మా రచయితలు

రచయిత పేరు:    నాంపల్లి సుజాత

కవితలు

మరుజన్మంటూ ఉంటే...

ఔను..
నేనిప్పుడు
గతాన్ని తలచుకొని
వగచడం సరికాదనిపిస్తోంది.

విశ్వమానవ మనుగడలో
ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న నేను
వజ్రసంకల్పంతో సాగిపోవాలి
చీకటి పొరల్లోంచి
తలెత్తిన అంకురాన్ని
రేపటి సూరిన్నయి వెలుగులు పంచాలి.!

తరతరాల అణచివేతలోంచి
రగిలిన నిప్పుకణికను
నింగి అంచులదాకా దూసుకుపోవాలి
మిరుమిట్లు గొల్పుతూ..
ఇప్పుడు
నేను వంటింటి కుందేలుకు కాను
ఒంటిచేత్తో ప్రగతిరథాన్ని
నడిపే సామ్రాగ్నిని..
అన్నట్టు..
ఇప్పుడెవరి చుట్టూతా తిరిగే
ఉపగ్రహాన్నీ కాదు..
నన్ను నేను వెలిగించుకుంటున్న స్వయం ప్రకాశిని.

ఇప్పుడు
తొక్కుడుబండనీ..
వాడి పాడేసే కరివేపాకునూ కాదు
ఇంటిల్లిపాదికి
కడుపునింపే అన్నం ముద్దనీ
అంతకన్నా మించి అవనికే ప్రాణంపోసే
అమ్మనీ ...
ఆకాశంలో సగాన్ని నేనే..

ఇప్పుడు
అగాధం నుంచి అంతరిక్షం దాకా..
అన్నీ రంగాల్లో విస్తరించిందీ నేనే
ఏక కాలంలో
ఇంటినీ.. మింటినీ అలవోకగా మోసే
సవ్యసాచినీ ..
ఇప్పుడు
నా తొవ్వలున్న  పల్లేర్లూ నల్లేర్లనీ నలిపేసే
ఆత్మవిశ్వాసం నాది
వెరసి ఒక జాతి జెండాకుండే
ఆత్మగౌరవం కూడా నాదే..
ఇంతకన్నా..ఎమ్ కావాలి..!
మరు జన్మంటూ ఉంటే
మల్లా మహిళ నై పుట్టాలనే కోరుకుంటా..!

గాంధీ ఆసుపత్రి
 

ఇవ్వాళ
నీ పేరు వింటేనే..
మంత్రముగ్దులమ్..తల్లీ!
కరోనా దేహాలని కాపాడే ధన్వంతరివి..!
కనబడని
వైరస్ తో యుద్ధం చేస్తున్న సైనికుడివి..
ప్రపంచమే..
లాక్ డౌన్..అంతా..క్వారంటైన్
ప్రతి ఇల్లూ తలుపులు
బిగించుకున్న వేల
ఎవరికి వారమే అనుమానితులం
అమ్మా ..తల్లీ.!
గాంధీ ఆసుపత్రీ..నువ్ సర్కార్ దవాఖానవే..
మూసుకున్న ప్రపంచం లో
నువ్వుమాత్రమే చేతులు చాచి ఆహ్వానిస్తున్నావ్..
కొర జీవునం తో కొట్టుకుంటున్న
మా ప్రాణాలని కాపాడాలని..
అర్రులు చాస్తున్నావ్..
తెల్ల దుస్తుల దేవుళ్ళని
అస్త్ర శస్త్రాలతో సమాయాత్తపరిచినవ్!
ఆరిపోతున్న
దీపాలకు స్వస్థత నింపే మదర్ థెరీసావి..నువ్వే

అది పేలే వైరస్ విస్ఫోటనం
తెలిసీ ఎదురెల్లుతున్నావ్
ఎంత తెగింపు తల్లీ నీది
మరణించిన బిడ్డల పై
కొంగుకప్పి మార్చురీ లో విలపిస్తావు.

ఒకప్పుడు
నిన్ను తలచుకుంటేనే..
వెన్నులో వణుకు పుట్టేది.
వొద్దుబిడ్డో సర్కార్ దవాఖానకూ అంటూ
వ్యంగ్య గానాలాలపించేటోళ్లం
క్షమించు తల్లీ!
ఇప్పుడు నువ్వే కాపాడే శరణాలయానివి
ఏ మాట కామాటే..
దీని పునాది
ఆ నిజాముదే నట ఎంత ముందుచూపో..!
గతంలోఎన్ని
గత్తరలకు ఎదురు నిలవలేదు!?
ఈ గాంధీ దావాఖాన..
ఇప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాం
నిన్ను చూసుకునే..కదా
తమసోమా జ్యోతిర్గమయా అంటూ
మరణం నుండి అమరత్వానికి..
తీసుకెల్లే నీకు శతకోటి వందనాలు తల్లీ!

 

అవసరమే ఎవరికైనా..!

కాలంతో..
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్ అవ్వడమంటే..!

ఆకులు రాలాయనో
సాయంసంధ్య ఎదురొచ్చిందనో ముడుచుకోక
తాజాగా చివుర్లను మొళిపించుకోవడం
అవసరమే ఎవరికైనా

రాగంలో రాగమై వర్ణంలో వర్ణమై
అడుగు కలపి సాగితేనే
సరికొత్త కాంతులమై ప్రజ్వలించేది.

పరిణామక్రమాన్ని అంగీకరించిన
ఒకనాటి అగ్నిశకలమే
ప్రాణిని ఆవిష్కరింప చేసిన జీవగ్రహం

తనను తాను
సంస్కరించుకోకుంటే ఇంకేముందీ
పుట్టలు పెరిగి పాకురుపట్టి పోమూ.!?

గొంగళి పురుగు నవీకరించు కుంటేనే
రంగుల సీతాకోకై రెక్కవిచ్చేది
రాగి పాత్రలని  రుద్ధి మెరిపించకుంటే
బొగ్గుల మయమే కదా

ఎప్పటికీ ముట్టని  మంచిల్లబాయి
మర్లబడి తెర్లయిపోదూ
భూకేంద్రక సిద్ధాంతమే ఇంకా సరియైందంటూ
ఆదిమయుగాల్లోనే జీవిస్తుంటారు కొందరెందుకో
వాడకుంటే మెడదుకూడా
అంతరించిపోతుంది సుమా..!

నవీకరించుకోవడం అంటే..
రంగుల రెక్కలను అతికించుకొని
గాల్లో విహరించమని కాదు.
రంగు వెలిసిపోకుండా నీకు నువ్వు పరిమళించమని

ఒక్క మనుషులకే కాదు
సర్వోపకరణాలకు నవీకరణ ఆవశ్యకమే..!
మానవ సృష్టి మన చరవాణీ
ప్రాధేయపడుతోంది
అప్డేట్ అయ్యేందుకు అనుమతి నియ్యమని.!
ప్రాణం లేని పరికరమే
అదేపనిగా ఆరాటపడుతుంటే
నన్ను నేను నవీకరించుకోవద్దూ.!?


 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు