మా రచయితలు

రచయిత పేరు:    డా. చింతల రాకేశ్ భవాని

కవితలు

శిశిర శార్వరి

రాల్చిన ఆకులను

చిగురు తొడగించ వచ్చిన కాలప్రవాహినివో

వెతల రాత్రికే వేకువ పాడి

వ్యథల ఆర్తిని

తొలగింపవచ్చిన

 కాల ఫలానివో

 

"శార్వరి" నీ ఆగమనం

మానవతకు వేయాలి అందలం

మానవాళికి కావాలి ఆనందం

భ్రాంతులన్ని విడిపోయే

కాంతులెన్నొ చెలరేగి

జగం జగం ప్రణమిల్లే

యుగం ఒకటి స్ఫురించాలి

 

"శార్వరీ"

యుగాది వేళ

మా జీవితాలకు

షడ్రుచులే కాదు

అమృతాలను అందించు

యువశక్తు గుండెలలో

నవ శక్తులు ప్రసరించు

కర్షకుల నెత్తురు ఫలించి

కార్మికుల కష్టం తరించి

పాడిపంటలు సుఖ భోగాలు

లోకమంతా వరించాలి

 

"శార్వరీ" నీ రాకతో

స్త్రీ వేదన పోవాలి

నేలంతా "శ్రీ"మయం కావాలి

ఎలకోయిల ఎలుగెత్తి

స్వస్తి స్వస్తి స్వస్తి అని

పంచమమై కూయాలి

 

నానీలు..

1.         మట్టిలో నీరేకాదు

          కన్నీరొలికినా

          చెట్టై

          పలుకుతుంది

 

2.         అధ్యయనం లేని విద్య

          సాగుచేయని నేల

          పండేదక్కడ

          పల్లెర్లే

 

3.         గురుశిష్యులదేమి

          బంధం

          వారి ఎదల్లో అతడు

          వాడని సుమగంధం

 

4.         ఆడకూతురని

          అలకెందుకు

          మానవజాతికే

          మాతృమూర్తి కదా

 

5.         నేలతల్లిదెప్పుడూ

          ఒకటే కల

          కాలే కడుపుల్లో

          బువ్వై బ్రతకాలని

 

6.         చీకటి వెలుగులే కదా

          లోకం

          నలుపును కావరంతో

          నలుపొద్దు

 

7.         తెలుగెక్కడికీ

          పోలేదు

          స్మార్ట్ గా తయారై

          ఆన్ లైన్లో అలరిస్తోంది

           

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు