గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా రాధేయ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు" మొదలైన క్రమం గురించి చెప్పండి?
"ఉమ్మడిశెట్టి"మా ఇంటి పేరు. కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఓ సామాన్య దిగువ మధ్య తరగతి చేనేత కార్మిక కుటుంబం మాది. మా తల్లి దండ్రులకు నేను నాలుగవ కొడుకుని.మేం అయిదు మంది అన్నదమ్ములం.ఇద్దరు చెల్లెళ్ళు. మొత్తం మా కుటుంబ సభ్యులం తొమ్మిది మంది.
మా తల్లిదండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి ,నాగమ్మ గార్లు. ఇద్దరూ చేనేత కార్మికులే. ముఖ్యంగా మా అమ్మ జీవితాంతం ఈ వృత్తిలోనే బతికింది.
నేనూ, మా అన్నలు అమ్మకు పనిలో సాయం చేసే వాళ్ళం.మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే మగ్గం మానేశాడని అమ్మ చెప్పింది.
మా నాన్న ఆరోజుల్లో వీధి బడిలో చదువుకున్నాడు, సంస్కారవంతుడు. మంచి లౌకికుడు. పేదరికాన్ని అయినా భరిస్తాడు కానీ ఎవరి దగ్గర చేయి చాచి ఎరుగడు.
పిల్లలందరినీ బాగా చదివించు కోవాలని ఎవరిని ఈ రెక్కల కష్టం లో దించ కూడదని భావించేవాడు. శరీర కష్టం వాళ్లది చదువు కోవలసిన బాధ్యత మాది.
మా అన్నదమ్ములూ, చెల్లెళ్ళు అందరూ చదువు కున్నారు. అందరికీ ఉద్యోగాలు
వచ్చాయి. ఆ పల్లెటూళ్ళో ఒక పేద చేనేత కార్మిక కుటుంబంలో అందరూ ఇష్టపడి, క్రమశిక్షణతో కష్టపడి చదువు కోవడం, పైగా అందరూ ఉద్యోగస్తులు కావడం మా ఉరిలోనే గాక చుట్టుపట్ల మా కుటుంబమంటే ఎంతో గౌరవం ఏర్పడింది.
కేవలం మా తల్లి కష్టం తోనే ఇంత పెద్ద కుటుంబం బతుకు తెరువు కష్టం కదా.
మా ఊరికి దగ్గర్లో ముద్దనూరు మాకు చిన్న టౌన్. అక్కడ మరొక భాగస్వామిని కలుపుకొని చిన్న బట్టల అంగడి ప్రారంభించాడు నాన్న.
తను రోజు పల్లె నుండి సైకిల్లో ముద్దనూరు వెళ్లి సాయంత్రం దాకా వ్యాపారం చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేవాడు. మేమంతా యామవరం లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాము. ముద్దనూరుకు వెళ్ళి హై స్కూల్ విద్య పూర్తి చేశాము.
ఈ చేనేత కుటుంబాల్లోచదువు ఉండేది కాదు. వారికి పదేళ్ల వయస్సు రాగానే ప్రతినపిల్లవాన్ని మగ్గంగుంటలో దింపుతారు. ఇక ఆడపిల్లల కైతే పెళ్లికి అర్హత మగ్గం నేర్వడమే.
నాకు బాల్యం నుంచీ ప్రకృతి ఆరాధన చాలా ఇష్టం, తెలుగు భాషన్నా, తెలుగు మాస్టార్లన్నా చాలా చాలా ఇష్టం.రాను రాను నా వయసుతో పాటు తెలుగు కవిత్వం మీద అభిమానమే కాదు, ప్రవేశం కూడా కలిగింది.
మొదట్లో అనుభూతి కవితలు, ప్రేమ కవితలు రాసేవాణ్ణి. 1974 లో శ్రీశ్రీ గారిని చూశాక నా భావజాలంలో కొంత మార్పు అవసరం అనిపించింది అప్పటి నుంచి అభ్యుదయ కవిత్వం రాస్తూ వచ్చాను.
నాకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ఎంచుకున్నాను నిరుద్యోగిగా ఉన్నప్పుడే నేను "మరోప్రపంచం కోసం" కవితా సంపుటి వేశాను నిరుద్యోగి గానే 79 లో నాకు పెళ్లి అయ్యింది.
నా జీవితంలోకి ఇల్లాలిగా సత్యా దేవి వచ్చింది ఆమె రాకతో నా జీవితం సాహిత్యం మరింతగా వికసించిందని చెప్పవచ్చు తను నాకు మంచి. ఉత్సాహాన్ని ఇచ్చింది
1982లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది ఉద్యోగంతో నేను పేదరికాన్ని జయించానన్న తృప్తి కలిగింది. తర్వాత కవిగా ఎదుగుతూ వచ్చాను. ఈ క్రమంలో నేను కవిత్వం రాయడమే కాకుండా మంచి కవిత్వం రాసిన కవుల్ని ప్రోత్సహిస్తూ వారిని ఒక అవార్డు పేరుతో గౌరవించాలని నా ఆశయం. ఈ విషయమే ఒకరోజు శ్రీమతి తో చర్చించాను ఆమె సంతోషంగా అంగీకరించింది. అంతేకాదు మేము పల్లెటూరిలోనే కాపురం ఉంటూ నిరాడంబరంగా బతకడం మాకుబాగా అలవాటైంది. తను కూడా ఎంతో పొదుపుగా కుటుంబాన్ని నిర్వహిస్తూనే అవార్డుకు తనవంతు సహకారం అందిస్తూ వచ్చింది.
అలా ఏర్పడిందే మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు". ఒక సామాన్య మధ్యతరగతి శ్రామిక కుటుంబ ఏర్పాటు చేసుకున్న ఒక పవిత్రమైన అవార్డు మాది.
2. అవార్డు కోసం కవితా సంపుటాల మధ్య తీవ్రమైన పోటీ ఎప్పుడైనా వచ్చిందా?
అప్పుడు న్యాయనిర్ణేతల అభిప్రాయం ఎలా ఉండేది? ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది?
మొదట్లో అవార్డు పరిశీలన కోసం 3 సం వ్యవధిలో అచ్చయిన కవితా సంపుటాలను ఆహ్వానించే వాణ్ణి.అప్పట్లో 30 సంపుటాలదాకా వచ్చేవి ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు లాగా ఇన్ని పత్రికలులేవు. మొబైల్స్ గానీ, మీడియా గ్రూపులు గానీ లేవు గదా,అన్నీ ఉత్తరాల ద్వారానే జరగాలి. అప్పుడున్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, ఉదయం పత్రికలు మా నోటిఫికేషన్ పట్టించుకోలేదు. ఎక్కడో మారుమూల పేజీలో ఓ చిన్న వార్త వేసేవారు. ఆ వార్తను చాలామంది కవులు గమనించే వాళ్లు కాదు. కానీ నేను ప్రతి ఆదివారం లైబ్రరీకి వెళ్లి కొత్త పుస్తకాలను వేసిన కవులను వారి చిరు నామాలను సేకరించుకుని వచ్చేవాణ్ణి.
ప్రతి రోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు నా క్యారీ బ్యాగులో 100 పోస్టుకార్డుల ఎప్పటికీ పెట్టుకొని వెళ్లేవాణ్ణి. మా అవార్డు ప్రకటన సమాచారాన్ని కార్డు మీద రాసి ఆయా కవుల పోస్ట్ చేసేవాణ్ణి. కొత్త కదా, అలా చేస్తే కూడా నాకు అప్పట్లో వందమందికి రాస్తే 30 నుంచి 40 దాకా మాత్రమే వచ్చేవి. వాటినే మూడు సెట్లు గా చేసి న్యాయనిర్ణేతల పంపేవాణ్ణి. అలా పదేళ్లు వరకు ప్రతియేటా క్రమం తప్పకుండా కష్టపడి కార్డుల ద్వారా కవులకు సమాచారం చేరవేశాను. పుస్తకాలు అంతగానే అందినట్లు మళ్లీ కవులకు ఉత్తరం రాసే వాణ్ని. అవార్డులు ప్రకటించాక పత్రికలకు సమాచారం ఇస్తూ మళ్లీ ఈ సమాచారాన్ని ఉత్తరం ద్వారా పంపిన కవులందరికీ రాసి పంపేవాడిని.
ఈ పదేళ్లలో నా నిబద్ధతను, తెలుగు సాహిత్య లోకం అంతా గుర్తించింది.అవార్డు విజేతలను కూడా గమనిస్తూ వచ్చింది.అవార్డు ద్వారా మేం ఎలాంటి వివక్షాలేకుండా ఉత్తమ కవిత్వఎంపికలో న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని ప్రకటిస్తూ రావడం, కవిలోకమంతా గమనించింది. గుర్తించింది. తర్వాత వాళ్లే మా అవార్డు ప్రకటన కోసం ఎదురు చూసేవారు. దీన్ని తెలుగు కవులకు ప్రతిష్టాత్మక పురస్కారంగా గుర్తించి గౌరవిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడగానే పుస్తకాలు పంపించడం అలవాటు చేసుకున్నారు. సాహిత్యలోకం గుర్తింపు కోసం, నాకు పది సంవత్సరాలు పట్టింది.
ఆవార్డు కోసం మొదట్లో ప్రతియేటా నగదు బహుమతి వెయ్యి రూపాయలు, షీల్డు, శాలువాతో సన్మానించుకోవాలని మేం నిర్ణయించుకున్నాము.
1988 లో ఈ అవార్డు ను ప్రారంభించక ముందు కుందుర్తి గారు స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ మాత్రమే ఉండేది. ఈ పురస్కారం కూడా కేవలం కవిత్వానికే అంకితమైన అవార్డు. నాకు కుందుర్తి గారితో పరిచయం, సాన్నిహిత్యం కూడా ఉండేది. మా అవార్డు స్థాపనకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా కారణమే..
మొదటి అవార్డు సభ 1989లో మా మండల కేంద్రమైన ముద్దనూరు లో ఏర్పాటు చేశాం.
తర్వాత్తర్వాత నేను పనిచేస్తున్న ప్రాంతాల్లోనే జరుపుతూ వచ్చాము. ప్రతి ఏటా ఈ అవార్డు ప్రదాన సభలు కోసం మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు పెట్టే వాళ్ళం.
ఈ మొత్తాన్ని మేము మాకొచ్చే జీవితంలోంచి పొదుపు చేసుకొని ఖర్చు పెట్టేవాళ్ళం.సభల నిర్వహణలో ఆడంబరం మాకు ఇష్టం లేదు.అలా చేసుకుంటూ పోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందుముందు భారమౌతుందని చాలా జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళం.
ప్రతి పదేళ్లకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఈ విలువ అయిదు వేలు అయింది.సభా ఖర్చులు కూడా బాగా పెరిగి పోయి..ఇప్పుడు ఏడాదికి ఎంత నిరాడంరంగా జరుపుకున్నా ముప్ఫై నుంచీ నలభై వేలు అవుతోంది.
మా పిల్లలు పెరుగుతూ వస్తుంటే మా ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూవచ్చాము. ఆ సంవత్సరం అవార్డు సభ కష్టమయ్యేది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా అవార్డును నడపాలా? అని నిర్వేదం, ప్రసూతి వైరాగ్యం కలిగేది. మళ్లీ అంతలోనే ఉత్సాహం తెచ్చుకొని ముందుకు పోతూ ఉంటాను.
అవార్డు నిర్వహణ నాకు సంవత్సరంలో ఆరునెలలు ప్రాజెక్ట్ గా భావిస్తుంటాను. ప్రతియేటా నవంబరు లో మా వార్డు నోటిఫికేషన్ వెలువడుతుంది.
జనవరి 31 వరకు పరిశీలన కోసం ఎంట్రీలను స్వీకరిస్తాను.ఫిబ్రవరి నెలంతా జడ్జిమెంట్.ఈ క్రమంలోనే రాయలసీమ తెలంగాణా, ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల నుండి ముగ్గురు సీనియర్ కవులనుగానీ, విమర్శకులను గానీ న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకొని వారి నుండి అనుమతి తీసుకుంటాను.
వచ్చిన ఎంట్రీలను మూడు బండిల్స్ ప్యాక్ చేస్తాను.స్టూడెంట్స్ ఆన్సర్ పేపర్స్ ఎంత జాగ్రత్తగా సెంటర్స్ కు పంపుతారో నేనూ అలాగే న్యాయనిర్ణేతలకు పంపుతాను.ఈ పని అత్యంత గోప్యంగా జరుగుతుంది.
న్యాయనిర్ణేతలు ఎవరు ఉంటారనేది నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. ముందుగా నేను ఎంచుకున్న న్యాయ నిర్ణేతలను ఫోన్ ద్వారా సంప్రదించి అనుమతి తీసుకుంటాను.
మిగిలిన ఇద్దరు ఎవరు అనేవిషయాన్ని కూడా వారికి చెప్పను. అలా ముగ్గురి నుండి విడివిడిగా అనుమతి తీసుకుంటాను.
అవార్డు విజేతను ప్రకటనతోనే ముగ్గురు న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ప్రకటించడం ఒక ఆనవాయితీ గా జరుగుతుంది.
ఇదంతా గోప్యంగా రహస్యంగా జరుగుతుంది. Judges ను ప్రాధాన్యత క్రమంలో వారిని మూడు పుస్తకాలను ఎంపిక చేసి, అందులోని ప్రత్యేకత గురించికొన్ని వాక్యాలు రాయమని కోరుతాను.
వారు ముగ్గురూ తొమ్మిది పుస్తకాలను సూచిస్తూ రాసి పంపిస్తారు. అందులో మొదటి స్థానం ఏ పుస్తకానికి వచ్చిందో చూస్తాను. అలా వచ్చిన పుస్తకాన్ని అవార్డు కోసం ఎంపిక చేస్తాను. స్థానాలు మారినప్పుడు కూడా ఒకే పుస్తకాన్ని ఎంతమంది సూచించారో మళ్ళీ చూస్తాను. అలా చూసి అంచనా వేసి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పుస్తకాన్ని ఎంపిక చేసుకుని అవార్డు విజేతగా ప్రకటిస్తాను.
ఫిబ్రవరి నెల అంతా కూడా జడ్జిమెంట్ కోసం కేటాయించి ఉంటాను. వారు తమ judgement నాకు పంపే వరకూ వారితో నేను మాట్లాడను. వారినుంచి రిపోర్ట్ వచ్చాక నిర్ణయాన్ని బట్టి మార్చి మొదటి వారంలో అవార్డు విజేతలను ప్రకటిస్తాను
ఒక వైపు ప్రవేటుగా నా చదువులు, పిల్లల చదువులు, కవిత్వం రాస్తూ పుస్తకాలు వెయ్యడం ఈ ఒక్క జీతంలోనే మాకు చాలా కష్టమయ్యేది.
అయినా సరే..
1982-94 మధ్య కాలం లో, తెలుగు బిఏ లిట్,ఎం.ఏ., చేశాను. 2008లో పిహెచ్,డి, సాధించాను.
2001 నేనెంతగానో ఇష్టపడే తెలుగు లెక్చరర్ గా ప్రమోషన్ పొందాను. నా కార్యరంగం కళాశాలకు మారింది. కడప జిల్లా నుండి ఆనంతపురం జిల్లాకు మారింది.
ఈ కాలం లోనే మేం అనేక ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకుల మధ్య అవార్డును కొనసాగిస్తూనే వచ్చాము. ఉత్తమ కవిత్వానికి అవార్డు ప్రకటించడంలో ఎక్కడా రాజీపడలేదు. న్యాయ నిర్ణేతల నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ వస్తున్నాను.
నాకు కవిత్వమే ప్రధానం. ప్రాంతాలూ, కవులూ కాదు. అలా భావించే వాణ్ణి అయితే నేను 32 మందిలో 15 మంది కవులు తెలంగాణ ప్రాంతం వారికే ఎందుకిస్తాను?. ముగ్గురే రాయల సీమ వారు. మీరొకసారి మా అవార్డు గ్రహీతల లిస్ట్ చూడండి. ఈ నాటి ప్రసిద్ధ కవులందరూ ఒకనాటి మా అవార్డు విజేతలే.
అవార్డు ఎంపికలో నా పాత్ర ఏమీఉండదు.ముగ్గురు న్యాయ నిర్ణేతల నిర్ణయమే కీలకం.
ఒక్కోసారి న్యాయనిర్ణేతల ప్రాధాన్యతా క్రమం లో కూడా సందిగ్ధత ఏర్పడిన సందర్భాలూ నాకు ఎదురైనాయి. అప్పుడు నేను స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు అయినా తీసుకొను. ఇలాంటి సందర్భాలు నాకు నాలుగైదు సార్లు ఎదురైంది.
మళ్లీ judges తోనే మాట్లాడి వారి ప్రాధాన్యతను పునః సమీక్షించమని కోరుతాను. మళ్లీ వారు సమయం కోరితే ఇస్తాను.వారి పునః సమీక్ష లో విజేతల్లో స్పష్టత వస్తుంది.
అప్పుడు విజేతను ప్రకటిస్తానే తప్ప,ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలుగ జేసుకొను. అవార్డు విజేత విషయంలో నా ప్రమేయమంటూ ఉండదు. judges ను ప్రభావితం చెయ్యను. పురస్కారాల్లో "ఉమ్మడిశెట్టి"ఒక ట్రేడ్ మార్క్ గా ఉండాలనేదే నా ఆశయం.
3. కవిగా మీరు కవులకు అవార్డు ఇవ్వడం పట్ల ఎలాంటి సంతృప్తి కి లోనవుతున్నారు ?
నేను బేసికల్ గా కవిని.కవిత్వ మంటే ప్రాణం.పైగా మేం తరతరాలుగా నిరక్షరాస్యులం. మగ్గమే మా జీవన వేదం.అటువంటి శ్రమజీవుల కడుపున పుట్టాను. ఆ రోజుల్లో వీధి బడిలో అంతో ఇంతో అక్షరజ్ఞానం పొందిన తండ్రికి కొడుకుగా పుట్టడం. నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.
నా తల్లి దండ్రీ,అన్నదమ్ములు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అందువల్లే నేను నిరుద్యోగి గా ఉన్నప్పుడే రెండు కవితా సంపుతాలు తెచ్చాను.ప్రాచీన,ప్రబంధ, అవధాన సాహిత్యమే రాజ్యమేలే రాయలసీమ గడపలో ధైర్యంగా 23 ఏళ్ల వయసులోనే 'మరోప్రపంచం కోసం' పేరుతో వచన కవిత్వసంపుటి తెచ్చి ప్రాచీన కవిపండితుల ఆగ్రహానికి గురయ్యాను. అప్పట్లోనే కడప జిల్లాలోని అభ్యుదయ కవులు గజ్జెల మల్లారెడ్డి, వైసివిరెడ్డి, రా రా, సోదుం జయరాం వంటి వారు నా భుజం తట్టి ప్రోత్సహించారు. తొలి కవితాసంపుటి తోనే కవిగా నా ఉనికిని చాటుకున్నాను.అదే ఉత్సాహం తో మళ్లీ 1981 లో "దివ్యదృష్టి"తెచ్చాను. ఈ పుస్తకానికి రెండు పురస్కారాలు రావడం తో కవి గా సాహిత్యలోకం లో గుర్తింపు వచ్చింది. నిరుద్యోగి గా ఈ రెండు పుస్తకాలు తేవడానికి మా కుటుంబ ప్రోత్సాహమే కారణం. 1982 లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది.
నాకూ, నా కవిత్వానికి, నా కుటుంబానికి ఒక ఆసరా దొరికింది.తర్వాత 84 లో జ్వలనమ్, 87లో తుఫాను ముందటి ప్రశాంతి వచ్చింది.
ఈ దశలో నేను కవిత్వం రాయడమే కాదు, ఉత్తమకవిత్వాన్ని ఎంపికచేసి, వారిని అవార్డుతో సత్కరించి,ఉత్తేజ పరుస్తూ,ఉత్తమ కవిత్వ నిర్మాణంలో "నేను సైతం" కృషి చేస్తున్న తృప్తి
నాకు మిగిలింది.
4. అవార్డు ఎంపికలు ఎప్పుడైనా అన్యాయం జరిగింది లేదా న్యాయం జరగలేదు అని మీకెప్పుడైనా అనిపించిందా?
లేదు లేదు నాకెప్పుడు అలా అనిపించలేదు. నూటికి 95 శాతం అన్యాయమే జరిగింది. కేవలం ఐదు శాతం కొంత అసంతృప్తి అనిపించినా ఎప్పుడూ నూటికి నూరు శాతం న్యాయం జరగక పోవచ్చు నని నా నమ్మకం.
అయితే ఇక్కడ నేనొక మాట చెప్పాలి. కవితా రంగం లోకి అడుగు పెట్టిన కవులు, తొలి కవితా సంపుటితోనే మా అవార్డు విజేతలైన కవులు 17 మంది దాకా వున్నారు.
వారిని చూసి నేనెంతో గర్వంగా చెప్పుకుంటాను. ఉదాహరణకు 30వ అవార్డు పొందిన శ్రీసుధ మోదుగు,గారిది తొలికవిత్వం"ఆమోహం".
ఇవాళ్టి ప్రామిసింగ్ పోయెట్ గా అందరి అభిమానం పొందుతున్న పుప్పాల శ్రీరామ్ గారి "అద్వంద్వం"తొలి
కవిత్వమే. ఇలా వివరించుకుంటూ పోతే 17 మంది దాకా ఉన్నారు.
మా అవార్డుతర్వాత అదే పుస్తకాలకు మరికొన్ని పురస్కారాలను పొందిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అలా తీసుకున్న వాళ్ళు 17 మంది దాకా ఉన్నారు. 88 నుంచీ 2019 వరకు 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ క్రమం లో ప్రతి అవార్డుకు ముగ్గురు న్యాయనిర్ణేతల చొప్పున ఇప్పటికి 96 మందికి పైగా ప్రసిద్ధ సాహితీవేత్తలు విమర్శకులు కవులు మా అవార్డుకు జడ్జెస్ గా వ్యవహరించారు.
వారి నిర్ణయాన్ని కాదని స్వతంత్రించి ఎప్పుడు నా నిర్ణయాన్ని ప్రకటించుకోలేదు. అవార్డు పొందిన 33 కావ్యాలలో కేవలం రెండు లేదా మూడు ఇంటి మీద నాకు కొంత అసంతృప్తి ఉంది. పేర్లు చెప్పను కానీ న్యాయనిర్ణేత నిర్ణయాన్ని బట్టి వాటిని ప్రకటించాల్సి వచ్చింది.
తొలిసారి మా అవార్డు పొందిన వారికి సాహితీ లోకంలో తిరుగే ఉండదనే సెంటిమెంట్ తెలుగు కవుల్లో ఉంది. వర్తమాన తెలుగు కవులు మా అవార్డును ప్రతిష్టాత్మక పురస్కారంగా గౌరవిస్తున్నారు.మాకీ సంతృప్తి చాలు.
5. మీకవితా ప్రస్థానం గురించి,సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం లోమైలు రాళ్ళను గురించి చెప్పండి?
నాకిప్పుడు అరవై ఐదేళ్ల వయసు. అధ్యాపకుడి గా ముప్ఫై ఐదేళ్లు. నా సాహితీ ప్రస్థానానికి యాభై ఏళ్ళు. మా అవార్డుకు ముప్పై మూడేళ్లు. నా జీవితంలో సగభాగం అవార్డులో భాగమైంది. 810 రూ,తో మొదలైన నా ఉద్యోగ జీవితంలో,అవార్డును స్థాపించుకున్నాం. పైసా,పైసా కూడబెట్టుకొని అవార్డు కోసం వెచ్చించాం. నా కవితా సంపుటాలు వేసుకున్నాం. 1988లో మేం ప్రారంభించిన అవార్డు ప్రతి ఏటా క్రమం తప్పకుండా 2017 నాటికి 30 ఏళ్ళు పూర్తి చేరుకోవడం.
మళ్ళీ 30 మంది కవులను ఆహ్వానించి త్రి దశాబ్ది కవితోత్సవాలను ఒక రోజంతా నిర్వహించడం ..
అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకం "మూడు పదులు, ముప్ఫై కావ్యాలు"అదే సభల్లో ఆవిష్కరించడం, ముప్ఫై ఏళ్ల నాటికి దాదాపు పదిహేనులక్షలు అవార్డుకోసం వెచ్చించాం, అయినాబాధ లేదు.
కోట్లవిలువచేసే గౌరవంతో పాటూ "ప్రతిష్టాత్మక పురస్కారం" అన్న కీర్తిని కూడా పొందడం, ఒక శ్రామిక మధ్యతరగతి కుటుంబం సాధించిన విజయంగామేం భావిస్తున్నాం.
అంతే కాదు ఒక సాధారణ బడిపంతులుగా మొదలైన నా జీవితం తెలుగులో ఎం.ఏ.,పిహెచ్,డి చేసి, డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు పనిచేసి రిటైర్ కావడం, 2008,09 లో ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య పుస్తకాన్ని రూపొందించే ఎడిటోరియల్ కమిటీ లో స్థానం పొందడం,
2003 లో ప్రతియేటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే సర్వ భాషాకవిసమ్మేళనం లో తెలుగు కవిగా పాల్గొనడం, బుక్కపట్నం డైట్ ఉపాధ్యాయ శిక్షణార్ధులుగా వచ్చిన ముగ్గురు యువకులు రెండేళ్లు నా వద్ద కవిత్వ శిక్షణ పొందిన పెళ్ళూరు సునీల్ , సుంకర గోపాలయ్య ,దోర్నాదుల సిద్దార్థ ఈ ముగ్గురూ తెలుగు కవులు గా గుర్తింపు పొందుతూ ఉండడం, వారే నామీద గౌరవం తో "డా. రాధేయ కవితా పురస్కారం" గత పదేళ్లకు పైగా విజయ వంతం గా నిర్వహిస్తూ ఉండడం, చేనేత కార్మికుల జీవన విషాదాన్ని చిత్రించిన తొలిసరిగా దీర్ఘ కావ్యం గా "మగ్గం బతుకు" రాయడం,. ఈ కావ్యం నాకు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టడం, ఈ కావ్యం తెలుగు హిందీ భాషల్లో అనువాదం కావడం , ఈ కావ్యం మీదనే , ఎస్కేయు లో, ఎస్వీయు లోరెండు ఎం ఫిల్. లు రావడం, నా సమగ్ర కవిత్వం మీద ఎస్కేయు లో పిహెచ్.,డి చేయడం .. ..ఇవన్నీ నేను సాధించిన మైలు రాళ్లే..
6. సాహితీ విమర్శకుడిగా మీరు చాలా విలువైన పుస్తకాలు రచించారు కదా వాటి గురించి చెప్పండి.
1978 లో కవిగా తొలి కవితా సంపుటి "మరో ప్రపంచం కోసం" తో నా ప్రస్థానం మొదలైంది.
తరవాత ప్రతి మూడేళ్ళ వ్యవధిలో ఒక పుస్తకం తెచ్చాను.2009 నాటికీ ఎనిమిది కవితా సంపుటాలు తెచ్చాను.
తర్వాత కవిత్వవిమర్శకుడిగా,విశ్లేషకుడిగా,ఆధునిక కవిత్వం లో వస్తు, వైవిధ్య విశ్లేషణ లో భాగంగా వరుసగా నాలుగు సంపుటాలు తెచ్చాను.
అవి..
కవిత్వం ఓ సామాజిక స్వప్నం..2011
కవిత్వం ఓ సామాజిక సంస్కారం..2012
కవిత్వం ఓ సామాజిక సత్యం..2013
కవిత్వం ఓ సామాజిక చైతన్యం..2015
ఇది సరికొత్త ప్రయోగం..
ఈ నాలుగు సంపుటాల్లో ..విభిన్న వస్తు పరంగా 500 మంది కవులు రాసిన 1200 కవితల్ని , ఉదాహరణలతో విశ్లేషించాను.గతంలో విడి విడి గా కొన్ని వ్యాసాలైతే వచ్చాయి గానీ ఇంత విస్తృతంగా విశ్లేషణ జరగలేదు. మా అవార్డు కు వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవడమే ఈ పుస్తకాలు రాయడానికి దోహద పడ్డాయని చెప్పవచ్చు.
తర్వాత...వర్తమాన సీనియర్ కవుల కవయిత్రుల సమగ్ర కవితా ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ రెండు భాగాలు తెచ్చాను.
అవి...
అవగాహన..2017
వివేచన.......2020
విశ్లేషణ....రావాల్సి ఉంది
ఈ మూడు సంపుటాల్లో 50 దాకా సీనియర్ కవులు,కవయిత్రులు ఉంటారు.
మా అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలమీద నేను రాసిన విశ్లేషణాత్మక గ్రంథం..
మూడు పదులు ముప్ఫై కావ్యాలు 2018 లో వచ్చింది.
కవిత్వ విమర్శకుడిగా నేను రాసిన పుస్తకాలు ఇవి..
7. అవార్డు సభలు పెద్ద ఎత్తున. నిర్వహించడం, వెనుక గలమీస్నేహితులు కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి?
మా అవార్డు సభలు భారీగా ఉండవు పెద్ద ఎత్తున జరగవు ఆడంబరంగా జరగవు అవార్డు మీద ఉన్న అభిమానంతో అలా అనుకుంటారు , అంతేకానీ అది వాస్తవం కాదు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అనగా పదేళ్లు,(దశాబ్ది సభ) ఇరవై ఏళ్ళు,(ద్వి దశాబ్ది) 25ఏళ్లకు( రజతోత్సవం) 30ఏళ్లకు(త్రి దశాబ్ది) ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వచ్చామే తప్ప ఆర్భాటం లేదు. త్రి దశాబ్ది ఉత్సవం మాత్రం ఒకరోజంతా ఒక చరిత్ర గా నిర్వహించాను. ఇందులో ప్రతి పైసా నాజీతం తో, 2013 నుంచీ నా పెన్షన్ తో.
ఇందులో స్నేహితుల,బంధువుల, అన్నదమ్ముల ఆర్థిక సహాయంగానీ నేను ఎవరి నుండీ ఏనాడూ ఆశించలేదు. ఇది కేవలం నా కుటుంబం పక్షాన్నే జరగాలి.అనే ఆశయమే పునాదిగా మా అవార్డు ఏర్పడింది. దీనికి వెనుకా ముందు నేనూ,మా శ్రీమతి ,మా పిల్లలు తప్ప వేరెవరూ లేరు.
నాకు బతుకు తెరువుకు ఉద్యోగముంది.
ఈ సమాజం రచయితగా నన్ను గుర్తించి గౌరవిస్తోంది.
ఈ సమాజానికి , సాహిత్యానికి, తోటి కవులకు నాకున్నంతలో నాకు చేతనైనంత ఏమైనా చెయ్యాలి. ఎవరికోసమోఎదురుచూడ కూడదు. ఎవరినుండి ఏమీ ఆశించ కూడదు.
ఇదీ నా ఆశయం. నా సంకల్పంతోనే మా పురస్కారం నడుస్తోంది.
ఈ నిబద్ధత దాటి వెళ్ళను. భవిష్యత్తులో అనుకోని విపత్కరస్థితిలో మా అవార్డు ఆగిపోయినా సరే. పురస్కారాల్లో ఒక చరిత్ర గానిల్చిపోవాలి.
8. మీ సాహితీ కుటుంబం చాలా పెద్దది కదా మీకు ఇంత మంది ఆత్మీయులతో అనుబంధం ఎట్లా ఏర్పడింది.?
మా పురస్కారం పొందిన ప్రతి కవినీ కవయిత్రిని మా కుటుంబ సభ్యులుగా, మా ఆడపడుచులుగా మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం.మొదట మేమిద్దరం, మాకు ముగ్గురు,ఇదీ మాకుటుంబం. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల సంఖ్య మా అవార్డు గ్రహీతల తో కలిసి 5+33=38 మంది అయ్యారు అంతేకాదు ప్రతి ఏటా మా సభ్యుడు ఒకరు పెరుగుతూనే ఉంటారు వారికి మా గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి ఇది ఇది మా దంపతులం చేసుకున్నా నిర్ణయం ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది.ఎందుకంటే అవార్డు ఇచ్చి వదిలేయం, వారిని మర్చిపోలేం, వారితో మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. రోజూ కనీసం ఒకరిద్దరైనా మాతో మాట్లాడుతూనే ఉంటారు. వారి ఆనందాలే కాదు కష్టాలూ, కన్నీళ్లూ మాతో
పంచుకుంటూనే ఉంటారు. ఓ సినీ కవి అన్నట్లు జగమంత కుటుంబం మాది. కవి లోక కుటుంబం మాది. వారూ అలాగే మమ్మల్ని గౌరవిస్తున్నారు,మేమూ వారిని అంతే ప్రేమిస్తున్నాం.
9. అవార్డు ప్రక్రియ కు సంబంధించి ఇటీవల 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా మార్చారు కదా ఆ క్రమం గురించి చెప్పండి?
సత్యాదేవి నా భాగ స్వామిని.నేను నిరుద్యోగిగా పేదరికం అనుభవిస్తున్న కాలం లోనే తాను 1979 లో నా భార్యగా నాతో జీవితాన్ని పంచుకొంది. మా ఇంటి నాల్గవ కోడలిగా"ఉమ్మడిశెట్టి సత్యాదేవి" మారింది.
తాను హైస్కూల్ విద్య వరకే చదువుకుంది. సాహిత్యం పట్ల అవగాహన లేదు. కవిత్వమంటే తెలియదు. అప్పటికే యువకవిగా గుర్తింపు తెచ్చుకున్న నన్ను భర్తగా ప్రేమించినట్లే నా కవిత్వాన్నీ అంతగానే ప్రేమించింది.
నా నిరుద్యోగానికి దిగులు పడలేదు. మరో మూడేళ్ళ తర్వాత అంటే 1982 లో నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగ మొచ్చింది. దిగువ మధ్యతరగతి ఇల్లాలి గా నాతో పాటు పల్లె కాపురం చేసింది.
“1988 లో కవిత్వానికి మన కుటుంబం పక్షాన ఒక అవార్డు స్థాపించి ప్రతియేటా ఒక కవిని సత్కరించుకుందాం. నా భార్యగా నీ అనుమతి కావాలి ఇస్తావా?” అన్నప్పుడు మారు మాట్లాడకుండా సంతోషంగా అంగీకరించింది.
అంతే కాదు, సంసారంలో పొదుపు చేసుకొంటూనే తీరిక సమయంలో మిషన్ కుట్టి కూడా ఆర్థికంగా అవార్డు కోసం శ్రమపడింది. కవులకు ఆతిధ్యం ఇచ్చి నాకు తోడ్పడింది.
అంతే కాదు, నాకు 58 ఏళ్ళు వచ్చేసరికి అవార్డుకు 25 ఏళ్ళు వచ్చాయి. మా బతుకులోకి కష్టాలూ, కన్నీళ్లూ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, బాధ్యతల మధ్య తాను అనారోగ్యంతో ఎదురీదుతూనే నాకు సంపూర్ణంగా సహకారం అందిస్తూ వచ్చింది.
జీతంతో పాతి కేళ్లుగా అవార్డు నడిచింది. ఇకపై పెన్షనే మాకు ఏకైక ఆధారం. తనిప్పుడు కష్టపడ లేదు. అవార్డు రజతోత్సవసభ బాగా నిర్వహించాము. అదే ముగింపు సభ గా భావించి అవార్డు విరమణను ప్రకటించాను. ఊహించని విధంగా తాను సభ ముందుకొచ్చి,నా చేతిలోని మైకు అందుకొని, మా ఆయన చెప్పినట్లు మా కష్టాలెన్ని ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా మా అవార్డును ఇంకా కొంతకాలం కొన సాగిస్తామని నేను ప్రకటిస్తున్నాను.
మా ఆయన ఆనందమే నాకు కావాలి. ఆయనకు సహకరిస్తాను అని సభా ముఖంగా ప్రకటించడం సభ మొత్తాన్ని ఆశ్చర్యంతో, ఆనందంతోముంచెత్తింది.
ఒక సామాన్య ఇల్లాలిగా భర్త ఆశయం తన భర్తకోసం ఇంతగా పరితపించి, త్యాగం చెయ్యడం ముఖ్యంగా మధ్య తరగతి గృహిణుల్లోమనకు కనిపించరు.
ఈమెను నా అదృష్టదేవత గా భావిస్తున్నాను.
అలా మరో ఐదేళ్లు కొనసాగిన మా అవార్డుకు 30 ఏళ్ళునిండాయి..ఈ మధ్యకాలం లో మా శ్రీమతి బెంగుళూరు లో రోడ్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి గెలిచింది. కానీ ఆమె మెమరీ మీద తీవ్ర ప్రభావం చూపింది.
మా చెన్నైలో మా బాబు దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. నేనేమో అనంతపురం లో మా అమ్మాయి దగ్గర ఉండిపోయాను. ఇంతలోనే అవార్డు 30 ఏళ్ల సభ రానే వచ్చింది.
ఏం చేయాలిప్పుడు? ముందుగా అనుకున్న ప్రకారం 30 మంది అవార్డు గ్రహీతల్ని ఆహ్వానించి ఒక రోజంతా ఉత్సవాలు నిర్వహించి అంతటితో ముగిద్దామని నిర్ణయించుకన్నాం. అందర్నీ పిలిచి ఒక రోజంతా జరపడానికి మా దగ్గర ఆర్థిక వనరులు లేవు.ఇంతకాలం ఒంటి చేత్తో నిర్వహిస్తూ వచ్చాము. ఇంత భారీగా ముగింపు పల్కడం నాకు నచ్చలేదు.
ఏదో 30వ అవార్డు ప్రదానం చేసి, ముగింపు పలకాలని నేనంటే తను ఒప్పుకోలేదు. మన బిడ్డకు పెళ్లి చేశామనుకొని ఈ సారి చేద్ధాం.
మీరు రిటైర్ అయ్యాక కొంత అమౌంట్ బ్యాంక్ లో ఉందికదా. అందులో తీసి ఖర్చుపెట్టండి. ఈ సారికి నాకోసం పెట్టండి. ఇంక మనేద్దాం అనే సరికి నాకు మతి పోయింది.
“ఇదేమిటి సత్యా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం .ఈ స్థితిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటే ..ఎలా?” అన్నాను.
“ఏం పర్వాలేదు. మీరింకేం ఆలోచించవద్దు నా కోసం చెయ్యండి..”అంది
త్యాగానికైనా ఒక హద్దంటూ ఉండాలి. తనకు మాలిన ధర్మం..సామెతయ్యింది. నాకు లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం భయం భయంగానే ఏర్పాట్లు ప్రారంభించాను.
ఆ రోజు రానే వచ్చింది. సభలు ఉదయం నుండి రాత్రి వరకూ ఏకధాటిగా కొనసాగాయి. మధ్యలో లంచ్ బ్రేక్ తో.
ప్రారంభోత్సవ సభలో తాను ప్రసంగిస్తూ అవార్డు గ్రహీతలనందరిని మా కుటుంబ సభ్యులు గా సంభోదిస్తూ ఆనందంతో భోరున ఏడ్చింది. మొత్తం సభ అంతా కంటతడి పెట్టించింది.
“ఇంకమేం చేయ్యలేము, మమ్మల్ని క్షమించండి” అంది. ఆయన శిష్యులు ముగ్గురూ పూనుకుంటే మా అవార్డు కొనసాగుతుందని మరోవైపు ఆశాభావాన్ని ప్రకటించింది.
ఆ రోజు అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. ఇంత గొప్ప త్యాగమూర్తిని భార్యగా పొందడం నిజంగా మన రాధేయ అదృష్టం అన్నారు.
అలా సభలు ఎంతోవైభవంగా, ఉత్సాహంగా జరిగిపోయాయి. మరో మూడు నెలలకు హార్ట్ అటాక్ తో తాను నాజీవితంచీ నిష్క్రమించింది. నన్ను ఒంటరిగా మిగిల్చింది.
39 ఏళ్ళు నన్నూ, నా కవిత్వాన్నీ,మా అవార్డును నడిపించి వెళ్లిపోయిన నా సహచరికి నేనేమివ్వగలను మీరే చెప్పండి? నన్ను నడిపిన నా సహచరి ఇకపైన తానే ఓ చరిత్రగా మిగలాలి.
అందుకే...31వ సభ నుంచీ మా అవార్డు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా తన స్మృతిలో కొనసాగిస్తున్నాను.
ఈ పేరు వెనుక ఇంతటి చరిత్ర ఉంది.
30 ఏళ్ల కవితోత్సవం నిర్వహించాక భవిష్యత్ లో ఈ అవార్డు ఒక ట్రస్ట్ కింద కొన సాగాలని నేను మా శ్రీమతి మరియు కుటుంబ సభ్యులు, మా శిష్యులు డా.పెళ్ళూరు సునీల్, సుంకర గోపాలయ్య, దోర్నాదుల సిద్దార్థ లతో కలిసి "ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్"( రి.నెం.23/2018) పేరుతో రిజిస్ట్రేషన్ చేశాము.
10. సాహిత్య జీవితంలో మీరు బాగా సంతృప్తికి లోనైన సందర్భం గురించి చెప్పండి?
ప్రతియేటా అవార్డు పేరుతో మేము ప్రమోట్ చేస్తున్న కవులంతాఈనాటి సమాజ ఈ పరిణామానికి ప్రతీకలు గా నిలిచి కవిత్వం రాస్తున్నారు ఈ కవులంతా ప్రజా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నారని పిస్తుంది.
మీరు ఒక్కసారి మా అవార్డు విజేతల లిస్టును పరిశీలించి చూడండి ఈనాడు బాగా కవిత్వం రాస్తూ సాహిత్యంలో గుర్తింపు పొందిన వారంతా ఒకనాటి మా అవార్డు గ్రహీతలు నని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.
వీరంతా మొదటి ప్రయత్నంలోనూ లేదా రెండో ప్రయత్నంలోనూ ప్రయత్నించి మా అవార్డులు పొందిన వారే. వీరి పట్ల నాకెంతో సంతృప్తిగా ఉందని తెలియజేస్తున్నాను.
అందరి పేర్లుఇక్కడ ఉటంకించ లేను గానీ, పాపినేని శివశంకర్ గారైతే నేమి, అఫ్సర్ గారైతే నేమి, నాళేశ్వరంశంకరం గారైతే నేమి, శిఖామణి గారైతే నేమి,దర్భశయనం గారైతే నేమి, కొండేపూడి నిర్మల గారైతే నేమి, ఇలా పేర్లు చెప్పుకుంటూపోతే చాలాపెద్ద లిస్టే ఉంది.
11. మిమ్ములను విచారానికి గురి చేసిన సాహిత్య సందర్భాల గురించి చెప్పండి?
నేను నా కవిత్వం పట్ల, మా అవార్డు పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నానో అంతే అసంతృప్తికి, విచారానికి గురి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే నాకు మిత్రుల సంఖ్య కంటే అనుకూల శత్రువుల, అసూయాపరుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది.
చాలా మంది కవులు పైకి బాగా సాఫ్ట్ గా,కనిపిస్తారు గానీ వాళ్ళ అంతర్ముఖాలు భిన్నంగా ఉంటాయి. నేనెంత నిష్పాక్షి కంగా, నిబద్ధతతో వ్యవహరిస్తున్నా ,నాలో,న్యాయనిర్ణేతల్లో లోపాలు ఆరా తీస్తూనే ఉంటారు.
ఎన్ని సార్లు పాల్గొన్నా మా అవార్డు వారికి రాలేదన్న అసంతృప్తిని ఏదో విధంగా పరోక్షంగా వ్యక్తం చేస్తూ ఉంటారు.
నేను వారి పేర్లను ప్రస్తావించను గానీ నన్ను బాగా వేదనకు గురిచేసిన వ్యక్తులు, సందర్భాలు చాలా ఉన్నాయి.పైకి చెప్పుకోలేను. ఎవరి సంస్కారం వారిది అని సమాధాన పడుతుంటాను.
నేను సీనియర్ కవిని కదా దాదాపు పదేళ్లుగా మీ అవార్డుకు నా పుస్తకాలు పంపిస్తున్నా మీరు నా వైపు చూడడం లేదు? ఎందుకు?
నా మీద ప్రేమ కలగాలంటే నేనేం చేయాలి? మీకు తెలంగాణ కవులు అంటేనే ఇష్టం, రాయలసీమ కవులను ఎందుకు పట్టించుకోరు? ఎందుకు? మీకు ప్రాంతీయ అభిమానం లేదా? మన సీమలో మంచి కవిత్వం లేదా? ఇలా అనేక విమర్శలు నన్ను చుట్టు ముడుతూ ఉంటాయి.
అప్పుడు నాకు బాగా నిరాశ కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఎందుకు ఈ పురస్కారం పెట్టాను? మంచి మిత్రులంతా అనుకూల శత్రువులు గా మారిపోతున్నారు
ఈ విశ్రాంత జీవితం లో అన్నీ వదిలేసి హాయిగా కవిత్వం రాసుకుంటూ ఉంటే చాలు, ఎందుకు ఈ పురస్కారం పెట్టాను? అని చాలాసార్లు మథన పడ్డాను.
నా జీవితంలో సగ భాగం ఈ అవార్డు నిర్వహణ తోనే సరిపోయింది. మానసికంగా, ఆర్థికంగా, కూడా నేను చాలా నష్టపోయాను.
అవార్డు అందరూ ఆశిస్తారు కానీ నేను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తాను కదా.
అవార్డు విజేతలను ప్రకటించిన ప్రతిసారీ కనీసం నాకు కనీసం పది మంది శత్రువులను పెరుగుతూ ఉంటారు.
అయితే కాంప్రమైజ్ కావడానికి నాలోని అంతరాత్మ అంగీకరించదు. నిందలైనా భరిస్తాను గానీ రాజీ పడలేను.
ఆర్థికంగా, శారీరకంగా అలసిపోయినప్పుడు అవార్డు నైనా ఆపేస్తాను గానీ కవిత్వ విలువలకు
అపఖ్యాతి రానివ్వను.
ఈ శత్రు బాధను భరించలేక 25 ఏళ్లకు విరమణ ప్రకటించాను. మా శ్రీమతి మరో ఐదేళ్లు చేద్దాం అంది. 30 ఏళ్ళు సభలోనే విరమణ ప్రకటించాను. కానీ తాను హఠాత్తుగా నా జీవితంలోంచీ నిష్క్రమించడంతో ఆమె స్మృతిలో కొనసాగిస్తూన్నాను.
మరి ఇలా ఎంతకాలం, నిర్వహించగలనో ఏమో? మున్ముందు అవార్డే తన భవిష్యత్తును తానే నిర్ణయించుకొంటుంది. అయితే ఈ అవార్డు ద్వారా నేను పొందిన గౌరవం అటుంచితే..
పొందిన అవమానాలు,నిరసనలు, కూడా ఎక్కువే..
35 ఏళ్లపాటు అధ్యాపక రంగంలో ఉండి గురువుగా పాఠాలు చెప్పి విద్యార్థుల్లో సాహిత్య స్ఫూర్తి నింపినా, ఏనాడూ ప్రభుత్వ మెప్పు పొందలేని శుద్ధ సాహిత్య జీవిని నేను.
కవిగా ,విమర్శకుడి గా విలువైన పదహారు పుస్తకాలు రాసిన కనీసం తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుకు నోచుకోలేక పోయిన కవిత్వ ప్రేమికుణ్ణి. అందుకు బాధలేదు జాలి తప్ప.
అన్ని గుర్తింపుల వెనుకా రాజకీయమే పనిచేస్తుంది. ఒక్క "ఉమ్మడిశెట్టి" మాత్రమే నూటికి నూట యాభై పాళ్లు ప్రతిభను గుర్తిస్తుంది, గెలిపిస్తుంది, విజేతగా ప్రకటిస్తుంది..
12. కవిత్వ రచనలో యువకవుల ప్రభావం ఎంతవరకు ఉంది? కొత్తగా రాస్తున్న వాళ్ళలో మహిళల పాత్ర ఎంత వరకు ఉంది?
వర్తమాన తరం లో నలభై శాతం మంది యువకవులు అద్భుతంగా కవిత్వం రాస్తున్నారని మాత్రం చెప్పగలను. అభివ్యక్తిలో కొత్త కొత్త కోణాల్ని దర్శింప జేస్తున్నారు.
అరవై శాతం మంది గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు. పూను స్పర్థలు విద్యలందే వైరములు వాణిజ్య మందే.. అన్నాడు కదా గురజాడ. అది మర్చి పోయారు ఈ యువకవులు.
వీరికి తక్షణ గుర్తింపుకావాలి. సీనియర్ల కవిత్వం చదివరు. కొత్త కోణాల్ని పట్టుకోలేరు. పైగా చాలా సంస్థలు
వీరికి బాగా ఆశలు కల్పించి ఉదారంగా బిరుదులు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలతో ముంచేస్తున్నారు.
చాలామంది ఒక పుస్తకం కూడా రాయక ముందే శ్రీ శ్రీ లు, గురజాడలు, గిడుగులు అయ్యారు. వీరిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది .
మీరు ఎప్పుడూ గుర్తింపు కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.పైగాఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కొంతమంది ఒకటి, రెండు పుస్తకాలు వేస్తూనే పేరుకు ముందు డాక్ట"రేట్లు"తగిలించుకుని ప్రచారం పొందడం చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది. యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పరిశోధనలు పి,హెచ్,.డి లు చేసినవారుకూడా ఇంత గుర్తింపు కోరుకోరు.
ఒకవేళ నాలాంటి వారు ఎవరైనా యువకవుల కవిత్వం పట్ల ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని సహృదయంతో స్వీకరించ లేరు. పైగా నేనేమో అసూయతో కామెంట్ చేస్తున్నానని, యువకుల్ని ప్రోత్సహించడం మాని నిరుత్సాహ పరుస్తున్నానని బాధ పడిపోతుంటారు.
నా దృష్టిలో కవిత్వం ఇంకా మార్కెట్ కాలేదని నేను నమ్ముతున్నాను కానీ వీరివల్ల ముందు ముందు ఆ ప్రమాదం ఏర్పడుతుందేమో నని నా బాధ.
నిజం చెప్పనా.. మా అవార్డు పొందినవారిలో తొంభై శాతం మంది యువకవులేనని వీరికి తెలియదు కాబోలు.
నాకు యువతరం పట్ల పెద్ద ఆశలున్నాయ్. గొప్పగా రాస్తున్న కవులను చూసి ఎంతగానో గర్వపడు తుంటాను.
శ్రీ శ్రీ అన్నట్లు..
రావోయ్ యువకవీ
సైక్లోన్ లేదా వస్తావో
సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా వస్తావో
రావోయ్ యువకవీ...
నా దృష్టిలో...
ప్రతిభావంతులైన యువతరం
భవిష్యత్తరానికి గొప్ప వాగ్ధానం
యువతరం మహిళా రచయిత్రులు కూడా మంచి థీమ్ ,సరి కొత్త అభివ్యక్తి తో ముందుకొస్తున్నారు
మహిళలు స్త్రీ వాదాన్నే రాయాలి,అనే లక్ష్మణ రేఖ గీసు కోకుండా వినూత్న శైలిని అందిపుచ్చుకుని కవిత్వం రాస్తున్నారు,కథలు రాస్తున్నారు. అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటు న్నారు, నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.
13. విద్యార్యులు కవిత్వం లో చేరువ కావాలంటే వారు ఏం చెయాలి?
వారికంటే ముందు వారికి తరగతి గది లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారిలో ముందుగా సాహిత్యంపట్ల అభిరుచి కల్గించాలి. సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహన కల్గించాలి.ఆపైన వారికి కొన్ని కవితా, కథల వస్తువుల నిచ్చి వారిలోని సృజననాత్మకను ప్రోత్సహించి సరిదిద్దాలి.
ఈ పని ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్న కవులు రచయితలు పూనుకోవాలి.పాఠ్యపుస్తకాంశాలతో
పాటు కవితలు,కథలు గురించి రచయితల గురించీ పరిచయం చేస్తూ వారిలో రచనాసక్తిని కలిగించాలి.
నా వరకు నేనెక్కడ పనిచేసినా అక్కడ కవులను తయారు చేశాను.వారు ఆగిపోలేదు.ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. వారిలో చాలా మంది తెలుగు పండితులు గా, అధ్యా పకులుగా కొనసాగుతున్నారు.ఈ భాధ్యతను ముఖ్యంగా మన రచయితలు తలకెత్తు కోవాలి.
14. కవిగా,సాహిత్య విమర్శకుడిగా,అవార్డు స్థాపకుడిగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
నాకు గొప్ప గొప్ప ప్రణాళికలు ఆశయాలు ఏముంటాయి చెప్పండి? పేదరికం తో మొదలైన జీవితం నాది సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితం గడుపుకుంటూ, కవిత్వం రాసుకుంటూ, పుస్తకాలు వేసుకుంటూ, ఉన్నంతలోనే ,నా శ్రీమతి తోడ్పాటుతో కవిత్వం కోసమే ఒక అవార్డును స్థాపించు కొని ఏ ఆటంకం లేకుండా గత 32 ఏళ్ల పైబడి నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పుడేమో కేవలం పెన్షన్ తో జీవితాన్ని గడుపుతున్నాను.
నా కంటూ ప్రత్యేకమైన ఆర్థిక వనరులు ఏమీ లేవు ఉన్నంతలో ఏదో కవిత్వం రాసుకుంటూ ఈ అవార్డును కొనసాగిస్తాను.ఇలా ఒంటరిగా ఎంతకాలం కొనసాగించగలనో భవిష్యత్కాలమే నిర్ణయించాలి.
ఈ అవార్డు ద్వారా భవిష్యత్ తరానికి గొప్ప కవులను పరిచయం చేశానన్న సంతృపి నాకు చాలనుకుంటున్నాను.
ఒక కవిగా గుర్తింపు ఉంది.విమర్శకుడి గా కొంత పేరుంది. తెలుగు కవులకు "ఉమ్మడిశెట్టి" ఒక ప్రతిష్టాత్మక పురస్కా రం గా గొప్ప పేరుంది.ఇది కొనసాగినంత కాలం నా నిజాయితీ లో, నిబద్ధతలో
లోటు రానివ్వను.
15. ఇంకేమైనా చెప్పండి?
రచయితలకు గానీ,రచయితల్ని గుర్తించే సంస్థలకు గానీ, నిజాయితీ,నిబద్ధత, వ్యక్తిత్వ సంస్కారం అనివార్యం గా ఉండాలి.
ఈ నాడు తెలుగు నాట వందల సంఖ్యలో అవార్డులు,పురస్కారాలు, సంస్థలు ఉన్నాయి. తమ గుర్తింపు కోసంకాకుండా సాహిత్య లోకంలో గుర్తింపును పొందాలి. పారదర్శకంగా ఉండాలి. చాలా సంస్థలు ..ఇచ్చి పుచ్చుకోవడం లోనూ, రాజకీయ నేతల అభిమానం కోసమో,పనిచేస్తూ,ప్రచారంలో ముందుంటాయి.
ఇస్తి నమ్మా వాయినం...పుచ్చుకుంటి నమ్మా వాయినం.. అన్నతీరుగా ఉంటాయి...ఈ తీరు మారాలి. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా స్వతంత్రంగా, జవాబుదారీగా నడుచుకోవాలి.
ఈ పురస్కారం, ఈ గౌరవం, స్థాపన, నిర్వహణ అంతా వన్ మ్యాన్ ఆర్మీగా భావించినా నాకు అభ్యంతరం లేదు. చాలా మంది పెద్దలు, సాహితీ వేత్తలు ఈ సంస్థలో గౌరవ సభ్యులుగా ఉంటామని, అవార్డు బహుమతి మొత్తాన్ని పెంచేందుకు ఆర్థికంగా సపోర్టు ఇస్తామని , అందుకు అనుమతించమని కోరారు..నేను వారి అభ్యర్థనను సున్నితంగానే తిరస్కరించాను. ఒక కవి కుటుంబం మరొక కవిని గుర్తించి గౌరవించే సంస్థ ఇది. నిబద్ధత,నిజాయితీ, అంకిత భావంతో ఈ సంస్థ కోసాగుతుంది అని ధీమాగా ప్రకటిస్తున్నాను.
{రాధేయ జీవన రేఖలు:
డా.ఉమ్మడిశెట్టి రాధేయ .కవి,విమర్శకులు
01.05.1955 న కడపజిల్లా ముద్దనూరు
మండలం లోని యామవరం గ్రామంలో
ఒక సామాన్య దిగువ మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించారు.
వీరి తల్లి దండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి, శ్రీమతి నాగమ్మ.
తల్లి దండ్రులు ఇరువురూ చేనేతకార్మికులు.
వీరు ఐదు మంది అన్నదమ్ములు,ఇద్దరు చెల్లెండ్రు. అన్నదమ్ముల్లో ఈయన నాలుగవ వారు.
వీరికి బాల్యం నుంచే ప్రకృతి పట్ల,తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ.వాళ్ళ ఊరు కూడా చుట్టూ కొండ కోనల మధ్య ప్రకృతి రమణీయంగా కన్పిస్తూ ఉండేది.
బాల్యంలో 4వ తరగతి లోనే మాస్టారు చెప్పిన పోతన పద్యాలను మరుసటిరోజే
చక్కటి వాక్శుద్ధితో అప్పజెప్పి శహబాష్ అనిపించుకున్నారు.
హైస్కూల్ స్థాయిలోనే ప్రకృతి గీతాలు,ప్రణయ గీతాలు,అనుభూతి గీతాలు రాసుకునే వారు.
1972 లో అభ్యుదయ భావాలతో రాసిన తొలి కవిత అచ్చయింది.
1978 లో తొలి కవితా సంపుటి మరోప్రపంచం కోసం కవితా సంపుటిని
తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ఉనికిని చాటుకున్నారు. అప్పటికే ఆంధ్రదేశంలో సుప్రసిద్దులైన కవులచేత ప్రశంసలు పొందారు.
ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల యూనివర్సిటీ చేరి చదువుకోలేక పోయారు.
1982 లో ఉపాధ్యాయ వృత్తి లో చేరిన తర్వాత స్వయం కృషి తో తెలుగు లో ఎం.ఏ., పి,హెచ్,డి చేశారు.
ఉపాధ్యాయుని గా,జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీకళాశాల తెలుగు అధ్యాపకునిగా,
తెలుగు శాఖాధిపతిగా తెలుగు భాషకు సేవలందించి 2013 లో పదవీవిరమణ చేశారు.ప్రస్తుతం ఆనంతపురం లో స్థిర పడ్డారు.
1988 లో తన ఇంటిపేరు మీద ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ను స్థాపించి గత 33 ఏళ్లుగా,ప్రతి ఏటా క్రమం తప్పకుండా,నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.
ఈ అవార్డు తెలుగు కవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.ఈ అవార్డు
రావాలని ప్రతి తెలుగు కవి కోరుకుంటాడు.
కవిత్వం రాయడం,కవిత్వం చదవడం,
కవులను గౌరవించడం వీరు తన ఆశయం పెట్టుకున్నారు. }
ఇవాళ ఒక "కొత్త వేకువ"ను చూశాను, ఉలిక్కి పడ్డాను. కంపించాను, కలవరపడ్డాను...
కలలు లేవు, గుస గుస లాడే ఊహలు లేవు, పలవరించే అనుభూతులు లేవు
ఒక నిలువెత్తు దుఃఖపు జీర,ఎదురుపడినట్లు, ఉల్లిపొరలాంటి వేదన వెంటాడు తున్నట్లుగా కల్లోల మేఘం ఉరుముతున్నట్లయింది.
"పక్కనున్న పసివాడి రోదన
రోదసి నంటుతూ
నన్ను నిట్టనిలువునా చీల్చేస్తుంటే
అవేవీ పట్టని నువ్వు
నా మైదానం పై
నీకు నచ్చినట్టు సంచరిస్తావు
నీ ఎముకలుకొరికే చలిని
వెచ్చబరచుకునే కుంపటిని నేను
నీ సలసల మరిగే అగ్ని గుండాలను చల్లార్చుకునే సరస్సును నేను
నాలో ఎన్ని సునామీలు
ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా చూశావా
నీకు నా దేహమొక క్రీడాస్థలం ఎప్పుడుపడితే అప్పుడు
నా ప్రమేయం ఏమీ లేకుండానేఅడుకొని
నువ్వు మాత్రమే గెలిచి
విజయగర్వంతో
నీ నుదుటన మెరిసే
చెమట చుక్కలను తుడుచుకుంటూ
తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు
నేను నా విరిగిపడిన ముక్కలను
ఏరుకుంటూ
నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను
పోగు చేసుకుంటూ
రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను
నువ్వు మాత్రం
నన్నొక అలను చేసి
ఆనందాలనావ పై విహరిస్తూ
నీ నీలి కలలను
సిగ్గులేకుండా సాకారం చేసుకుంటూనే ఉంటావు"
(కవిత..నీలికలలు పుట..43)
ఎవరిదీ నిర్భయ గళం?
ఎవరిదీ నిర్నిద్ర వేదనా స్వరం?
ఏ సగటు ఇల్లాలి పక్షాన ఈ ఆక్రోశం?
ఈ కవితాస్వరమే.. పద్మావతి రాంభక్తగారిది.
పోయినేడాది మా శిష్యత్రయం ఫోన్ చేసి మన 'రాధేయ దశాబ్ది కవితాపురస్కారానికి' ముగ్గురి కవితల్ని ఎంపిక చేశాం సర్,వారే అనిల్ డ్యానీ,పద్మావతి రాంభక్త,అఖిలాశ,. ఇందులోని పద్మావతే ..ఇవాళ నేను ప్రస్తావిస్తున్ననీలికలల కవయిత్రి.
కవితా విజేతలు ముగ్గురి కవితలు తెప్పించుకుని చదివాను.మంచి నిర్ణయమనిపించి ముగ్గుర్నీ ఫోన్ లో అభినందించాను.
తరతరాలుగా పితృస్వామ్య నీడలో పురుషాధిపత్య భావజాలం లో నలిగిపోతూ,రాజీపడుతూ,సర్దుకుపోయే
సగటు ఇల్లాలికి ఈ నీలికలలు కవితరాయడానికి ధైర్యమే కాదు తెగువ కూడా కావాలి.ఆ నిర్భయ,నిర్నిద్ర ,ధైర్య
స్వరం.. పద్మావతి రాంభక్త ది కావడం నాకు ఆశ్చర్యమనిపించినా,ఈ ధిక్కార స్వరాన్ని స్వాగతిస్తూ,మనసారా అభినందిస్తున్నాను.
అందుకే ఇవాళ ఒక కొత్త వేకువను,కొత్త చూపుతో ఒక కొత్త కవిత్వోదయం గా స్త్రీ కోణం లోంచీ దర్శిస్తున్నాను. కవయిత్రికి ఈ కొత్త చూపునిచ్చిన వారు - కొండేపూడి నిర్మల"లేబర్ రూమ్" కావచ్చు, విమల"వంటిల్లు" కావచ్చు,
మందరపు'సర్పపరిష్వంగం"కావచ్చు, పాటిబండ్ల రజని "అబార్షన్ స్టేట్మెంట్' కావచ్చు, జయప్రభ "పైటను తగిలెయ్యాలి" కావచ్చు..ఇలా ఒకరి స్ఫూర్తి మరొకరికి ఆచరణ కాగలిగి నప్పుడే కవుల, భవిష్యత్ స్వప్నం సాకార మవుతుంది.
దాంపత్య బంధం అమలిన శృంగారం లో దగ్గరౌతుంది.ఆత్మీయ స్పర్శ కావాలి
"నీ స్పర్శ నన్ను సేద తీర్చాలి
నువ్వు నన్ను తాకగానే
నా మనసు గాలిలో దూదిపింజలా తేలిపోవాలి
స్పర్శ అంటే.చర్మంపై తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు చీదరించేలా కాకుండా లోలోతుల్లోకి చొచ్చుకొనిపోయి హృదయవీణ సుతారంగా మీటాలి బ్రతుకు పోరు లోని బడలిక తగ్గిస్తూ అమలిన ప్రేమకు అద్భుత భాష్యం చెప్పాలి"
(పుట..33)
పసుపు తాడుతో జీవన బంధంపరిమళాన్ని అందించకపోతే,ఎన్నాళ్ళని
ఆశగా ఎదురు చూస్తుందిఏఇల్లాలైనా. తన బ్రతుకు మడిపై ఒక్క చినుకు పలకరింపు కైనా నోచుకోకపోతే ఆమె అతడికి శాశ్వతంగా దూరమై ఆమె ఒక అర్థం కాని కావ్యం లాగే మిగిలి పోతుందంటారు కవయిత్రి.
"ప్రతిరోజూ అతడి ముని వేళ్ళు
ఆమెపై గొంగళి లా పాకుతూ
చర్మలిపిని చదివి
లోపలి తడిని ఒక్కసారైనా తాక లేకపోయాయి
అతడి కనులలో
కాస్తంత కాంతిపుంజానికై
ఆమె ఆత్రంగా వెతికింది"
(పుట..36)
జీవితంలో ఏబాధాసందర్భం కళ్లబడినా నేను కన్నీటి కుండ నై నిలువెల్లా వణికి పోతానంటోంది కవయిత్రి.అమ్మప్రేమగా ఆర్ధ్రంగా తలుచుకుంటుంది .
" ప్రతీ సాయంత్రం
చిమ్నీ మసినంతా తన అందమైన చేతులతో తుడిచేసి
ఇంట్లోనే ఏదో ఒక చంద్రుడిని వెలిగించేది మా అమ్మ
వెన్నెలనంతా ముద్దచేసి నాకు ప్రేమగాగోరుముద్దలు తినిపించేది"
పుట..39
ఒక వర్షం కురిసిన రాత్రిలో తన హృదయాన్ని తడుపుకుంటూ కలలు గంటుంది.ఒక సారైనా జ్వరమొస్తే బాగుండుననీ భావిస్తుంది.
"ఒకసారి జ్వరం వస్తే బాగుండును ఆకాశంలోంచి అమ్మ నడిచొచ్చి
తన చల్లని స్పర్శతో నా ఒళ్ళంతానిమిరితేబాగుండును
పనికి సెలవు పెట్టి మరీ శ్రీవారు
కళ్లలో ఒత్తులేసుకుని
నాకు సపర్యలు చేస్తే బాగుండును"
(పుట..52)
అమ్మకోసం, అమ్మలాంటి ప్రేమకోసం తపన పడ్తుంది కవయిత్రి.అతివల దేహాల ఒంపుసొంపుల్ని మాత్రమే చూడగలిగే పురుష పుంగవులకు తీవ్రంగా వార్నింగ్ ఇస్తోంది.
'ఇకమీదట
మీ నుండి వెలువడే
మా బాడీ షేమింగుల దుర్గంధ పూరితమైన వ్యాఖ్యలకు
చరమగీతం పాడేలా
మరోమారు చెవిన బడితే
మీ నాలుకలను తెగ్గోసికాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం జాగ్రత్త,
(పుట..63)
ప్రతి ఇంట్లో కన్నీటికొలన్లు ఉంటాయని, వాటిని దర్శించాలంటే మనమనసులకు కళ్ళుండాలి.అద్దె ఇల్లు లాంటి గర్భాన్ని మోస్తున్న సర్గసీ మదర్ ను మరో కుంతి తో పోలుస్తుంది.
"తన రక్తమాంసాలతో అభిషేకిస్తున్న పిండానికి అమ్మ కాని అమ్మ గా మారి నవమాసాలూమోస్తుందామె
మరో కుంతి కాకపోయినా ముఖమైనా చూడని పసి జీవాన్ని హృదయాన్ని చిక్కబట్టుకుని పరాయి చేతులలో పెట్టేస్తున్న ఇంతి ఆమె
తనను తానే క్షమించుకోలేక అంతులేనిబాధను మోస్తూ బతుకు కీడుస్తుంది"
(పుట..67)
మరోచోట గాయాల కథను వినిపిస్తుంది.
బెస్తవాళ్లను గురించి రాస్తూ..వారు నిత్యంసముద్రపు పొత్తిళ్లలో జన్మించి, పోరులో కెరటాల కత్తులతో యుద్ధం చేసేవారుగా వర్ణిస్తుంది.
నీకూ నాకూ మధ్య మొలిచిన నిలువెత్తు గోడను ధ్వంసం చేసి సమస్త మురికినీ, మాలిన్యాలనూ కడిగేసుకొని మనసారా కౌగలించుకొందాం రమ్మని సహచరుని కోరుతుంది. కన్నీటి ఉప్పదనాన్ని ఒక్కసారైనారుచిచూడకుండా బతుకు నదిని దాటడం సాధ్య మవుతుందా నీకైనా,నాకైనా,నా మనసేమైనా గొర్రెపిల్లా? గుంజకు కట్టేస్తే పారి పోకుండా ఉండడానికి ? అనిసూటిగా ప్రశ్నిస్తుంది
రంగువెలిసిన నేత కార్మికుల దైన్య జీవితాలను అక్షర బద్దం చేస్తుంది. ఆకలిని ఆత్రంగా వెతుక్కుంటూ రోజంతా నిలబడి,నిలబడి తన బతుకులోకి ఆశగా తొంగి చూసుకొంటున్న సేల్స్ గర్ల్స్ ను పరామర్శిస్తుంది.
మాతృత్వపు అదృష్టం కోసం ,కొత్తజన్మ కోసం నరాలు చిట్లే నరక యాతనను భరించే స్త్రీ మూర్తిని ప్రశంసిస్తుంది. కొండేపూడి నిర్మల గారి లేబర్ రూమ్ ను తలపించే వేదన ఈ కవిత.
"కత్తుల నదిపై పయనించి
కన్నీళ్ళ నదిని ఈదుతూ
నరాలు చిట్లేయాతనను ఓర్వక తప్పదు
కొన్ని నిమిషాలలో సునాయాసంగానో ఎన్నో గంటల పోరాటంతోనో, యమలోకపు ద్వారాన్ని తాకినంత పనై, వెనుదిరిగాకో
కోరుకున్నంత కొండంత ఫలం
నీ ఒడిలో చేరొచ్చు
మాతృత్వపు కిరీటాన్ని ధరించి అమ్మగా పువ్వులాంటిపాపాయిని చూసి మురిసి పరిపూర్ణమైన స్త్రీ మూర్తిగా నీ జన్మకు ధన్యవాదాలు సాధించవచ్చు" ( పుట.. 144).
ఇలా కవయిత్రి పద్మావతి రాంభక్త గారి కలందర్శించిన కొత్త వేకువలో ఎక్కువ కవితలు స్త్రీ పక్షపాతాన్నే వహించాయి.
మిగిలిన కవితలు కూడా మానవీయ కోణం లోంచే మాట్లాడినై.
స్త్రీ పక్షాన మాట్లాడిన కవిత్వమంతా ధైర్యం కంటేదీనత్వం లోంచే పలికింది,
ఆగ్రహం కంటే ఆవేదనగానే పలికింది,
కరడు గట్టిన పితృస్వామ్య,పురుషాధిక్య
సమాజం లో మార్పుకోసం,పాలక పక్షం
కళ్ళు తెరిపించాలంటేధిక్కార స్వరం పలకాలి.
రాబోయే రోజుల్లో ఈ స్వరం మరింత బలపడుతుంది.తాను కలలు గనే స్త్రీ స్వేచ్ఛకు పునరంకితం కాగలదని నా విశ్వాసం.
తొలి ప్రయత్నంలోనే సామాజికంగా ,స్త్రీ మనోభావాలను సూటిగా,స్పష్టంగా "కొత్త వేకువ"గా ఆవిష్కరించిన నవ కవయిత్రి పద్మావతి రాంభక్తఅభినందిస్తూ,2019 లోనే తన కవితకు 'రాధేయ కవితా పురస్కారం' అందుకొని,మా కుటుంబ ఆడపడుచు గా గౌరవం అందుకున్న ఈ కవయిత్రిని మరో సారి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను.కొత్త వేకువ ను మనసారా స్వాగతిస్తున్నాను.
గడుసైన కవి ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్య ప్రపంచానికి చాలా దగ్గరైన వాడు ఇతని కవిత్వంలో ఆగని కవిత్వ ధార కనపడుతుంది. అది ప్రజల భాషలో వినబడుతుంది.సీరియస్ విషయాలే కాకుండా వాటి మధ్య జారిపోతున్న దయనీయ జీవన దృశ్యాన్ని పట్టుకోవడం, అనేక వాదాలు, ధోరణులు, ఉద్యమాల్లో ఇమడ కుండా సమకాలీన సాహిత్య చరిత్రలో మానవీయ సంఘర్షణలను పట్టుకోవడం నరసింహారెడ్డి ప్రత్యేకత. - డా. సుంకిరెడ్డినారాయణరెడ్డి.
కవి నిరంతర చైతన్య శీలి. నిత్య సృజనాత్మక శీలి.అతని కవిత్వం సమస్త మానవీయ సంవేదనా శీలి. అతని కవిత్వం ఏ భాషలో కి అనువదింపబడినా,తనదైన భావస్ఫూర్తి మెరుస్తూనే ఉంటుంది.
తనదైన శైలితో, తనదైన ప్రాపంచిక దృక్పథంతో, సమాజాన్ని జాగృత పరుస్తూనే ఉంటుంది తను ఏ స్థాయిలో నిలబడినా, తన మూలాల్ని మరువడు. తన గ్రామీణ జీవననేపథ్యాన్ని మరువడు. తనలో భావ సంచలనం కల్గినపుడు,పురిటి నొప్పులు పడుతూనే కొత్తకవితకు జన్మిస్తాడు. సామాజిక బాధ్యత కలిగిన కవి చైతన్య రహితంగా ఉండలేడు. సమాజ హితం కోసం, నిత్య చైతన్య శీలిగా, సాహిత్య వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి నిత్య చైతన్య శీలి, నిగర్వి, నిష్కపటి, తెలంగాణ సామాజిక చింతనా పరుడు, డా.ఏనుగు నరసింహారెడ్డి గారు.
తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో, ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా నిత్యం ప్రజాక్షేత్రంలో విధులు నిర్వహిస్తూనే, పై అధికారుల ఒత్తిళ్ల మధ్య ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా లేని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఏమాత్రం తీరిక సమయం దొరికినా కవిత్వ రచనకు అంకితమైన అరుదైన కవి, డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు. వీరితో నాకు 1995 నుండి గాఢమైన పరిచయం. ఆత్మీయమైన కవితానుబంధం మాది.
2018లో నేను మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు'త్రిదశాబ్దిఉత్సవాలనుఅనంతపురంలో ఒక రోజంతా నిర్వహించాను వారిని ఒక ఆత్మీయ అతిథిగా ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆనాటి సభలో వారు వర్తమాన కవులకు చక్కటి దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.
ఒక కవిగా,సాహితీవేత్తగా,తాను ఎక్కడా ఆగిపోలేదు.విశ్రాంతి తీసుకోలేదు. తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని విరమించు కోలేదు భావ సాంద్రత లో తనదైన అభివ్యక్తిని మెరుగు పర్చుకుంటూ,నిబద్ధతతో సాగిపోతూ ఉన్నారు. వారిని కవిత్వ కోణం లోంచీ, పాతికేళ్ల వారి కవితా ప్రస్థానాన్ని గురించి విశ్లేషించే ప్రయత్నమే ఇది.
కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు 1968లో యాదాద్రి భువనగిరి జిల్లా లోని 'కల్లోల కుంట'లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి దంపతులు.వీరి ప్రాథమికవిద్య, ఉన్నతవిద్య చిట్యాల, రామన్నపేట, నల్గొండలో, సాగింది.
1998లో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో "తెలుగు హిందీ జాతీయోద్యమ తులనాత్మక అధ్యయనం" అనే అంశం మీద పీహెచ్ డి పొందారు.
వీరి సృజనాత్మక నేపథ్యంలోంచీ నిరంతరం పదునెక్కుతున్న కవిగా, విమర్శకుడిగా, తెలుగు సాహితీ రంగంలో అలసట లేని విరామం లేని సాహిత్య ప్రస్థానం వీరిది.
మీరు ప్రస్తుతం విభక్త తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ నిన్నటి వరకూ తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యదర్శి కొనసాగుతూ ఉండడం వీరి వ్యక్తిత్వం, అంకితభావం, ఒక కారణం కావచ్చు.
ఒక స్థితిలో తను తాను పరిచయం చేసుకుంటూ... "నేను పుట్టిన నేల,నేను నడిచిన బాటలు, నేను కలిసిన వ్యక్తులు, నన్ను దిద్దిన పుస్తకాలు, నేను చేసిన పనులు,అవి ఇచ్చిన అను భూతులు ఒక చోట రాసి పోస్తే అది నేనే "అని ప్రకటించడం వెనుక ఈ కవి కి ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందో, మనకు ఇట్టే అర్థమవుతుంది
డా.ఏనుగు నరసింహారెడ్డి గారి రచనలు
ఇవి..
1 సమాంతర స్వప్నం...కవిత్వం... (1995)
2.నేనే ... కవిత్వం .................(2002)
3.మట్టిపాట...కవిత్వం ............(2008)
4.కొత్తపలక.... కవిత్వం...............(2013)
5..హైద్రాబాద్ విషాదం...అనువాదం.. (2016)
6.అంతరంగం...ఆధునిక కవిత్వ విమర్శ...(2018)
7.మూలమలుపు...కవిత్వం...(2018)
8.సమాహార...........(2019)
9.తెలుగు రాష్ట్రాల.. రెవిన్యూ వ్యవస్థ..నిన్న నేడు రేపు (2019 )
10.కవిత్వం లో బాల్యం..ఎంఫిల్ గ్రంథం ( 2019)
11.తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు
(తులనాత్మక పరిశీలన)....(2019)
12.తెలంగాణా రుబాయిలు...(2020)
-----------------------
నిరుద్యోగ, నిరాశా పర్వం సమాంతర స్వప్నం (1995)
------------------------
ఆకలి కి పర్యాయపదమైన, నిరుద్యోగ దశాబ్దంలో, ఆకలిలోంచి అభద్రత లోంచీ ఎలుగెత్తి కవిస్వరమే ఈ "సమాంతర స్వప్నం"
తన సామాజిక అవగాహన గురించీ, జీవితం లోంచీ, కవిత్వం గురించీ ఇలా నిర్వచిస్తున్నాడు కవి..
నిజానికి దబాయింపులూ, స్ట్రాటజీల్లేని కవిత్వమే నాకిష్టం. జీవితానికి విధేయం కాని కవిత్వాన్ని నేనూహించలేను. రాయ కుండా ఉండలేని అనివార్యతా గుణం, పొగలు కక్కే నిజాయితీ ఇటువంటివి అరుదవుతున్న కాలంలో, అలసిపోయి పలకరించే నిరుద్యోగిలా, నాయీ "సమాంతర స్వప్నం".
59 కవితలున్న ఈ సంపుటిలో ఒక్క నిరుద్యోగ పర్వాన్ని గురించే పది కవితలు దాకా ఉండటం ఓ విశేషం.
వృద్ధాప్యం లేత చెట్టుపై
నాలాంటి గొడ్డలి దెబ్బల్ని దయతో భరించు
నేనసలే రాకపోవచ్చు
అమ్మా!
నువ్వు ఎదురు చూడకు (పుట- 2 )
ప్లాట్ ఫారం మీద తన గొంతు రైలు కూతవు తుందని క్వాలిఫైడ్ టీచర్లకు మద్దతుగా నిలుస్తాడు కవి.ఒంటరి భూతాన్ని నిరంతర సామూహికత్వం తో చిత్తు చేస్తానని ప్రతిన బూనుతాడు. ఇరానీ చాయ్ తీపెక్కుతున్నా, బతుకు మాత్రం చేదెక్కు తుందంటాడు.
తప్పని దుఃఖం
దిగమింగుకున్న కొద్దీ ఎగదన్నుకొస్తున్న
వింత దుఃఖం
కాలం మెరుపు కత్తుల్ని దూసి
ఎన్నినిలువు కోతల్ని కోస్తున్నా
గూడు వీడిన పిచ్చుకను కావడం
మాను కోలేక పోయాను. ( పుట- 17)
చాకిరీతనాన్ని స్త్రీత్వంగా అలంకరించుకున్న క్షమయాధరిత్రిని కొనియాడుతున్నాడు కవి.భగ్గున మండే చౌరస్తాలో రసం పిండుతున్న చేతుల్ని చూసి ఆర్ధ్రంగా ద్రవిస్తాడు.ఉస్మానియా
యూనివర్సిటీ లో పరిశోధకుల బతుకు కూడలి ఎన్.సీ.పీ చౌరస్తా పై రాస్తూ...
నా ప్రాణమా ఎన్.సీ.పీ
నువ్వెన్ని కన్నీటి బొట్లను
ఎన్ని వేదనామయ జాలి చూపులను
ఎన్ని తరంగిత హృదయ విన్యాసాలను తీర్థమాడించుకున్నావు
నీ స్పర్శ లేని రోజు
దినచర్య మిగిలిపోయిన
అనుభూతుల ఆస్తుల నిస్తున్న ఎన్.సీ.పీ
దినదిన గండమైన ఈ చేప పిల్లలకు
నువ్వే కదమ్మా ఎన్.సీ.పీ.చల్లటి కొల్లేటి సరస్సు ( పుట-23)
బతుకునే పద్మవ్యూహం లో నిలిపి ఆత్మబలిదానాలతో,చిత్ర హింసల నరక యాతనల్ని భరించే త్యాగమూర్తులను
స్మరించుకుంటాడు కవి.గల్లంతైన హృదయపు చిరునామాను గురించి వాకబు చేస్తాడు.
ఏ మాట వెనకాల ఆ వాసన లేదు
ఏ పలకరింపులో ఆ చెమ్మ లేదు
కాస్త వెతకండి
హృదయం చిరునామా గల్లంతయింది ( పుట-29)
కవీ, నువ్వెప్పుడూ వేదనకు మరో రూపానివే నంటాడు. అమ్మ ఒడి నుండి అనుభవాల ఆస్తులను తీసుకున్నా నంటాడు వందలు,వేల బతుకుపుస్తకాలను ఆ ఒడిలో నుండి నేర్చుకున్నా నంటాడు. మా బతుకు దీక్ష మారదు,మా చెమట బట్టలు మారవు, మేంమారం అంటాడు.
ఇక్కడి భక్తి అంటే రాజకీయం,ఆలయాలు ఓట్లకు నిలయాలు అని ప్రకటిస్తాడు.
ఇక్కడి ఆలయాలు
ఓట్ల మొగ్గలేసి
సీట్ల పూత పూసి
పవర్ ఫలాలను పంచుతాయనే కదా
క్షుదార్తుల ఉదరాలను
కరసేవ కంపుతో నింపేస్తారు ( పుట..39)
నిరుద్యోగ నిర్వేద యువకుడిగా శివారెడ్డి కవిత్వంతో చైతన్య స్పూర్తితో ఒక కవిత రాస్తాడు.
"సహజ సామర్థ్యం పెల్లుబికిన ప్రతిచోటా ఓవర్ క్వాలిఫికేషనై వెక్కిరిస్తుంది
గొంతునొక్కి మనసు చంపుకు
కనిపించిన నాడు
అసమర్థతగా ధృవీకరించబడుతుంది ఒక్కోసారి
అప్రయోజకమైన సానుభూతి తుఫాను కొన్ని రోజుల పాటు మనిషిని కానీయదు నాకేసి చూసుకుంటే
తెగిపోయిన పతంగాలు గుర్తుకు వస్తాయి బతకడానికి ఓ పెద్ద బండ బరువు చేసిన బతకడానికి ఓ బడా వ్యాపారం చేసిన సుందరమయ వ్యవస్థలో
బతకును మోయలేక మోస్తూ
రాయలేక రాస్తూ
కవిని నేనే
చదువు కునే వాళ్ళుంటే
కవిత్వాన్ని నేనే
నేను నవ యోగి
నా పాత పేరు నిరుద్యోగి" ( పుట..95 )
ఈ కవిత్వం రాసిన కాలం నాటికి నిరుద్యోగ యువకుడైన ఈ కవి చాలా కవితల్లో తన మానసిక నిర్వేదం ప్రకటిస్తూ ఉంటాడు. ఇంట్లో,బయటా,స్నేహితుల మధ్య అన్నీ ప్రశ్నలే.వారి పలకరింపులన్నీతనకు శూలాలు గుచ్చుకున్నట్లు ఉంటాయి కవికి.
"ఉపాధి వృక్షం చేసుకోలేని నాకు
ఇంట్లో
ప్రశ్నఅమ్మ మొహమవుతుంది
నాన్న వయసవుతుంది
అన్నింటి కన్నా పెద్ద ప్రశ్న
నా చదువవుతుంది". (పుట..50)
కవికి గ్రూప్2ఎ లో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు తనఇల్లు, కాలేజ్, యూనివర్సిటీ నదీనదాల్లోపడవై కేరింతలు కొట్టిన ఆనందాన్ని అనుభవించాడు కవి.తనకూ బాల్యానికీ నడుమ తెగిపోని హోమ్ వర్క్ ల రాగ బంధమనీ,యాభై అక్షరాల గందర గోళమని అంటాడు కవి.
ఇలా "సమాంతర స్వప్నం" లోని కవిత్వమంతా కవి నేటివిటీని, బాల్య, యవ్వనోద్రేకాల మధ్యబతుకు కష్టాన్ని వివరిస్తుంది.నిరుద్యోగ పర్వంలో కష్టాల కడగండ్లను ఆర్ధ్రంగా వివరిస్తాడు కవి.
-------------------------
ఒక అసందర్భ వ్యంగ్య చిత్రం-'నేనే' (2002)
--------------------------
ఎవరూ అందుకోలేని ఒక ఆదర్శవాది, ఒక ఉదాత్త మూర్తి ,జ్ఞాన గ్రంథాలయ సర్వస్వం మధురకవి తన గురువు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారికి అంకితమిచ్చిన కవిత్వమే 'నేనే'
తొలి కవిత తెలంగాణ గ్రామ సేవకుల, వెట్టిచాకిరీల, వేతనము లేని ఉద్యోగుల గురించి,దయనీయంగా రాసిన కవిత-
'నీటిపిట్ట'
వీరిని నీరుడీలని, కావలికార్ లని ఇంకా వివిధ పేర్లతో పిలువబడుతుంటారు.
ఓ నీటి పిట్టా
చిలికి చిలికి వెల్లువెత్తిన ఉప్పెనలో
కట్టగండికి గడ్డివామువై ఇసుక బస్తావై నిలువరించి ప్రాణాలిచ్చే జలదాతా తూముల్లో మరణ పిట్ట వేదన తెలిసీ
నీరుడీ వారసత్వం చేపట్టిన
నీ సుగుణమే జ్ఞానం
నువ్వూ నీచేతి కర్రా అంగిబిళ్ళా
గంగ చుట్టూరా ఓ వెట్టి కాపలా
నువ్వు నిజమైనమట్టి బావుటా ( పుట.. 2 )
ఉగ్గ బట్టుకున్న దుఃఖంతో భవానీ స్మృతి మీద రాసిన కవితే 'వాలు గులాబీ' చిక్కబట్టుకున్న తరిమివేత మీద,అక్కరకు రాని చుట్టము మాదిరి అశోక చక్రం తలలు వంచేసుకున్నప్పుడు పజ్జమే నా గుండె చుట్టూ తారాడుతూ,నాలో కొత్త ఆశల్ని పూయిస్తుందంటాడు కవి.
వానాకాలం అంటే ఇష్టపడని కవి ఎవడుంటాడు? మన కవి నరసింహారెడ్డి కూడా పల్లె మూలాల నుండి ఎదిగి వచ్చిన వారే కనుక వానంటే పరవశించి పోతారు.
''ఆకాశం జల్లెడ లోంచీ
పైకెగసిన సముద్రం
అడవి తల్లికి తెగని చినుకులు చీరలిచ్చి పులకింత వాగులై సాగింది
వర్షం కురుస్తుంటే
చినుకుల వెనకాల
మసక మసకగా గుట్టరాళ్లు
ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే
విశ్వం విలాస హాసం వానకాలం
వన్నెల బహుమానం"
(పుట..11)
మానవత్వం లేని మత దురభిమానుల మధ్య, సరికొత్త క్షమాగుణాన్ని సృష్టించి, వ్యాధుల్ని నిర్భీతిగా నయం చేస్తూ పేదల గుండెల స్టెతస్కోప్ అయిన 'స్టీవర్ట్ స్టెయిన్' ను,1999 లో ఒరిస్సాలో సజీవ దహనం చేసిన ఘటనను తలుచుకుంటూ, వారి స్మృతి లో రాసిన కవితే 'అంగార శయ్య'.
'బంజారా హిల్స్ చుట్టూరా' కవితలో ఖాళీ కడుపులు, కళ్ళనిండా నీళ్లున్న ఎండు గడ్డి గుడిసెల్నిబీపరామర్శిస్తాడు కవి.
జీవితమే ఓ అసందర్భ వ్యంగ్య చిత్రమనీ, ఇందులో నిందార్హుడెవడూ లేడని అంటాడు శంకర్ మట్ రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లూట్ వాయించే బిక్షగాడి పాటకు ద్రవించి పోతాడు కవి.
పాటగాడా నా పాటగాడా
పడిలేచే కెరటాల మధ్య పదిలమైన సముద్రంలా
పగలూ రాత్రీ ఏకం చేస్తూ
మా ఆనందాల కోసం
మా విషాదాల కోసం
పాడే పాటగాడా
సైరాపాట గాడా
సై సైరా పాట గాడా ( పుట..19)
శాంతి కపోత సౌందర్యాన్ని చూస్తూ గడుపుతాడు కవి.ఎంతకీ తెగని కలను గురించి వివరిస్తాడు
కేవలం రెవెన్యూ రికార్డుల్లో కనిపించే గ్రామాలు కొన్నిఉంటాయి.అలాంటి వాటిని గురించి రాసిన కవితే 'తహసిల్ తరీఖా'
'బతుకమ్మ కల' లోతెలంగాణ బతుకమ్మ పండుగ గురించి అపురూపంగా రాస్తూ బతుకమ్మ దాపకం చీరలో జరీ అంచునై పోదామని ,ఒళ్లంతా కళ్లు చేసుకుని రెల్లు గడ్డి ఎదురుచూస్తుందట.
ఈ పండుగ అక్కలకు బదులు మాకే రెండు వారాల ముందు మొదలవుతుందంటాడు కవి. దేవ కాంతలు ప్రత్యక్షమై బంగారు బతుకమ్మను బహుకరిస్తే చెరువులో వదిలేయ బతుకమ్మను బహుకరిస్తే చెరువులోవదిలేయ మనసురాక ఊగిస లాడుతూ మెలకువలో కొచ్చే వాళ్లమని తన అనుభవం గురించి రాశాడు కవి.
"దూరంగా కొండ నింగిని కలిసేచోట
సృష్టిలోతుల్ని కొలవాలని
పండిన గోరింటల పరువం మీంచి
నీట వాలి లోనికి దారేది బతుకమ్మ
తొడలోతునీళ్లలో
తరలిపోయే గౌరమ్మా
మళ్ళొచ్చే పండుగకు
మళ్లీ మళ్లీ రావమ్మా ( పుట..34)
డా.కూరెళ్ల విఠలాచార్య గారు ఒక మేధావి, ఒక సాహితీ ఝరి, ఒక తొణకని సముద్రం, ఈదురు గాలికి చెదరని ఓసాహితీ మహా వట వృక్షం.
అంతటి వారు ఈ కవి గురువుగారు కావడం వారికి ఈ పుస్తకం అంకితం చేయడం ఎంతో సముచితంగా ఉంది ఎందుకంటే తెలంగాణలోని వెల్లంకి అనే ఒక కుగ్రామంలో గ్రామీణ పేద విద్యార్థుల కోసం తన ఇంటిని మహా గ్రంధాలయం గా మార్చిన మానవతా మూర్తి. సాహితీ వదాన్యులనుండి 67,000 గ్రంథాలను సేకరించి అందులో పదిలపరచి విద్యా దానం అద్భుతంగా నిర్వహిస్తున్న మహానుభావుడాయన.
తనకున్న కొద్దిపాటి భూమిని కూడా పేదవారికి పంచిపెట్టి 83 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా తన గ్రంథాలయ నిర్వహణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సాహితీ భీష్ములు విఠలాచార్య గారు.
నేను స్వయంగా వెల్లంకి వెళ్లివచ్చాను వారి గ్రంథాలయాన్ని దర్శించే భాగ్యం నాకు కలిగిందని చెప్పడానికి ఎంతో గర్వ పడుతున్నాను ఆరోజు వారు నా పట్ల చూపిన ప్రేమను ఎన్నటికీ మరువలేను.
నా వంతుగా వారి గ్రంథాలయానికి ఆరు వందల పుస్తకాలను విరాళంగా పంపించాను .వారు గొప్ప సాహితీవేత్తలు కవి పండితులు వారు స్వయంగా ఎన్నో విలువైన గ్రంథాలను రచించారు వారి కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రజా కవి కాళోజీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
వారి "విఠలేశ్వర శతకము" గురించి మన కవి ఏనుగు నరసింహారెడ్డి అభివర్ణిస్తూ...
తలబిరుసు లేని పద్యం
లోతైన సాదు వ్యక్తీకరణ
మీ వ్యక్తిత్వమంత సమున్నత కవిత చదివాక ఏం రాసినా
పగలు దివిటీలు పట్టినట్లే గురువుగారూ మీరిలాగే ఉండి తీరాలి
మేము నమూనాగా చూపించగలిగే
సమున్నత వ్యక్తిత్వం
తలెత్తుకు చూసే కవిత్వం
లోకాన్ని నిజంగా శాసించ గలిగేకవిత్వం
వెల్లంకికి జేజే లు (పుట.. 37)
పద్యాన్ని మరువకండని,అతికష్టం మీద దాన్ని మర్చిపోయినట్టు నటించకండి అంటూ కవుల్నీ, కళాకారుల్నీ హెచ్చరిస్తున్నాడు.పరాయీకరణ ప్రారంభమయ్యాక మన పల్లెటూళ్లు జ్ఞాపకంగా మిగిలి పోయాయని ఆవేదన పడుతున్నాడు.
ఉద్యోగం బదిలీ గురించి కాదని బదిలీ కాలేని మనసు గురించి బాధపడు తున్నానని కవి ప్రకటిస్తాడు.
కాలం నది ముందు మోకరిల్లి
కాస్త ముందుకు పోతున్నట్లు నటిద్దాం సరళీకృత ప్రపంచం
ఇప్పుడు దుఃఖ సౌఖ్యపు అజెండా
ఎంతకీ దొరకని కన్నీటి జాలు ( పుట..62)
బదిలీ పేరుమీద మజిలీ పూర్తయినప్పుడు ఎవరికైనా కళ్ళవెంట నీటి బిందువులు రావలసిందే,జీవితాన్ని మరణం దిశగా తెంపు లేని పరుగు నిర్వచిస్తాడు కవి.
కన్ను మూస్తే ఎవరి జీవనయానంలో వారే తీరిక లేకుండా ఉంటారు. ఆశ మాత్రమే మనకున్న ఆస్తి అంటారు. కొత్తగూడెం లో ఆర్టీసీ బస్సు ఎలక్ట్రిక్ షాక్ కు గురై 14 మంది మరణించినప్పుడు కవి కూడాఎంతో షాక్ కు గురవుతాడు.
బహుశా మన ప్రాణాలింక
సామూహికంగా హనన మవటం
ఓ గంట చర్చ కూడా కాదు
ఓ క్షణం నిట్టూర్పు కూడా కాదు
గుండె ఆగుతున్నప్పటి
ఆజీవన ఆక్రందన
ఏదీ.. ఏ చోట స్మరణకు రాదు ( పుట..84)
షేక్స్ పియర్లు,షెల్లీ, కీట్స్, కాళిదాసులూ పాళీపల్లకిలో ఊరేగే యువరాజులని కీర్తిస్తాడు. మన లోక వ్యవహారం లో అందరూ అపూర్వమైన ప్రేమను నటించే వారే. నువ్వు మాత్రం ఒంటరి వాడవే నంటాడు.
కాలం జారిపోతుంది
గుండె పగిలిపోతుంది
దిగులు దుప్పట్లు కప్పుకొని
పాత జ్ఞాపకాలుమీంచి
ముఖం చాటేసే దొంగ ప్రేమల్నుంచీ అవసరాల్ని దిగేసుకున్న
అభిమానాల్నుంచీ
ఒంటరిగానే నువ్వు ( పుట.. 92)
ఇలా "నేనే" కవితా సంపుటిలో అనేక సామాజిక,సాంస్కృతిక,విషయాలను ప్రపంచీకరణ కోణం లోంచీ విశదీకరిస్తాడు కవి.
--------------------------
పల్లె కడగండ్ల మీద పద్య సమరం- మట్టిపాట శతకం (2008)
--------------------------
ఒకనాడు పసిడి పంటల తో, కుల వృత్తుల తో కళకళలాడిన పల్లె తీరు మారింది. జీవనశైలి మారింది. కుల వృత్తుల విధ్వంసమైనాయి. అన్నదాతల దైనందిన జీవితాన్ని చూస్తే గుండె చెదిరి పోతుంది
అన్నదాతల దీన దశను చూసి కవి గుండెల్లో ప్రతిధ్వనించిన పద్యమే మట్టిపాట శతకం. ఈమట్టి పాట ఈ శతక పద్యాలు ఆడియో క్యాసెట్ గా రూపొందింది, తెలంగాణ జనజీవనంలో మమేకమై ప్రతిధ్వనిస్తున్నాయి 'పల్లె బతుకు మాది పాడు గాను' అనే మకుటం తో అలరించే చక్కటి పద్యరచన ఈ పుస్తకం.
ఉన్న ఊరు నిడిసి కన్నతల్లి నిడిసి
పంట చేలనిడిసి పనులనిడిసి
బోరు బండ్లమీద ఘోరంగ తిరిగేము
పల్లె బతుకు మాదిపాడుగాను (పుట.. 7 )
ప్రపంచీకరణకు స్థానికతే పరిష్కారం. అటువంటి విధ్వంస వినాశనాన్ని ధిక్కరిస్తూ ఈ శతక పద్యాలు రూపొందిందాయి.
రేయి పగలు యనక రెక్క విరుచుకున్న పుట్టవేమి బువ్వ బట్టలైన
శ్రమను జేయువాడుకుమిలి యేడ్చుటఏమి పల్లె బతుకు మాది పాడు గాను (పుట..10)
నేడు పల్లె తన ఉనికిని కోల్పోయింది టీవీలు మొబైల్లు తెచ్చిన నాగరికతతో మన పల్లె సంస్కృతి బాగా మారిపోయింది.
ఈ మార్పు జీవితాన్ని మనిషిని విడదీసి చూపుతున్నది.
చేనేత బతుకులకు చేటు గాల మొచ్చింది. కులవృత్తులు కూలిపోయి బతుకు దుర్భరమైందనికవివాపోతున్నాడు
పద్మశాలి బతుకు బహుదుర్భరంబాయె వారమంత వడికి చీరె నేయ
పడుగు పేకలాయేబతుకు దారిద్ర్యాలు
పల్లె బతుకు మాది పాడుగాను ( పుట..16)
ఓట్ల బిచ్చగాండ్లు వచ్చారు పోయారు ఐదేళ్ల వరకు మళ్ళీ పల్లెలో అడుగుపెట్టరు. అన్ని కులాలు పల్లెలో ఐకమత్యంగా జీవిస్తారు.
పండిన పంటలు పట్నాలు చేరుతాయి.
చదివినోళ్లు ఉద్యోగం వేటలో పట్నాలకు పోతారు. ఇంకేముంది మా పల్లెలో ఎండిన చేలు తప్ప ,అంటున్న కవి.
పల్లె తరుగుతోంది పట్నమెదుగుతోంది
కన్న తల్లి గుండె కరుగుతోంది
నగర కన్నె వన్నె నానాడు పెరిగెరా
పల్లె బతుకు మాది పాడు గాను ( పుట..19)
ఏరు పొంగితే ఊరు మునిగిపోతుంది. ఎండ మండితే ఎడద మండిపోతుంది. పల్లె జీవిత మంటే అరటి ఆకు ముళ్లుతో సమానం. పల్లెటూరి లో శ్రమజీవులే కనిపిస్తారు. నిత్యం బతుకు పోరులో బండ బతుకులు పల్లెటూర్లు. రామారావు గెలిచినా,రాజీవ్ గాంధీ గెలిచినా పల్లె బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు.
ఏలి నోళ్ళ మాట లెంత గానో తీపి
చేతలేమొ సున్న చేయరేమి
మాట తోడ మమ్ము మాయజేసిరి చాల
పల్లె బతుకు మాది పాడు గాను ( పుట..22)
చదువుకున్నవారు పదవులున్నవారు సంపాదన కొరకు పట్నం చేరినారు తల్లినొ దలినారు, పల్లెనొదలినారు,ఆడబిడ్డ పెళ్ళికి ఐదెకరాల పొలం పోయే.కొడుకు చదువు కోసం కొంత,ఉన్న ఆస్తులెల్ల ఊడ్చి పెట్టిన బతుకాయే..
ఎల్ల బాధలకును పల్లెలే నిలయాలు
పల్లె బాధ లెవడు బాపడాయే
ఉండి చావలేక ఊళ్ళు వురుకు చుండె
పల్లె బతుకు మాది పాడుగాను (పుట..33)
వైద్య సేవలు లేవు. పొలాలు ఫ్యాక్టరీలకై అమ్ముకోవడం,పనులు లేక అర్ధాకలితో
బతకడం,వృద్ధులంతాపల్లెటూరిలో, కొడుకులంతా పట్టణాల్లో ఉంటారు. వరుస కరువులతో,పంట మీద ఆశ సన్నగిల్లే.రైతుల బతుకులన్నీ అప్పుల పాలే గదా..
అప్పు జేసి నీరు ఆశించి బోర్లేయ
గంటే డైనరావు కండ్ల నీరు
పరగ దయ్యెమాయె పాతాళ గంగమ్మ
పల్లె బతుకు మాది పాడుగాను (పుట..38)
కరువు పనులు వల్ల వచ్చే గింజలు ప్రభుత్వబ్రోకర్ల పాలాయె.ఫ్లోరైడ్ పీడతో నానాటికీ ఊర్లన్నీ తరిగిపోతున్నాయి పట్టించుకునే నాధుడే లేడు.
తాగు బాధ సాగుతూనే ఉండ
సాగునీటి పనులు సాగు చుండె
దీర్ఘ వ్యూహమేది దరిదాపులో లేదు
పల్లె బతుకు మాది పాడుగాను (పుట..43)
ఇలా ఈ శతకం లోని ప్రతి పద్యం పల్లె దయనీయ జీవితాలను తెలియజేస్తుంది. విచ్ఛిన్నమవుతున్న గ్రామీణతకు రూపు కట్టిన అక్షర సాక్ష్యం ఈ శతకం.
పాడుబడిన పల్లె జీవితం పరిమళాలతో పాడిపంటలతో, పరవశించాలని ప్రపంచీకరణ కుట్రలు కుతంత్రాలు లను పల్లెలు జయించి పునర్వికాసం పొందాలని ఆశిస్తున్నాడు.మన కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు
--------------------------
బతుకు పోరు చెలక లో ఒక గుండె ధైర్యం 'కొత్త పలక' (2013)
--------------------------
బతుకు పోరులో రేకు పలక గుండె ధైర్యాన్ని నింపిన 'కొత్త పలక'గా కవికి జీవిత పాఠాలు నేర్పింది. శీతాకాలం సాయంకాలం నల్లటి కాన్వాసు మీద నల్ల రంగు బొమ్మేసినట్టు మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు.జీఓ 610 పట్ల ఆగ్రహం ఉండొచ్చు కానీ జీవోలో అధర్మం లేదని పెద్దన్నల కు తెలియజేస్తున్నారు.రేకు పలక మీద ఎక్కాలు దిద్దుకున్న 'పలక' జీవితం గురించి ఎన్నో పాఠాలు చెప్పింది అంటాడు.
పలకను తల్చుకుంటే
నల్లని చీకట్లనుతరిమేసేందుకు
ఒక తెల్లని దీపంలా ఎదురొచ్చిన
అక్షరం గుర్తొస్తుంది
ఇప్పుడొక పలక దొరికితే బాగుండు
చెరిపి రాయాల్సిన జీవిత పాఠాలు
చాలా గుర్తుకొస్తున్నాయి (పుట..28)
వాక్యం రసాత్మకం కావ్యం కదా, వ్యవసాయానికి విద్యుత్తు ఉచితం కావడం ఎంతో గొప్ప రససిద్ధి కావ్య ఖండం గా భావిస్తూ, కవిత్వమిచ్చే ఉచిత విద్యుత్తును సమర్పి స్తున్నాడు .
చక్రంతిప్పి కుండల్ని తీర్చిదిద్దినంత నేర్పుగా కణ కణ మండే కొలిమిలో
పనిముట్లను వంకీలు తిప్పినంత ఒడుపుగా
మగ్గంమీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా
దార్శనికులు ధర్మం కోసం పోరాడతారు (పుట..31)
వెనకట ఇక్కడొక ఊరుండేది. మనుషులకు రక్షణ కవచంగా ఎవరైనా చూపిస్తారా? అంటూ పల్లెల గతకాలపు వైభవాన్ని మన ముందుంచు తున్నాడు కవి.
కరువంటేఎలా ఉంటది? వలస బతుకులంటే ఎలా ఉంటాయి? బతికే టోళ్లుఎవరు? బలయిపోయే పోరలు ఎవరు? అంటూ ప్రశ్నిస్తాడు.
ఊరి మొగసాల కింద
రావియాకుల గలగల కింద
రాలిపోయే కన్నీటి కింద
చెప్పుకోలేని బాధ బిడ్డా! కరువు
వెంటవస్తే నేను కూడా మీకో బరువు (పుట..39)
పని లేక పోవడమంటే జీవితం లేక పోవడమే లేకపోవడమే నంటాడు ఈ కవికి నాన్నంటే ఆరబెట్టిన నీటిరంగుల వర్ణ చిత్రం లా, ఒక స్పష్టత జ్ఞాపకం.
వలస కాలంలో నాగలి కర్రు నీటి మట్టం నిర్దయగా జారుకుంటుంది .డుద్దు కూడా దొరకని పరిస్థితి, ఆడవాళ్లు పని దినమంతా మైళ్ళ కొద్దీ మంచినీళ్లకు నడకలు. నూకల్లేని ముసలి యచన కలవరపెడ్తుంది.
ఖజానాలో ధనం మూలుగుతుంది గిడ్డంగుల్లో ధాన్యం మురుగుతుంది. కాలే కడుపుల మీంచి రోజుకో శవం లేస్తుంది. ఇదీ వలసల కాలమంటే.
సర్కస్ జీవనంలోని విషాదాలను వివరిస్తాడు ఒక చోట కవి. కొల్లేటి కలెక్టర్ గారి పేరు పొందిన అగర్వాల్ గారిని కవి ప్రశంసిస్తాడు.
1983లో విడిపోయిన పదవ తరగతి సహ విద్యార్థులు మళ్లీ 21 ఏళ్ల తర్వాత కుటుంబాలతో సహా ఆత్మీయంగా కలుసుకున్నప్పుడు, కవి హృదయం కాడ మల్లెపూలచెట్టయి, పట్టలేని పరవశంతో అవధులు దాటిన ఆనందంతో ఫ్లాష్ బ్యాక్ చైల్డ్ హుడ్ మెమరీస్ ను నెమరేసు కుంటాడు.
కాలం ముందుకు గడిచినప్పుడు ఖచ్చితమైన వీడ్కోలు తప్పనప్పుడు పట్టపగ్గాలు లేని విశ్రాంతి లోనూ ఊహాతీతమైన శూన్యంలో
బరువైన జ్ఞాపకాలతో
చిట్యాల నుండి చిత్ర చిత్ర ప్రదేశాలకు అంతుచిక్కని ఆకాశంలోఊర పిచ్చుకలమై లోతెరుగని సముద్రంలో చేపపిల్లలమై.. (పుట..78)
సురక్షిత కలశాలతో
గట్టు మీద కూర్చున్న వాళ్లేవరైనా
నా బాధ్యతల యుద్ధరంగంలో
మునిగితేలే వారిని గాయపరచడం
సులువే మరి (పుట..80)
కట్టుబట్టలకోసం,కడుపు కోసం పునాదులు తవ్వే దిన కూలీలు వ్యవస్థ చక్రబంధంలో కేవలం ఆకులుగా మిగిలిపోతారని, వేదన పడతాడు కవి.
అవకాశవాద రాజకీయాల్ని కూడా మహా త్యాగమయ పోరాటాలు నిర్వహిస్తాడు పోరాటాలు చిత్రించగల పత్రికాధిపతుల చర్యలను నిరసిస్తాడు కవి.
ప్రభుత్వ శాఖల అన్నింటిలోనూ కుంటిసాకులతో ప్రమోషన్ అడ్డుకునే పరిస్థితిని చూసి,దిగులుగా నిట్టూరుస్తాడు కవి. కాలం ఆకాశం కింద కోటి ఆశలతో ఉగాదులు వస్తూ పోతుంటా యని,అప్పుడప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని వారే తూకం వేసుకోవాలని సలహా ఇస్తాడు.
చిత్ర కారుడు కాపు రాజయ్య మరణానికి నివాళి సమర్పిస్తాడు. మనుషులంతా కలిసి నడవాలని భుజకీర్తులు లేకుండా కలవాలని ఆశిస్తాడు. తన బాల్యంలోకి మళ్ళీ వెనక్కి పోవాలని ఆశ పడుతున్నాడు నేల మీద పూచిన పూల సోయగాలను చూడాలని ఆశ పడుతున్నాడు.
అక్కడికి
ఎలాగైనా మళ్లీ పోవాలె
చిగురుమామిళ్ల కింద గుసగుసలు
గుట్టల కింద జ్ఞాపకాలు మల్లెలు
తలుపుల వీణపై
తట్టి చూడాలె
మళ్ళీఅక్కడికే పోవాలె (పుట..127)
నల్గొండ జిల్లా చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల1982 -83 బ్యాచ్ పదవ తరగతి స్నేహానికి అంకితమిచ్చిన జ్ఞాపికగా ఈ 'కొత్త పలక'ను ఆవిష్కరించారు కవి
ఇందులో మట్టి నుండి ఉదయించిన ఊహలు చీల్చుకుని అనుభూతులు అనుభవాలు ఆశయాలు ఈ కొత్త పలకపై మెరుస్తాయి.
--------------------------
గెలుపు కోసం నిరంతర శోధనే "మూల మలుపు" (2018 )
--------------------------
సృజన లోకములో నిరంతరం కవి అంతరంగ శోధనే ఈ మూల మలుపు.
అసలు 'మలుపు' అంటేనే ఒక అధ్యాయం మొదలు కావడం లేదా జీవితంలో ఒక కొత్త దశ ఆరంభం కావడం అనే అర్థం లో వాడుతూ ఉంటాం. వాడి జీవితం మలుపు తిరిగింది అంటూంటాం.అంటే వాడికి ఒక కొత్త జీవితం,లేదా ఒక సంతోషకరమైన అధ్యాయం మొదలైందన్న అర్థంలో వాడుతాం.
కొన్ని పదాలకు, పదబంధాలకు ప్రాంతాలను బట్టి లౌకిక అర్థాలు మారుతూ ఉంటాయి.
కవి వాడిన 'మూలమలుపు' అనే పద బంధానికి నలిమెల భాస్కర్ గారు రూపొందించిన తెలంగాణా పదకోశంలో (మూల మల్గుడు), వీధి మలుపు, అనే అర్థాన్ని సూచించారు.
కవి కూడా ఈ అర్థప్రయోగం లోనే పుస్తకానికి పేరు పెట్టినట్లు భావిద్దాం 2013లో వెలువడిన "కొత్త పలక" తర్వాత మరో ఐదేళ్ల కు వచ్చిన కవిత్వమే ఈ "మూల మలుపు' మార్కెట్ మాయాజాలం లో మనుషులంతా తప్పిపోతూ, ఎదురుచూస్తూ తడబడుతూ పారిపోతున్న నేటి కాలానికి ప్రేరణగా నిలిచిన కవిత్వమే "మూలమలుపు".
నడిచొచ్చిన నేను తిరుగాడుతున్న ని తీరం చేరువయ్యే దాకా కన్నీటిని ఆపుకుంటూ భావిస్తాడు. మార్కెట్ ప్రపంచంలో లోకమంతా వచ్చిన దారిని మర్చిపోతూ ఉంటారు. తాము ఉన్నచోటే ఉండి ఒక్కొక్కరే తప్పి పోతూ ఉంటారని కవి భావన.
మనం ఉన్నచోటే ఉండి
ఒక్కొక్కరం తప్పి పోతూఉంటాం
ఎవరూఎవరికీ కనిపించే టట్లు లేరు.
మనం అక్కడే తిరుగాడుతూ ఉంటాం తిరిగిన ప్రదేశంలోనే
పదే పదే కలుస్తూ ఉంటాం (పుట..25)
జీవన వేదనలన్నీ గుక్కపట్టిన మరణమని, ఒంటరి దుఃఖాన్ని ఎవరూ పంచుకోలేమని అంటాడు కవి. నిద్రలో నవ్వు గురించి అద్భుతంగా నిర్వచిస్తాడు. కవిత్వం చెప్పడం కష్టమని అది నవ్యత్వ ఆలోచననీ, జడత్వ విమోచననీ,చెబుతూ కవి ఎప్పుడూ ప్రజల పక్షమే నని ఢంకా బజాయించి మరీ చెబుతాడు కవి.
జాలువారుతున్న పంటకాలువ గట్లమీద, పూల తీగల పులకరింతలు, తల్లి ఒడిలో ఖుషి చేసే పిల్లవాడిలా, జలదృశ్యం ముంగిట్లో ఉన్న ఊరును మన కళ్ళ ముందు దృశ్యమానం చేస్తాడు కవి.
జ్ఞాపిక అంటే
కాలం వెనక్కి తిరిగి
ప్రేమాత్మకంగా చేసే మువ్వల శబ్దం
ఇంటి నిండా జ్ఞాపికలు సరే
మదిలో చాలాకాలం నిలిచే జ్ఞాపకాలు కొన్నైనా ఉండితీరాలి (పుట.. 45)
రాతిని ఉలితో చెక్కి శిల్పంగా మలిచినట్లు కవిత్వాన్ని చెక్కాలి.చిరకాలం గుర్తుండిపోయే వాక్యాల్ని పోత పోయాలని వర్ధమాన కవులకు సలహా ఇస్తాడు. అంటాడు.అన్నిచోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అమ్మకు శక్తి నిమ్మ ని నాన్నను పంపించాడని చమత్కరిస్తారు కవిత్వం ఒక ప్రత్యేక ప్రపంచమనీ,అందులో నేనుంటాననీ సెలవిచ్చాడు. భయానికి ఒక రూపం ఉంటుందని భ్రమ లో ఉండేవాళ్ళం భయం అనేది మహా మాయావి అంటాడు. కొందరికేమో జీవితమే క్రీడ మరి నాకేమో రెవిన్యూ బాధ్యతల క్రీనీడ అంటాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఈ పది జిల్లాల తెలంగాణ ముప్పై ఒక్క దీపాలుగా వెలుగొందుతుందని తన ఆశావహ దృక్పధాన్ని తెలియజేస్తాడు.
కవిగా కవి నందిని సిద్ధారెడ్డి గారి నిబద్ధతను కవి కొనియాడు తాడు. పుస్తకాలు లేని ఇల్లు ఎడారి వంటిదని, కవి అన్నవాడు రోజు ఏదో ఒకటి రాయాలంటాడు.
ఇరానీ చాయ్ లేని హైదరాబాద్ ని ఎలా ఊహించగలం? గాయపడకుండా ఉండాలి అనుకుంటాను చివరికి గాయపడ్డ కే ఇల్లు చేరుకుంటాను గెలవడం మన చేతుల్లో లేనట్లే ఇతరుల్ని గెలిపించడం అంత సులభం కాదు.
రెప్పలు గాయపరిచిన కంటినిండా ఉద్వేగం జారి పోతున్నట్లు, చెదిరిపోతున్న సౌందర్యం కనిపించని భాషలతో మనల్ని కట్టేస్తుంది
2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ నుండి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మనసారా స్వాగతిస్తూ తన ఆనందాన్ని ప్రకటించే సన్నివేశాన్ని పారవశ్యంతో కవితాగానం చేస్తున్నాడు కవి.
కాల యవనిక మీద
సప్తవర్ణాల అద్దకం దిద్దినట్లున్నది
నవ తెలంగాణ పురోగామి ద్వారం తెరుచుకున్నట్లుంటుంది. (పుట..90)
చిన్నప్పటి సినిమా సంబరాన్ని ఇప్పటి ప్రపంచంతో పోల్చి చూపాడు. సారస్వత పరిషత్ నిత్య చైతన్య శీలిగా రూపొందించే సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాల్ని ఎంతగానో కొనియాడారు.
భారత ప్రధాని పెద్ద నోట్ల రద్దు మంత్రం ఏ మాత్రం పని చేయలేదన్నాడు. రెక్కలు విరిగితే పక్షి ఎగరలేదు, ఆయుధం లేని వీరత్వం ఎందుకు కొరగాదు. ప్రతి ఉగాదికి ముస్తాబై సాహితీ కళా సాంస్కృతిక సంబరాలతో కళ కళలాడే రవీంద్ర భారతిని ఇష్టంగా తలుచుకుంటాడు.
ఏదీ మిగలదనితెలిసీ
ఏదో మిగిలించుకుందామని
ఒక్క చోట కాలు నిలువకుండా
నడయాడే నది, మనిషి (పుట..116)
పూల పూల పరిమళమున్నట్లే నేలకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. చందమామను కిందికి దింపిన చార్మినార్ ను హైద్రాబాద్ కు తలమానికం గా భావిస్తాడు.నడుస్తున్న తొవ్వ లో మలుపుదాటాలి,ఎట్లున్నా ప్రయాణం సాగించాలి.
నడుస్తున్న తొవ్వ
కోరుకున్నది కాదు
మలుపుల దగ్గరి దుఃఖం
దింపుకోవడం
గుండె కోతే
శరీరం మీద దాని
దాడి కనిపిస్తది
మనో శకలం మీద దాని నాడి
స్వారీచేస్తది
మనకో మనసుంటది
తన దారిలోనే అది నడిపిస్తది (పుట.. 124)
ఆసిఫా హత్య పట్ల తీవ్రంగా స్పందిస్తాడు కవి.
గోవుల్ని ప్రేమించే పులి
పసి బాలికల్ని కామించే మూకల
మాతృభక్తి కి
మోజు పడుతుంది
దేవుడు జీవుల్ని కోరే వ్యవస్థ
ప్రతీకలు కదా
ప్రాణం కన్నా శీలం
కీర్తించబడే దేశంలో
ఆసిఫాను దళిత ద్రౌపదిని చేసి
పగలబడి నవ్వుతుంటే
వ్యవస్థ అంతా పులి ముట్టించిన
వెలుగు లోనే వికృత నృత్య మాడుతుంది
పులి గోవుల కనికరపు గొంగడి కప్పుకొని మనిషుల్ని వెంటాడుతుంది మనుషులంతా
ఒక్కటి కావాలె
పులిని బోనులో పెట్టాలె (పుట..145)
ఇవాళ పులి గోవుల కనికరం గొంగడి మనుషుల్ని వెంటాడుతుంది కావున మనుషులంతా ఒక్కటి కావాలి పులి బోనులో పెట్టాలి అంటున్నాడు కవి.
కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి మూలమలుపు కవిత్వంలో సమకాలీన తెలంగాణా జీవితం మనల్ని తట్టి లేపుతుంది .
తెలంగాణ జన జాగృతికి అద్దం పడుతుంది ఒకప్పటి పల్లెటూర్లు ఇప్పుడు నగరానికి వలస వచ్చిదుర్భర జీవితాల్ని గడుపుతున్న ఉదంతాల్ని ఇందులో కవిత్వం గా మలిచారు.
కవి తన బాల్య జీవనం గురించి నెమరువేసుకోవడం మనం ఇందులోనూ గమనించగలం.
-------------------------
మానవీయ తాత్విక భావాలు తెలంగాణ రుబాయిలు (2020)
--------------------------
మూల మలుపు తర్వాత మరో రెండేళ్లకు 'తెలంగాణ రుబాయిలు' పేరుతో ఒక బృహత్ గ్రంథం తీసుకురావడం కవి గారి కవితా చైతన్యంలో నిజంగానే ఒక కొత్తమలుపు. 'మూలమలుపు' కవిత్వానికిది పొడిగింపు గా నేను భావిస్తున్నాను. పేరుకు ఇది తెలంగాణ రుబాయిలు గానీ ఇందులో తెలంగాణా ప్రాంతీయ జనజీవనం గానీ, భౌగోళిక చారిత్రిక విశ్లేషణలు గానీ ఇందులో మనకు కనిపించవు.కవి సార్వజనీన హృదయావిష్కరణమే వినిపిస్తుంది.
కవి తెలంగాణా ప్రాంతీయుడు గనుక బహుశా అందుకు సంకేతార్థంగా ఈ పేరు పెట్టి ఉండవచ్చు.ఒక అవిశ్రాంత ఉద్యోగిగా,ప్రభుత్వ పాలనా యంత్రాంగం లో కీలక బాధ్యతలు నిర్వహించే ఒక అధికారి కవి గా తనదైన సమయాన్ని కేటాయించుకొని కవిత్వం రాయడం అరుదైన విషయమే అయినప్పటికీ కవి గా ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక కొత్త కళాత్మక ప్రక్రియ రుబాయిలు వైపు ఆసక్తిగా తలొగ్గి ఏకధాటిగా 536 రుబాయిలు రాయడం,వాటిని మళ్ళీపుస్తక రూపం తేవడం, నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఇందుకు ప్రధానంగా ఆంధ్రప్రభ పత్రిక ఇచ్చిన ప్రేరణ కావచ్చు.
ఆంధ్రప్రభ దినపత్రిక,ఆదివారం సంచికలో 2016 ఫిబ్రవరి28 నుండి 2019 మార్చి3వ ఆదివారం వరకు అంటే మూడు సంవత్సరాల ,ఒక్కనెల దాకా సీరియల్ గా ప్రచురిస్తూ వచ్చినట్లు కవి మాటల్లో తెలిసింది.పత్రికా ప్రేరణ లేకుంటే కవి
500 పైగా రాసుండేవారు కాదు.
ఇటీవల చాలా మందిని చూస్తున్నాం.ఓ యాభయ్యో,వందో రాసి, పుస్తకం గా వేసి,ఆ ప్రక్రియకు తనవంతుగా న్యాయం చేసినట్లుగా ఫీలైపోతున్న కవుల్ని రచయితల్ని ఇవాళ మనం చూస్తున్నాం.
అలా కాకుండా పత్రిక ఇచ్చిన స్ఫూర్తితో పాటు,తనలో ఇంకి పోని చెలిమగా స్రవించే భావోద్వేగం వల్లనే ఐదువందలకు పైగా ఈ రుబాయిలు రాయగలిగారంటే కవిలో రగిలిన ,భావోద్వేగం ప్లస్ భావ స్పూర్తికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా.
ఇకపోతే అసలు విషయానికొస్తే రుబాయీ అనేది అచ్చమైన ఒక ఫారసీ ఛందస్సు ప్రక్రియ.ఈ రుబాయీలో నాలుగు పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.నిర్దిష్టమైన ఛందో నియమాలతో 1,2,4,పాదాలలో రదీఫ్,కాఫియా లను పాటిస్తూ ఒకే విషయాన్ని చమత్కారపూర్వకంగా వ్యక్తపర్చడం కవి నైపుణ్య ప్రదర్శనకు ఆస్కారం కలిగిస్తుంది.మూడవ పాదం భావ పరిణామ సూచకంగా ఉంటుంది.
నియమాలను,మూల సూత్రాలను చక్కగా ఆకళింపు చేసుకొని, తనలోని సృజన కు పదును పెడ్తే రుబాయీల రచన కవి భావనలో కొత్త అభివ్యక్తి లో రాటుదేలి తనదైన ఒక రుబాయీల ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు కవి.
ఇలా తెలంగాణా రుబాయిల్లో తనదైన సరికొత్త భావనా ప్రపంచం లో విహరించాడు ఈ కవి.నాకు తెలిసినంతలో డా.దాశరథి,డా.తిరుమల శ్రీనివాసాచార్య తర్వాత రుబాయీలను సంఖ్యా పరంగా, ఇంత విస్తృతంగా రాసిన వారు ఈ కవే నని చెప్పవచ్చు.
ఇంక రుబాయిల లోకి ప్రవేశిద్దాం..
పాపాయి ఆటా, పాటా, నవ్వూ, ఇలా ఉందన్న చమత్కారం...
వీణ మోగినట్లు పాడింది పాప
కొమ్మ ఊగినట్లు ఆడింది పాప
వాణీ విలాసం ఆమె చుట్టూర
ఆత్మ వెలిగినట్లు నవ్వింది పాప
చిట్టి నడకలు,మాటలు,వాళ్ళున్న ఇల్లు ఇలా ఉంటాయట...
చిన్ని నడకల పడవలే పిల్లలు
చిట్టి మాటల వరదలే పిల్లలు
ఇల్లు ఒక ద్వీపం వాళ్ళు దీపం
రంగురంగుల మల్లెలే పిల్లలు (పుట..29)
మన అనుభవానికి మించిన గురువు లేడు. అనుభావాలన్నీమనకు జీవిత గుణపాఠాలే నంటాడు కవి..
ఖాళీ కడుపులతో అలసినప్పటి రోజులు ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు చెప్పిన పాఠాలు ఏ గురువు చెప్పలేడు దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు (పుట..31)
కవిత్వం వచనం కాకూడదనీ,భాష్యానికి తగ్గట్టు భావన సాగాలనీ,మొక్కకు అవసరమైనంత నీరు,అవసరానికి మించిన సంపద ప్రేమల్ని దూరం చేస్తుందని జీవన సత్యం బోధిస్తాడు కవి...
వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది మొక్కకు నీరుండాలి ముంచేట్టుగా కాదు
సంపదలు ఎక్కువైతే ప్రేమ తగ్గుతుంది (పుట..33)
మతములన్నియు మాసి పోవును, జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ..ఈ కవి కూడా కులమతాలు,
భేషజాలు అన్నీ మాసిపోతాయన్న తాత్విక భావాన్ని ప్రకటిస్తాడు.
ఈ కులము ఈ మతము మాసి పోతవి
ఈ హంగూ ఆర్భాటం సమసి పోతవి భేషజాలు ఎన్నున్నా నేల మీదనే
పై లోకంలో నిజాలు తెలిసిపోతవి (పుట..47)
అమ్మ మాట,నాన్న నడక మన జీవన సంస్కారానికి బాటల నేర్పరుస్తాయి అంటున్న కవి...
అమ్మ నేర్పిన మాట గొప్పది
నాన నేర్పిన నడక గొప్పది
నడుమ విద్యలు ఎన్ని ఉన్నా
తొలుత నేర్చిన నడత గొప్పది (పుట..73)
ఎవరి నొప్పి వారి హృదయానికే తెలుస్తుంది.పరుల సానుభూతి కి గాయం మానదంటాడు కవి..
ముళ్ళు దిగిన పాదానికె నొప్పి
తెగిన చేతి చుట్టూనే నొప్పి
పరుల సానుభూతంతా ఊహ
గాయపడిన హృదయానికె నొప్పి
తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, ఆశకు మించిన దరిద్రం లేదు అన్నా డొక కవి
మరి ఈ కవి కూడా ఏమీ తక్కువ తినలేదు..నీ మాటల్లో నిజముండాలి,నీ చేతల్లో సాయం ఉండాలి,నీ ఘనత అక్కర్లేదు నిజాయితీ చాలు అంటాడు..
నిజమొకటి మాట్లాడు నీతులు అక్కరలేదు/ చిన్న సహాయము చేయుఖ్యాతులు అక్కరలేదు/ సంతృప్తి యన్న దొకటే స్వర్గలోక నకలు
సహజ వర్తన మేలు,ఘనతలు అక్కరలేదు (పుట..103.)
సొంత ఊరిపట్ల మమకారం,బాల్య దోస్తులపట్ల యౌవనోత్సాహం, పొక్కిళ్ళయిన వాకిళ్ల లో పొర్లిపోయే కన్నీళ్లు, బాల్య జీవిత ఆనవాళ్ళంటాడు కవి.
ఒక్కసారి ఊరికెళ్తే కొత్త జీవమొస్తుంది దోస్తులతో కీచులాడ నవయవ్వన మొస్తుంది/ పొక్కిలైన వాకిళ్ళు పొర్లి పోయిన కన్నీళ్లు/ గుర్తుకొచ్చి మరోసారి నవజీవన మొస్తుంది. (పుట..125)
పక్షి కన్నీరు కన్పించదు,చెట్టు దుఃఖం విన్పించదు.మన లోలోపలి దుఃఖం ఎవరికీ అంతుచిక్కదంటాడు కవి.
పక్షి కంట కన్నీరు ఎవరు చూతురుల
చెట్టు కార్చు మున్నీరు ఎవరు చూతురు మన కొరకే ఈ లోకం అనుకుంటం
మన లోపలి దుఃఖఝరి ఎవరు చూతురు (పుట..145)
ఇవ్వడమే తెలిసిన పల్లెకు చేయి సాచే గుణం తెలియదు.పట్నాలకు గుంజుకోవడమే తెలుసు,ఉపకారమంటే ఏమిటో తెలియదు అంటున్నాకవి...
పాలవాడు ప్రతిరోజూ పల్లె పరిమళము
తెస్తడు/కాయగూర కాపుబిడ్డ మట్టి మధురిమలు తెస్తడు/ రెండు చేతులా పట్నం గుంజుకొనుడె ఉంటెట్లా /
ప్రతి రైతూ పండించీ పంట మోసుకుతెస్తడు (పుట..183)
మరో రుబాయీలో పల్లె త్యాగాన్ని గురించి ఇలా అంటాడు.
పట్నానికి శ్రమ ఫలాలు పంపుతుంది ఊరు పట్నానికి చెమ్మటనే ఒంపుతుంది ఊరు కలకాలం పల్లెలకె రుణ పడ్డది నగరం పట్నానికి ప్రాణవాయువు నందిస్తది ఊరు (పుట..189)
సహజీవనమే జీవన సౌందర్యమనీ, అనుబంధాలకు,ఆనందాలకు ప్రోత్సాహం, ఉత్సాహం టానిక్కులంటాడు కవి.
నలుగురితో కలవడమే నిజమౌ టానిక్ పలువురితో సంభాషణ నిజమౌ టానిక్ కొంటే దొరికేది కాని బలవర్ధకమూ ఉత్సాహం, ప్రోత్సాహం, నిజమౌ టానిక్ (పుట..297)
సంఖ్యాపరంగా ఈ 536 తెలంగాణ రుబాయిల్లో అన్నీఆణిముత్యాలు కాకపోవచ్చు, కొన్ని సామాన్య నీతి బోధకాలు గా అనిపిస్తాయి.కానీ చాలావరకు సంతృప్తి కరంగా,వాస్తవికంగా ఉన్నాయి.తాత్త్విక చింతనకు సంబంధించివి తక్కువగా కనిపిస్తాయి.
నేను స్థాలీ పులాక న్యాయంగా నేను అతి తక్కువగానే ఉటంకించాను.సమయా భావం, స్థలాభావం వల్ల కేవలం అయిదు శాతం రుబాయిలను మాత్రమే కోట్ చెయ్యగలిగాను. ఇందులోని రుబాయిలు కొన్ని గతంలో తాను రాసిన మట్టిపాట శతకానికి పొడిగింపుగా మనకు అనిపిస్తాయి.
ముందే చెప్పాను,పేరుకే తెలంగాణ రుబాయిలు తెలంగాణా జీవితానికి సంబంధించి గానీ,ఉద్యమ,పోరాటాల గురించి గానీ, ప్రస్తావనలు నాకు కన్పించలేదు.
అందుక్కారణం ఇవి రాస్తున్నకాలం నాటికే (2016-2019) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడి పరిపాలన లో తనదైన ఉనికి చాటు కుంటూ ఉంది.కాకపోతే తెలంగాణ వ్యవహార భాషా శైలికి ఈ రుబాయిలు అద్దం పడుతున్నాయి.
మొత్తంమీద రుబాయీల సృజనలో కవి సాగించిన అనితర సాధ్యమైన ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్రలో నిల్చిపోగలదు.
డా.ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రధానంగా కవి,సామాజిక దృక్పథమున్న రచయిత.సాహిత్యం పట్ల నిశితమైన పరిశీలనా దృష్టిగల వివేచనా పరుడుగా అన్పిస్తాడు .తన కవిత్వానికి అనుబంధ రచనలు కొన్ని వెలువరించాడు.వాటిని గురించి కూడా సంక్షిప్తంగా తెలుసు కోగలిగితే వారి బహుముఖ ప్రజ్ఞ మనకు క్తెలుస్తుంది.వారి సమగ్ర కవితా ప్రస్థానం మనకు కూలంకషంగా మనకు అర్థమౌతుంది.
--------------------------
ఒక చారిత్రక అనువాదం హైద్రాబాద్ విషాదం(2016)
--------------------------
మీర్ లాయక్ అలీ గారి ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్ ఓ చారిత్రక విలక్షణమైన ఆంగ్లా నువాద రచన. ఆనాటి నిజాం రాష్ట్ర ప్రధానిగా, హైదరాబాద్ దేశభక్తుడిగా హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా ప్రయత్నించి, విఫలమైన వ్యక్తి ఆనాటి న్యాయాన్యాయాలను తనదైన తూనిక రాళ్లతో బేరీజు వేసి ఆవేదనతో వ్రాసిన గ్రంథమిది.
ఆంగ్లములోని ఈ పుస్తకాన్ని కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది కవి గారి అనువాద రచన మాత్రమే.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరగడానికి దోహదపడిన కారణాలను జరిగిన సంఘటనలను,జరిపిన సంప్రదింపులను అర్థం చేసుకోవడానికి ఈ అనువాదం ఎంతగానో దోహదపడుతుంది. తెలంగాణ చరిత్రనీ,ప్రత్యేకించి హైదరాబాద్ చరిత్రనీ అధ్యయనం చేయడానికి ఉపకరించే తెలుగు అనువాద గ్రంథమిది.
1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నడిచిన ఉద్విగ్నభరితమైన హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈ అనువాద గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది.
--------------------------
ఆధునిక కవితావిమర్శ లో ఒక పార్శ్వం 'అంతరంగం'( 2018)
--------------------------
కవి డా.ఏనుగు నరసింహారెడ్డి కేవలం కవిగానే కాకుండా,తనలో విమర్శకుడు కూడా ఉన్నాడని ప్రకటించిన ఆధునిక కవితా విమర్శ పుస్తకమే ఈ 'అంతరంగం' ఇది 2018 లో వెలువడింది ఇందులో కవి కవిత్వం పై చేసిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు కవిగారి నిశిత పరిశీలనా దృష్టిని,తనలో ఉన్న లోతైన అవగాహనను సూచిస్తాయి. ఈ వ్యాసాలన్నీ హైదరాబాద్ కవుల కవిత్వం మీదనే సాగుతాయి. కవిత్వంపై ఆయాకవుల అభివ్యక్తి,శిల్పం, దృక్పథం మొదలైన అంశాలపై దృష్టి సారించారు. ఇందులో 26 మంది తెలంగాణా కవుల కవిత్వంపై నిశిత పరిశీలనా దృష్టితో రాసిన సమీక్ష వ్యాసాలుంటాయి.
ఇందులో మహాకవి దాశరథి, అమ్మంగి వేణుగోపాల్ ,సదాశివ డా.కూరేళ్ళవిఠలా చార్య, విశ్వంభర సినారె, ప్రజా కవి కాళోజీ ఆధునిక తెలంగాణఅస్తిత్వ కవి నందిని సిథారెడ్డి ,ఆశా రాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మొదలైన 26 మంది ప్రముఖుల కవిత్వ తత్వం గురించి విశ్లేషించిన పుస్తకమిది.
--------------------------
కవి సాహిత్య నిబద్ధతకు సాక్ష్యమే 'సమాహార'(2019)
--------------------------
కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి సాహితీ వ్యక్తిత్వానికి నిదర్శనమే ఈ సమాహార సాహిత్య వ్యాసాల రచన. రాయకుండా ఉండలేని భావోద్వేగం కవిని సాహిత్య విమర్శకుడిగా కూడా నిలబెట్టింది.స్వయం ప్రతిభతో ఎదిగిన కవిగా, గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చిన కవిగా, విభిన్న సాహితీవేత్తల సమాహార దర్శనంగా 26 వ్యాసాల సంకలనం గా మనకు అందించారు.. ఇందులో ప్రధానంగా బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో స్త్రీ పాత్రల పరిశీలన మొదలుకొని భాను ప్రకాష్ హృదయ పథం.. వరకు వైవిధ్యభరితమైన వ్యాసాలున్నాయి
--------------------------
కవి పరిశీలన లో విలక్షణ సంస్కరణల ప్రతిపాదనలే...
"తెలుగు రాష్ట్రాల రెవిన్యూ వ్యవస్థ" నిన్న నేడు రేపు (2019)
--------------------------
కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు రెవిన్యూ శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ అందులోని అంతర్ బహిర్ స్వరూపాలు స్వయంగా చూసినవారు గనుక,అంతేగాకుండా, జనసామాన్యం పట్ల ఆసక్తి కలిగిన ఉన్నతాధికారిగా, రెవెన్యూ శాఖలోని అవగాహనతో, విశ్లేషణతో ఈ పుస్తకం రాసినట్లుగా మనం భావించవచ్చు
ప్రజా యోగ్యమైన సంస్కరణలను కొన్ని ఇందులో ప్రతిపాదించారు. ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేసే వ్యవస్థగా కలగంటూ రాసిన గ్రంథమిది. ప్రజల సాధకబాధకాలను, రెవెన్యూ శాఖలో రావలసిన సంస్కరణలను, సూచించారు. అటు రెవిన్యూ శాఖ ,ఇటు పాలక వ్యవస్థ ఈయన ప్రతిపాదించిన సంస్కరణలను మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ గ్రంథం చదివితే మనకు అర్థమౌతుంది. ఇందులో రెవెన్యూ శాఖ పై పది అంశాల గురించిన సమగ్ర విశ్లేషణలు ఉన్నాయి.
--------------------------
తులనాత్మక సాహిత్యంలో భాగంగా గుఱ్ఱం జాషువా: డిలాన్ థామస్ ల కవిత్వం లో బాల్యం..(2019)
కవి ఏనుగు నరసింహారెడ్డి గారు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో 1991-93 సం.లలో ఆచార్య మృణాళిని గారి పర్యవేక్షణలో సమర్పించిన ఎం,ఫిల్., సిద్ధాంత గ్రంథ రూపమే ఈ.. గుఱ్ఱం జాషువా:డిలాన్ థామస్ ల కవిత్వంలో బాల్యం.(తులనాత్మక సాహిత్యం).
తెలుగులో జాషువా కవితల్లో బాల్యాన్ని గురించి, ఆంగ్లంలో డిలాన్ కవిత్వంలో బాల్యం గురించి తులనాత్మకంగా అధ్యయనం చేశాడు కవి.
జాషువా కవిత్వం భావ ప్రధానమైంది భావాన్ని అనుసరించి ఆయన భాష ఉంటుంది. భాష మీద మక్కువతో విషయాన్ని దారి మళ్లించడు. ఏ విషయాన్ని తీసుకుని కవిత్వ రచన చేసినా, తన పరిధి దాటకుండా ముగించడం ఆయన లక్షణం.
అందుకు భిన్నమైన వాడు డిలాన్ భాష పట్ల ఆసక్తి ఎక్కువ. ఆయనకు ఒక కొత్త పదం కనిపిస్తే దాన్ని ఆలంబనగా చేసుకుని కవిత్వ రచన చేస్తాడు. ఒక కొత్త భావాన్ని ఏర్పరచుకొని కాదు, అందువల్ల కవిత్వం ప్రారంభమైన తర్వాత అది కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది .
జాషువా కవిత్వం రచనా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. జాషువా కవితల్లో సామాజిక సంఘర్షణ కనిపిస్తుంది డిలాన్ కవిత్వంలోనూ అది కనిపించదని పరిశోధకుడు గా నరసింహారెడ్డి గారు నిరూపిస్తారు.
ఈ ఎం,ఫిల్., సిద్ధాంత వ్యాసమే 2019 లో గ్రంథ రూపంలో వెలువరించారు కవి.
-------------------------
తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరిశీలన ) -పిహెచ్,డి., గ్రంథం (2019)
--------------------------
కవి ఏనుగు నరసింహారెడ్డి గారు 1993-98సంవత్సరాల మధ్యకాలంలో హైద్రాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఆచార్య పి.మృణాళిని గారి పర్యవేక్షణలో తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరి శీలన)అంశం గా పిహెచ్,డి.,పూర్తి చేశారు.ఈ సిద్ధాంత గ్రంథమే 2019 లో పుస్తక రూపంగా వెలువరించారు.
తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలపై చేసిన పరిశోధనలో ప్రధానంగా గమనించదగిన అంశం.. ఏక వస్తుకత. తెలుగు హిందీ లలోనే కాకుండా ఇతర భారతీయ భాషలలో కూడా జాతి విముక్తి పోరాట గీతాలు ఉద్యమ కాలం లో ముమ్మరంగా వెలువడిన గీతాలను పరిశీలించినప్పుడు ఈ విషయమై మరింత స్పష్టత పడిందని నిరూపించాడు పరిశోధక కవి.
జాతీయోద్యమంలో పోరాట వాదులు మితవాదులు మధ్యేమార్గం అవలంభించిన నట్లే జాతీయోద్యమ గేయ కారులో మూడు వర్గాల కవులున్నాలు న్నారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టత నిచ్చాడు పరిశోధకుడు. జాతీయోద్యమం చూపిన గొప్ప ప్రభావం అన్ని ప్రాంతాల, వర్గాల, వయసుల, ప్రజల్ని కదిలించింది. స్వాతంత్రోద్యమం ఒక గొప్ప పోరాట గీతాలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని ఇందులో పరిశోధకుడు వివరించారు. ఈ సిద్ధాంత పరిశోధనా గ్రంథం 2019లో పుస్తక రూపం గా వెలువడింది.
-డా.ఏనుగు నరసింహారెడ్డి సమగ్ర కవిత్వ అధ్యయనం,పరిశీలన,విశ్లేషణల అనంతరం నాలో కల్గిన భావ సంచలనాలు,
ప్రతిస్పందనలు కొన్ని పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది నాకు.
- 52 ఏళ్ల జీవన యానం లో 27ఏళ్ల కవితా ప్రస్థానం కవిది.
తొలిసారిగా కవిగా రెక్కలు విచ్చుకున్న నాటికి వీరి వయస్సు 27 ఏళ్ళు, అప్పటికియువకుడిగా నిరుద్యోగిగా కవిత్వంలోకి అడుగు పెట్టినప్పుడు వారి హృదయాకాశంలో యవ్వనం తాలూకు సహజంగా ఉండే ప్రేమ భావనలు గానీ అనుభూతుల పరవశం గానీ లేక పోవడం ఒక విశేషం. పల్లెజీవనం,మధ్యతరగతి రైతు కుటుంబజీవనం ,నిరుద్యోగిగా తన అంతరంగ అలజడిని కవిత్వం గా అవిష్కరించుకున్నారు.
తొలి కవితా సంపుటిలో నిరుద్యోగ పర్వంలోంచీ పెల్లుబిన వేదనే ప్రధానం గా ప్రతిధ్వనించింది. - తర్వాత ఏడేళ్లకు వచ్చిన కవిత్వం 'నేనే'లో కాలం తెచ్చిన మార్పులతో బాధ్యత గల ఉద్యోగం కవి భావజాలం లోనూ కొంత పరిణతి తెచ్చింది.సామాజిక అవగాహన పెరిగింది,కవిత్వంలోనూ సాంద్రత పెరిగింది. - తర్వాత ఆరేళ్లకు వచ్చిన 'మట్టి పాట' పద్య శతకం తో కవిత్వం లో కొంత వైవిధ్యం చోటు చేసుకుంది. - మట్టి పాట తర్వాత ఐదేళ్లకు వచ్చిన 'కొత్త పలక'(2013) లో వస్తువు ఎంపిక లోనూ,భావప్రకటనలోనూ,సామాజిక, రాజకీయ అవగాహననువిస్తృతం చేసిందనే చెప్పాలి.ఉద్యమాల పట్ల సంఘీభావం ఏర్పడింది.
-రాష్ట్రంవిడిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళ తర్వాత వచ్చిన కవిత్వం "మూల మలుపు" లో ప్రాంతీయ చైతన్యం పట్ల అవగాహన పెరిగింది.
-నాకు తెలిసిన,నాకు పరిచయమున్న కొందరు రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణా కవులు,రచయితలు సీమాంధ్రుల పట్ల అవమాన కరంగా రాయడం నేను గమనించాను గానీ ఈయనెక్కడా అలాంటి పదజాలం వీరి కవిత్వం లో నాకు కనపడలేదు.
-కాకపోతే..ఒక కవితలో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగాఉండి, కార్యదక్షుడిగా ప్రశంసలు పొందిన ఒక రాజకీయ మేధావిని ఒక చరిత్ర హీనుడిగా అభివర్ణించడం అస్మదీయులకు బాధాకరంగా తోచింది .ఆ కవితను సంకలనం లో చేర్చకుండా ఉంటే బావుండు ననిపిస్తుంది. -అదొక్కటే తప్ప, తన కవిత్వంలో మరెక్కడా సీమాంధ్రుల పట్ల అధిక్షేపం ప్రకటించలేదు.
-తాజాగా వచ్చిన "తెలంగాణ రుబాయిలు'. కవిగారి విలక్షణ సృజన.500 లకు పైగా రుబాయిలు రాయడం వెనుక కవిగారి నిబద్ధతను కవిత్వం పట్ల అపారమైన ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు .
డా.ఏనుగు నరసింహారెడ్డి వ్యక్తిగా సహృదయుడు,ఏమాత్రం భేషజాలు లేని కవి,నాకు గత పదిహేనేళ్ళుగా ఆత్మీయుడు,
నేను బాగా ప్రేమించే వారిలో ఒకడు, వారి 27 ఏళ్ల కవితాప్రస్థానంలో,అయిదు కవితా సంపుటాలు+తెలంగాణ రుబాయిల బృహద్గ్రంథం తో కలిసి ,మరికొన్ని ఆనుబంధ గ్రంధాలను ఆసాంతం చదివి, విశ్లేషించే అవకాశం నాకు కల్గించినందుకు కవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వయసులో నాకంటే పదేళ్లకు పైగా చిన్నవారు కావడంవల్ల వారిని ఇష్టపూర్వకంగానే అక్కడక్కడా ఏకవచనం లోనే సంభోదించాను.
ప్రముఖ కవి, విమర్శకులు, డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారన్నట్లు.. నిబద్ధుడైన,చురుకైన కవిగా సాహితీప్రపంచంలోకి దూసు కొచ్చిన కవిగా డా.ఏనుగు నరసింహారెడ్డి గారిని మనసారా అభినందిస్తూ,సుంకిరెడ్డి మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను.
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు