మా రచయితలు

రచయిత పేరు:    పి. జయ

సాహిత్య వ్యాసలు

పక్కదారి పట్టిన మహిళా దినం ఉద్దేశం

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా గోదావరి అంతర్జాల సాహిత్య పత్రిక "ఆకాశమంత" అనే శీర్షికతో ప్రత్యేక మహిళా సంచిక చేస్తున్నందుకు ఉద్యమాభినందనలు. మహిళా దినం నేపథ్యం, దాని ఉద్దేశం,ఆ ఉద్దేశాన్ని ఎవరు, ఎందుకు పక్కదారి పట్టించారు, కార్మికులలో కెల్లా అత్యంత దోపిడీ,పీడనలకు గురయ్యే కార్మికులు ఎవరు, వారి విముక్తి ఎలా సాధ్యం, చివరికి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం శీర్షికలోని "శ్రామిక, పోరాట" అనే పదాలు సైతం పాలకవర్గాలు ఎందుకు తుంగలో తొక్కాయి అన్న అంశాలను సంక్షిప్తంగా చర్చిద్దాం.

పారిశ్రామిక విప్లవానంతరం యూరప్,అమెరికా ఖండాలలో అనేక పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి.ఆ పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు విపరీతమైన శ్రమ దోపిడీకి,అణిచివేతలకు గురయ్యే వారు.కనీస వసతులైన మరుగుదొడ్లు,తాగునీరు,గాలి, వెలుతురు, చంటిబిడ్డల సంరక్షణ లేకపోవడం, శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, 15-18 గంటలు పని చేయించడం, సెలవులు ఇవ్వకపోవడం మొదలైన సమస్యలు ఎదుర్కొనే వారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆ కార్మికులు సంఘటితమై గడ్డకట్టే చలిలో కవాతులు,రాస్తారోకోలు, ధర్నాలు మొదలైన నిరసన కార్యక్రమాలు చేసేవారు.వారి పోరాటాలను కంపెనీ యజమానులు తీవ్రంగా అణచివేసేవారు.చివరికి సజీవ దహనాలు కూడా చేసేవారు.అయినా ఆ మహిళలు తమ పోరాటాల నుండి వెనక్కి తగ్గకపోవడంతో యూరప్, అమెరికా దేశాలలోని మేధావులకు, ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చారు.ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు "క్లారా జెట్కిన్" 1910వ సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభను ఏర్పాటు చేసి, ఆ సభలో ఆ మహిళా కార్మికుల అలుపెరుగని పోరాటాలను ఎత్తిపడుతూ,శ్రామికుల శ్రమ దోపిడీకి, అణిచివేతకు మూలకారణం పెట్టుబడిదారీ వ్యవస్థ అని, స్త్రీ పురుష కార్మికుల ఐక్య పోరాటాలే వారిని "శ్రమ విముక్తి" చేస్తాయని, అది కార్మిక వర్గం యొక్క "దీర్ఘకాలిక పోరాటాల" వల్లనే సాధ్యమవుతుందని చెప్పారామె. అంతేకాక కార్మిక వర్గమే పీడిత ప్రజలను సమూలంగా విముక్తి చేస్తుందని, ఈ పోరాటాలు సజీవంగా ఉండాలంటే నిరంతర చర్చ, నిర్మాణాలు, సంఘటిత పోరాటాలు ఉండాలని వీటి సమీక్షకు మహిళలకు సంవత్సరానికి ఒకరోజు ఉండాలని, అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల మహిళలు మహిళా దినం ఏర్పాటు చేసుకోవాలని క్లారా జెట్కిన్ ప్రపంచ మహిళలకు పిలుపునిచ్చారు.

ప్రపంచంలో ఏ మూలన ప్రజా పోరాటాలు వెల్లువెత్తినా, వాటిని పీడిత ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని, తమ ముందున్న జీవన్మరణ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడం చూస్తుంటాం. ఈ ప్రజాపోరాట సంస్కృతిని పెట్టుబడిదారులు అంతే వేగంగా నీరుగార్చి పోరాట "సారాన్ని" తుంగలో తొక్కి రూపాన్ని మిగిల్చి పాలకవర్గాల చేత తమ మార్కెట్ దోపిడిని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినం ఉద్దేశాన్ని కూడా తుంగలో తొక్కి, మహిళల్ని అత్యంత దుర్మార్గంగా దోపిడీ,అణిచివేతలకు గురి చేసిన ఇక్కడి బ్రాహ్మణీయ భూస్వామ్య హైందవ సంస్కృతిని మహిళా దినానికి జోడిస్తూ స్త్రీలను వంటలు, అల్లికలు, ముగ్గుల పోటీలకు పరిమితం చేశారు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత కార్మికులు అనుభవిస్తున్న ఎనిమిది గంటల పనిదినం,ప్రసూతి,క్యాజువల్, చైల్డ్ కేర్ సెలవులు, పురుషులతో సమానమైన వేతనాలు, అలవెన్సులు మొదలైన హక్కులన్నీ ఆనాటి కార్మిక మహిళల పోరాట ఫలితమన్న చరిత్రను పాలకవర్గాలు ఎక్కడా బయటకు రానివ్వడం లేదు.

మహిళా దినం అవతరించిన ఈ నూటా పది సంవత్సరాలలో దాదాపు ప్రపంచదేశాలన్నీ స్వతంత్రం పొంది,బూర్జువా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వాలే పబ్లిక్ పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతున్నాయి. కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేసినట్టు సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణలను ప్రవేశపెట్టి విపరీతమైన లాభాలు ఆర్జించాలని వ్యూహరచన చేశారు. మూడవ ప్రపంచ దేశాలలో లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ పరిశ్రమలను నష్టాల్లో నడుస్తున్నాయని దుష్ప్రచారం చేసి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించడం,క్రమంగా మూసి వేయడం జరిగింది. నూతన ఆర్థిక విధానాల ఉద్దేశమే ప్రైవేటు రంగాల ను బలోపేతం చెయ్యడం. ఇందులో భాగంగానే ప్రభుత్వ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు VRS లు ఇవ్వడం, శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం జరుగుతుంది. మరోవైపు మనలాంటి వ్యవసాయ దేశాలలో ఈ నూతన ఆర్థిక విధానాలు వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలో పడేశాయి. చేతి వృత్తులను ధ్వంసం చేశాయి. ఈ రంగాల విధ్వంసం వల్ల చిన్న, సన్నకారు రైతులు,రైతు కూలీలు, చేతివృత్తుల వారు పట్టణాలు, నగరాలకు వలసలు పోయి అసంఘటిత కార్మికులుగా మారిపోయారు. అక్కడ కూడా వీరికి ప్రతిరోజు పని దొరకక, అడ్డాల దగ్గర పోటీపడుతూ, అర్ధాకలితో బాధపడుతున్నారు. నూతన ఆర్థిక విధానాల అనంతరం పెట్టుబడిదారులు పరిశ్రమలలో కార్మికుల స్థానంలో యంత్రాల వాడకం పెంచడం వల్ల కార్మికుల వినియోగ శక్తి తగ్గిపోతుంది. పెట్టుబడిదారులు ప్రజలకు అవసరం లేని వస్తువులు కుప్పలుగా తయారు చేయడం వల్ల విపరీతమైన నిల్వలు పెరిగి పోయి నిరంతర సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. వారి మధ్యనే తీవ్రమైన పోటీ ఏర్పడి, దేశవిదేశాలలో కొద్దిమందే "గుత్త పెట్టుబడిదారులుగా" తయారయ్యారు.వీరు కార్మికులకు కనీస వసతులు కల్పించకుండా, శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకుండా ఆనాటి యూరప్, అమెరికా కార్మికుల కన్నా దుర్భరమైన స్థితిలో కి నెట్టేశారు. చివరికి కార్మికుల పోరాటాలు లేకుండా చేసి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం శీర్షికలో"శ్రామిక, పోరాట" అనే పదాలను కూడా ఈ గుత్త పెట్టుబడిదారులు మాయం చేశారు.

ఈ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థలో అసంఘటిత కార్మిక మహిళలే గాక అన్ని వర్గాల, కులాల మహిళలు తరతమ స్థాయిలలో దోపిడీ, పీడనల ఎదుర్కోవడమే కాక, పసి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, హత్యలతో వారి మనుగడే  ప్రశ్నార్థకమైంది.ఈ దేశ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగుమెట్టయిన దళిత స్త్రీలు బ్రాహ్మణీయ భూస్వామ్య వ్యవస్థ వల్ల వేల సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురి కావడమే కాక, లైంగిక దోపిడీకి గురవుతున్నారు.దానికి పెట్టుబడిదారీ వ్యవస్థ తోడవడం వల్ల శ్రామిక దళిత స్త్రీల పరిస్థితి పెంక మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది.వీరు పల్లెలు, పట్టణాలు, నగరాలలో రాత్రి 3-4 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు వీధులన్నీ శుభ్రం చేస్తూ, మనుషుల "మలాన్ని" చేతులతో ఎత్తి పోస్తూ, అసంఘటిత కార్మికులలోకెల్లా అత్యంత దుర్భరమైన కార్మికులుగా బతుకీడుస్తున్నారు.దుమ్ము,ధూళి,దుర్వాసన వల్ల వీరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడి చిన్నవయసులోనే మరణిస్తున్నారు.ప్రభుత్వాలు వీరి శ్రమకు తగిన వేతనాలు ఇవ్వవు, ఉద్యోగాలు శాశ్వతం చెయ్యవు. వీరి ఆకలి,అంటరానితనం,ఆడతనం అనే అసమానతలు పోయినప్పుడు,వీరు కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించినప్పుడు, శ్రమ విముక్తి, కులనిర్మూలన, మహిళా విముక్తి జరిగినప్పుడు సమాజంలోని అన్ని కులాల, వర్గాల మహిళలు విముక్తి చెందుతారు."కార్మిక విముక్తి"అంటే ఆర్థిక రాజకీయ విముక్తే కాదు, సామాజిక, జెండర్, అంతర్ జెండర్, సాంస్కృతిక విముక్తి జరిగినప్పుడే క్లారా జెట్కిన్ ఆశయంలక్ష్యం నెరవేరుతాయి.

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు