(ఆంధ్ర జ్యోతి వివిధ కోసం అల్లం రాజయ్య గారిని కాత్యాయనీ విద్మహే గారు ఇంటర్వ్యూ చేసారు. గత సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వివిధ సాహిత్య పేజీలో ఈ ఇంటర్వ్యూ లోని కొంత భాగాన్ని ప్రచురించారు. ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో ఆ ఇంటర్వ్యూ పూర్తి భాగాన్ని గోదావరి అంతర్జాల సాహిత్య పత్రిక పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం)
‘ఎదురు తిరిగితే’ (1977) కథ నుండి,నలభై రెండేళ్లుగా నేను అల్లం రాజయ్యగారి సాహిత్య పాఠకురాలిని. ఉత్తర తెలంగాణ గ్రామీణజనజీవిత సంఘర్షణలను, ఆరాటపోరాటాల చరిత్రగతిని,ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో సమాజాన్ని, మానవ సంబంధాలను అర్ధం చేసుకొనటానికి సమర్ధ వంతమైన సాధనం అల్లం రాజయ్య సాహిత్యం. మంథని తాలూకా అడవి అంచున, ఒకప్పటి బ్రాహ్మణ అగ్రహారం గాజులపల్లి లో రైతు కుటుంబంలో పుట్టిన రాజయ్య బడి చదువుల నాటికే కులం, ఆర్ధికం,దొరల అధికారం మానవ సంబంధాలను శాసిస్తున్నతీరును గమనిస్తూ ,కలవరానికి గురి అవుతూ కారణాలు తెలియని ఆవేదనలో సాహిత్యం చదవటం మొదలుపెట్టారు. గాంధీని, అంబేద్కర్ ను అధ్యయనం చేసారు. సామాజిక ఆచరణ మార్గాల వెతుకులాటలో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగం అయ్యారు. అది అర్ధాంతరంగా ముగిసిన తరువాత కాలేజీ చదువులకోసం వరంగల్ వచ్చారు. 1974 లో బీఎస్సీ పూర్తయ్యే నాటికే నక్సల్బరీ వెలుగులో కరీంనగర్ లో పురుడు పోసుకొంటున్న విప్లవోద్యమ నిర్మాణం లో తనతరపు సహచరులందరితో పాటు తానూ ఒకరైనారు. 1975 లో ఏసిసి కంపెనీ ఉద్యోగంలో చేరి మంచిర్యాలకు మకాం మార్చినా ఆలోచన,ఆచరణ,సృజన అన్నీనూతన ప్రజాస్వామిక ఉత్పత్తి సంబంధాల విప్లవోద్యమ పునర్నిర్మాణ మార్గంలోనే సాగించుకొంటూ వచ్చిన వర్తమాన చరిత్ర అల్లం రాజయ్య.
1973 నుండి అల్లం రాజయ్య రాసిన కథలు, నవలలు సంపుటాలుగా ప్రచురించ టానికి హైదరాబాద్ లోని పర్ స్పెక్టివ్స్ సంస్థ పూనుకొన్నది. వరవరరావు వీటికి సంపాదకులు. 2008 లో కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం నవలలతో వచ్చిన మొదటి సంపుటం ‘అల్లం రాజయ్య సాహిత్యం’. 1973 నుండి 1980 వరకు వచ్చిన 34 కథలతో ’ 2011 లో రెండవ సంపుటం ‘సృష్టికర్తలు వచ్చింది. 2013 లో ‘కొమురంభీము’ మూడవ సంపుటంగానూ , ‘వసంతగీతం’ నాలుగవ సంపుటంగానూ వచ్చాయి. 1981నుండి 1985 వరకు రాయబడిన 32 కథలతో అయిదవ సంపుటం ‘తల్లిచేప’ 2017 లో రాగా 1987 నుండి 2000 వరకు ప్రచురించబడిన 25 కథలతో ఆరవ సంపుటం ‘అతడు’ 2019 లో వచ్చింది. వివి రాసిన విపులమైన ముందుమాటలతో అచ్చులో 2,390 పుటలకు వ్యాపించిన సృజన సాహిత్యం ఇది. ముగింపులు - ముందుమాటలు ,ఊరేగింపు అనే నవలలు, మరో ముప్ఫయ్ కథలు పోయినవి పోగా లభించనివి మరికొన్ని, ఇటీవలి టైగర్ జోన్ నవల, మరి మూడు కథలు ఈ సంపుటాలలోకి ఎక్కనేలేదు. ఆరవది, ఇప్పటికి చివరిది అయిన ‘అతడు’ కథల సంపుటి వెలువడిన సందర్భంగా అల్లం రాజయ్య గారితో ముఖాముఖి సంభాషణ కోసం వంగాల సంపత్ రెడ్డి తో కలిసి ఆగస్టు 27 న మంచిర్యాల వెళ్ళాను. ఆరుగంటల పాటు ఒక మహా ప్రవాహంలా సాగిన ఆ నాటి సంభాషణలో దొర్లిన చరిత్ర,అనుభవాలు, జ్ఞాపకాలు, నమ్మకాలూ ఎన్నెన్నో… ఆ సంభాషణ నుండి కొంత మీ కోసం.
రాజయ్యగారూ , వందకు పైగా కథలు, పోగొట్టుకొన్న నవలలు, అచ్చులో ఉన్న సైరన్, టైగర్ జోన్ నవలతో కలుపుకొని తొమ్మిది నవలలు రాశారు కదా… అంత అపరిమిత సాహిత్యాన్ని ఉత్తరతెలంగాణ దేశకాల పరిస్థితుల పరిమితులనుండి సృష్టించటం ఎలా సాధ్యమైంది?
పాత అభివృద్ధి నిరోధకమైన సమాజాన్ని కూలదోసి దోపిడీ, పీడన,హింస లేని కొత్త సమసమాజాన్ని, శ్రామికవర్గ పార్టీని నిర్మించి పోరాడే చరిత్ర నా కాలంలో, స్థలంలో కొనసాగటం వల్లనే సాధ్యమైంది. ఇలాంటి సంఘర్షణాత్మకమైన సమాజం సాహిత్యానికి ప్రేరణ. అర్ధమైన వాస్తవికత గురించి రాయాలి. అదెప్పడూ స్థలకాల పరిమితమైందే . అనేక పొరలలో, అనేక కోణాలలో నిర్మితమయ్యే సమాజంలోని అసమానతలు , అవి సృష్టించే వైరుధ్యాలు, పరిష్కారంలో సంఘం అర్ధమయ్యేవరకు యాతన పడాలి. ఆ యాతన నుండి పుట్టే ఘర్షణ భావోద్వేగాలకు కారణమవుతూ ఒక వాస్తవానికి చుట్టూ ఆవరించిన అనేక వాస్తవికతలను అర్ధం చేయిస్తుంది.. అందువల్ల దేశకాల పరిమితులున్నా జీవన వైవిధ్యం, సంఘర్షణ గురించిన ఎరుక కలుగుతుంది. ఆ ఒత్తిడి నుండే నేను రాసాను. కరపత్రాలు, నివేదికలు … ఇవన్నీ కూడా కథలే కదా! నా చుట్టూ వున్న సమాజం గురించే రాసాను. మనుషుల గురించే రాసాను. అందరూ నేను చూసిన, ఎరిగిన మనుషులే. వేరేపేర్లు పెట్టి రాస్తాం అంతే. నా దుఃఖం ఏదైతే వ్రాసానో అది స్థల కాలాలనుండి తెలుసుకోవలసినదే. ఆ సమాజం ఇప్పుడు స్తబ్దంగా లేదు…. కూకటివేళ్లతో సహా పెకులుతోంది… ఎంతో అలజడి… మరెంతో సంఘర్షణ.
కథ, నవల యాదృచ్ఛిక రచనలు కావు. ఆచరణాత్మకమైన ఉద్దేశపూర్వక రచనలు . కథ రాయటమంత యాతన మరొకటి ఉండదు. ఆ హింసనంతా మనం అనుభవించాలి. మొదట నేను తెలుసుకొనటం ,తెలుసుకునే క్రమంలో లీనమై పోవటం, - వ్యక్తిగా కంటే ఆ పరిస్థితులలో, సమూహంలో లీనమవటానికే నా ప్రాధాన్యత- మనం అందులో భాగమైన, కూలిపోతున్న పాత సమాజపు ఆవేదన, రూపొందుతున్న కొత్త సమాజపు ఉద్వేగం రెండూ అతలాకుతలం చేస్తాయి. ఉద్విగ్న మైన వైరుధ్యాలను ఎదుర్కొనటం, ఉద్విగ్నతను దాటి పరిష్కారంవైపు పోవటం, ఆచరణకు వీలయ్యేదశలో రాయటం. ఇది నా రచనా పద్ధతి. ఇదే సర్వ సంపూర్ణమైన ఆచరణ అనుకోను. అప్పటికీ ఇప్పటికీ రూపొందుతున్న సమాజం పట్ల చిన్నపిల్లగాడ్నే - పరిశీలకుడినే గానీ తీర్పరిని కాను.
సృజనలో అనుభవానికి ప్రాధాన్యమా? పరిశీలనకు ప్రాధాన్యమా?
అనుభవమే ప్రధానం.అనుభవం పుట్టి పెరిగిన ప్రాంతాలను ,స్థల కాలాలను, కులాన్ని, మతాన్ని, లింగాన్ని బట్టి వ్యక్తిగతమైనదిగానూ, సామూహిక మైనది గానూ కూడా ఉంటుంది. అనుభవాలు ఒకసారి ఏర్పడి స్థిరపడేవికావు. జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పటికప్పుడు వచ్చి చేరే కొత్త అనుభవంతో అది నిరంతరం విస్తృతమవుతుంటుంది. ఈ క్రమంలో ‘పరిశీలన’ ది ప్రధాన పాత్ర. పరిశీలన అనుభవంగా మారుతుంది.అనుభవాన్ని గతి తార్కికంగానూ, చారిత్రికంగానూ విశ్లేషించుకోవటమే పరిశీలన. ఈ రెండూ సృజన అనే ఆచరణ నేపథ్యంలో జరుగుతాయి.
సన్నకారు రైతులు, రైతుకూలీలు ఫ్యూడల్ భూస్వామ్యంతో ప్రత్యక్ష సంఘర్షణకు దిగిన కాలాన్ని, చరిత్రను, సింగరేణి కార్మికులు పెట్టుబడిదారీ వ్యవస్థతో సంఘర్షణకు దిగిన చరిత్రను కథలుగా మలచిన మీరు ‘మధ్యవర్తులు’ కథతో చదువుకున్న మధ్య తరగతి వైపు చూపు మళ్లించారు.ఎందుకని?
ఉత్పత్తి వనరులు,ఉత్పత్తిశక్తులైన కార్మికులు,కర్షకుల అధీనంలో కాకుండా భూస్వాముల పెట్టుబడిదారుల అధీనంలో ఉండటం - ఉత్పత్తిశక్తుల నుండి అదనపు విలువ పిండుకొని - అతి కీలకమైన ఉత్పత్తిశక్తులనుఅభివృద్ధికాకుండా నిరోధించటం, ఉత్పత్తిసంబంధాలు ప్రజాస్వామీకరణ చెందకుండా భూస్వామిక పెట్టుబడిదారీ వలస సంబంధాలుగా ఉండటం - భారతీయ సమాజంలో అత్యంత అభివృద్ధి నిరోధకమైంది. కనుక ఇలాంటి అసమ విషమ పరిస్థితులు మార్చటానికి ఉత్పత్తి శక్తులు పోరాడక తప్పదు. అది అనివార్యం.
వ్యవసాయక దేశంలో భూమి అంటే దానిని అంటిపెట్టుకొని అభివృద్ధిచెందే సకల ఉత్పత్తి సంబంధాలు. అవి సృష్టించే అసమానతలు ఎన్ని తీర్లు ఉన్నయ్, అసమ సంబంధాలు ఎంత బాధ కలిగిస్తయ్, వాటి మీద కోపం ఎన్ని రూపాలలో వ్యక్తమవుతుందీ చెప్పే ప్రయత్నం మొదటి కథలలో చేసాను. ఉత్పత్తి వనరు అయిన భూమికి, భూస్వాములకు, భూమి నుండి ఉత్పత్తి అయిన పంటకు, పంపకానికి రైతుకూలీలకు మధ్య ఉన్నసంబంధాలను జరిగిన పోరాటం ద్వారా పరిశీలించే కొద్దీ అసమానతల వాస్తవం స్పష్టంగా అనుభవమైంది కనుక భూసంబంధాలు, అందులోని వైరుధ్యాలు, సంఘర్షణ అందుకోసం జరిగిన ప్రజాపోరాటాలు నా చేత ఆ రకమైన కథలు రాయించినయ్. సమస్యలకు ఒక పరిష్కారం దిశగా జరిగే యుద్ధానికి మనుషులను సన్నద్ధం చేసే పార్టీ గురించి చెప్పాలి. మీరు పేర్కొన్న గోడ కథనే తీసుకుందాం. అది అట్లా రాసిందే. పీపుల్స్ వార్ నిర్మాణమే ఆ కథ. ( ఎన్నాళ్ళుగానో కూలి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్న భూమి తనదని, వదిలి వెళ్లిపోవాలని మోటర్ల రిపేరింగ్ కార్ఖానా పెట్టుకుంటానని దొర చెప్పినప్పుడు చుట్టూ గోడలేపి, గుడిసెల కూల్చివేతకు సిద్ధపడ్డప్పుడు రాత్రికి రాత్రి కూలీకుటుంబాలన్నీ కలసి ఆ గోడను కూలగొట్టిన కథ అది. కూలివాళ్ళ మీద కేసులు, నక్సలైట్లతో సంబంధాలున్నాయని శిక్షలు మామూలే. వాళ్లలో రాములు మాత్రం జాడపత్తా లేకుండా పోవటం అందులో చెప్పబడింది. అంటే భూస్వామ్య అధికారాన్ని విధ్వంసం చేసే ప్రజాయుద్ధ నిర్మాణంలోకి అతను వెళ్లాడన్నమాట. )
ఆదివాసీ ఉత్పత్తి ప్రకృతితో ముడిపడింది. భారతీయ ఉత్పత్తివిధానం అటువంటిది కాదు. ఉత్పత్తి విధానంలో , సంబంధాలలో యూరప్ లో లాగా బానిస సమాజాన్ని రద్దుచేసి ఫ్యూడల్ సమాజం, దాన్ని రద్దుచేసి పెట్టుబడిదారీ సమాజం ఇక్కడ ఏర్పడలేదు. ఉత్పత్తి సంబంధాలలో అతి పురాతన మను కౌటిల్యులే ఇప్పటిదాకా కొనసాగటం ఒక కుట్ర. విషాదం. అది ఇప్పుడు మరీ తీవ్రమైంది. అది ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం లేని మధ్యతరగతిని ఏమి చేస్తుంది? తాము పుట్టిపెరిగిన రైతాంగం నుండి , కార్మికుల నుండి విడదీసి యంత్రాoగంగా మారుస్తుంది. చదువుకున్న వాళ్ళు ,మధ్యతరగతివాళ్ళు ఈ ఉత్పత్తి మాయలో ఏమైతరు? ఇప్పుడున్న ఉత్పత్తిసంబంధాలలో వాళ్ళెంత హింసకు, పరాయీకరణకు గురవుతున్నారో తెలుస్తున్నప్పుడు, వాటిని మార్చటం గురించిన చైతన్యం కలిగించాలి. తప్పనిసరిగా వాళ్ళు పోరాడే శక్తులతో కలిసి పోవాలి. అన్ని భారతీయ భాషల్లో మధ్యవర్తుల శ్రమ పరాయీకరణ గురించి బాధపడటం రాశారు. కాదు, ఆ స్థితిని దాటటానికి ప్రయత్నం చేయాలనే ఈ కథ.
మధ్యతరగతి లో ఉత్పత్తి సంబంధాలలోని అమానవీయతను గురించిన స్పృహ వుంటుంది. గోపీచంద్ ,చలం, బుచ్చిబాబు వంటి రచయితలు ఈ కోవకు చెందినవాళ్ళే. ఉత్పత్తిసంబంధాలను ప్రశ్నించిన ,పాత భూస్వామ్య హేతు విరుద్ధ సమాజాన్ని ప్రశ్నించిన సాహిత్యం - చీకటిగదులు - వంటి నవలలు వచ్చాయి. కానీ ఉత్పత్తిసంబంధాలను మార్చటాన్ని గురించి వాళ్ళు ఆలోచించలేదు. విప్లవం తెచ్చే మార్పువాళ్ళ కోసం కూడా కావాలి. ‘మధ్యవర్తులు’ వంటి కథలు అందుకే రాసాను. సర్వీసురంగం పేర మధ్యతరగతి 50 శాతం కన్నా ఎక్కువగా పెరిగింది.
భూమి సమస్య కేంద్రంగా మనుషుల ఆరాటపోరాటాలను, విప్లవోద్యమనిర్మాణంలోకి చేరే అనివార్యమైన స్థితిగతులను, రాజ్యహింసను ధిక్కరిస్తూ విప్లవోద్యమాన్ని అంటిపెట్టుకొని సాగే క్రమాన్ని చిత్రించిన - ‘సృష్టికర్తలు’ , ‘అడివి మనిషి’ తల్లి చేప, ‘ఒకతండ్రి’ వంటి కథలు రాసారు కదా! ఆ కథలు ఉత్తేజకరమైన ఆశను , ఆర్ద్రతను కలిగించాయి.మరి అటువంటి పోరాటంతో ఏ సంబంధంలేని ‘మనిషిలోపలి విధ్వంసం’ కథ ఎందుకు రాసారు ?అది ఆద్యంతాలు విషాదమే కదా?
భారతీయ ఉత్పత్తి విధానం కోణం నుండి జీవితాన్ని, సామాజిక పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొనటం అవసరం. ఈ కథలో రైతు రాజారాం భూస్వామిక వ్యవసాయ విధానం సంక్షోభం మూలకంగా కొంతకాలానికి కూలీగా మారిపోయి ,అక్కడినుండి ఇంకా దిగజారి, పరాయీకరణకు లోనై, విధ్వంసమై ,భార్య తిరస్కారానికి గురియై ఒంటరివాడు అవుతాడు. భార్య తీసుకొని వెళ్ళిపెంచి పెద్దచేసిన కొడుకు తన చుట్టూ ఆవరించి ఉన్న కల్లోల సమాజాన్ని, సంక్షోభాన్ని అర్ధం చేసుకోలేక యాతనపడి ,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొంటాడు. వాడి మరణానికి కూడా మొగుడే కారణమన్నట్లు చూసి,చీదరించుకొని కొడుకు శవాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆమె. రాజారాం పెళ్ళాంపిల్లలను పోషించలేని అసమర్థుడయ్యాడు , తాగి వచ్చిపెళ్ళాన్ని కొడుతున్నాడు. ఇల్లూ వాకిలి పట్టక తిరుగుతున్నాడు అని అతని భార్యే కాదు ఎవరైనా చీదరించుకోవచ్చు , కానీ అతను అలా ఎందుకు తయారయ్యాడన్నప్రశ్న వేసుకొని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచిస్తే అది భారతదేశ వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల వైఫల్యం అని అర్ధం అవుతుంది.
భారతదేశంలోని కోట్లాది రైతుల స్థితి అది. ఇప్పటికీ రైతు పొలందున్ని పంట వేయాలంటే ట్రాక్టర్ల కోసం, ఎరువులు,పురుగు మందుల కోసం, అప్పులకై షావుకార్ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సివస్తుంది. ఇంత చేసి పండిస్తే గిట్టుబాటు ధరలేక రైతుకు గిట్టేది 40 శాతం మాత్రమే. ఈ ప్రక్రియలో అంతులేని హింసకు, దోపిడీకి గురవుతూ భూమికి , భార్యా బిడ్డలకు, దేనికీ, ఎవరికీ చెందనివాడవుతాడు. ఒంటరివాడవుతాడు. మన ఉత్పత్తి విధానం భూస్వాములకు,పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చి పెడుతూ రైతాంగాన్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అది మొత్తంగా మనిషిలోపలి విధ్వంసానికి దారితీస్తున్నది. ఆ విషాద వాస్తవం గురించిన అవగాహన కలిగితే తప్ప ఆస్తి యొక్క అన్నిరకాల అధికార అభివ్యక్తుల మీద పోరాటాలు నిర్మాణంకావు. కులాలుగా వర్గాలుగా చీలివున్న గ్రామీణ రైతాంగం, రైతుకూలీలు అభివృద్ధి నిరోధకమైన హింసాత్మక ఉత్పత్తివైధానాన్ని అర్ధం చేసుకొని పరిష్కరించే దిశగా ప్రజాపోరాటాల నిర్మాణం జరిగితే కోట్లాదిమంది అలాంటి పోరాటాల్లో సమీకరించబడతారు. ఇప్పటికీ భారతదేశంలో విప్లవపోరాటాలు ఎదుర్కుంటున్నది అతి కీలకమైన నిర్మాణపరంగా సమస్య.
‘కమల’, ‘మహాదేవుని కల’ కథలు కూడా ఉత్పత్తిసంబంధాల వైఫల్యం చెప్పటానికే రాసాను. భూస్వామి దగ్గర పనిచేసే పాలేరుకిష్టయ్య, భూస్వామి కుటుంబానికి చాకిరిచేసే భార్య కమల దాదాపు ఒక స్థితిలో ఉన్నవాళ్లే. ఫలితం లేని శ్రమ, హక్కులు లేని జీవితం ఉత్పత్తి సంబంధాలలోని అసమానతల వల్లనే వాళ్ళ పాలబడ్డాయి. వాటినుండి బయట పడటానికి కిష్టయ్య వంటి పాలేర్లకు వున్న పాటి అవకాశం కూడా కమల వంటి స్త్రీలకు లేదు. భారతదేశంలోని సగభాగం స్త్రీలు విప్లవోద్యమాలల్లోకి రావాలంటే ఈ వైరుధ్యం అర్ధం కావాలి.
శూద్ర కులాల వాళ్ళు చేయవలసినదిగా చెప్పబడిన వ్యవసాయం మీద అపేక్ష పడిన మహాదేవుడి జీవిత వైఫల్యాన్ని కూడా ‘ఉత్పత్తి విధానం’ లో భాగంగానే చూడాలంటారా?
కులాల గురించి భారతదేశ పరిణామక్రమం అర్ధం చేసుకోకుండా చర్చజరుగుతున్న సందర్భంలో రాసిన కథ అది. మహాదేవుని వెనక మల్లోజుల కోటేశ్వరరావు ఉన్నాడు.ఇంకా చాలామంది మిత్రులున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతను వ్యవసాయ సంబంధాలలో , భూ సంబంధాలలో మార్పు కోసం ఎందుకంత తండ్లాడిండు అన్న ప్రశ్ననన్ను చాల వేధించింది. సమాధానంకోసం సంఘర్షణ పడ్డ. అసలు మనిషికి భూమికి , శ్రమకు వుండే సంబంధం చాలా సహజమైంది. కానీ మనువాద బ్రాహ్మణీయ కుల వ్యవస్థ కొందరిని శ్రమనుండి దూరం చేసింది. శూద్రులను,దళితులను, మహిళలను శ్రమ ఫలితాలకు దూరం చేసింది. కులం రీత్యా అగ్రహారాలు పొంది భూములైతే పొందిన్రు కానీ వాళ్ళు భూమితో, శ్రమతో వుండే సహజ సంబంధాన్ని పోగొట్టుకున్నారు.ఆ ప్రక్రియ చాలా హింసాత్మకమైనది. ఆ క్రమంలో మనుషులు విధ్వంసం అవుతారు. మహాదేవ్ లాగా పిచ్చివాళ్లయినా అవుతారు. వాళ్ళ నాయన వలే శ్రమ అగ్రవర్ణానికి అవమానకరమైనదిగా భావించే స్థితికి చేరి పరాన్నభుక్కులుగా నయినా మారతారు.క్రూర హింసాత్మక రాజ్యంగా, ప్రత్యర్థులుగా మారతారు. భారతదేశ భూస్వామిక సంక్లిష్ట స్వభావాన్ని అధ్యయనం చేయటంలో భాగంగా ఈ కథ రూపొందింది.
‘లక్షలాది మందిని లోలోపల ముట్టుకున్నమనిషి’ గురించిన ‘అతడు’ కథ లో ఆ లక్షలాది మందిని మీరు కూడా లోలోపల నుండి ముట్టుకున్నట్లే అనిపిస్తుంది. మల్లిక ఇంటి నుండి వీధులకు, మార్కెట్ కు, మిల్లులకు, తుప్పలకు, హాస్పిటల్ కు, పోలీస్ స్టేషన్ కు, చివరకు శ్మశానానికి, ఆ క్రమంలో అనేకమంది మంది మనుషుల మనసులలోకి కెమెరాను మార్చి మార్చిఫోకస్ చేస్తూ ఈ కథను గొప్ప దృశ్యకావ్యంగా చేసారు మీరు. ఈ కథలో కోట్లాది మానవులను కలిపే ఉత్పత్తి సంబంధం గురించి,అందులోని వైరుధ్యాల గురించి, అవి మనుషులను ఎన్ని భిన్నమార్గాలలోకి నెట్టుకు పోతాయో భిన్న పాత్రల అంతరంగ ఆలోచనల ద్వారా చూపించిన తీరును గుర్తు చేసుకొంటే ఉత్పత్తి సంబంధాల మార్మికతను విప్పిచెప్పటమే అంతఃసూత్రంగా కనబడుతుంది. ఏమంటారు?
నిజమే. భూస్వామ్య పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు రెండింటి మధ్య ‘అతడు’ పనిచేశాడు. ఆ ఉత్పత్తి విధానాలలోని దోపిడీ, హింస, విధ్వంసం అర్ధం చేసుకొన్నాడు కనుకనే మార్పు కోసం పనిచేశాడు. పాత అమానవీయమైన భూస్వామిక మానవ సంబంధాలను పునాదులతో కదిలించి ,కొత్త ప్రజాస్వామిక సంబంధాల నిర్మాణాన్ని వేగవంతం చేయటం, భిన్న వైరుధ్యాలలో ఉన్న మనుషులను కదిలించి ఆచరణలోకి తేవటంలో కార్మికవర్గ నాయకుడిగా పనిచేశాడు. అందుకే అతడికి పేరులేదు. అతడు విప్లవాచరణ స్వరూపం. మహాదేవునికలలోని మహాదేవ్ ను,మనిషిలోపలి విధ్వంసం లోని రాజారాం ను, మధ్యవర్తులు లోని నాగేంద్రను, కమలలోని కమలను, ప్రత్యర్థులు లోని రావు ను గతితార్కికంగా, చారిత్రకంగా అర్ధం చేసుకొని వారివారి సంక్షోభాలను, విధ్వంసాలను రూపుమాపి నిర్మాణం చేసే శ్రామికవర్గ పార్టీ అతడు.
మీరు ఒక ప్రధాన మంత్రి మానసిక స్థితిని, సంఘర్షణను చిత్రిస్తూ ‘ ప్రత్యర్ధులు’ కథ రాశారు కదా! ఆ ప్రధాని పివి నరసింహారావు అని తెలుస్తూనే వుంది. ప్రజల సమస్యలు, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు అనేకం ఉండగా అంత పై స్థాయి వ్యక్తి ని కేంద్రం గా చేసి కథ ఎందుకు రాయవలసి వచ్చింది?
నేనున్న సామాజిక సందర్భం నుండే ఆ కథ వచ్చింది. బ్రాహ్మణీయ అర్ధ వలస , అర్ధభూస్వామ్య లక్షణం అంతగా ఉన్నవారు పివి తప్ప మరొకరు లేరు. మన శత్రువు గురించి మనకు తెలియకుండా యుద్ధంలో నిలబడలేం. ఈ కథలో ఆదివాసీ నాయకుడి పాత్ర ఒకటి వుంది. అతను ఈ ప్రధానమంత్రి ఒకే వూర్లో పుట్టి పెరిగిన వాళ్ళు. ఒకే కాలంలో లో ప్రారంభం అయినవాళ్లు ఎక్కడ ,ఎట్లా వేరయిన్రు ? .. వాళ్ళను వేరుచేసింది ఏమిటి? ఉత్పత్తి విధానమే. ఉత్పత్తిచుట్టూ వుండే యంత్రాOగం వాడే భాష వేరు. ఎవడి నాటకం వాడిదే. భూస్వామ్య అర్ధవలస సంబంధం అది. ఆ సంబంధంలో మనుషులు ఎలా ఉన్నారో కూడా మనకు కావాలి. మార్చటానికి సంబంధించిన సన్నివేశంలో మనం ఉన్నాం కనుక వాళ్ళ జీవితాలనుండి అర్ధం చేసుకొన్న వాస్తవికతను రాయాల్సి వుంది. అందుకనే రాసా.
రాయటం వరకు బాగానే ఉంది. కానీ శత్రువు మీద కోపం కాస్తయినా కనబరచకుండా అంతరంగ చిత్రణ చేయటం ఎలా సాధ్యమైంది ?
కమ్యూనిజాన్ని కనిష్ఠ స్థాయి నుండి గరిష్ఠ స్థాయివరకు అర్ధం చేసుకున్న వాళ్ళు మనిషి మీద కోపం చేయరు. మనిషిని అట్లా మార్చిన ఉత్పత్తి విధాన వ్యవస్థమీద కోపం తెచ్చుకోవాలె. దానిని మనచేతుల్లోకి తీసుకుని మార్చుకొనటం ఎట్లా అనేది నా కథకు లక్ష్యం. అయితే ప్రత్యర్ధులు కథ నిండా అనేక సామాజిక పరిణామ క్రమపు ఉద్వేగాలు, పతాకస్థాయి ఘర్షణ వున్నాయి. నిజానికి ఈ కథ తాత్వికంగా అత్యంత తీవ్రమైన కథ. కథ మొదలవటమే ఒక ఎన్నికల యుద్ధవాతావరణంలో మొదలౌతుంది. ఎప్పటికైనా అత్యంతదారుణమైన, హింసాత్మకమైన స్థితిలో తమ పతనం జరిగితీరుతుందన్న భయం ఎరుక ఉన్నాయి.
అయితే అది మీరు ‘వసంతగీతం’ నవలతోనే ప్రారంభించినట్లున్నారు. విప్లవోద్యమాన్ని అత్యంత హింసాత్మకంగా అణచివేస్తున్న పోలీసులు వ్యక్తులుగా మానసికంగా ఎంత విధ్వంసానికి గురిఅవుతున్నారో, ప్రేమకు, కౌటుంబిక జీవితానికి ఎలా పరాయీకరణకు గురిఅవుతున్నారో ఈ నవలలో చిత్రించారుకదా !
అవును. నేరం రాజ్యం యొక్క అవ్యక్తరూపం. అది ఆస్తులతో, అధికారంతో పాటు ఉత్పత్తి అవుతుంది. సున్నితమైన హృదయం ఉన్న మానవుణ్ణి కర్కోటకుడిగా మారుస్తుంది. యుద్ధం నేరవ్యవస్థపైనే. యుద్ధరంగంలో మోహరించిన విప్లవోద్యమాల ఎత్తుగడలు,వ్యూహం ; రాష్ట్రం నుండి కేంద్రం దాకా మోహరించిన రాజ్యపు నిర్మాణాలు చిత్రించనైనది.
ఈ నవలలో మరొకటి కూడా వుంది.ఉత్పత్తి సంబంధాలలో అసమానతల వల్ల బాధలుపడేవాళ్లు వాటిని మార్చటానికి పనిచేస్తున్న పార్టీకి ఆకర్షితులు కావటం , నిర్మాణంలోకి పోవటం సహజం. పోయినవాళ్లంతా జీవితకాలం దానినే అంటిపెట్టుకొని ఉండాలనుకొనటం ఆదర్శం. అటువంటి వాళ్ళు ఉన్నారు కూడా. కానీ మనుషులందరూ అట్లాగే ఉండరు. రకరకాల లోపలి వత్తిడులతో, బయటి వత్తిడులతో, వదులుకోలేని
మోహాలతో నిర్మాణాన్ని వీడి వెళ్లిపోవచ్చు. ఆ విధమైన మనుషులను పిరికివాళ్ళనో, విప్లవ ద్రోహులనో వదిలెయ్యటమో,శిక్షించటమో కాదు చెయ్యాల్సింది. వాళ్ళ రాజకీయచైతన్యం పదునుదేరే వరకు కనిపెట్టుకొని ఉండాలి.ఊగిసలాడేవాళ్ళకొరకు కూడా ప్రజాసంఘాలు, పార్టీ పనిచేయాల్సి ఉంటుంది. గట్టయ్య జీవిత పరిణామాలు కేంద్రంగా ఇతివృత్తం నడపటం అందుకోసమే.
భారతదేశ చరిత్రలో ప్రజాపోరాట చరిత్రలో అనేక ప్రాంతాలల్లో తిరుగుబాట్లు , ఉద్యమాలు జరిగి ఇంచుమించు మూడునాలుగు సంవత్సరాలలో అణచివేతకు గురయ్యాయి. తొలిసారిగా చైనాదేశపు విప్లవ విజయం (1931-49) 18 సంవత్సరాలు, (1967-1985) నుండి నక్సల్బరీ రైతాంగపోరాటంగా నిలదొక్కుకోవటానికి దారులు తీసిన అనుభవం ఈ నవల.
కొలిమంటుకున్నది నవల నుండి వసంతగీతం వరకు ఈ నలభై ఏళ్ళ లో మీరు రాసిన నవలలన్నీ సమకాలీన రాజకీయార్థిక చరిత్రలే కదా ‘కొమురం భీము’ లో చరిత్రనే ఇతివృత్తం చేసుకున్నారు ఎందుకని?
భారత దేశంలో జరిగిన అనేక రైతాంగ పోరాటాలు తగిన స్థావర ప్రాంతాలు లేక నిలదొక్కుకోజాలని నేపథ్యంలో విప్లవోద్యమం ముందు నుండే అడవిలో పనిచేసింది. ఫలితంగా 1976 నాటికి ఆదివాసులలో భూమి హక్కు చైతన్యం ఉద్యమస్థాయికి చేరుతున్నది. 1981 లో ఇంద్రవెల్లి లో గిరిజన రైతుకూలీ సభకు సమీకరణ దాని ఫలితమే. పోలీసు కాల్పులతో ఆ సభ భగ్నమైన ఘటన నన్ను నిద్రపోనియ్యలేదు.అప్పటికే సాహూకు అడవి సుపరిచితం. అడవిని సర్వే చేసి , ఆదివాసీల జీవితాన్ని పరిశీలిస్తూ నోట్సుకూడా రాసుకున్నాడు . నలభై సంవత్సరాల క్రితపు ‘కొమురం భీము పోరాట చరిత్రతో తెగిపోయిన లింకు ఎక్కడో నరాలను అంటుకొని మండుతూ కలవరపరిచింది. ఆదివాసీల కథనాలలో దాని జాడలు తెలిసే కొద్దీ ఇంద్రవెల్లి సందర్భం నుండి, ఇంద్రవెల్లిని మరింత అభివృద్ధికరంగా ముందుకు తీసుకు పోవటానికి కొమురం భీము చరిత్రను నవలగా రాయటం అవసరం అనిపించింది. రాశాం. ఆ కొమురం భీము పోరాట వారసత్వమే ఇప్పటి ఆదివాసీ యుద్ధం.ఇప్పటికి ఆరు సార్లు ప్రచురించ బడింది ఈ నవల.
ఇదివరకు పరిచయం ఉన్నఒక ఆదివాసీ కుటుంబాన్నిఈ మధ్య కలిసిన.. అప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళ బిడ్డలు ఇప్పుడు కాలేజీ చదువులకు వచ్చారు. వాళ్ళ అమ్మాయి చేతిలో కొమురం భీము నవల ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కొమురం భీము నవల చదువుతున్న ఆ ఆదివాసీ అమ్మాయి ఏమి ఆలోచిస్తున్నది? దానితో ఎట్లా ఐడెంటిఫై అవుతున్నది? ఏమైతది? అనే ప్రశ్నలు నన్ను ఇప్పటికీ వేధిస్తున్నయ్.
ఆదివాసీలు తమ చరిత్రనే కాక సామాజిక పరిణామక్రమాన్నిగతితార్కిగంగా, చారిత్రికంగా అర్ధంచేసుకుని యాభైఏళ్ల సుదీర్ఘపోరాటంలో నాయకత్వంలోకి వస్తున్నారు. జల్ - జంగల్- జమీన్ - అధికార్ నినాదాలతో భారతదేశంలో ఒక శక్తిగా ఎదుగుతున్నారు. భారతదేశంలోని వనరులను, ఖనిజాలను, దళారీ ప్రభుత్వ అండదండలతో దోచుకుపోతున్న బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు సవాలుగా మనందరి తరఫున నిలబడ్డారు. ఇలాంటి చైతన్యానికి, నిర్మాణానికి,కొమురంభీం ఒక టార్చ్ లైట్ గా పనిచేశాడు. రెండువేల అయిదువందల సంవత్సరాల వలసవాదుల - ఆర్యులనుండి ఆంగ్లేయులదాకా- అల్లిన పుక్కిటి పురాణాల చరిత్రను తిరస్కరించి పోరాడిన ఆదివాసీ, మూలవాసీ పోరాటయోధుడు కొమురం భీం.
మహిళల పట్ల స్నేహం, గౌరవం, నమ్మకం మీ సాహిత్యంలో అంతఃస్రవంతి. కానీ ఈ విధమైన సంస్కారం ఈ నాటి సమాజంలో నానాటికీ క్షీణిస్తున్నది. దీనిని మీరెలా వ్యాఖ్యానిస్తారు?
బ్రాహ్మణీయ భూస్వామ్య పితృస్వామిక సమాజంలో ఆడవాళ్లను మనుషులుగా చూసే పరిస్థితే లేదు. కమల కథలో కమల లాగా స్త్రీలందరూ ఉత్పత్తి సంబంధాల వైరుధ్యాల మధ్య పితృస్వామిక భావజాలంవలన అందరికంటే ఎక్కువగా అణచివేతకు, హింస కు గురయ్యారు. సోషలిస్టు దేశాలలో కూడా వాళ్ళను సమానంగా ఎదగనియ్యలేదు. మొదట్లో విప్లవోద్యమం కూడా స్త్రీ సమస్యను అర్ధం చేసుకొనటంలో, పార్టీలోకి తీసుకొనటంలో తడబడిన మాట వాస్తవం. 1985 నుండి స్త్రీల గురించి ఆలోచించటం , స్త్రీల భాగసామ్యం పార్టీలో పెరుగుతూ వచ్చింది. అయితే ఆదివాసీ శ్రామిక దళిత బహుజన మహిళకు ఉన్నంత వెసులుబాటు మధ్యతరగతి మహిళలకు లేదు.
యాభైఏళ్ల భారతీయ విప్లవోద్యమాన్ని బాగా అర్ధం చేసుకున్నవాళ్ళు మహిళలు.వాళ్లు తాగరు. సమిష్టి జీవితాన్ని కోల్పోలేదు. కుటుంబ నిర్వహణ సామర్ధ్యం , అనుభవం వున్నవాళ్లు. ఆస్తులే లేనివాళ్లు … నేరాలు చేసే ప్రసక్తే లేదు అందువల్ల తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక విప్లవఅవసరాల కోసం కూడా నిలబడగలిగిన శక్తి వాళ్లకే అధికంగా ఉన్నది. ప్రపంచ విప్లవోద్యమాలల్లో లేనివిధంగా 50 శాతం మహిళలు విప్లవోద్యమాల్లో పోరాడుతున్నారు.
పసి పిల్లల నుండి వయసుతో నిమిత్తంలేకుండా ,వావి వరసలతో సంబంధం లేకుండా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలను ఎట్లా అర్ధం చేసుకోవాలి?
భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ఎంత మొరటుగా ,వికృతంగా సామాజిక పరిణామక్రమానికి భిన్నంగా ఎంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయో - ఈ ఘటనలు కొండగుర్తు. తమ సామాజిక వైఫల్యాన్నంతా పురుషులు స్త్రీల మీద చూపిస్తున్నారు. దళితుల మీద జరిగిన స్థాయిలో స్త్రీల మీద దాడులు ఈ రూపంలో సాగుతున్నాయి. పితృస్వామిక బహుముఖాల వికృత రూపమిది. మహిళలు చైతన్యం కావటం, పాత పుక్కిటి పురాణాల బ్రాహ్మణీయ భావజాలం నుండి బయటపడి సంఘటితం కావటం అటు బూర్జువా రాజకీయాలల్లో, విప్లవ రాజకీయాలల్లో ముఖ్యంగా ఉత్పత్తిరంగంలోకి ,ఉద్యోగాలల్లోకి - క్రమంగా ఫ్యూడల్ నిర్మాణమైన కుటుంబంలో పురుషుడు పట్టు కోల్పోవటం - వీటన్నిటి మూలకంగా మనువాద రామాయణం సంకెళ్లు తెగటంతో - రాజ్యం లాగే -పురుషుడు ఫాసిస్టుగా -ముఖ్యంగా బ్రాహ్మణీయ విధ్వంసక ఫాసిస్టుగా మారుతున్నాడు. సృజనాత్మకంగా వుండే మనుషులపట్ల, ఆడవాళ్లు ,పిల్లల పట్ల హింసాత్మక ప్రవృత్తికి దిగుతున్నాడు. మహాద్భుతమైన స్త్రీ పురుషులు విప్లవోద్యమాలల్లో నిర్మాణం కాకుండా నిరోధించటానికి సామ్రాజ్య వాదులు, వాళ్ళ తొత్తులైన ప్రభుత్వాలు,ప్రసార ప్రచార సామాజిక మాధ్యమాలు సెల్ ఫోన్ల లాంటి వాటిలో ఒక అరాచక వికృత హింసాత్మక భావజాలాన్ని అన్నిరకాలుగా ప్రచారంచేస్తున్నారు.
వరకట్నపు వేధింపులు, హత్యలు, అత్యాచారాలు మొదలు ప్రభుత్వ విధానాలు,రాజకీయార్థిక సమస్యలు, నిర్వాసితత్వం వరకు అనేక రూపాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలమీద పోరాడుతున్న మహిళా సంఘాలు, కుల వివక్షమీద పోరాడుతున్న సంఘాలు ఈ నాడు అనేకం వున్నాయి. వీటిని ఎట్లా చూడాలంటారు?
బహుముఖాలుగా వ్యక్తమవుతున్న ప్రజాచైతన్యంగా అర్ధం చేసుకోవాలి. వర్గ కుల లింగ ప్రాంతీయ వైరుధ్యాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయటంలో స్థలకాలాలల్లో అలాంటి వైరుధ్యాలను గుర్తెరిగి ఉద్యమాలు నిర్మించటంలో విప్లవోద్యమం విఫలం అయింది. ఇన్నాళ్లు గిడసబారి యాభైఏళ్ల విప్లవోద్యమ నేపథ్యంలో అవి చైతన్యం పొందాయి. ఆయా వర్గాల ఆగ్రహావేశాల వ్యక్తీకరణ ఈ రకమైన సంఘాలు.
వాళ్ళ దగ్గరకు పోవటం ఎలా అంటే భాషను మార్చుకోవాలి. బ్రాహ్మణీయ ఆధిక్యతా స్వభావాన్ని గుర్తించి వదులుకోవాలి. మనకున్న జ్ఞాన తత్వమంతా పుక్కిటి పురాణాల భావవాదమే. భావవాదం తీవ్ర స్థితిలో ఇలాంటి వైరుధ్యాలను పెంచి పోషించి -సుదీర్ఘకాలం మనుగడ సాగించటానికి భారతదేశ భూస్వామ్యం వాడుకున్నది. ఆ తరువాత వచ్చిన ముస్లిములు, మొగలులు, ఇంగ్లీషువారు, ఇప్పటి సామ్రాజ్య వాదులు ఇలాంటి వైరుధ్యాలను వాడుకొని ప్రజలు నిర్మాణం కాకుండా చూసారు. అందుకే దళితులు, ఆదివాసీలు, మహిళల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దళితులు, బహుజనులు, మహిళలు ఈ మాయలో పడకుండా - తమలోపలి వైరుధ్యాలను పరిష్కరించుకొని నిర్మాణం కావాలి. తమవైన ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించి, కలిసివచ్చే ప్రజాస్వామిక శక్తులను కూడగట్టుకోవాలి.
నిజానికి భారతదేశంలో విప్లవోద్యమమంటే -దళిత బహుజన మహిళా ఆదివాసీ మత మైనారిటీల ఐక్యతతో - నాయకత్వంతో -కార్మికవర్గ దృక్పథం తో నిర్మించుకోవాలి. యాభైఏళ్ల విప్లవోద్యమపోరాటం వాళ్ళ కోసం - వారిదే. భవిష్యత్తు వాళ్లదే. వాళ్ళు విప్లవోద్యమం వేరు కాదు.
ఇన్ని రకాల సంఘాలు రావటం ఆరోగ్యకరమే.చలన చైతన్యాలతో తొణికిసలాడుతున్న సమూహాలకు శ్రామికవర్గ పార్టీ దగ్గర కావాలి. శ్రమ నుండి ఉత్పన్నమైన జ్ఞానాన్ని, దళితుల ఆదివాసీల,బహుజనుల, మహిళల గతితార్కిక చరిత్రను పునర్నిర్మించాలి. రాజకీయాలనుండి రూపొందిన జ్ఞానాన్నివినిమయం చేసుకోవాలి.
స్త్రీలది, దళితులది,ఆదివాసీలది భాష సుకుమారం. మనుషులపట్ల గౌరవం దానిలో వ్యక్తమవుతుంది. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయటంలో వాళ్ళే నిజమైన చోదకశక్తులు.
సమకాలీన తెలుగు సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
తొలి నుండి కన్నడ,మలయాళ,మరాఠీ సాహిత్యాల వలే జీవితాన్ని పట్టుకున్న సాహిత్యం కాదు తెలుగుసాహిత్యం. బెంగాల్ ,తెలుగు సాహిత్యాలలో కొంత కాల్పనికత, హేతువిరుద్ధత ,రొమాంటిసిజం, అతివాదం ఉన్నాయి. విప్లవోద్యమ కాలంలో ప్రజల నుండి రచయితలు వచ్చారు. కానీ ఎక్కువమంది రాలేదు. కవిత్వంలో ప్రజావ్యతిరేక ధోరణులు ఉన్నాయి కానీ ఒక్క కథ కూడా ప్రజావ్యతిరేకమైనది లేదు. ఇప్పటి కథకులు సెన్సిటివ్ గానూ ఉన్నారు, తీవ్ర స్వరంతోను ఉన్నారు. సామ్రాజ్యవాద కంపు కొట్టే సరుకుల సంస్కృతిపై విస్తృతంగా రాస్తున్నారు. విభిన్న వర్గాలను గుర్తెరిగి చీలివున్న ప్రజలను దగ్గరకు తీసుకొని నిర్మాణం చేయగల సాహిత్యం రావాలి.
మరొక ప్రశ్న .. సాహిత్యానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండాలంటారు?
సాహిత్యం ,రాజకీయం, జీవితం ఈ మూడూ వేరువేరు కాదు. వీటికి సంబంధించిన పనిలోఆచరణ అనుభవమే సాహిత్యం. నా కాలంలో, నా స్థలంలో,సకల అనర్ధాలకు మూలమైన స్వంతఆస్తిని రద్దుచేసి నూతన ప్రజాస్వామిక ఉత్పత్తివిధానం నెలకొల్పటం, - తద్వారా సోషలిజం సాధించటానికి మార్గంవేయడంకోసం దీర్ఘకాలికంగా ప్రజలు పోరాడుతున్నారు. అనేక అనుభవాలు గడించారు. కొన్ని అనుభవాలను నా శక్తి మేరకు చిత్రించాను. నా సాహిత్యం కన్నా పురోగమించాల్సిన ప్రజాపోరాటాలను తెలుసుకోవడం, నా వంతుగా నిలబడటం, నా శక్తి మేరకు కృషిచేయడం నా జీవితం. నేను అలంటి ప్రజలను నా సాహిత్యం కన్నా ఎక్కువగా ఇష్టపడతాను. ప్రేమిస్తాను.
చివరి ప్రశ్న .. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కనీస ప్రజాస్వామిక వాతావరణం కూడా లేకుండాపోయింది. సభలు, సమావేశాలు పెట్టుకునే పరిస్థితే లేదుకదా … దీనిమీద మీరేమంటారు ?
మంచి ప్రశ్న. ప్రత్యేక తెలంగాణ ఏర్పడటమే ఆట,పాట, మాట బందైన నిర్బంధ వాతావరణంలో ప్రజలు ఒక వెసులుబాటు కోసం పెద్దఎత్తున ఉద్యమంలోకి కదలటంతోనే సాధ్యమైంది. అంతకు ముందటి విప్లవోద్యమాల తరహా సభలు,సమావేశాలకన్న భిన్నంగా - ఎక్కడికక్కడ వేలాది లక్షలాదిమంది కదిలారు. ఇతర కారణాలతో పాటు- ప్రజాస్వామిక వాతావరణం కోసం కూడా జరిగిన ఉద్యమది.
తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు అతివాదానికో, మితవాదానికో లోనై అంచనా వేయటం సరికాదు. స్థలకాలాలల్లో మోహరించిన వైరుధ్యాలను ఎవరు శాస్త్రీయంగా వాస్తవంగా అర్ధం చేసుకుంటారో వారు ప్రజలతో ఉంటారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాలకన్నా ముందున్నారు. మునుపటి ప్రజాసంఘాలు పాత ఆచరణలోనే ఉన్నాయి.
అయినా ప్రభుత్వాలు విప్లవోద్యమాలను ఆమోదించవు. స్థల కాలాలలో దారులు వెతకటమే … ఇంకోపక్క అనేక సభలు,సమావేశాలు దైనందిన విషయాలమీద జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమాలు రాజకీయంగా అంటే తక్షణ,దీర్ఘకాలిక లక్ష్యాలను కనిష్ట స్థాయినుండి గరిష్ట స్థాయికి అర్ధం చేసుకుంటీ … ఇలాంటిస్థితిని దాటుకుంటాయి.
--------------------------------------------------
ఊరు యిడిసి అప్పుడే ఆరు సంవత్సరాలయితంది. వూరు యాదికస్తే కడుపులో దేవినట్టయితది. ఎందుకో! ఈ మధ్య కాలంలో వూరుకు పోవాలనిపించింది. పోదామని బయలుదేరాను. మనసులో ఎక్కడో చెప్పలేని ఆనందం యింకో పక్క బాధ. ఎందుకంటే! వూల్లో ఏమున్నది వూరు మొత్తం వల్లకాడులెక్కయింది....ఆ... డ్యాం అని పడి మా అందరి బతుకులను ఆగంజేసింది. ప్రజలంతా దిక్కులేని పక్షుల్లాగా అయిపోయారు. చిన్నకారు, సన్నకారు రైతులతో సహా అందరూ కూలీలయ్యారు. పదిమందికి అన్నంపెట్టిన రైతుల చేతులు యిప్పుడు కూలి అడ్డలకాడ కూలికోసం ఎదురుచుస్తున్నాయి. దీనికి తోడు వూల్లకు బ్రాండిషాపులచ్చాయి. రైతులకు మా భూములన్ని పోయి మేమిప్పుడు కూలి పనిచేయవలసి రాబట్టే అనే బాధపడేవారు. మనుషులల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మనుషులు యింతకు ముందు వారిలాగే వుంటలేరు. ఒకరి కష్టాలల్లో యింకొకరు పాలు పంచుకోవడం లేదు. తమ మనసులోని బాధను యింకొకరికి చెప్పుకుందామంటే కూడా ఎవరు వినరు. అది ఏమిటో వారికే తెలియదు. చెప్పేవారు కూడా ఎవరులేరు. దీనికి తోడు ఆర్థిక పరమైన బాధలు. ఈ బాధలు మరిసిపోవడానికి అప్పుడప్పుడు కల్లుతాగేవారు. ఈ అప్పుడప్పుడు తాగే అలవాటు క్రమంగా రోజూ తాగేటట్టు చేసింది. సర్కారు వూరును లేపిన తరువాత గుట్టకొగలు, చెట్టుకొగలు అయినారు. పనుల కోసం ప్రజలందరు చుట్టపక్కలవుండే పట్టణాలకు పనులకు పోయి మల్లా రాత్రికి యింటికి వచ్చేవారు. మరి కొంత మందైతే పూర్తిగా పల్లెను వదిలి పట్టణాలకు వలస వెల్లారు.
యింకా వూరు జ్ఞాపకాలు చాలా మట్టుకు నీళ్లల్లో మునిగిపోయాయి. సర్కారు ప్రతిదాన్ని పైసలతోటి ఖరీదు కట్టలేదు కదా! మేము ఆడుకున్న చెట్లు, పుట్టలు, చేండ్లు చెలుకలు, మా తీపి గుర్తులను ప్రాజెక్టు మింగింది. యింకా చాలా మంది సోపతిగాల్లు సచ్చిపోయినారు. అందుకే వూరుకు పోదామంటేనే చాలా బాధగా వుంది. అయినా పరువాలేదు, పోదామని నిర్ణయించుకున్నాను. ఎండకాలం కాబట్టి ప్రాజెక్టులో నీళ్లు తగ్గుతాయి. పాత వూరు నీల్లల్ల నుంచి లేచి కనబడుతుంది. కాబట్టి అంతా తిరిగి చూడవచ్చునని బయలుదేరాను.
పొద్దున బయలు దేరి సాయంత్రం కల్ల వూరుకి చేరుకున్నాను. వూరు సొర్రుదలకు అక్కడ ఎత్తైన స్థూపం వుంటుంది. ఆ స్థూపాన్ని చూసిన నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి. మనస్సులో ఎక్కడో గడ్డకట్టుకపోయినట్టు అయింది. కడుపంతా సెరువైంది. ఆ స్తూపాన్ని చూస్తే ఎన్నో జ్ఞాపకాలు, వూరు దొరలను, పెత్తందార్లను, భూస్వాములను వుచ్చపోయించిన నాగన్న గుర్తుకు వచ్చాడు. ఎంతమంచివాడో నాగన్న, బక్కపల్చన మనిషి, కోలమొఖం గుబురు గడ్డం, అతను నవ్వుతే స్వచ్చమైన గలగల పారే వాగులాగుండేది. ప్రతి సమస్యను చిరునవ్వునవ్వి చాలా సులువుగా పరిష్కరించేవాడు. అతని గొంతు ఎంత తియ్యగుండేదో! మంచి పాటగాడు అతను పాట పాడితే గలగల పారే సెలఏరులాగుండేది. అన్యాయాన్ని ఎదిరించిండు, పేదలందరిని కూడగట్టి ఎన్నో పోరాటాలు చేశాడు. వూరి దొరల మెడలువంచి అన్యాయాన్ని ఎదిరించిండు. దొరల జులుం మెల్లె మెల్లెగా తగ్గింది. దొరలు ఊళ్లోని ఆడోల్ల జోలికి రావడంలేదు. కూలిరేట్లు పెరిగినయి. మాల, మాదిగల పిల్లలు, పేద ప్రజల పిల్లలు బడికి పోతున్నారు. అందరు తెలివికి వస్తున్నారు. దొరలు, షావుకార్లు, పటేండ్లు, కూలీలను పేరు పెట్టి పిలుస్తున్నారు. యింతకు ముందులెక్క ఆసి, తోసి, అంటలేరు. వూల్లో చాలా మార్పులు వచ్చాయి. అంతకు ముందు వూరిలో పేదవాల్లు టి.వి చూడటానికి షావుకార్ల యిండ్లకు పోయేవారు. వారు వీల్లను రానిచ్చేవారు కాదు. షావుకార్ల యిండ్లన్ని తిరుగంగా, తిరుగంగా ఎవరో ఒకరు రానిచ్చేవారు. అయితే అది ఆంక్షలతో కూడింది. టి.వి చూసి యింటికి వచ్చే ముందు వాళ్లు టి.వి పెట్టిన ఆరుగు కడిగి రావాలి. యిట్లా చాలా యిబ్బందులు పడేవారు. అయితే వూల్లెకు సంఘాలు వచ్చిన తరువాత సంఘం సహాయంతో వూల్లే ఒక్క షెడ్డు నిర్మించి అందులో టి.వి. పెట్టించారు. వార్త పత్రిక కూడా ఏపిస్తున్నారు. వూరిలోని ప్రజలు పని పాటలు అయినా తరువాత టి.వి. చూసేవారు. చదువుకున్నవారు వార్త పత్రిక చదివే వారు. యిట్లా వూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నింటికి కారణం నాగన్న. కనుక నాగన్నంటే దొరలకు మంట.
వూరిలోని సంఘాలు బలపడుతున్నాయి. రైతులు, కూలీలు ఐక్యంగా వుంటున్నారు. ఒకరికొకరు పనులల్లో పాటలల్లో సాయం చేసుకుంటున్నారు. యిట్లా అందరి రెక్కల్లో బొక్కల్లో వున్నాడు నాగన్న.
అయితే నాగన్న మీద దొరలకు చాలా కోపమున్నది. ఎందుకంటే వాళ్లకు ఎవరు బయపడతలేరు. వాల్ల మాటలు ఎవరు వినడంలేదు. ఎవలు కూడా దొరలకు వంగి వంగి దండాలు పెడతలేరు. యిట్లా దొరలకు కొరకరాని కొయ్యలాగా మారిన నాగన్న మీద కసిపెంచుకున్నారు. ఎలాగైనా నాగన్నను సంపించాలని దొరలు పన్నాగాలు పన్నారు. అయితే ప్రజాబలం మెండుగావున్న నాగన్నను పట్టుకోవాలంటే అంతా సులువు కాదన్న సంగతి దొరలకు, పోలీసులకు తొందరగానే అర్థం అయ్యింది. ప్రజలు కూడా నాగన్నను తమ కడుపులో పెట్టుకొని చూసుకొనేవారు. తమ కంటి పాపాల్లాగా కాపాడుకొనేవారు.
దొరలు నాగన్నను సంపించడం కోసం చాలా ఎత్తులు వేసేవారు. వూరిలో ఏం పనిలేక తాగుతూ తిరిగే ఒక్క యువకున్ని దొరలు తమసెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఆ యువకునికి దొరలు తాగబోయించేవారు. అట్లా మారిపోయిన అతడు ప్రజల మధ్యనే తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా దొరలకు ప్రజలకు సంబంధించిన, నాగన్నకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పేవాడు. వాడు చెప్పిన విషయాలన్ని దొరలు పోలీసులకు చెప్పేవారు.
ఒక్క రోజు పొద్దుగాల ఏడుగంటల సమయంలో నాగన్న బస్టాండు ప్రాంతంలో వున్నాడు. మారువేషంలో వచ్చిన పోలీసోల్లు నాగన్నను పట్టుకున్నారు. మూడురోజులు చిత్రహింసలు పెట్టి కాల్లు, రెక్కలు విరిసి వూరు గోదావరి ఒడ్డుకు కాల్చిచంపారు.
ఆ పాత విషయాలు గుర్తువచ్చి నా మనస్సంతా చెల్లా చెదురయిపోయింది. దొరలు పోలీసులు చంపిన నాగన్న అమరుడైనాడు. అతని గుర్తుగా యిక్కడ స్తూపం వెలిసింది. అప్పుడు దొరలను వుచ్చపోయించిన నాగన్న స్తూపం, యిప్పుడు ఆ వూరి ప్రజలకు ఏం సందేశం యిస్తుందో? ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో చూడాలి. మనస్సంత కోల్లుదవ్విన పెంటలెక్క అయింది. గుండె బరువుతో ముందుకే నడుస్తున్నాను. వూరును ఏదో రాక్షసి మింగినట్టుగున్నది. వూరంతా వల్లకాడయింది.
కొద్దిగా ముందుకు పోతే దొస్తువాళ్ల యిల్లు. వూరినుంచి అందరు వెల్లిపోయి సర్కారుసూపించిన భూమలల్ల యిండ్లు కట్టుకున్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం సర్కారు యిచ్చే పైసలు పెండింగ్లోపడి యిక్కడనే వుంటున్నారు. వాళ్లకు పైసలు వస్తయో రావో కూడా తెలియదు. వీళ్ల గురించి పట్టించుకునే నాదుడేలేడు. యింకో కొంతమందికి పైసలు తక్కువ వచ్చి, ఆ పైసలు ఎటుసాలక, యిండ్లు కట్టుకోలేక, వున్న అప్పులు కట్టుకొని యిక్కడే వుంటున్నారు. అందులో ఒక్కటి మా దొస్తువాళ్ల యిల్లు. మనసులో ఎక్కడో కలుక్కుమన్నది. యిక్కడ ఎట్లవుంటున్నారు వీళ్లు. మనుషులు లేకపోవడం వల్ల వూరినిండ తుమ్మలు, పిచ్చిచెట్లు పెరిగాయి. వూరంతా అడవీ తీరవున్నది.
కొద్దిగా ముందుకు పోయాను. నాలుగేండ్ల కింద మిషన్భగీరత పనులకోసం తవ్విన పొక్కలో పడి మెడలు యిరిగి మంచానికే పరిమితమైన దోస్త్ వాళ్ల ‘అయ్య’ పోశాలు మంచంలో శవం లెక్క పడివున్నాడు. దూరం నుంచే చూశాను. అతని దగ్గరికి పోయేంత గుండే ధైర్యం నాకులేదు. దు:ఖం ఆగడంలేదు. కడుపులో ఎక్కన్నో మంట కోపం, ఏమిచేయని నిస్సాహాయకస్థితి. మధాహ్నం కావడం చేత యింటికాడ ఎవలు లేరు. అందరు కూలి పనులకు పోయినట్టున్నారు. అతకు ముందు పోశాలును అతని రూపాన్ని, తలుచుకుంటే ఎంతో బాధనిపిస్తుంది. పోశాలు ఎత్తైన బలమైన మనిషి. యిప్పుడు నాలుగు ఏండ్లనుంచి మంచానికే పరిమితం కావడం వల్ల బొక్కలు తేలి పీనుగు తీర తయారయ్యిండు. అతను వూళ్లో అందరితోని కలుపుకోలుగా వుండేవాడు. మంచి మాటకారి, పంచాయితులు కూడా చేసేవాడు. అతను మంచిగా వున్నప్పుడు వాళ్ల యింటి కాడ ఎప్పుడు మందితోని సందడిగా వుండేది. పంచాయితీలకోసం, పడావులకోసం ఎప్పుడు యింటికాడ ఎవరో ఒకరు వుండేవారు. యింకా వూరికి ఎలక్షన్లు వచ్చినయంటే పోశాలు తీరిక లేకుండా వుండేవాడు. ఎలక్షన్లో నిలవడే వ్యక్తులు పోశాలును చాలా రకాలుగా వాడుకునేవారు. అలాంటిది యిప్పుడు వాళ్ల యింటి మొఖాన వచ్చిన నాదుడే లేడు. యిది వాళ్లస్థితి.
వాళ్లస్థితి గురించి ఆలోచిస్తూ ముందుకు నడిచాను. వాళ్లియింటికాన్నుంచి వందగజాలు నడుస్తే మూడుతొవ్వలు కలిసే చోటువస్తుంది. ఈ మూడు బజార్లకాడ కూసుండుడంటే నాకు ఎంతో యిష్టం. యిక్కడ కూసుండి మాట్లాడుతూ ఎన్నిరాత్రులు గడిపినామో సోపతిగాల్లందరం కలిసి యిక్కడ ఎన్నో ఆటలు ఆడుకునేది. బొంబాయికి బతుకు దెరువుకోసం పోయిన మా సోపతిగాండ్లు వూరికి వస్తే పండగ సందడిగా వుండేది. ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమవుండేది. వాళ్లు మళ్లా తిరిగి బొంబాయికి పోయేటప్పుడు అందరం ఏడుస్తూ సాగనంపేవాళ్లం.
అట్లా ఎన్నో అనుభవాలతో నడుస్తున్న నాకు రామన్న కూలిపోయిన యిల్లు కనపడ్డది. ఆ యింటికాడ చాలా సేపు కూసున్నాను. ఆ యిల్లు ఎట్లా అయితే కూలిపోయిందో రామన్న కూడా ఆట్లా కూల్చివేయబడ్డాడు. అతను ఎంత మంచి మనసు కలవాడు.
మృదుస్వభావం కలవాడు. ప్రజలకోసం దొరలను ఎదురించినవాడు. ఎన్నో పోరాటాలు తను చేస్తూ నిర్మించినవాడు. ఎందుకోగని తరువాత రామన్న పోరాటాలకు దూరంగా వుంటూవచ్చాడు. యిప్పుడు అతను ఏ పోరాటాలు చేయడంలేదు. అయినా సరే పోలీసుల వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు వేధించేవారు. వూరిలోకి కొత్తవాళ్లు ఎవరు వచ్చిన రామన్నను పోలీస్స్టేషన్కు పిలిపించి వేధించేవారు. వూరిలో చాలా మంది మాజీలు వున్నారు. కాని ఎవరిని పోలీసులు వేధించేవారుకాదు. దీనికి కారణం ఏందంటే రామన్న మిగితా మాజీలల్లాగా పోలీసులకు అనుకూలంగా వుండకపోవడం, మాజీలు కొంత మంది రాజకీయ నాయకుల అవతారం ఎత్తారు, కొంత మంది రియల్స్టేట్ చేస్తున్నారు. మరి కొంత మంది పంచాయితీలు, పైరవీలు చేస్తూ చాలా సంపాదించారు. లగ్జరి జీవితం అనుభవిస్తున్నారు. వీళ్లంతా పోరాటంలో వున్నప్పుడు ఏపనులయితే చెయ్యవద్దనీ చెప్పారో యిప్పుడు అవే పనులు చేస్తున్నారు. ఈ పనులు చేయని రామన్నంటే మిగితా మాజీలకు యిష్టం వుండేది కాదు.
సమాజం ఎప్పుడు మారుతూ వుంటుందికదా! మారుతున్న కాలంతో పాటే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్కెట్టు సమాజం అందరిని మాయచేస్తుంది. ఎన్నో కనపడని కుట్రలను చేస్తుంది. అందరికి చేతినిండ పని వున్నట్టే వుంటుంది, కానీ ఫలితం మాత్రం శూన్యంగా వుంటుంది. ఈ మార్కెట్టు సమాజం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుంది. ఎవరిని కలిసిమెలిసి బతకనివ్వదు, అందరిమధ్య విభేదాలు సృష్టించి విడకొడుతుంది. మనుషులను పిచ్చివాళ్లను చేస్తుంది. ఈ మార్కెట్టు కాలంలో ఒకరుకూడా సుఖంగా వుండరు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది. భార్య భర్తలను సుఖంగా వుండనియ్యదు. తల్లులకు పిల్లలను పిల్లలకు తల్లులను కాకుండా చేస్తుంది. సమాజంలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ పనిని పైసలతో వెల కట్టే రోజులు వచ్చాయి. యిలాంటి సమాజంతో రామన్న లాంటి వ్యక్తులు బతికే పరిస్థితి లేదు. ఈ విషపు సమాజాన్ని చూడలేక రామన్న ఒకనాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
రామన్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తె మెదడు కోల్లు తవ్విన పెంట తీర్గ అయితది. బరువెక్కిన హృదయంతో నడుస్తున్నాను. ఈ లోకంలో ప్రతీది ఒక్క అనుభవమే కదా! ప్రతీ అనుభవం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ సమాజమే ఒక పెద్ద పాఠశాల. ఎంత నేర్చుకుంటే అంతా నేర్పిస్తుంది. ఈ తలకిందుల సమాజాన్ని సీదచెయ్యటంకోసం ఎంత మంది తల్లులు తమ కడుపుకోతను అనుభవించారు. వాళ్ల మరణాల రక్తపు గుర్తులు మనకు ఏమ్ చెప్పుతున్నాయి. ఏ సందేశాన్నిస్తున్నాయి. ఈ ఉల్టా పల్టా సమాజాన్ని సక్కదిద్దడానికి మనం ఏం చేస్తున్నామా? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద వున్నది.
యిలాంటి ఆలోచనలు మెదుడులో మెదులుతుంటే! తేరుకొనీ ముందుకేసి చూశాను. చెంత చెట్టు కనపడుతుంది. అదే దాసరోల్ల చింత చెట్టు. ఆ చెట్టు కింద మేమందరం ఎన్నొ ఆటలు ఆడుకొనేది. చిర్రగోనే ఆట, గోలీలాట, కోతికొమ్మాట, అంగుడుదునుకుడు లాంటి ఆటలు ఆడేది. ఆ చింత చెట్టు పంచాయితీలకు అడ్డ. అక్కడ ఎన్నో పంచాయితులు జరిగేవి. చెట్టు కింద చీకట్ల ఏమో మీటింగులు జరిగేవి. చీకటయితే చెట్టుకింద ఎవరెవరో కొత్తవాల్లు కనపడేవారు. ఈ కొత్తవాల్లతో మా వూరి యువకులు కలిసేవారు. ఏమెమో విషయాలు రాత్రంతా మాట్లాడుకొనేవారు. వీళ్ల రాకతో వూళ్లో దండగలు, కల్లు తాగడాలు బందు అయినాయి. యింతకు ముందటి పంచాయితీలల్లో లెక్క తిమ్మిని బొమ్మ, బొమ్మను తిమ్మిచేయడం లేదు. నిజంవైపు ఎక్కువ మంది నిలబడుతున్నారు. యిట్లా వూళ్లో చాలా మార్పులు జరిగాయి.
ఈ ప్రాజెక్టు ఆ గుర్తుల మీద బురద జల్లింది. ఆ చింత చెట్టు కూడా నీటిలో మునిగిపోయింది.
అక్కడి నుంచి ఎడం చేయి పక్క మీదుగా పోతే పీరీల గుండం (మొహంర్రం) వస్తుంది. పీరీల పండుగ వచ్చిందంటే వూరిలో అదొక పెద్ద సందడి. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాటలు పాడుతూ గుండం చుట్టు ఎగిరేవారు. వూరి జనమంతా అక్కన్నే వుండేవారు. ఈ పీరీలగుండాన్ని కూడా మాయదారి ప్రాజెక్టు మింగేసింది.
పీరీలగుండం కాన్నుంచి కొద్దిగా ముందుకుపోతే రాంబాయిగడ్డ. రాంబాయి గడ్డను ఆనుకొని ఎత్తైన మట్టిగోడ, దాని మీద పాత కుమ్మరి గూనలు కప్పివున్నాయి. ఈ గోడ దాదాపుగా చుట్టు పది ఎకరాలతో వున్నది. యిదే మా వూరి దొరగడి. గడిలోనికి పోవటానికి ఎత్తైన పెద్ద దరువాజ వుంది. ఆ దరువాజ ముందు, ఆపక్క, ఈపక్క, కూసూండటానికి బండతో గద్దే కట్టించివున్నది. గోడల మీద అక్కిరి, బిక్కిరి జాజురాతలున్నాయి. ఆ జాజు రాతల మీద సున్నం వేసి వున్నది. సున్నం చాటుకు వుండలేని ఆ రాతలు ఎరర్రగా కనిపిస్తూ వేలాది ప్రశ్నలు, నాకో, మరి ఈ సమాజానికో సందిస్తున్నట్లుగా వున్నాయి.
యిప్పుడు గడిలో మొత్తం తుమ్మలు మొలిశాయి. అండ్లకు పోవటానికి వీలు లేకుండా వున్నాయి చెట్లు, చేమలు. ఈ గడిలో ఎంత మంది తల్లుల మాన, పాణాలు, మన్నులో కలిసిపోయాయో, ఎంత మంది యువకులు పాలేర్లుగా తమ నెత్తురును ఈ దొరల పొలాలు దున్నటానికి దారవోశారో! ఎంత మంది ఈ గడీలో తన్నులు, గుద్దులు తిన్నారో, ఎన్ని నరకయాతనలు పడ్డారో. ఎంతో మంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ గడీలు యిప్పుడు మట్టిలో మట్టి అయినాయి. వూళ్లెకు సంఘాలు వచ్చి దొరలు పట్టణాలు వలసపోయారు. వందల ఎకరాల భూములు బీల్లు వడ్డాయి. దొరలు కూడా ఈ భూములు మీద ఆశవదులుకున్నారు. పట్టణాలకు పోయిన దొరలు వ్యాపారాలు చేస్తూ, కాంట్రక్ట్లు చేస్తూ, పెట్టుబడుదారులు అయినారు. పెట్టుబడుదారులు రాజకీయనాయకులయినారు. రాజకీయనాయకులయిన దొరలు ప్రభుత్వాలను ఏర్పటు చేసినారు. తొండ మారి వూసరవెల్లి అయింది. భూస్వాములుగా వున్నప్పుడు దొరల దోపిడి, దౌర్జన్యాలు వూల్లకే పరిమితంగా వుండేది. వాళ్లు యిప్పుడు రాజకీయనాయకులై ఏకంగా దేశాన్నే దోపిడి చేసే స్థితికి ఎదిగిపోయారు. ప్రాజెక్టు కూడా వాల్లకే న్యాయం చేసింది. వుత్తపుణ్యానికి పోతయనుకున్న భూములు కోట్లు తెచ్చిపెట్టాయి. కూలిపోయిన యిండ్లకు కూడా వాళ్ల పలుకుబడితో ఎక్కువ పైసలు తెప్పించుకున్నారు.
వూరిలో సెంటు భూమి లేని పేదలను ఈ ప్రాజెక్టు నిండాముంచింది. ఎకురమో, ఆర ఎకురమో వున్న వాళ్లకు ఆ డబ్బులు ఎటు సాలక అప్పుల పాలయినారు.
హనుమండ్ల గుడి, గుడివద్ద పెద్ద వేపచెట్టు, సుట్టు బండతో కట్టిన గద్దె, ఆ గద్దే మీద సాయంత్రం పూట షావుకార్లు, పటేండ్లు, దొరలు కూసుండేవారు. ఆ గద్దే కాడికి గాని, గుడి వద్దకుగాని మాల, మాదిగలకు రావడానికి అర్హతలేదు. ఆ గుడికి పోవడానికి మాల, మాదిగలు ఎన్ని పోరాటాలు చేశారో తలుసుకుంటేనే గుండెబరువెక్కుతుంది. ప్రతి దసరాకు ఏదోరకంగా మాల, మాదిగలతో వూరిలోని మిగితా కులాలు లొల్లికి దిగేటివి. లొల్లీలన్ని దొరలు వెనుక వుండి నడిపించేవారు. కులాలమధ్య అంతరాలు సృష్టించి ప్రజలు ఏకం కాకుండా చేసేవారు. గొడవల గురించే ఆలోచిస్తారు. దొరల దోపిడి గురించి ఎవరికి ఆలోచన రాదు. ఈ రకంగా దొరలు తమ పబ్బం గడుపుకునే వారు. తరువాత వూరికి వచ్చిన సంఘాలవల్ల సబ్బండ కులాలు ఒక్కటయ్యాయి. దొరలు వెలివేయబడ్డారు. దొరలను వూరి ప్రజలు తరిమి, తరిమి పొలిమేరలు దాటించారు. మాల, మాదిగలకు గుడికి పోయే రోజులు వచ్చాయి. అయితే అప్పుడూ ఈ ప్రాజెక్టును గాని, ప్రాజెక్టును నిర్మించే ప్రభుత్వాన్ని గాని ఎదురించలేక పోతున్నారు....ఎందుకోమరీ....
మా వూరి బడి ఎన్నో సంవత్సరాల చరిత్ర గలిగిన బడి, యిప్పుడు వెలవెలబోయింది. బడిని చూస్తే ఎన్ని మధుర జ్ఞాపకాలో గుర్తుకు వస్తాయి. మమ్ములను మనుషులుగా తీర్చిదిద్దిన బడికి కూడా తప్పలేదు ప్రాజెక్టులో మునుగుడు. దాదాపు నలబై, యాబై సంవత్సరాలుగా ఏడవ తరగతికే పరిమితమైన బడిలో యిప్పుడు పదవ తరగతి వరకు వున్నది. దొరల కాలంలో బల్లకు ఎక్కువ ప్రాధాన్యత యిచ్చే వారు కాదు. పేదవాళ్లు ముఖ్యంగా మాల, మాదిగలు చదువుకుంటే తెలివిమంతులు అయితారని బడిని అభివృద్దికాకుండా చూసెవారు. బడికోసం వచ్చే పంతుల్లను కూడా వాళ్ల చెప్పుచేతుల్లో పెట్టుకొనేవారు. వాళ్ళ యిండ్లల్లోనే వుంచుకొని తమ పిల్లలకు చదువు చెప్పించుకునేవారు. యిది ఆ రోజుల్లో బడి పరిస్థితి.
అలాంటి బడి 10వ.తరగతి వరకు అవడానికి ముఖ్యకారకుడు ‘రెడ్డి’ సారు. ఆయన రాకతోనే వూరి బడి స్థితిగతులు మొత్తం మారిపోయాయి. సారు బడికోసం ఎంత తపన పడేవాడో తలుసుకుంటే చాలా బాధకలుగుతుంది. ఎంతో మందికి కంటు అయి మా బడిని 10వ. తరగతి వరకు తీసుకవచ్చాడు. మా బడితో మొట్టమొదటి సారి తల్లి దండ్రుల కమిటి వేసి నవాడు. ప్రతినెల మీటింగు పెట్టి, వూరిలోని ప్రజలందరికి బడియొక్క స్థితి గురించి చెప్పేవాడు. తల్లి దండ్రులకు పిల్లల చదువు గురించి చెప్పేవాడు. అట్లాగే బడిలోనికి యూనిఫామ్ తీసుకవచ్చిన వాడు కూడా ‘రెడ్డి’ సారే. ఈ విధంగా బడి అభివృద్దిచెందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. 10వ. తరగతి వరకు బడిని అభివృద్ది చేయడం ఒక ఎత్తు అయితే తరగతులు నిర్వహించడం కోసం గదులు నిర్మించడం పెద్ద సమస్య అయ్యింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కోక్క తరగతికి పరిమిషన్ రావడం జరిగింది. మొదటగా 8వ.తరగతికి, ఆ తరువాత 9వ.10వ. తరగతులకు పరిమిషన్ రావడం జరిగింది. యిప్పుడు ఉపాధ్యాయుల సమస్య మొదలయింది. తరగతులు పెరిగినయి కనుక టీచర్లు కావాలి. ప్రభుత్వం టీచర్లను పంపించేటట్టులేదు కనుక విద్యార్థులకు చదువు విషయంలో యిబ్బందికలుగకుండా బడిలో తల్లి దండ్రులమీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేటు టీచర్ల అవసరం గురించి చెప్పాడు. మనకు గవర్నమెంటు టీచర్లను పంపించాలంటే సమయం పడుతుంది. అప్పటిదాక పిల్లలకు చదువు విషయంలో అన్యాయం జరుగుతుంది. కనుక మీరందరు ఒప్పుకుంటే ప్రైవేటు టీచర్లను పెట్టుకుందాం అన్నాడు. మీటింగ్లోని తల్లి దండ్రులు కొంత సేపు ఆలోచన చేసి, చివరకు అందరు ఒప్పుకున్నారు. గవర్నమెంటు టీచర్లు, ముగ్గురు, ప్రైవేటు టీచర్లు ముగ్గురు కలిపి బడిని నడిపించారు. ఒక్కొక్క టీచరు మూడు నుంచి నాలుగు సబ్జెక్టులు చెప్పేవారు. అలా చెప్పడంకోసం సార్లు చాలా కష్టపడేవారు. మొత్తానికి బడిని మాత్రం నడిపించేవారు.
ఇక పోతే గదులు గవర్నమెంటు బడి బిల్డింగ్ నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. కనుక మనం తాత్కలికమైన షెడ్లు నిర్మించుకోవాలని అందరం నిర్ణయించుకున్నాము. తక్కువఖర్చుతో షెడ్లు కావాలంటే కర్రతో కూడా షెడ్లు నిర్మించాలి. అలా నిర్మించాలంటే అడవికిపోవాలి. కనుక వూరిలోని పెద్దమనుషులతో ప్రజలతో మాట్లాడి ఎడ్లబండ్లు కట్టుకొని టీచర్లు, రెడ్డిసారు, మోహన్సారు, సురేష్సారు పిల్లలం, మా తల్లిదండ్రులు, వూరిలోని బడిమీద ప్రేమ వున్న కొంతమంది యువకులు, యిట్లా అందరం కలిసి అడివికి పోయి, వాసాలు, కంకలు, పొరక మొదలైన వాటిని కొట్టుకొని వచ్చాము. మీది కప్పుకోసం వూరిలో చందాలు జమచేసి డాంబరు వట్టలు తెచ్చి కప్పాము. ఈ విధంగా 8వ,9వ,10వ తరగతులకు సంబంధించిన షెడ్లు ఏర్పడినాయి.
10వ తరగతి మొదటి బ్యాచ్ మాది. 10వ తరగతికి పరిమిషన్ తేవడం కోసం సారు చాలా కష్టపడ్డాడు. అయినా పదవ తరగతికి పరిమిషన్ రాలేదు. మేము పదవ తరగతి ప్రైవేటుగా వేరే స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్షలు రాశాము. మా పదవతరగతి అయినపోయిన తరువాత బడికి 10వ తరగతి పర్మిషన్ రావడం జరిగింది. అట్లా మా పదవ తరగతి పూర్తి అయ్యింది.
ఎన్నో అనుభవాలు నేర్పిన బడిని దాటి ముందుకు పోతే గుండోల్ల మూల, దీన్ని అనుకొని గ్రామపంచాయితి ఆఫీసుంటుంది. వెనుకట ఎందరో దొరలు పాలించినటువంటి ఈ గ్రామపంచాయితి తరువాత వూరితో వచ్చిన మార్పులతో ఆ అధికారం కిందిస్థాయి వాళ్లకు కూడా రావడం జరిగింది. ఎవరు అధికారంలో వున్న ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమిలేదు. ఎన్నికలలో గెలిచే అధికారం చేజిక్కించుకున్నవారు దొరల మాదిరి రాజకీయాలనీ చేయడం జరిగింది. వూరిలో కొత్తరకమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చులు పెట్టేవారు. లంపెన్ రాజకీయాలు నడిపేవారు. యువకులను రెండు వర్గాలు చేసి లొల్లీలు పెట్టించేవారు. పోలీసుకేసులు పెట్టించేవారు. వూరిలోని పేద ప్రజలు ముఖ్యంగా మాల, మాదిగలు రెండు పక్షాలుగా విడిపోయారు. ఒకటి పాలక పక్షం, రెండోది ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షానికి నాయకత్వం వహించేవ్యక్తి పాలక పక్షంలోని వ్యక్తి మీద వాళ్ల మనుషుల మీద ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ వాళ్లమీద ప్రజలకు పూర్తి వ్యతిరేకం వచ్చేటట్టుగా చేసేవాడు. సర్పంచ్ విల్ల మీద కేసులు బనాయిస్తు పోలీసుల ద్వారా వేధింపులు చేపించేవాడు. సర్పంచి చేసిన కొన్ని స్కాంలు ఋజువు కావడం జరిగింది. మెల్లెమెల్లగా సర్పంచి మీద ప్రజలకు వ్యతిరేకత ఏర్పడ్డది. దీనిని ఆసరచేసుకొని ప్రతిపక్షంలోని వ్యక్తి సర్పంచిని ప్రజల మధ్య నిలవకుంట చేసినాడు. యిట్లా కొట్లాటలు జరుగుతుండగానే ఎలక్షన్లు రావడం, మల్లా ఈ యిద్దరు వ్యక్తులే పోటిలో వుండటం జరిగింది. సర్పంచి మీద వున్న వ్యతిరేకత అతను ఓడిపోవడం జరిగింది. ప్రతిపక్షంలోని నాయకుడు పాలకపక్షం లోకి రావడం జరిగింది. అధికారమార్పిడి జరిగింది.
కొన్ని రోజులకు వూరికి యిసుక టెండర్ రావడం జరిగింది. వూరిని అనుకొని గోదావరి వుండటం అండ్ల విపరీతమైన యిసుక వుండటంతో యిసుక కాంట్ట్రర్లకు యిక్కడి యిసుక మీద కన్ను పడ్డది. ఎలాగైనా యిసుకను యిక్కడి నుంచి తీసుకపోవాలి. అనుకున్నారు. అయితే కొంత మంది యువకులు యిసుక తీయడాన్ని వ్యతిరేకించారు. యిసుక తీస్తే భూగర్భ జలాలు యినికిపోతాయని యువకులు వాదించేవారు. ఫలితంగా తాగునీరు, సాగునీరుకు చాలా ఇబ్బందులు వస్తాయని కొందరు యువకులు ప్రజలకుచెప్పేవారు. యిసుక టెండరు కోసం వచ్చిన కాంట్రక్టరుతో యువకులు కొందరు గొడవపడ్డారు. యిట్లా గొడవలు జరుగుతుండగానే కాంట్రక్టర్, ఎవరితోనైతే పనిసులబంగా అయితదో వాన్నే పట్టుకున్నాడు. ఆ వ్యక్తీ మా వూరి కొత్త సర్పంచి యిట్లా మా వూరి సర్పంచి కాంట్రక్టర్ యిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి మా వూరిని, మన్ను పాలు చేశాడు. వూరిలోని ప్రజలు, యువకులు, ఎంత ఆశతోటి గెలిపించుకున్నారో, అంతా నిరాశే మిగిలింది.
ప్రజల మర్మం తెలిసిన సర్పంచి వాళ్లను ఎట్లా మాయల పడగొట్టాలో అట్లా పడగొట్టాడు. యిక్కడ వున్నటువంటి పెద్ద సమస్య ఏందంటే! మా వూరి యువకులు బొంబాయిలాంటి ప్రదేశాలకు పనికోసం వలస వెల్లేవారు. అటువంటి పాయింట్ను పట్టుకున్న సర్పంచి యువకులను మచ్చిక చేసుకొన్నాడు. ఒక రోజు గ్రామ పంచాయితికాడ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీటింగుకు వచ్చిన ప్రజలనుద్దేశించి! చూడుండ్లి....మనకు యిసుక టెండరు పడుతే మన బతుకులు బాగుపడుతయి, మీ రందరు బొంబాయికి వలస పోవడం బందు అయితది. అట్లాగే మన గ్రామ పంచాయితికి నిధులు కూడా వస్తాయి. ఆ నిధుల ద్వారా మన గ్రామ పంచాయితిని అభివృద్ది చేసుకోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. అయితే చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. కొంత మందియువకులు వ్యతిరేకించారు. కానీ ఫలితం లేకుండా అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల వూల్లల్ల యిసుక టెండర్లు నడుస్తున్నాయి. పనికిపోయిన కూలీలకు రోజువారి కూలికంటే ఎక్కువగానే పైసలు రావడంతో మా వూరి ప్రజలకు కూడా టెండర్ అయితేనే బాగుండు అనుకున్నారు. మొత్తానికైతే మా వూరి యిసుకటెండరు పట్టిన కాంట్రక్టరు పనులు ప్రారంభించాడు.
యిసుక పనులు జోరుగా నడుస్తున్నాయి. ప్రజలచేతుల్లో పైసలు గలగల మంటున్నాయి. వూరికి బ్రాండిషాపులు వచ్చాయి. యిసుక పనులకు పోయిన కూలీలు ఎక్కువగా మధ్యానికి అలవాటు పడ్డారు. కూలికి పోతే వచ్చిన డబ్బులను మధ్యం షాపులకు దారబోసేవారు. వూరిలోని యిసుకంతా పట్టణాలకు తరలిపోయింది. కాసులు కాంట్రక్టర్ జేబులు నిండాయి. కమీషన్లు సర్పంచికి దక్కాయి. ప్రజలకు మాత్రము కష్టం తప్పా ఏమి మిగులలేదు. గోదావరిలోని యిసుక తీయడంతో వ్యవసాయ బావులు, తాగునీటి బావులు ఎండిపోయినాయి. ఫలితంగా పంటలు పండకుంట అయినాయి. వూరిలో గోరమైన కరువు తాండవించింది. యిట్లా నడుస్తున్న క్రమంలోనే వూరిని ప్రాజెక్టు కింద లేపుతమని అధికారులు వచ్చారు. ప్రజలకు ఏం అర్థం కాని అయోమయస్థితి ఏర్పడ్డది. ప్రజలంతా పిసపిస అయితండ్లు. యిలాంటి అయోమయ పరిస్థితిలో ప్రజలంతా ఒక్క నిర్ణయానికి వచ్చారు. వూరికి వచ్చే సర్వేర్లను అడ్డుకోవాలి అనుకున్నారు. మన వూరు మునుగుతే మనం బతకలేము. గుట్టకొక్కలం, చెట్టుకొక్కలం అయితం, ఆగన్నపక్షులం అయితం, అనీ అందరు సర్వేర్లను వూరికి రానీయద్దని నిర్ణయించుకున్నారు.
వూరికి వచ్చిన సర్వేర్లను ప్రజలు అడ్డుకున్నారు. ఏం చేయలేక సర్వేర్లు తిరిగివెళ్లిపోయారు. అయితే అధికార్లు సర్పంచితోని మంతనాలు జరిపి వూల్లోకి వచ్చారు. మళ్లా యిప్పుడు కూడా ప్రజలు ప్రతిఘటించారు. అయితే సర్పంచి కలిపించుకొని, ప్రజలారా సూడుండ్లి ప్రాజెక్టు అనేది మనం కట్టేది కాదు. యిది సర్కారు నిర్ణయం కావున మనమందరం దీనికి సహకరించాలి. అందుకు తగ్గట్టుగా మనకు నష్టపరిహరం యిప్పిస్తాను. భూములు పోయిన వాళ్లకు పైసలు యిస్తారు. అని అన్నాడోలేదో ప్రజల నుంచి ఒక్కసారి లొల్లి మొదలయింది. మందిలో నుంచి ఎవరో లేచి మాకు భూములకు పైసలు వద్దు, భూములకు బదులుగా భూములు యిప్పించుండ్లి, అని అన్నాడు. మేము మా తాతల ముత్తాతల నుంచి గీ భూమినే నమ్ముకొని బతుకుతున్నాము. మాకు భూమి లేకుంటే మేము బతకలేము. అని లొల్లి పెట్టారు. అప్పుడు ఒక అధికారి కలిపించుకొని సూడుండ్లి మీరు మాకు యిష్టమున్నా లేకపోయినా భూములు యివ్వాలి. లేకపోతే సర్కారు పోలీసులను పెట్టి జబర్దస్తిగా భూములు గుంజుకుటుంది. ఆ తరువాత మీ యిష్టం అన్నాడు. మా భూములను గుంజుకోవడానికి వాడెవడు. యిది ఎవరి జాగీరుకాదు. ఎట్లా గుంజుకుంటరో మేము చూస్తం అని ప్రజలన్నారు. గుంపులో నుంచి ఒక్క ముసల్ది లేసి సర్పంచి కెల్లి సూసి, ఏమయ్యా! బెల్లంకొట్టిన రాయోలే సూత్తన్నవ్, ఏంది మన బతుకులన్నది? ఆ మాటలకు సర్పంచి ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తండు. అప్పుడు ఒక్క యూవకుడు లేసి యింకా సర్పించి ఏంది గిర్పంచేంది, వాడు ఎప్పుడో అమ్ముడు పోయిండు. అని కుండ బద్దలు గొట్టినట్టున్నడు. ఆ మాటలకు కూడా సర్పంచి ఏం మాట్లాడలేదు. అధికార్లు, సర్పంచి ఏం మాట్లాడలేదు. అధికార్లు, సర్పంచి, ప్రజలు ఎటొల్లటు వెల్లిపోయిండ్లు.
మల్లా తెల్లారి అధికార్లు పోలీసులను తీసుకొని వచ్చారు. ప్రజలు ప్రతిఘటించారు. పోలీసులు లాఠిచార్జి చేశారు. ఒక్క సారిగా కొట్టుకొల్లు, మొత్తుకోల్లు. లాఠీలు పెడీలు, పెడీలుమని ప్రజల మీద తిరిగాయి. ఎవలయితే ఎక్కువగా మాట్లాడిండ్లో వాళ్ల మీద కేసులు అయినయి.
యిట్లా ఒక్క వారం రోజులు గడిచిన తరువాత వూరికి మళ్లా అధికార్లు, పోలీసులను తీసుకొని వచ్చారు. కాకపోతే యిప్పుడు రాయబారిగా ఆర్డివో వచ్చాడు. ఆర్డివో సర్పంచి ద్వారా వూరిలో మీటింగు పెట్టించాడు. జమ అయిన ప్రజతోని ఆర్డివో యిట్లా చూడండి! మీరు పంతానికి పోతే ఏంరాదు. గవర్నమెంటు యిచ్చే కాంపన్జేషన్ తీసుకొని మాకు సహకరించండి. అన్నాడు. మీరు సహకరిస్తే మీమీద పెట్టిన కేసులు ఎత్తివేస్తం, అన్నాడు. అయితే చేసేది ఏమిలేక విసిగిపోయినటువంటి ప్రజలు సరే అన్నట్టుగా తలలూపారు.
సర్వేర్లు సర్వేచేయడం ప్రాంభించారు. సర్వేలల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. వున్న వాళ్లు పైసలు బెట్టి వాళ్ల యిండ్లకు ఎస్టిమేషన్లు ఎక్కువగా వేపించుకున్నారు. మరో కొత్త విషయం ఏందంటే? వూరికి దొరలు రావడం, వారి యొక్క యిండ్లను దగ్గెరవుండి, తమ పలుకు బడితో ఎక్కువ ఎస్టిమేషన్లు తెప్పించుకోవడం జరిగింది. వుత్తపుణ్యానికి పోతయనుకున్న భూములకు కోట్లు రావడం దొరలకు సంతోషకరమైన విషయం. యిట్లా వాళ్ల భూమలకు, యిండ్లకు కోట్లు రావడం జరిగింది.
మామూలు యిండ్లున్న పేద ప్రజలకు చాలా తక్కువగా పైసలు రావడం జరిగింది. అయితే ఏం చేయలేక ప్రజలు నోర్లు మూసుకున్నారు.
ప్రజలల్లో ఒకరకమైన అసహనం ఏర్పడ్డది. అన్నలు జెండలు పాతిన భూములన్నీ దొరలకు పిల్లలు జేసి పైసలు తెచ్చిపెట్టే, ఎప్పటికైనా దొరలు, దొరలే అనుకున్నారు. కొంతమంది మాత్రం అన్నలు భూములల్లా జెండాలు పాతి దున్నుకోండ్లంటే ఎవరన్న ముందుకువచ్చిండ్లా? మన చేతకాని తనానికి వాళ్లనంటే ఏం లాభం అనుకున్నారు.
దొరలు మాత్రం విజయగర్వంతో మీరు మమ్ములను ఏం చేయలేరు? మాకు అండగా గవర్నమెంటున్నది. పోలీసులున్నరు. అని వాళ్లకే వాళ్లే అనుకుంటా వూరిమీద కోపంతో వెళ్లిపోయారు.
మా వూరి సర్పంచికి కూడా లాభం బాగానే జరిగింది. తనయొక్క యిల్లుకు ఎస్టిమేషన్ ఎక్కువగా ఏపించుకున్నాడు. కుక్కపేరునక్కపేరు బెట్టి కూలి వేతనాలు దొబ్బాడు. యిట్లా సర్పంచి కోట్లు గడించాడు. యిప్పుడు అతనికి ఇరువై ముప్పైమంది మనుషులు. యిప్పుడు వూరికి నయా దొర అయ్యిండు.
‘అధికారం డబ్బు, పలుకుబడి ఎవరి దగ్గెర వుంటుందో వాడే దొర’ ఎంంతో మంది కరుడుగట్టిన భూస్వాములను, నరహంతక దొరలను వూల్లల్లనుంచి తరిమి కొట్టిన ప్రజలు ఈ నయా దొరకు ఏ విధంగా గుణపాఠం చెప్పుతారోమరి చూడాలి.
ఈ జ్ఞాపకాలన్ని గుర్తుకువచ్చేటప్పటికి నా గుండె మొద్దు బారిపోయింది. అయినా సరే ముందుకే పోవాలి. యిట్లా ఆలోచిస్తూ! గ్రామపంచాయితి దాటిపోతున్నా నాకు ఎడుమవైపు పడమరదిక్కుగా ఎన్నో బీడు భూములు కనిపించాయి. గ్రామపంచాయితి కాన్నుంచి చూస్తే కంటినదరుకు కనిపియ్యనంత దూరం మొత్తం దొరల భూములే. ఈ భూములల్లో ఎంతమంది రక్తం ఏరులై పారిందో, ఎంతమంది తల్లులను కైకిల్లకు తీసుకపోయి చెరిచారో, ఎంతో మంది ప్రాణాలతో ఈ రూపం తీసుకున్న భూములు, యిప్పుడు ప్రాజెక్టులో మునిగిపోయాయి. మల్లా ప్రాజెక్టువల్ల దొరలకే లాభం జరిగింది. కొన్ని కోట్ల రూపాయాలు దొరలకు వచ్చాయి.
అంతా....తల్ల కిందుల సమాజం. ఈ తల్లకిందుల సమాజం సీద అయ్యే వరకు ఈ లోకంలో ఈ దేశంలో పేదలు, కష్టజీవులు, శ్రమజీవులు బతకలేరు....బతకరు.....బతకలేరు....
యిట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు పోయినకొద్ది ప్రాజెక్టునీల్లు కనబడుతున్నాయి. ‘‘ప్రాజెక్టు మున్నుతిన్న మంజేరుగున్న తీరుగాకనపడుతంది’’ ఈ నీల్లను చూస్తే ఒకపక్క సంతోషం, యింకోపక్కబాధ. ఈ నీల్లు ఎవరికి వుపయోగపడుతున్నాయి. యిక్కడి భూములను, మనుషుల బతుకులను, సర్వం మింగిన ప్రాజెక్టు యిక్కడి ప్రజలకు మాత్రం వుపయోగపడదు. ఎక్కడో రెండు, మూడు వందల కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దనగరాలకు వుపయోగపడుతున్నాయి నీల్లు. మా పక్కనే పెద్ద సముద్రం లెక్క ప్రాజెక్టువుంటుంది. మాకు మాత్రం తాగుదామంటే గుటికెడు నీల్లుండవు. మా ఒక్క గుంటెడు భూమిని కూడా ఈ నీల్లు తడుపవు. మాకు ఎంత మాత్రం వుపయోగపడని ఈ ప్రాజెక్టు మాకెందుకు? ప్రాజెక్టులకు భూములు యివ్వడమంటే తాము సచ్చి యింకొకరికి నీల్లు యివ్వడమే. యిది ఈ దేశంలో ప్రాజెక్టుకింద భూములు పోయిన ప్రజల దుస్థితి.
యిప్పటికైనా ప్రభుత్వాలు కల్లు తెరిసి ప్రాజెక్టు చుట్టుపక్కల వున్న చెరువులకు పంపింగ్ ద్వారా ప్రాజెక్టునీల్లు పంపించి స్టోరేజ్ చేసి రైతులకు వుపయోగపడేవిధంగా చేయాలి. యిట్లా చేస్తే పంటలు పండే అవకాశం వుంటుంది. అలాగే ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రజలకు తాగునీరిందంచాలి.
చీకటి అయితంది...నేను తిరుగు ప్రయాణమయ్యాను. ఆ సూర్యుడు చీకటిలోకి ఎట్లా వెళ్లిపోతున్నాడో నా మనసు కూడా దు:ఖం అనే చీకటిలోకి వెళ్లి పోతుంది. ‘‘అస్తమించిన సూర్యుడు వుదయించకమానడు. అట్లాగే చీకటితో గడ్డకట్టుకపోయిన నా హృదయం వెలుగునివ్వక మానదు’
ఈ దేశానికి
నీవెప్పుడు పరాయివే..
నీ చెమట చుక్కలతో
ఈ నేలను సస్య శ్యామలం చేసిన
నీ రెక్కల కష్టంతో
ఈ నేలను సుందరభరితంగా మలచిన
ఈ దేశానికి
నీవెప్పుడు పరాయివె
బతుకుదెరుకై వలసబోయి
అగ్ర రాజ్యపు అధికారంలో భాగమైన కమల
ఈ దేశపు కమలానికి తోటి మొగ్గే
అదే పొట్టకూటి కోసం
ఈ దేశానికి ఎవడైనా వస్తే దురాక్రమణదారుడు
ఇస్లాం ని ఆచరించే అరబ్బు రాజులు
ఈ కమలానికి మిత్ర పుష్పాలే
అదే ఈ గడ్డపై పుట్టిపెరిగి
ఇస్లాం ని ఆచరించే ప్రతి ముస్లిం
ఈ కమలానికి శత్రువే
నీవు ముస్లిం వా
అయితే శత్రువువే
నీవు దళితుడవా
అయితే పరాయివే..
ఈ దేశానికి
నీవెప్పుడూ పరాయివే..
"అనిమేష" అంటే రెప్పవాల్చనిది ప్రకృతి. కోట్ల సంవత్సరాల కాలం నాటి నుండి జీవకోటి కోసం విశ్రాంతి తీసుకొనిది.మనిషి పుట్టినప్పటి నుంచి అనేక బాధలను భరిస్తూ, ప్రేమను పంచుతూ మానవ మనుగడలో సంపూర్ణ భాగమైంది.కానీ ఇదంతా మరిచిన మనిషి, బుద్ధునికే అందని హద్దులేని ఆశతో ప్రకృతిపై అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కాలమెంతో చెడ్డదని నిందిస్తున్నాడు.ప్రపంచ మార్కెట్ వస్తువే కాదూ మార్కెట్టే తానై అతి తెలివితో ప్రాణాంతకమైన విపత్తులకు, వ్యాధులకు కారణమవుతున్నాడు.శాస్త్ర విజ్ఞానంతో ఎంతెత్తుకెదిగినా తనను తాను కాపాడుకోలేని ప్రమాద అంచుకు నెట్టి వేయబడుతున్నాడు.చచ్చి బ్రతుకుతున్నాడు. ఒకవేళ బ్రతికి బట్ట గట్టినా ఆ తర్వాత జీవచ్ఛవంలాగా బ్రతికీడుస్తున్నాడు.ఈ క్రమం ఒక్కసారి పొరపాటున జరిగింది కాదు, అనేకానేక సార్లు ప్రకృతిని విధ్వంసం చేయడం,తప్పయింది అంటూ నేలకు ముక్కు రాయడం జరుగుతున్నది. అట్లా ప్రకృతిపై ఎదగిన,అంతే వేగంగా పతనమైనా మనిషి గురించి ఈ కరోనా నేపథ్యంలో గత గుణపాఠాలను గుర్తు చేసేదే ఈ “అనిమేష” కావ్యం.
“అనిమేష” ఉపద్రవ కావ్యం రాసింది తెలుగు సమాజానికి తెలుగు సాహిత్యానికి సుపరిచితులైన నందిని సిద్ధారెడ్డి. ఇది మంజీర రచయితల సంఘం ప్రచురించింది. ఈ "అనిమేష" 19 గాథల ఉపద్రవ గాథా కావ్యం. ఇందులోని ప్రతి ఒక్కటి ప్రతి మనిషి గత, వర్తమాన అనుభవాలను తడుతుంది. ఎనిమిది నెలలైనా ఆగని కరోనా విపత్తు అంశంగా మొదలై వేల ఏండ్ల నాటి గుణపాఠాలను మనిషికి గుర్తు చేస్తుంది.ఈ కావ్యం తపనంతా ప్రకృతి, మనిషి; మనిషి, ప్రకృతి. మనిషి ప్రకృతి పై ఎదిగిన విధానాన్ని, చేసిన విద్వంసాన్ని, ఆఖరికి మనిషి పతనాన్ని గురించి చెప్తుంది.అయినా మారని మనిషిని హెచ్చరిస్తుంది.మన కళ్ల ముందు జరిగిన విపత్తును ఒకే దగ్గర చూస్తే ఆ దుఖమెంత భారంగా ఉంటుందో ఆ బాధంతా ఈ కావ్యం మోసింది. ఇది ప్రపంచ ప్రజల దుఃఖం.కవి ఈ కావ్యంలో చేసిన పదాల ప్రయోగాలు, తెలవని పదాలేమున్నా తెలుసుకోవాలనే తపన పాఠకులను మరింత చదివించేలా చేస్తుంది. ప్రకృతిని ప్రేమించే,ప్రకృతిని కాపాడుకోవాలనుకునే ప్రతి మనిషి ఈ కావ్యాన్ని ఇష్టపడతారని నా భావన. నేనూ రాసింది ఈ కావ్యంలోని పదాలతోనే. ఇది నా అనుభూతి మాత్రమే. సమీక్ష కాదు.
ప్రకృతి పుట్టినప్పటి నుండే కోటానుకోట్ల బ్యాక్టీరియాలు, వైరస్ ల వంటి సూక్ష్మజీవులు పుట్టాయి. కొన్ని మానవ మనుగడకు అవసరమైనవి,కొన్ని హానికరమైనవి.కానీ మనిషి చేసిన వికృత చేష్టల వల్ల పుట్టినటువంటి వైరసొకటి నేడు మనిషిని భయపెడుతున్నది. ఎంతగా అంటే
“తలుపులకవతల ఏ ద్రోహం తచ్చాడుతుందో తెలువదు
.....................
చేతుల్ని చూసి కళ్ళు భయపడతాయి
నులుముకోవడానికి లేవబోయి
మునివేళ్ళు చతికల బడతాయి
కడుక్కోవడానికి వెళ్ళినప్పుడల్లా”. ఇది అందరూ అనుభవించిన భయం.ఇప్పటికి అనుభవిస్తున్న తెలియని భయం.
"చంపడానికి కత్తే అక్కర్లేదు
ఉరి తీయడానికి తాడే అక్కర్లేదు
ప్రపంచీకరణ యుద్ధానికి
అణుబాంబులు అక్కరలేదు
వైరస్ చాలు
ప్రపంచమే హడల్ అని "అపరిచిత గాథ"లో మనిషి భయాన్ని సరళంగా కవిత్వీకరిస్తాడు. మరి ఈ వైరస్ ఎక్కడ మొదలైందని ప్రపంచమంతా గుసగుసలాడుతుంటే వినిపించిన పేరు వూహన్.సుందరమైన, సౌకర్యవంతమైన, అధునాతన శాస్త్ర సాంకేతికత కలిగిన నగరం. అటువంటి నగరంలో కరోనా సోకిన తర్వాత తలకిందులైన నగర పరిస్థితి ధైన్యమైనది. ఇప్పుడు అది ఎంత దుఃఖంలో ఉందంటే
“కాళ్ళ కింద నదులే
కళ్ళకింద నదులే” అని రెండు వాక్యాల్లో నగర స్థితిని చెప్తాడు. వూహాన్ లో వైరాలజీ శాస్త్రవేత్త షీ, డాక్టర్ లీ ఎవరు చెప్పినా ప్రభుత్వం వినలేదు.అందుకే వారిని
“దగ్గి దగ్గి చచ్చేదాకా
దేశం చూడలేదు”. ఎందుకంటే అహంకారానికి నిజం నచ్చదు అధికారానికి ప్రాణం లెక్కే లేదు అని ప్రభుత్వ తీరును చెప్తాడు. కరోనా ప్రాణాంతక యాత్ర అక్కడితోనే ఆగలేదని
“ప్రపంచీకరణ కదా/ విపణులతోపాటు/ విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే”నని, అట్లా మనిషి కొనితెచ్చుకున్న విపత్తే ఈ కరోనా ని చెప్తాడు. ఎవరు, ఎలా తీసుకు వచ్చారో తెలియదు కానీ దేశాలు దాటి ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఎందుకంటే
“వైరస్ కు సరిహద్దులు లేవు/వర్ణభేదాలు అంతకంటే లేవు/ వర్గం కులం మతం వరుసకైనా లేవు/.../శరీరమైతే చాలు.మనుషుల్లా తనకేమి భేదాల్లేవు.ఎవ్వరినైనా చంపడమే. అట్లాగే చంపుకుంటూ వస్తున్నది. అలాంటి సందర్బంలో రాత్రికి రాత్రే ముందస్తు చర్యల్లేకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దాంతో దేశంలో మారిన భౌగోళిక స్థితిని చెప్తూ
“ఎయిర్ వేలు రైలు వేలు రోడ్డు వేలు
సీ వేలు స్కై వేలు
ఏ వేలూ లేవు
వేలు లేని వేళ
వేళకాని వేళ
వేల శవాలు కుప్పబడతాయి”. ఎవరికీ ఎవరూ లేని అట్లాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రతి రోగికి ఆత్మీయులై మునిసిపాలిటీ సిబ్బంది,అర్ధం కాని రోగంపై మనుషుల కాపాడాలనే తపనతో వైద్యంచేస్తున్న డాక్టర్లు,నర్సుల సాహసాన్ని మొక్కాలి అంటాడు కవి.ఇది నిజం.వాళ్లే గనుక లేకపోతే శవాల గుట్టలతో భూమంతా నిండిపోయేది.దాదాపు 200 దేశాల్లో ఇదే పరిస్థితి.ఇంకా లాక్ డౌన్ కాలంలో వైద్య,రక్షణ,రాజకీయపరమైన కొత్త పదజాలం అనివార్యంగా వచ్చిందని.
“కొత్త భాష
కొత్త బాధ
కొత్త సంకెళ్ళు” అంటూ మూడు పదాల్లో క్లుప్తంగా కరోనా విపత్కాలన్ని వివరిస్తాడు. నిజానికి ఈ పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు.ఎన్నో ఏండ్ల నుండి మూఢనమ్మకాల్లో మగ్గుతున్న మనుషులకు ఈ నిజం అర్దమై వుండాలి. అదేమిటంటే టావో, బుద్ధుడు, అల్లా, క్రీస్తు, నారాయణుడు, షిరిడిసాయి, ఏడుకొండలస్వామి అందరూ మాస్కులేసుకొని తలుపులేసుకున్న సంగతి. లేని దేవుళ్ళ పేరు జెప్పి నమ్మించి పబ్బం గడుపుకునే బాపతు గాళ్ళు చేసే నీచ రాజకీయల సంగతి ప్రజలంతా అర్థం చేసుకోవాలి.ఇలాంటి కుటిల రాజకీయాలు జేసే ప్రభుత్వాల, మతోన్మాదుల ప్రచారానికి కౌంటర్ గా “చప్పట్లు కొడితేం
పక్షులు లేవయి
గంటలు మోగిస్తేం
ధైర్యం పలుకదు” అని శాస్త్రీయ దృక్పథాన్ని చెప్తాడు.
ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికోదిలి లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ప్రాణాలను బిగపట్టుకొని తరలిపోతున్న వలస దుఃఖాన్ని 'వలస గాథ"లో చాలా ఆర్ద్రంగా గా వివరించారు.ప్రపంచంలోని అంతస్తులను, పట్టణాలను, చారిత్రక కట్టడాలను, సుందరమైన స్థలాలను తీర్చిదిద్దింది వలస కూలీలే.అలాంటి వలస జీవులు ఏమి పనుల్లేక, తినడానికి తిండి లేక పూట పూట గండంగా బ్రతుకీడుస్తున్నారు.ఆకలికి భరించలేని స్థితి వచ్చింది. ఆకలి చావుల పరంపర కొనసాగుతున్న దశలో ”కాయానికి తాళం వేయగలం/ కడుపుకు తాళం లేదు”అని అంటాడు.అందుకే బతికుంటే బచ్చలాకైన తిని బతుకోచ్చనుకుంటూ వలస జీవి కన్నూరికి పయనం గట్టాడు. రోడ్డు పొడుగునా వందలు వేల కిలోమీటర్లు నడిచారు.వాళ్ల రూపం పూర్తిగా మారింది.”మూటాముల్లె తలమీద/ చంటి పిల్ల చంకలో/వేలు పట్టుకొని పిలగాడు”తో నడక మొదలై తల్లిని,పిల్లల్ని,చుట్టాల్ని తలుచుకుంటూ వెళ్లే సందర్భంలో ఎన్నో విషాదకర ఘటనలు వలస జీవి కళ్లముందు సాక్షాత్కరించాయి.మనం కూడా ప్రత్యక్ష,పరోక్ష సాక్ష్యులం.అందులో మచ్చుకు కవి చెప్పిన వాటిలో... సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణం,చంటి పిల్లల సంకలేసుకొని కిందపడిన భార్య,సోమయతండా ఆదివాసీ మహిళ బిడ్డకు పాలివ్వడానికి పాలు రాక గడ్డి తినడం,బిడ్డ ఏడుపు భరించలేక గుండె పగిలి రైల్వేస్టేషన్లో తల్లి మరణం,ఇలా నడుస్తూ నడుస్తూ మనుషులు హటాత్తుగా కూలిపోతున్నారు.బ్రతికుంటేనే భాద అనుకుంటూనే మళ్ళీ ఎలాగైనా బ్రతకాలనే చిన్నిపాటి ఆశతో ప్రతి ఒక్కరు కన్నూరికి చేరాలని నడుస్తూనే ఉన్నారు. అలా నడిచి నడిచి అలిసిన శరీరాలు రైలు పట్టాలపై సేద తీరుతుండగా గూడ్సు రైలెక్కి శవాలైన సందర్భమింకా కళ్ళ ముందట తిరుగుతూనే ఉంది.ఇంకా విదేశం నుండి కంటైన్ మెంట్ లన్ని దాటి చనిపోయిన తల్లిని చూడటానికి వచ్చిన కొడుకు స్థితిని చెప్తూ..
“అక్కలుంటారు తమ్ములుంటారు
భారంగా బంధువులుంటారు
ఎవరి మీద పడి ఏడవటానికుండదు
ఎవరి కన్నీళ్లు తుడవటానికి లేదు
అనుమానితుడు”. తల్లికి కొడుకు అనుమానితుడైన సందర్బం చరిత్రలో కనబడదేమో కదా.ఇంకా కరోనా సోకిన కొడుకుని హాస్పటల్లో చేర్పించగా డాక్టర్లు అతను చనిపోయాడని చెప్పగా తల్లిదండ్రుల ఆవేదన “అదేదో మాకు సోకితే మంచిగుండు/మమ్ముల కదలనిస్తలేరుగని”అని గుండె బండరాయి చేసుకున్న సందర్భాన్ని "ప్రాణగాథ"లో ఎంతో దీనంగా చెప్తాడు.
ఒకపక్క కరోనా ఎవరిని వదలకుండా చంపుతుంటే దేశాధినేతలు మాత్రం అహంకారాన్ని,నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఒకరి దేశంపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.కుల మత జాతి లింగ భేధాలతో మూర్ఖులవుతున్నారు.
”మతం ఒక వైరస్
ఎప్పుడో మెదడును కమ్మేసింది
రాజకీయం మరో వైరస్
రక్తనాళాల్లో చేరిపోయింది
వ్యాపారం వావిలేని జీవి
మనస్సును మత్పరించింది
ఇవ్వాల్ల మనిషి ఎక్కడ దొరుకుతాడు
ఒట్టి శరీరం తప్ప
అదీ బతకనివ్వకుండా
ఇప్పుడిదిగో ఈ వైరస్” అంటూ మనిషిని పీల్చి పిప్పి జేసిన ప్రపంచ పాలకవర్గాల పీడనని,మతోన్మాదాన్ని, వ్యాపారికరణ హీనత్వాన్ని, వైరస్ క్రూరత్వాన్ని ఈ ఒక్క పాదంలో చెప్తాడు. కాని మనిషి వినడు కదా అందుకే వేల సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా రేబిస్,మీజిల్స్,స్పెయిన్ ఫ్లూ,స్పానిష్ ఫ్లూ,ఫ్రెంచ్ ఫ్లూ,ఆసియన్ ఫ్లూ,హాంగ్కాంగ్ ఫ్లూ,అమెరికన్ ఫ్లూ, చైనా వైరస్, కలరా,ఎబోలా,ఎయిడ్స్,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ వంటి రోగాలతో లక్షల మంది చనిపోయారు.అలా సేవాగుణం,చిత్తశుద్ధి లేని నీచ రాజకీయ నాయకులు, బుద్ధిలేని కొందరు కుల మత జాతి లకు పుట్టిన కుల్లుగాల్లు “వైరస్ లకు దేశాల పేర్లు”పెట్టి ద్వేషాలకు దారులేస్తున్నారు”అని అంటాడు. ఇంకా "ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ/గందరగోళాలు మూర్ఖం అని చెప్తూ “ప్రపంచ సంరక్షణ/ప్రపంచ దేశాల బాధ్యత” అనే సత్యాన్ని చెప్తాడు.
మనిషి కోరికలు పరిమితికి మించినవి.చాలా ప్రమాదమైనవి. అయినా ప్రకృతి కొండలని,నదీజలాలను, జంతువులను, పక్షులను ముఖ్యంగా మనుషుల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ వచ్చింది. ఇది ఎప్పటికీ మారదు.అందుకే మానవుడు ప్రకృతినెంత గాయం చేసినా పాల కోసం రొమ్ము కొరికిన/ పసిబిడ్డగా తలచి తల నిమిరింది”అని చెప్తాడు. కానీ అంతటితో ఆగకుండా “పక్షిని చూసి విమానమై ఎగిరినవాడు/గుర్రాన్ని చూసి రైలయి ఉరికినవాడు/సింహాన్ని చూసి నియంతలా జూలు విదిల్చినవాడు” సౌకర్యాన్ని మించి ప్రకృతిని వాడుకోవడం, తోటి వారికి గూడు లేకుండాచేయడం,స్వార్థంతో నన్ను మించినవాడు లేడని మనిషి అపోహాతో విర్రవీగడం.ఇది నిజంగా మనిషి బుద్దిలేని తనమే. అయినా చాలనట్టు ఇంకా ప్రపంచీకరణలో ప్రపంచ మార్కెట్ గా మారిన “ఆశానుబావుడు”మనిషని కవి చీదరించుకుంటాడు. అడవి పట్ల ఆదినుండి ఉన్న అభిప్రాయాల్ని చెప్తూ “అడవిని మొక్కింది ఆదిమం/అడవిని వేటాడింది రాచరికం/అడవిని నరికింది నాగరికం/అమాంతం ఆసాంతం అడవిని/బాంబులతో బద్దలుకొడుతున్నది ప్రపంచీకరణ”అంటాడు. నేడు మానవుడు క్రూర విద్వంసకుడుగా మారాడు.అందుకే మనిషి విలువలు మరచి స్వార్థంతో వికృతంగా బహురూపిగా మారి,వికృత ముఖంతో “పిచ్చుకలను చంపి/ప్రపంచ పిచ్చుకల దినం ఆచరించేవాడు/ తల్లిని చంపి తల్లుల దినోత్సవం/నవ్వులు చిదిమి నవ్వుల దినోత్సవం/సర్వనాశనం చేసి/ సంరక్షణ దినం” పాటిస్తాడు. అట్లాగే “ఒక చేతితో పర్యావరణ ఉద్యమానికి విరాళం ఇచ్చి/మరో చేత్తో పర్యావరణ విధ్వంసానికి దిగుతాడు” అంటూ ప్రకృతిని ఒలుచుకు తినేవాడు, ప్రకృతిని కాపాడుకునేవాడు ఒక్కటి కాదనే ఎరుకను కూడా కవి మన ముందుంచుతాడు.
చివరిగా... ప్రకృతిని అందంగా తీర్చిదిద్దింది మనిషి, మనిషి బ్రతుకును అంతకంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దింది ప్రకృతి.దీనికి కాలమే సాక్ష్యం.గత కాలపు ప్రాణాంతక వ్యాధులను చైతన్యంతో పట్టుదలతో సాహసించి వ్యాక్సిన్లను కనిపెట్టి ఎందరినో కాపాడాడు.అలాగే ఈ కరోనా వైరస్ కు కూడా వ్యాక్సిన్ ని కనిపెట్టి త్వరలో చరిత్రలో నిలుస్తాడు.ఇది సత్యం.ఇది తథ్యం.ఎందుకంటే “విధ్వంసం ఎప్పుడు చెల్లదు/విలయం ఎంతోకాలం నిలవదు”అనే ఆశవాదాన్ని ప్రజల్లో నింపి ప్రపంచ మానవాళికి ఈ మాటలతో కవి భరోసానిస్తాడు.ఇంకా కవి మాటల్లో మూడు అయితేనే మనిషి. “బ్రతుకు/బతికించు/బతుకనివ్వు”;అందం/అనుబంధం/ఆదర్శం"-ఈ మూడు మూడింటితోనే జీవిత పరమార్థమని అందుకు మనిషి నిజమైన సంఘజీవిగా బ్రతకాలని చెప్తాడు. అట్లాగే గతకాలపు విపత్తులకు,వ్యాధులకు,యుద్ధాలకు మనిషే కారణం గనుక పరిష్కారం కూడా మనిషె.కాబట్టి మనిషితోనే ఎలాగైనా రేపు “చరిత్ర ద్వారం/తెరుచుకుంటుంది/పేచీ లేదు/మనిషి బతుక్కి కాలం పూచీ/సమస్త ప్రాణి/ సహజీవనానికి/పూచీ పడాల్సింది మనిషి/ఈ తరానికి/ రాబోయే తరాలకు అది హామీ”. ఇది ప్రతి ఒక్కరు ఎరుకలో పెట్టుకొని బ్రతకాలి.బ్రతకనివ్వాలని దానికి మనిషి హామీ పడాలనే బాధ్యత గుర్తు చేస్తాడు.
పాలక వర్గాలు,ప్రపంచ మైనింగ్ మాఫియా తరాల సహజ సంపదను కాజేస్తూ,తోటి వారిని,ఆదివాసులను నిర్వాసితుల జేస్తున్నారు.ఇది తప్పని, అన్యాయమని ప్రశ్నిస్తే దోపిడీని, హింసని చట్టబద్ధత చేసి ప్రజల్ని నిర్బంధించడం, హింసించడం, చంపడం కూడా చేస్తున్నారు.ఇదంతా మనం తరాలుగా చూస్తూనే ఉన్నాం.మాట్లాడుతున్నాం. అయినా ఇంకా ఇంకా బిగ్గరగా మాట్లాడాలి.లేకుంటే మరో ఉపద్రవానికి మనమంతా నేల కూలిపోవాల్సి ఉంటుంది. తప్పెవరూ జేసినా శిక్ష అందరికనే విషయం మర్చిపోవద్దు. అందుకే ప్రకృతి పరిరక్షణకు మనిషైన ప్రతోడు నిజాయితిగా నడవాల్సిన, నిలబడాల్సిన భాద్యత, అనివార్యత ఉంది. లేకుంటే ఏ ఒక్కరం మిగలం. ఈ అనివార్యమైన మందలింపే ఈ కావ్యపు లక్ష్యం.
01.11.2020
NOV 2020
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు