మా రచయితలు

రచయిత పేరు:    అజయ్ భార్గవ్ సోమాజీ

కవితలు

అంబరం పలుకరించింది . . అవని పులకరించింది 

బాల్య మిత్రులు వారు

విడిపోయి కలిసుంటారు

మిన్నూ, మన్నూ అంటారు

వారిని  చూసేవారందరూ

 

ఒకరికొకరు తోడుంటారు

జగతిని ముందుకు నడుపుతుంటారు

ఉదార స్వభావాలతో వారు

ఉదకదానం చేసుకుంటారు

విపరీత కాలాల్లో ఒకరి

విపత్తులనొకరు తొలగించుకుంటారు

 

వేసవిలో . . . .

తన తనువు నెర్రెలు వాసినా

తన చర్మం ఎండి మాడిపోయినా

నేస్తానికి నీరిస్తుంది , స్నేహానికి ప్రాణం పోస్తుంది . . . . పృథ్వి

 

ఆవిరితో బరువెక్కినా . . . .

రవికిరణాలకు వేడెక్కినా . . . .

నీటి ధనం కలిగి ఉన్నా . . . .

ఆ సూర్యునితోనే కలిసి వెలుగుతుంది

ఆప్తుని జాడను మరిచి . . . . ఆకాశం

 

ఋతువు మారింది . . . . .

హితుణ్ణి తలచింది . . . .

వేసవిలో భూమికి ఎడంగా ఉన్న

రవికి దగ్గరగా ఉన్న ఆ మేఘాకాశం . . .

 

ఆపత్కాలంలో ఆప్తుణ్ణి వదిలి వెళ్లానని ఆలోచించి

స్నేహితుణ్ని బాధించానని గుర్తించి

అపరాధం క్షమించమని అర్థించి

పశ్చాత్తాపంతో నల్లగా మారి

భూమి ముందు తలవంచి నిలుచుంది . . .

 

ఆషాఢ మాసంలో తన పశ్చాత్తాపం తెలుపుతూ

అంబరం పలుకరించింది . . .

 స్నేహితుని రాకతో అవని పులకరించింది

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు