మా రచయితలు

రచయిత పేరు:    ఆచార్య యస్‍. రాజేశ్వరి

సాహిత్య వ్యాసలు

ఎరుకలేని ఎరుకలస్త్రీల జీవితం 

           అరుణ రాసిన ఎల్లినవల 1992లో తొలిసారి అచ్చయింది. నీలితో కలిపి 1996లో విరసం వారు ప్రచురించారు. ఎల్లికి కొనసాగింపే నీలి నవల కూడా!. ఎల్లినవల ఎరుకల జీవన విధానాన్ని మన ముందు పరిచింది. అందులోనూ స్త్రీల జీవితాన్ని కేంద్రంగా చేసుకుంది. ఈ నాటికీ బాల్య వివాహాలు, ఓలి వంటి దురాచారాల కింద నలిగిపోతున్న చిన్న పిల్లల్ని వాళ్ళ బానిసత్వాన్ని మన ముందు నిలబెట్టింది ఈ నవల.

            ఎరుకల వారి జీవనం ప్రధానంగా పందుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. ఆడవాళ్ళు ఈతాకు బుట్టలు, చాపలు అల్లుతారు. కొందరు సోదె చెప్పటం, పచ్చబొట్లు పొడవడం, పురుళ్ళు పోయడం కూడా చేస్తారు. 1991 జనాభా లెక్కల ప్రకారం 3,87,898 మంది ఎరుకల వాళ్ళు భారతదేశంలో ఉన్నట్లు తేలింది. వీరిలో 25.74% అక్షరాస్యత ఉంది. ఎరుకల వాళ్ళు ఆంధ్రలో కృష్ణా, విజయవాడ, తూ.గో., ప.గో. ప్రాంతాల్లో ఎక్కువగా నివశిస్తున్నారు. కృష్ణా జిల్లా వుప్పలూరు ప్రాంతానికి చెందిన అరుణ తన ప్రాంతంలో తనకు బాగా తెలిసిన ఎరుకల వాళ్ళ జీవితాన్ని దగ్గరగా లోతుగా పరిశీలించి, స్త్రీల పై అణిచివేతను, వారి జీవితాల్లోని చీకటి కోణాల్ని వెలుగులోనికి తెచ్చింది. ఇందులోని పాత్రలన్నీ సజీవమైనవే.

            ఎల్లి గురించి చెప్పాలంటే నాయనమ్మ మాలచ్చిమితో మొదలుపెట్టాలి. మాలచ్చిమికి చిన్నప్పుడే ఓలికి ఆశపడి పెళ్ళి చేశాడు ఆమె తండ్రి. ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక మొగుడు తాగుడికి డబ్బు అవసరమై సుబ్బన్నకు అమ్మేశాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్న పిల్లలు వదల్లేక ఏడుస్తూ ఉండగా బలవంతంగా లాక్కువచ్చాడు కొనుక్కున్నోడు. గుండెల్లో దుఃఖంతో తడి ఆరని కళ్ళతో మాలచ్చిమికి సుబ్బన్నతో సంసారం మొదలయింది. ఎంకన్న, బాజి పుట్టారు. బాజిని ఊరి కామందులు పాడు చేయడంతో పిచ్చిదై నదిలో దూకి చచ్చిపోయింది. పందులు తమ చేలో పడ్డాయని ఊరి పెద్ద కోపంతో సుబ్బన్న కాలు నరికేశాడు. కాలు కుళ్ళి సుబ్బన్న మంచాన పడి చివరికి చనిపోయాడు. కొడుకు ఎంకన్నకు దురగతో పెళ్ళయింది. దురగ నలుగురు పిల్లల్ని కని ఆఖరి కాన్పులో, కాన్పు కష్టమై చనిపోయింది. మా లచ్చిమికి వృద్ధాప్యం వల్ల కళ్ళు కనపడక గుడ్డిదయ్యింది. పెద్దపిల్ల ఎల్లిపదేళ్ళకే ఇంటి బాధ్యతనంతా నెత్తిన వేసుకుని చాకిరీ చేస్తుంది. పదకొండు ఏళ్ళు రాగానే తండ్రి ఎంకన్న ఎక్కువ ఓలికి ఆశపడి 30 యేళ్ళ తమ్మయ్యకిచ్చి పెళ్ళి చేశాడు. చిన్న పిల్లకావడంతో ఇంట్లోనే ఉంచుకున్నాడు. 13 సంవత్సరాలు రాగానే ఎల్లిని అత్తారింటికి పంపారు. అక్కడ ఇంటి చాకిరీ అంతా చేస్తున్నా కూడా ఎల్లిపై వాళ్ళకు కనికరం లేదు. అత్తా మామ తిట్టే వాళ్ళు. మొగుడికి అనుమానం ఎక్కువ. రోజూ కొట్టేవాడు.

            దువ్వ ఎంకన్న దగ్గర పెరిగాడు మాలచ్చిమి ఓసారి పొరుగూరికి పెద్దోళ్ళ ఇంట్లో పురుడు పోయడానికి వెళ్ళింది. బిడ్డ పుట్టగానే వాళ్ళు మాలచ్చిమికి ఇచ్చి వడ్ల గింజ వేసి చంపుకుంటావో, పెంచుకుంటావో నీ యిష్టం అన్నారు. బంగారం లాంటి బిడ్డను చంపడానికి చేతులు రాక పెంచి పెద్ద చేసింది. దువ్వుకు నీలిఅంటే ఇష్టం నీలికి కూడా దువ్వ అంటే ప్రాణం. నీలి కోమలి కూతురు. నీలి చిన్నప్పుడే తండ్రి ఎక్కువ ఓలి కోసం రోగిస్టి వాడికిచ్చి చేశాడు. మొగుడు పోగానే నీలి సోదె చెప్పుకుంటూ తల్లి దగ్గర బతుకుతోంది. కొడుకు చస్తే మాత్రం అదినా ఇంటి గొడ్డు కాకుండా పోద్దా! ఎవడన్నా పలుగేసి దాన్ని తోలుకు పోవాలంటే నా ఓలి నాకు కట్టాల్సిందేఅన్నాడు నీలి మామ సంగయ్య పంచాయితీలో.ఊరిని కులం కట్టుబాట్లను నీలి ,దువ్వ లెక్కపెట్టక పంచాయితీని ఛీకొట్టి వెళ్ళిపోయారు. 

            ‘ఎల్లినవలలో స్త్రీ జీవితం చుట్టూ ఉన్న మూడు వలయాలను రచయిత్రి చిత్రించారు. ఈ నాటికీ ఎరుకల వాళ్లలో బాల్యవివాహాలు, ఓలి వంటి దురాచారాలు ఉన్నాయి. తాగొచ్చి ఆడవాళ్లను కొట్టడం, తన్నడం మగవాళ్ల జీవితంలో ఒక భాగం. కుటుంబంలో ఉన్న ఈ గృహహింసఒక విషవలయంగా స్త్రీల చుట్టూ బలంగా ఉంది. దానిని జాగ్రత్తగా అమలు పరుస్తూ కులం కట్టుబాట్ల పేరుతో కులపెద్దలు జరిపే కులపంచాయితీలు రెండవ వలయం. మొత్తం ఎరుకల వారిని అందరినీ అణిచివేస్తూ ఆడవాళ్ళపై భూస్వాములు చేసే ధౌర్జన్యం మూడో విషవలయం’’ ఆడది మగోడి చెప్పు  కింద తేలుతొక్కి పట్టాలి అని ఎరికల వాళ్ళు అనుకుంటే, ఎరికల వాళ్లు మన కాళ్లకింద చెప్పులాంటి వాళ్ళు అణిచి వేయాలి అని భూస్వాములు అనుకుంటారు. భూస్వాముల వాళ్ల కింది చెప్పుల్లాగా ఎరికలోళ్ళు. ఆ చెప్పుకింది తేలులాగా ఆడోళ్లు ఉన్న వ్యవస్థ వారిది.

            మొత్తం మీద భూస్వాములు, కుల పెద్దలు, ఇంట్లోని మగోళ్లు అందరికీ ఆడదాన్ని అణిచి వేయాలన్నదే  ఆలోచన.లోకానికంతా పంబలోడు లోకువ, పంబలోడికి పంబలది లోకువ’’ అంటుంది. మాలచ్చిమి కుటుంబం, వ్యవస్థ, రాజ్యం, చట్టం, స్త్రీల జీవితాలపై చూపే పెత్తనాన్ని ఎల్లినవల చిత్రీకరించింది.

            ఈ నవలలో రచయిత వాచ్యంగా కాక, సూక్ష్మంగా చెప్పింది ఒకటి ఉంది. అది కింది కులాల స్త్రీలపై ఉన్న ఒక అపోహను దూరం చేసింది. బ్రాహ్మణకులానికి చెందిన హనుమాయమ్మ మాలచ్చిమి దగ్గర బాధపడుతుంది. తన కూతురికి పెళ్ళి చేస్తే రెండేళ్ళకే ఇంటికి వచ్చేసింది. మొగుడు ఇంకో దాన్ని  ఉంచుకోవడంతో, మా యిండ్లల్లో ఒక సారి పెళ్లయితే ఆడదాని జీవితం ఇక అంతే వాడు చచ్చినా, బతికినా వాడే మొగుడు మీకు ఈ కట్టు బాటు లేదు కదా. ఇష్టం లేనోడిని వదిలి మారు మనువు చేసుకోవచ్చు అంటుంది. అందుకు మాలచ్చిమి ఆ సొతంత్రం మాకెక్కడిది అమ్మగారు? కన్నోడు డబ్బు కోసం అమ్ముతాడు. కట్టుకున్నోడి దగ్గిర చాకిరీ చేస్తాం. పిల్లల్ని కంటాం. కట్టుకున్నోడు. తాగుడు కోసం అమ్ముతాడు. పిల్లల్ని లాక్కుంటాడు. ఆ చిన్న పిల్లల్ని వదల్లేక ఏడుస్తూ కొనుక్కున్నోడి వెంట వెళతాం. ఉత్త గొడ్డు బతుకు మాదిఅని వాపోతుంది. ఆశ్చర్యపోయిన హనుమాయమ్మ ఆడదాని బతుకు ఎక్కడైనా ఒకటే అని బాధపడుతుంది.

            సాహిత్యంలో ప్రతి రచన తన పూర్వకాలపు లేక సమకాలీన రచనతో అల్లుకుని ఉంటుంది. ఆ అల్లుకను Inter textuality అంటారు. ఒక రచనలో అంతర్వాహినిగా ఉన్న అనేక రచనల్ని గుర్తుపట్టడం విమర్శకుడికి గొప్ప అనుభూతి. ఆ దృష్టితో పరిశీలిస్తే గురజాడ పూర్ణమ్మ ఎల్లిగాను, కన్యాశుల్కంలోని బుచ్చమ్మ. మధురవాణి నీలిలోను కన్పిస్తారు. అంతకంటే ఎక్కువగా ఎల్లి నవల్లో ఎరుక స్త్రీల బానిసత్వం అమెరికాలోని నీగ్రోల బానిసత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఎల్లి నవలకు స్తోవే రాసిన అంకుల్‍ టామ్స్ కాబిన్‍కు దగ్గరి పోలికలు ఉన్నాయి.ఈ నవలను రంగనాయకమ్మ టామ్‍ మామ ఇల్లుఅనే పేరుతో అనువదించారు. స్తోవే రచన బానిసల దుర్భర జీవితాల్ని వెలుగులోనికి తెచ్చింది. తెల్లోళ్లు బానిసల్ని కొట్టడం, చంపడం, వేలం వెయ్యడం వంటి దురాగతాలను ఎండగట్టింది. ఈ నవల ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య అంతర్యుద్ధానికి కారణమై, చివరికి బనిసత్వ రద్దుకు దారితీసింది.

            అయితే అక్కడ బానిస స్త్రీలు యజమాని నుంచి మాత్రమే తిట్లు తన్నులు తింటారు. ఇక్కడ ఎరికల స్త్రీలు భూస్వాములు నుంచి మాత్రమే కాక, తమ తండ్రి, మొగుడు, మామ, చివరికి కొడుకు నుంచి కూడా తన్నులు తింటారు. నా బతుక్కి చర్నాకోలపోయిందనుకుంటే, ఈ కొడుకు మొగుడు తగులు కున్నాడే అని కత్రేణి వాపోతుంది. కొడుకు తాగుడు కోసం డబ్బులు ఇవ్వడం లేదని తల్లి అని కూడా చూడకుండా తిడుతాడు. కొడతాడు. రంగనాయకమ్మ జానికి విముక్తి నవలలో బానిసలకు స్త్రీలకు మధ్యగల పోలికల్ని పన్నెండింటిని పట్టికలాగా చూపారు. ఈ నవలలో అరుణ గొడ్డుకి ఆడదానికి ఉన్న పోలికల్ని చూపించారు. నీలిని గొడ్డుతో పోలుస్తూ ఎక్కువ ధర చెపుతాడు మామ సంగయ్య.నీలి

1. సావిల్లు మారిన గొడ్డుకాదు

2. ఈత తీనిన గొడ్డుకాదు

3. వొడికి లొంగిన గొడ్డుకాదు

4. పనిపాట చేయగలగొడ్డు

            చాకిరీ తెలుసు మగోడి తరువాత మగోడంత చేవగలది అంటాడు సంగయ్య.అందుకే నీలికి ఏక్కువ ఓలి చెల్లించమన్నాడు. ఈ విధంగా అరుణ ఎల్లి నవల ద్వారా ఎరుక స్త్రీల జీవితంలో దాగిన చీకటి కోణాల్ని వెలుగులోకి తెచ్చారు.

 

( రచయిత : డీన్‍  మరియు  సెనెట్‍ మెంర్‍ , తెలుగు అధ్యయన శాఖ , శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502)

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు