మాణంశిల్పం' అనే అధ్యాయంలో నేను కథానిర్మాణం, కథా కథనం - అనీ రెండు భాగాలను కలిపి రాసినట్లు అనిపించింది. ఇవి వేర్వేరు విషయాలు గనక రెండు అధ్యాయాలు చేయాలి అనిపించింది. అలా కథానిర్మాణ శిల్పం, కథా కథన శిల్పం అని రెండు అధ్యాయాలుగా రాసి గురువుగారికి చదివి వినిపించాను. నీ పరిశోధన పూర్తయింది అన్నారు.  ఆ రోజు నేను పొందిన ఆనందం అంతా ఇంతాకాదు.  “రచయిత - నిబద్ధతఅని నేను ఒక వ్యాసంగా రాశాను. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. ఆ వ్యాసం రాసేనాటికి ఆ అంశంమీద ఇంకెవరన్న రాశారా అనేది నాకు తెలియదు. తర్వాత చూస్తే చాలా మంది, కెవిఆర్, వేల్చేరు నారాయణరావు, త్రిపురనేని, రారా, కుందుర్తి, అద్దే పల్లి, ద్వానా శాస్త్రి, కతియాల వంటి వాళ్ళంతా నిబద్ధత గురించి మాట్లాడి ఉన్నారు. అదేమీ తెలియకుండానే అనేకులు ఆలోచించిన అంశాన్ని గురించి నేను కూడా ఆలోచించానని ఆనందం కలిగింది.తెలుగు కథానికా విమర్శఅని ఒక వ్యాసం రాశాను. చాలా పరిశోధన చేసి రాశాను. అది నాకు తృప్తినిచ్చింది. అలాగే తెలుగు కథానికా చరిత్రను సామాజిక ఉద్యమాల వెలుగులో పెద్ద వ్యాసంగా రాసినప్పుడు నేను చాలా తృప్తి పడ్డాను. ఇలాంటివి కొన్ని అనుభూతులు ఉన్నాయి. సర్దేశాయి తిరుమలరావు, చేకూరి రామారావు, పెనుగొండ లక్ష్మినారాయణ వంటి పెద్దలు, మిత్రులు నా విమర్శభాషా సౌందర్యాన్ని ప్రశంసించినప్పుడు ఆనందం కలిగింది.

19        సాహిత్య విమర్శ రాసే క్రమంలో లేదా అధ్యయనం చేసే క్రమంలో మాధ్యమాలలో సాధారాణంగా అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కొన్ని సార్లు వాదోపవాదాలకు దారి తీస్తుంటాయి. మీ రచనా జీవితంలో అటువంటి సందర్భాలు ఉ న్నాయా? వివరించండి?

అలాంటి సందర్భాలు నా విమర్శ జీవితంలో చాలా సంభవించాయి. ఇతరుల అభిప్రాయాలు అసంబద్ధమైనవని అనిపించినప్పుడు నా అభిప్రాయాల మీద ఎవరైనా అసంబద్ధంగా మాట్లాడినప్పుడు నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి. 1989 సెప్టెంబర్ 2న ఆంధ్రపత్రిక 'సాహితి' పేజీలో ఇస్మాయిల్ గారిది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆయన పేరు చెప్పకుండా వామపక్ష సాహిత్యం మీద విమర్శ పెట్టారు. రాజకీయాల ప్రభావంతో వచ్చేదంతా అకవిత్వమన్నట్లు మాట్లాడారు. 1980 తర్వాత మాత్రమే మంచి కవిత్వం వస్తున్నదన్నారు. రాజకీయాలకు కవిత్వానికీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. ఆయన అప్పటికీ పేరున్నకవి. నాకు అప్పటికి 40 ఏళ్ళు. విమర్శ రంగంలో అప్పటికి నావి తొలి అడుగులే కాని ఆయన అభిప్రాయాలు నచ్చలేదు.అన్యాయ మాటలుఅంటూ నా అభిప్రాయం రాశాను. అది 1989 అక్టోబర్ 9న అచ్చయింది ఆంధ్రపత్రికలో. కానీ, నేను చిన్నవాడని కదా, నా పేరు పెట్టుకోడానికి జంకి, 'సాగర్' అనే పేరుతో రాశాను. ఆ తర్వాత నేనేప్పుడు మారుపేరుతో గానీ దొంగ పేరుతో గానీ రాయలేదు. నా పేరుతోనే చర్చల్లో పాల్గొన్నాను. విశ్వనాథ సత్యనారాయణ, పి. కేశవరెడ్డి, వల్లభాచార్య, గంగాధర్ గాడ్జిల్, వసుమతి, ద్వానాశాస్త్రి, సిరంచ, సుధాకర్, వేల్చేరు నారాయణరావు, అక్కిరాజు రమాపతిరావు లాంటి అనేక మందితో చర్చల్లో పాల్గొన్నాను. ద్వానా శాస్త్రిగారితో 'నిబద్ధత' విషయంలో అనేక పర్యాయాలు ఢీకొన్నాను. అయితే ఎవరితో విభేదించినా నాగరికతా సరిహద్దులు దాటడం నా లక్షణం కాదు. ద్వానాకు వెటకారం చెయ్యడం అలవాటు. కాని ఆయన మీద ఉన్న గౌరవంతో దానిని నేను పట్టించుకోలేదు. శ్రీశ్రీ శతజయంతి, గురజాడ 150వ జయంతి సమీపిస్తున్న సమయంలో మనువాదులు వాళ్ళ మీద మరో సారి దాడికి పూనుకున్నారు. గురజాడ 'దేశభక్తి'లో ఏదేశం ఉంది. గురజాడ సంస్కృతీ విధ్వంసకుడు, గురజాడ ఈ నాటికి ఎందుకు అవసరం వంటి వ్యాసాలు వచ్చినప్పుడు నేను గట్టిగానే సమాధానం చెప్పాను. నవరసాల వంటి ముసుగు పేర్లతో రాసేవాళ్ళను నిలదీశాను.

ఈ సందర్భంలోనే శ్రీశ్రీ, గురజాడ  మీద మనువాదుల దాడి తిప్పికొట్టబడుతున్న సమయంలో అక్కిరాజు రామాపతిరావుగారుఅదికవి నన్నయ్య సహస్ర జయంతిని ఘనంగా నిర్వహించాలంటూ, పాఠకుల దృష్టిని మార్చే ప్రయత్నం చేశారు. నన్నయ్య 1050 - 60 మధ్య భారత రచన ప్రారంభించారని, అప్పటికి ఆయనకు 50ఏళ్ళ వయసు దాటి ఉండవచ్చని ఊహించారు. అంటే శ్రీశ్రీ(1910) శతజయంతికి సరిపోయేట్టుగా నన్నయ్య వెయ్యో జయంతిని కలిపారు. సరే నన్నయ్య జీవిత విశేషాలు చారిత్రక ఆధారాలతో లభిస్తే జరుపుకోవచ్చు. అప్పుడు  నేను 'నన్నయ్య గారి వెయ్యో పుట్టిన రోజు విగ్రహాత్సవమా? సామాజికోత్సవమా? అని రాశాను. అందులో 11వ శతాబ్దం నాటి  కవిని గురించి 21వ శతాబ్దంలో ఎలా ఉత్సవం జరుపుకోవాలో చెప్పండి అని కోరాను. ఆయన వర్ణ వ్యవస్థను కీర్తించిన కవి, మనం వర్ణవ్యవస్థ నిర్మూలనోద్యమం కాలంలో ఉన్నాం. ఎలా లింకు కుదురుతుందో చెప్పండి అని అడిగాను. అంతే, వెంటనే 'నిశాపతి' అనే ముసుగు పేరు ప్రవేశించింది. నన్నయ్యగారిపై రాద్ధంతోత్సవంఅనే వ్యాసం వచ్చింది. ఇద్దరు మిత్రుల వ్యంగ్య సంభాషణగా అది సాగింది. పేరు చెప్పుకోలేని వారితో మనకేమిలే అనుకున్నాను. ఆ తర్వాత అక్కిరాజుగారు విజృంభించి నువ్వు శ్రీవెంకటేశ్వర విశ్వద్యాలయంలో విద్యాభ్యాసం, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యలయంలో ఉద్యోగం ఎందుకు చేశావు? అవి మనువాద పేర్లు కాదా అని వాదించారు. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే ఇలాంటి వాదాలు వస్తాయని మాకు తెలుసు. ఇంతలో ద్వానాశాస్త్రి గారురాచపాళం వితండవాదంఅంటూ దూకారు. అలాగే కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళైగారు చివరికి వి.చెంచయ్యగారు ఏ కాలపు నీతినయినా బాధితుల దృష్టితో చూడాలి అని రాశారు. దాంతో ఆ చర్చ  ముగిసింది.

అలాగే ఇంటర్మిడియేట్ విద్యార్థులకు కచుని వృత్తాంతాన్ని పాఠంగా పెట్టినప్పుడు, అది పెట్టకూడని పాఠం అని నేను వ్యాసం రాశాను. అప్పుడు పెద్ద చర్చే  జరిగింది. అక్కిరాజు గారు మొదలుకొని అందరూ నన్ను దబాయించారుగానీ, నా వాదాన్ని పూర్వపక్షం చేయకుండా ఏవేవో మాట్లాడారు.

సంఘమిత్రలాంటి ఒకటి రెండు పేర్లతో ఇటీవల నన్ను గురించి దుర్మార్గమైన వ్యాసాలు రాశాడు. కేంద్రసాహిత్య అకాడమీ అంతా నా గుప్పెట్లో ఉందని రాశారు. నన్నొక గ్యాంగ్ లీడర్ అని జుగుప్సావహమైన భాషలో రాశారు. నాకు తెలియని, నాకు లేని శక్తులన్నిటినీ ఆపాదించేశారు. సంఘమిత్ర, నవరసాల వంటి పేర్లతో ఎవరైనా సాహితీపరులు నాకెక్కడా  తారసపడలేదు. కాబట్టి అవి దొంగ పేర్లు, పిరికివాళ్ళతో మనకెందుకు? అని ఊరుకున్నాను. నాకు ఒకటి అర్థమైంది భావజాలమే మనకు మిత్రులనైనా, శత్రువులనైనా సృష్టిస్తుందన్నది  వాస్తవం నాకు మార్క్సిజం మీద నమ్మక ముంది. సంఘమిత్రకు లేదు. పోనీ ఏమైంది? దానికి నన్ను నిందించాలా? సంఘ మిత్రకు హిందుత్వం ఇష్టం. నేను అభ్యంతరం చెప్పను. సందర్భం వచ్చినప్పుడు అభిప్రాయం చెప్పడానికి వెనుకాడను. అభిప్రాయాలు వేరైనా చర్చలో అనాగరికమైన భాష, సంస్కారం లేనిభాష ఉపయోగించాల్సిన అవసరం లేదు. ప్రశ్నకు సమాధానం లేప్పుడే గలీజు భాష, దబాయింపు ఆయుధాలౌతాయి. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.

20        రాయలసీమలో విమర్శ రంగంతో మీ తర్వాత కృషి చేస్తున్న ఇప్పటి తరం గురించి చెప్పండి?

60 ఏళ్ళకు పైబడిన వారందరూ నా తరం విమర్శకులు. 60కి లోన ఉన్నవాళ్ళు నా తర్వాతి తరం, ఇప్పటి తరం అనుకుందాం. గంగిశెట్టి లక్ష్మినారాయణ, హెచ్.ఎస్. బ్రహ్మనంద, పి.కుసుమకుమారి, జి చలపతి, ఎస్. భక్తవత్సలరెడ్డి, పి. నరసింహారెడ్డి, వి.స్.జి.డి.చంద్రశేఖర్, జి. దామోదరనాయుడు, మూలవిజయలక్ష్మి, కె. దామోదరనాయుడు, చిట్రాజు గోవిందరాజు, టి.జి.ఆర్, ప్రసాద్, సింగమనేని నారాయణ, నందవరం లింగా రెడ్డి, ఎస్.రాజేశ్వరి, రాధేయ, బి.సూర్యసాగర్, పాణి, స్వామి  మొదలైన వాళ్ళంతా నా తరానికి చెందిన నా తరం సాహిత్య విమర్శకులు. ఇప్పటితరం వాళ్ళతో ఇప్పటికీ విమర్శ గ్రంథాలు ప్రచురించబడిన వాళ్ళు,              ఉపన్యాసాలు చేస్తూ, వ్యాసాలు రాస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొలకలూరి మధుజ్యోతి, కిన్నెర శ్రీదేవి, కొలకలూరి ఆశజ్యోతి, మేడిపల్లి రవికుమార్, ఆర్.రాజేశ్వరమ్మ, అప్పిరెడ్డి, హరినాథరెడ్డి, తవ్యా వెంకటయ్య, అంరె.శ్రీనివాస్, బి. రాఘవేంద్ర, కె.నాగేశ్వరాచారి, పాణి, జి. వెంకటకృష్ణ, ఎన్ ఈశ్వర్ రెడ్డి, ఎం.ఎం.వినోదిని, మూల మల్లికార్జునరెడ్డి, రాజారాం , జి.వి సాయిప్రసాద్, షమీవుల్లా, కె.లక్ష్మినారాయణ, వై.సుభాషిణి, ఆర్. శశికళ, పి.వరలక్ష్మి, పిళ్ళాను. కుమారస్వామి తక్కిడ శిల జాని, సి.న్. క్షాత్రపతిరెడ్డి, ఎల్.ఆర్.వెంకటరమణ, జిక్కి కృష్ణ, రాసాని వంటివాళ్ళు దాదాపు 50 మంది దాకా రాయలసీమ నుండి విమర్శ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో సంప్రదాయ వాదులు ఉన్నారు. మార్క్సిజం, అంబేద్కరిజం, స్త్రీవాదులూ ప్రాంతీయవాదులు ఉన్నారు. చాలా మంది పరిశోధనలు చేసి డిగ్రీలు సంపాదించి సరైన ఉపాధిలేక అలా ఉండిపోయారు. వాళ్ళకు ఒక ఉపాధి లభించి ఉంటే మంచి విమర్శకులయ్యే వాళ్ళు.

21        ఇప్పటి సాహిత్య విమర్శకులకు మీరు చేసే సూచనలు ఏవైనా ఉన్నాయా?

నా తర్వాతి తరం విమర్శకులలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిర్దిష్టమైన దృక్పథం గలిగిన వాళ్ళున్నారు. వాళ్ళకు నేనేమీ సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు.

మిగతా వాళ్ళు సాహిత్య విమర్శకులు గొప్పపాఠకులు కావాలి అని వల్లంపాటి, విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. 'లోకములో గావ్యవిమర్శనము గడు నిష్టురపు పనిఅని వెన్నేటి రామచంద్రరావు రచనను వివరించడం రచన చేయడం కన్నా కష్టతరం అని త్రిపురనేని మధుసూదనరావు అన్నారు. నేటి విమర్శకులు ఈ అభిప్రాయాలను జీర్ణం చేసుకోవాలి. సాహిత్య విమర్శ నల్లేరు మీద బండి నడక కాదని, అది సంక్షేమ  కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలి. సాహిత్య విమర్శకూడా సామాజిక చర్చ, అది ఒక సామాజిక కర్తవ్యం అని తెలుసుకోవాలి. సాహితతీ  విమర్శ కాలక్షేప కార్యకలాపం కాదు. కత్తిమీద సాము అని గుర్తించాలి. సాహిత్య విమర్శకులకు సహనం ప్రాణభూతమైన లక్షణం. సాహిత్యంపట్ల, రచయితలపట్ల గౌరవం కలిగి ఉంటూనే విమర్శలో నిష్కర్షగా ఉండాలి. విమర్శకులకు "అందరిని మెప్పించెదనయ్యైంకుడలన్అనే ధోరణి పనికిరాదు. దానివల్ల సమాజానికి, సాహిత్యానికి నష్టమని తెలుసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా, నిస్సంకోచంగా ఒక సైడ్ తీసుకోకతప్పదు. ఒక దృక్పథం ఏర్పరుచుకోక తప్పదు. సాహిత్య విమర్శ ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి. విమర్శ రాసే క్రమంలో విమర్శకులకు ఇవన్నీ  తెలుస్తాయి.

22        రాయలసీమలో మీ ముందటి తరానికి చెందిన సాహిత్య విమర్శకులను గురించి తెలియ జేస్తారా?

నా ముందటి కాలానికి చెందిన సాహిత్య విమర్శకులలో రాయలసీమకు చెందినవారు కనీసం 40 మంది నాకు గుర్తున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి నుండి నూతలపాటి.గంగాధరం దాకా వీళ్ళందరూకలిసి కనీసం ఒక వంద విమర్శగ్రంథాలు రాసి ఉంటారు. వీళ్ళను నాలుగు తరాలుగా వింగడించుకోవచ్చు.

మొదటి తరం :

కట్టమంచి రామలింగారెడ్డి ( కవితృతత్వ విచారము వ్రాసమంజరి మొ||)

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ( సారస్వతాలోపము, వేమన, నాటకోపన్యాసములు మొ||)

కవిత్వవేది (ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహము కందూకురి వీరేశ లింగయుగము మొ||)

రూపనగుడి నారాయణరావు ( కావ్యనిదానము మొ||)

 

రెండవతరం:

పుట్టపర్తినారాయణచార్యులు ( ప్రబంధనాయికలు మొ||)

గడియారం వెంపటశేషశాస్త్రి (తిక్కనకావ్య శిల్పము మొ||)

భూపతి లక్ష్మినారాయణరావు ( సాహిత్యదర్శనము మొ||)

చిలుకూరి నారాయణరావు (గుజరాతీ సాహిత్య చరిత్ర మొ||)

కోరాడ రామకృష్ణయ్య (ఆంధ్రభారత కవితా విమర్శనము మొ||)  

కల్లూరు అహోబలరావు (రాయలసీమ రచయితల చరిత్ర మొ||)

 

మూడవతరం:

రాచమల్లు రామచంద్రారెడ్డి (సారస్వతి వివేచన మొ||)

మధురాంత కంరాజారం (కథనడి వచ్చిన దారి మొ||)

కోదాడమహదేవశాస్త్రి ( తెలుగు సాహిత్య చరిత్ర మొ||)

తిమ్మవజ్ఞల కోదండరామయ్య ( పాలవెల్లి, కవిరాజ శిఖముణి మొ||)

తూమాటి దొణప్ప (జానపద సంపద మొ||)

జాస్తి సూర్యనారాయణ ( తెలుగు వారికి సంస్కృతం మొ||)

సర్దేశాయి తిరుమలరావు (శివబరతదర్శనము, కన్యాశుల్కనాటకవళి మొ||)

 

నాల్గవతరం:

ఆర్ఎస్ సుదర్శనం ( సాహిత్యంలో దృక్పథాలు, సాహిత్యం - సమాజం మొ॥)

కేతువిశ్వనాథరెడ్డి ( కడప ఊర్ల పేర్లు, దృష్టి మొ||)

పి.వి. ఆరుణాచలం ( వ్యాసమంజూష మొ||)

జి. నాగయ్య ( తెలుగు సాహిత్య సమీక్ష, ద్విపదవాజ్మయం, తెలుగులో కావ్యావతారికలు, ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి మొ॥)

మద్దూరి సుబ్బరెడ్డి ( తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, సాహిత్య వివేచన మొ||)

కొలకలూరి ఇవాక్ ( తెలుగు వ్యాసపరిణామం, ఆధునిక సాహిత్య విమర్శసూత్రం, విమర్శిని, శూద్రకవి శుభమూర్తి వసుచరిత్రపక్షం మొ||)

తిమ్మపుడి కోటిశ్వరరావు ( ఆముక్తమాల్యదా సౌందర్యము, శ్వేత చ్ఛత్రం, సాలభంజిక, పురణవిద్ర మొ||) శిలాపరఘనాథ శర్మ ( వ్యాసభారత వరివస్య, ఆంధ్రమహాభారతం - నిదర్శనం మొ||)

సోదుంరామ్మోహన్ ( సాహిత్యవలోపన, సాహిత్యంలో శిల్పం మొ||)

ఆర్వీయార్ ( సాహిత్యతత్వం మొ||)

త్రిపురనేని మధుసూదన రావు ( కవిత్వం - చైతన్యం, సాహిత్యంలో వస్తశిల్పాలు మొ॥)

వల్లంపాటి వెంకటసుబ్బయ్య ( నవలా శిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం రాయలసీమ ఆధునిక సాహిత్యం మొ||)

డి. పద్మావతి ( దాశరథిరంగాచార్య నవలలు, ఆచార్య జి.ఎన్.రెడ్డి మొ||)

బి.భాస్కరచౌదరి ( జాషువకృతుల సమాలోచన, కృష్ణశాస్త్రి కవితాత్మ మొ||)

పి. సంజీవమ్మ ( తెలుగు నవల - సామాజిక చైతన్యం, సాహిత్య వ్యాసాలు మొ||)

తక్కోలు మాచిరెడ్డి ( చీకటి నుంచి స్వప్నం దాకా, రా రా మొ||)

ఎస్.గంగప్ప ( కోలాచలం శ్రీనివాసరావు నాటక సమాలోచనం, అన్నమయ్య ఇతర భారతీయ - కవులు మొ||) ఆశావాది ప్రకాశరావు ( భాగవత సౌరభం, సంప్రదాయ కవి తారీతి మొ||)

జె.ఎస్.ఆర్.కె.శర్మ ( భువనవిజయ ప్రబంధ సంక్షిప్త సంకలనం మొ||)

నూతల పాటి గంగాధరం ( గంగాధర లహరి మొ||)

వారాలకృష్ణమూర్తి ( తెలుగు, నాటకం - రాజకీయ సామాజిక సమస్యలు మొ||)

వీళ్ళలో విశ్వవిద్యాలయ ఆచార్యుల నుండి పాఠశాల అధ్యాపకులు దాకా ఉన్నారు. సంప్రదాయ వాదులూ, అభ్యుదాయ, విప్లవ, దళితవాదులు ఉన్నారు. ముగ్గురు నలుగురు సాహిత్య చరిత్రకారులు ఉన్నారు. భాషాశాస్త్ర పరిశోధకులున్నారు. నలుగురు వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. ( కట్టమంచి, జి.ఎన్.రెడ్డి, తూమాటి దొణప్ప, కొలకలూరి ఇనాక్) అనువాదకులున్నారు. అనువాద శాస్త్రవేత్తలున్నారు. అనేక మంది రచయితలకు పీఠికలు రాసినవాళ్ళున్నారు.

23        మీ తరం సాహిత్య విమర్శకులు రాయలసీమ వారిని గురించి తెలియజేస్తారా?

నా తరం విమర్శకులు కనీసం ఇరవై మందికి పైగా ఉన్నారు. పిహెచ్ డి  మాత్రోప జీవులను పక్కన బెట్టినా ఇంతమంది ఉ న్నారు.

సింగమనేని నారాయణ ( సమయమూ - సందర్భము, సంభాషణ, కవరణం తెలుగోవిందుకు, మధురాంతనం రాజారం మొ||)

హెచ్.ఎస్. బ్రహ్మనంద : ధృన్యాలోపం, తెలుగు కవిత్వం - నన్నయ్య ఒరవడి, విశిష్ట సాహిత్యం - జానపద ధోరణులు, తెలుగు సాహిత్య విమర్శ మీద సాహిత్య ప్రభవం, రాయలసీమలో హరికథా సంప్రదాయం,

రాయలసీమ భాష మొ||)

పి.కుసుమకుమారి ( సాహిత్యం - జండర్‌ స్పృహ మొ||)

జి. చలపతి ( వింశతి, కవికర్ణ రసాయనం - విశిష్టాద్యైవం మొ||)

భూమన్ (రాయలసీమ ముఖచిత్రం మొ||)

కావ్యా వతారిపి - తెలుగు తారిపి మొ||)

ఘట్టమ రాజు అశ్వర్థనారాయణ

పిఎల్. శ్రీనివాసరెడ్డి ( శ్రీనివాసాలు మొ||)

ఎం.కె.దేవకి ( తెలుగులో బాలగేయ సాహిత్యం , బాల సాహిత్యం మొ||)

ఎస్.జి. చంద్రశేఖర్ ( తెలుగు వచన కవిత్వం - కుందుర్తి మొ||)

ఎన్. భక్తవత్సలరెడ్డి ( స్వాతంత్ర్యోత్తరకాలాన తెలుగు కవిత, మొ||)

జి. దామోదరనాయుడు ( దశావతారతత్వం, మనుచరిత్ర - మనచరిత్ర, జయ మొ||)

కె. దామోదరనాయుడు ( మూలవిజలక్ష్మి తెలుగు జాతీయాలు, కడప జిల్లా భష, సిరిమల్లెలు మొ||)

టి. జిఆర్ ప్రసాద్ (చేతన మొ||) చిట్రాజు గోవిందరాజు ( కరుణకుమార, అన్నమయ్య పదాలలో ఉత్సవాలు తెలుగు సాహిత్యంలో మానవహక్కులు మొ||)

డి.బెంగారెడ్డి ( దౌపది, చిత్తూరు జిల్లా గ్రామ నామాలు మహాభారతంలో రాజనీతి మొ||)

ఎం. గోవిందస్వామి నాయుడు ( అనంతపురం జిల్లా గ్రామనామాలు, కాశనసోమన - అన్నమయ్య - తులనాత్మక పరిశీలన మొ||)

కె. సర్వోత్తమరావు (దాత్రిణాత్యదేవిబం దోరీతులు, అక్షరావలోపనం, రామదాసు - అన్నమయ్య, త్యాగరాజు మొ||)

. విశ్వనాధరెడ్డి ( వైదేహి, తమిళ తెలుగు భాషల్లో ఉర్దూపదాలు - తులనాత్మక పరిశీలన మొ||)

. చంద్రమౌళి ( దాశరథి కవితా సమాలోచన, తెలుగులో స్మృతి కవిత్వం మొ||)

అమళ్ళ దిన్నె వెంపటరమణప్రసాద్ ( తెలుగులో మృచ్ఛకటికం, అనంతపర్యం మొ||)

బండినారాయణస్వామి ( రాయలసీమ సమాజం - సాహిత్యం)

రాధేయ (అవగాహన, కవిత్వం - ఒక సామాజిక చైతన్యం, కవిత్యం - ఒక సామాజిక అవసరం, కవిత్వం - ఒక సామాజిక చైతన్యం మొ||)

గంగిశెట్టి లక్ష్మీనారాయణ ( ప్రాచీన శ్రేష్టభాషగా తెలుగు చరిత్ర మొ||)

హెచ్చార్కె  ( సంబంధం  మొ||)

బి. సూర్యసాగర్ ( శృతి సాహిత్యం - సౌందర్యం)

పి. రమేశ్ నారాయణ ( ఎర్రని ఆకాశం మొ||)

మక్కలూరి శ్రీరాములు ( పోతన భాగవతం, అయిదు వ్యాసాలు మొ||)

శశిశ్రీ ( రాయలసీమ సాహిత్యం , చూపు మొ||)

ఎన్. రామచంద్ర ( బెలం సాహిత్యం - సామాజిక చైతన్యం, పరిశోధన మొ||)

నా తరం వాళ్ళందరూ కలిసి నూటికి తక్కువ కాకుండా విమర్శ గ్రంథాలు ప్రచురించి ఉంటారు. నా తరం వాళ్లలో కూడా సంప్రదాయ వాదులూ, ఆధునికులూ ఉన్నారు. పుస్తకాలుగా రాకపోయినా, వ్యాసాలు అసంఖ్యకంగా రాసిన మధురాంతకం  నరేంద్ర, ఘట్టమరాజు లాంటి వాళ్ళు నా తరం విమర్శకులు ఉన్నారు. 

24        రాయలసీమ నుండి వచ్చిన విమర్శ గ్రంథాలలో ప్రామాణికమైనవిగా పేరుపొందిన వాటిని కొన్నింటిని పేర్కొంటారా?

తప్పకుండా కవిత్వతత్వ విచారం, వేమన, సారస్వతాలోకము, ఆంధ్రవాజ్మయ చరిత్ర సంగ్రహము, తెలుగు సాహిత్య సమీక్ష, సాహిత్యంలో దృక్పథాలు, తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, సాహిత్యంలో వస్తు శిల్పాలు, కన్యాశుల్కనాటక కళ, జానపద కళాసంపద, కడప ఊర్ల పేర్లు, సాంస్కృత వివేచనం వంటివి కనీసం ఇరవై విమర్శ పరిశోధన గ్రంథాలు రాయలసీమ నుండి వచ్చిన ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి.

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు