(అలనాటి తెలుగు సినిమా రచయిత 'సదాశివ బ్రహ్మం' గారి జయంతి ఉత్సవాల సందర్భంగా...)
కవి కలముకు,శిల్పి ఉలికి,కళ కంచెకు
ఈ మూటికి సాటి రాదోయ్... పోటీ లేదోయ్
అంటూ వెండితెర సాక్షిగా బల్లగుద్ది కళారూపాలకి ఈ ప్రపంచంలో ఏవి సాటిరావు అని చెప్పిన మొదటి తరం సినిమా రచయిత 'సదాశివబ్రహ్మం'. ఆయన పేరు ముందు 'వెంపటి' అనే ఇంటి పేరు మీద పాడిన గుర్తులేదు. సదాశివబ్రహ్మం అంటేనే సర్వజ్ఞులని ఒక సినిమా చేతికి వస్తే కథ,మాటలు,పాటలు వ్రాసి సిద్ధం చేయగల సమర్ధులని ఆనాటి సినీ నిర్మాతల నమ్మకం.అది నిజం అని ప్రేక్షకులు,సినీ అభిమానులు, మేధావులు సైతం తలలూపి మెచ్చుకున్న కాలం.పాతకాలపు తెలుగు సినిమా వెండి తెర వెలుగుల యుగం. ఆ సినిమా సాంఘికం,పౌరాణికం,చారిత్రకం, జానపదం ఏదైనా ఆ విషయంలో కి శ్రీ సదాశివబ్రహ్మం గారు పరకాయ ప్రవేశం చేసి కథా కథనాన్ని రాణింపజేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.
ఆయన 1905 డిసెంబర్ 29 వ తారీకున వెంపటి వారి పండిత కుటుంబంలో తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండి భాష,వేదం, సంస్కృతి,సాంప్రదాయం, పాండిత్యం వంటి విషయాలు ముఖరితమయ్యే ఇంట్లో పెరిగారు. 10 ఏళ్ళ వయసుకే పద్యాలు వ్రాయగల ప్రావీణ్యం సంపాదించారు.స్కూలు చదువు ఎనిమిదో క్లాస్ వరకే అయినా పంచకావ్యాలు చదివి వాటి సారాన్ని గ్రహించారు.
శ్రీ వెంపటి సదాశివబ్రహ్మం 1941 వ సంవత్సరంలో సినిమారంగంలో రచయితగా పని చేయాలని ఆసక్తితో మద్రాసు నగరం చేరారు. ఆయనకి 1941 రాజా శాండో అనే దర్శకుని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'చూడామణి' అనే సినిమాకి రచయితగా పని చేసే అవకాశం లభించింది.అదే ఆయనకి తొలి సినిమా.ఆ వెంటనే తెనాలి రామకృష్ణ,ఘరానా దొంగ, పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి కొన్ని సినిమాలకు రచన చేశారు. అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు అన్ని ఆయనే రాశారు. అయితే 1960లో తోట సుబ్బారావు నిర్మించిన 'పరమానందయ్య శిష్యుల కథ' బాగా పాపులర్ గా అందరికీ తెలిసినది. అది బాగా ఆడి, డబ్బులు కూడా బాగా వచ్చాయని ఆనాటి వారు చెప్తూ ఉంటారు. ఈ పరమానందయ్య శిష్యుల కథ కి కూడా రచయిత శ్రీ సదాశివ బ్రహ్మం గారే. అదీ చమత్కారం.
ఆయనకి బాగా గుర్తింపు వచ్చిన చిత్రం రాధిక (1947) అని చెప్పుకోవచ్చు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. సాంకేతికంగా సినిమా మా మెరుగుపడటం, రావు బాలసరస్వతీ దేవి లాంటి ప్రతిభావంతులైన వారు అందులో పాటలు పాడటం, అవి ప్రచారానికి అవకాశం కలగడం కొన్ని అంశాలు.
ఈ 'రాధిక' లో
గోపాలకృష్ణుడు నల్లన
గోకులంలో పాలు తెల్లనా కాళిందిలో చల్లనా
పాట పాడండి నా గుండె జల్లున
అంటూ మారుమోగుతూ ఉండేది అప్పట్లో రేడియో మధ్యాహ్నం ఓపెన్ చేస్తే చాలు ఈ పాట వాడ వాడంత వ్యాపించి వినిపించేది. చాలా కాలం వరకు ఇదొక ప్రైవేటు గ్రామఫోన్ రికార్డు గా అందరూ భావించేవారు. పాడిన వారి పేరు చెప్పినా రచయిత పేరు, సంగీతం చేసిన వారి పేరు మరీ చూస్తే సినిమా పేరు కూడా తరచూ వినిపించేవి కావు.తెరవెనుక పనిచేసే రచయితలు నిజంగా తెరవెనుక గానే ఉండిపోవడం జరుగుతూ వచ్చింది చాలాకాలం.
నెమ్మదిగా 1949లో వచ్చిన కీలుగుఱ్ఱం తో రచయితకి కూడా గుర్తింపు లభించింది.అన్నిటికీ మించి 1950లో విడుదలైన 'సంసారం' సినిమాతో సదాశివబ్రహ్మం గారికి మంచి గుర్తింపు వచ్చింది. సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమా. చిన్న చిన్న టౌన్ లలో కూడా 100 రోజులు పైన ఆడిన సినిమా ఈ సంసారం. ఇందులో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు,సావిత్రి లాంటి వాళ్లు స్టార్స్ గా మారారు. ఇందులో మెయిన్ లక్ష్మీరాజ్యం అయినా ఆమె అప్పటికే స్థిరపడ్డ నటి.ఈ సంసారం సినిమాకి రచన, సంగీతం, నటీనటుల ప్రతిభ అన్నిటికీ మించి సమకాలీన సాంఘిక వాతావరణం సినిమా విజయానికి దోహదపడ్డాయి. సువర్ణ దక్షిణామూర్తి అద్భుతమైన సంగీతం చేసిన సినిమా సంసారం.
ఈ సినిమాలో
1.సంసారం సంసారం
ప్రేమ సుధా పురం
నవ జీవన సారం- సంసారం
ఘంటసాల పాడారు
2.చిత్రమైనది విధి నడక
పరిశోధన ఒక వేడుక
3.కలనిజమాయెగా కోరిక తీరేగా
4. టకు టకు టకు టమక్కుల బండి
లాంఖానాల బండి ఎద్దుల బండి ఇలా రక రకాలుగా పాటలు అప్పట్లో అందరినీ ఎంతో అలరించాయి .సదాశివ బ్రహ్మం గారి రచన కు ఒక గుర్తింపు మెప్పూ లభించాయని చెప్పుకోవచ్చు.
సదాశివ బ్రహ్మం గారి చిత్రాలలో ముఖ్యమైనది 'వద్దులే డబ్బు' (1954) చిత్రమైన,సరదా కథని అద్భుతంగా నడిపిన తీరు బాగుంటుంది. ఇందులో అల్లదే! అవతల అదిగో పాట చాలా బాగుంటుంది.ఇది జిక్కి పాడారు. ఈ 'వద్దంటే డబ్బు' చిత్రం లో ఎన్టీఆర్,షావుకారు జానకి,జమున, పేకేటి ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణం చక్కని సంగీతం సమకూర్చారు.వై ఆర్ స్వామి దర్శకులు.
1.చదవాలి కంటిలోని మదిలోని 2.ప్రేమ గీతి (ఏ ఎమ్ రాజా సుశీల) ఎవరో దోషులు పాటలు సదాశివబ్రహ్మం వ్రాశారు. ఈ సినిమాలో శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా రాశారు. అప్పట్లో సదాశివబ్రహ్మం వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా రాశారని సినీ సంగీతాభిమానులు కొనియాడారు.అది అతిశయోక్తి కాదు.నిజంగా వారి సాహిత్యం పాటలు చాలా ఉదాత్తంగా ఉంటుంది.
చాలా పేరు తెచ్చిన చిత్రం ఈ వద్దంటే డబ్బు ఆ తర్వాత సదాశివబ్రహ్మం గారు చాలా విజయవంతమైన చిత్రాలకు పని చేశారు.
'భలేరాముడు' (1956) ఈ చిత్రంలో లోనూ చాలా చక్కని పాటలు ఆయన రాశారు. ముఖ్యంగా 'ఓహో మేఘమాల నీలాల మేఘమాల! చల్లగ రావేలా మెల్ల మెల్లగ రావేలా! ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి విడివిడిగా పాడతారు. కథాపరంగా సాహిత్యంలో తేడాలుంటాయి.ట్యూన్ దగ్గరగా ఉంటుంది.సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో గంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల పాడారు
'పక్కింటి అమ్మాయి' (అంజలి దేవి, రేలంగి ప్రధాన పాత్రలు) హాస్యరస ప్రధానమైన చిత్రం సదాశివబ్రహ్మం గారు ధీటుగా రచన చేశారు.చాలా విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం. 'సొగసైన క్రాఫు పోయే- నగుమోము చిన్నబోయే' అంటూ అప్పట్లో కుర్రాళ్ళు ఒకరినొకరు ఆట పట్టించుకునే వారు.
'పరదేశి'కన్యాశుల్కం రచనతో తెరకెక్కాయి.పరదేశి సాధారణ సినిమానే అయినా 'కన్యాశుల్కం' నిజంగా కత్తి మీద సాము.తెలుగు సాహిత్యంలో గొప్ప క్లాసిక్ గా చెప్పుకునే నాటకం కన్యాశుల్కం గురుజాడ అప్పారావు గారి అద్భుత సృష్టి తెర అనువదించడం సదాశివబ్రహ్మం అద్భుతంగా నిర్వహించారు. ఇది సామాన్యమైన విషయం కాదు, సులువు కాదు ఆయన చదువుకున్నది ప్రాచీన సాహిత్యం, సంస్కృత కావ్యాలు కానీ ఆయన ఆలోచన అత్యంత ఆధునిక మని విశాల మని వారి సినిమా రచన పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. ఇందులో 'సరసుడ దరిచేర రా' అనే నృత్యగీతం రాశారు.ఇది ఎమ్.ఎల్.వసంతకుమారి పాడారు.
'ఇలవేలుపు' లాంటి విజయవంతమైన సినిమాలకు పూర్తిగా పనిచేశారు. 1940లలో వచ్చిన తెనాలి రామకృష్ణ కు వీరే పని చేశారు. మళ్ళి 1956 లో తీసిన తెనాలి రామకృష్ణ (ఎన్టీఆర్ ఏ యన్ ఆర్) సినిమాకి సదాశివబ్రహ్మం గారు రచన చేశారు. ఇందులో పద్యాలు పాటలు రాశారు. 'చేసేది ఏమిటో చేసేయి సూటిగా- ఘంటసాల పాడిన పాట సంప్రదాయ సిద్ధంగా ఉన్నా పద్యాలు మినహాయిస్తే పద్యాలు, పాటలు శ్రీ వెంపటి సదాశివబ్రహ్మం గారు రాశారు.
ఈ తెనాలి రామకృష్ణ (56) రచనా పరంగా సంగీతపరంగా పెద్ద హిట్. దీనికి సంగీతం కూర్చున్నవారు విశ్వనాథన్ రామ్మూర్తి.
భువన సుందరి- భామావిజయం, రణభేరి లాంటి ఎన్నో సినిమాలకు రచన చేశారాయన. ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు 'చెంచులక్ష్మి- సువర్ణసుందరి- లవకుశ- అప్పు చేసి పప్పు కూడు- ఇల్లరికం- 56 లో వచ్చిన తెనాలి రామకృష్ణ. సాంఘిక సినిమాలు ఎంత బాగా రాసారో. అంత సమర్థంగానూ పౌరాణికాలు, జానపదాలు కూడా రాసి మెప్పించగల గలగడం ఆయన ప్రతిభకు గీటురాయి.
ఎల్ వి ప్రసాద్ గారి లాంటి సినిమా దిగ్గజం పక్కన రచయితగా మాటలు,పాటలు రాసి మెప్పించడం గొప్ప విషయం. ముఖ్యంగా అప్పు చేసి పప్పు కూడు లాంటి హాస్య చిత్రానికి పనిచేయడం విజయం సాధించడం వెంపటి సదాశివబ్రహ్మం గారికి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవాలి.
లవకుశ చిత్రంలో రామాయణం పాటల్లో రచించారు. అందులోనే 'ఏ నిముషానికి ఏమి జరుగునో' అని రాశారు అలాగే చెంచులక్ష్మి చిత్రంలో 'పాలకడలి పై శేషతల్పమున' అంటూ విష్ణువుని స్తుతించారు.
వెంపటి సదాశివబ్రహ్మం- మరణించే పర్యంతం సదా తెలుగు సినిమాలకు రచన చేస్తూనే ఉన్నారు.
1968 జనవరి 1న ఆయన మరణించినా, సదాశివబ్రహ్మం రాసిన తెలుగు సినిమాలు ఈనాటికీ సినిమా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. పాత తరం రచయితల ప్రతిభను చాటి చెప్తూనే ఉన్నాయి.