ప్రతి గురువారం మల్లంపల్లి ఊర్లో అంగడి(సంత) . ఆ ఊర్లో పనిచేసే టీచర్లందరూ అప్పుడప్పుడు అంగడిలో తమకు కావలసిన సరుకులు కొనుక్కునే వాళ్ళు .
అక్కడే కూరగాయలు కొంటున్న సుమనకు ,నమస్తే మేడం అన్న మాట వినిపించగానే తలెత్తి చూసింది సుమన .
ఎక్కడో చూసినట్టుందేకాని
గుర్తు పట్టలేదు సుమన.
"నన్ను గుర్తు పట్టలేదా మేడం . అవునులెండి మేము ఎందుకు మీకు గుర్తుంటాం
నేను మేడం రమ్యను . ములుగులో మీ స్టూడెంట్ ని"
అన్నది రమ్య .
"అవునా ఏంటి ఇక్కడ చదువు మానేసావా ?"
అన్నది సుమన.
ఒకవైపు బజ్జీ లేస్తూ, మరొకవైపు కాయగూరలమ్ముతూ ,పది చేతులతో పని చేస్తున్నట్లు కనపడుతోంది రమ్య .
అప్పుడే అటుగా వచ్చిన అతనితో "నువ్వు ఇక్కడ కూర్చొని కూరగాయలమ్ము , నేను బజ్జీలు వేస్తానంటూ" వెళుతూ , రండి మేడం ఇక్కడ కూర్చోండని కుర్చీ చూపించింది. వేడివేడిగా వేసిన బజ్జీలు ప్లేట్ లో పెట్టి అందించింది.
" రమ్య గురించి ఆలోచిస్తూనే ఇప్పుడా! వద్దమ్మా! నేను ఈటైంలో ఏమీ తిననమ్మా " అన్నది సుమన.
"అవును మేడం జీవితంలో మర్చిపోయే అలవాట్లా మీవి. స్ట్రిక్టు గావుండే మీరు విద్యార్థులందరికీ ఎప్పుడు గుర్తే , సాయంకాలం బ్రష్ వేయనిది ఏమీతీసుకోరు కదా! అన్నది "రమ్య .
ఏమి కొనకుండా దర్జాగాఅంగట్లో (సంత) కుర్చీలో కూర్చుని ముచ్చటపెడుతున్న సుమన దగ్గరకు వచ్చిన టీచర్లు "మేముందరం కొనవలసినవి కొనుక్కున్నాం . మీరేమీ కొనలేదా "అన్నారు టీచర్లు .
ఇక వెళ్దామా అన్నారందరు.
"ఈ అమ్మాయి రమ్య ములుగులో నాస్టుడెంటని పరిచయం చేసింది" సుమన.
అందరికి నమస్కారం చేసింది రమ్య . "నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే లంచ్ లోబజ్జీలు తెప్పించుకునే వాళ్ళమన్నది రోహిణి ". ఆమెకు చిరుతిళ్ళంటే చాలా ఇష్టం .
"మీరు ఇప్పుడు ఏ ఊర్లో చేస్తున్నారు మేడం .వీళ్ళందరూ టీచర్లేనా" అన్నది రమ్య .
"అవునమ్మా !నేను ఇప్పుడు ఈ వూరు మల్లం పెళ్లి లోనే పనిచేస్తున్న గురువారం ఇక్కడ అంగడి కదా అందరంఅప్పుడప్పుడు కావలసినవి కొనుక్కుంటా మన్నది "సుమన.
"మీరు ఎప్పుడు నాకు కనపడలేదు మేడమ్ .దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇక్కడే గురువారం బజ్జీలు ,కూరగాయలమ్ముతున్నానన్నది" రమ్య .
ఇందాక వచ్చినతన్ని పిలిచి ఇతడు నా భర్తంటూ అందరికీ పరిచయం చేసింది . అతను అందరికీ నమస్కరించాడు .చాలా సౌమ్యుని లా కనిపించాడు. సుమనకు . ప్రశ్నార్థకంగా చూస్తున్న సుమనతో "ఇంకా పిల్లలు లేరు మేడం "అన్నది రమ్య.
సరే రమ్య నీ కాళ్ల మీద నువ్వు నిలబడి సంపాదించుకుంటున్నావు చాలా సంతోషం , ఇంకా ఎదగాలి నువ్వంటు ఒక పచ్చనోటు ఆమె చేతిలో పెట్టబోయింది . ఇప్పటికే మీ రుణం తీర్చుకోలేనిది. మీ మంచి మాటలు వినిపించుకోలేక పోయానన్నది .ఆమె కన్నుల్లో సన్నటి నీటి పొర.
అందరూ తినండంటూ , మిరపకాయ బజ్జీలు మసాల చల్లి టీచర్లకందరికీ ఇచ్చింది రమ్య. రమ్య చాలా బాగున్నాయమ్మాఅంటూ టీచర్లు అందరు మెచ్చుకొన్నారు.
"కొంచెం ఉప్పుఇస్తా మీరు కూడా మొహం కడుక్కొని తినుమని బ్రతిమాలింది" రమ్య.
బలేదానివే రమ్యా ! నాకు ఏమి వద్దు అనగానే, సరే ఇంటికి తీసుకు వెళ్ళండన్నది రమ్య కాదనలేకపోయింది సుమన.
సాయంత్రం నాలుగైందంటె మొహం కడుక్కోనిది మంచినీళ్ళు కూడా తాగదు సుమన.
ఇంటికి వెళ్ళిన తర్వాతనే అన్ని అని ,ఆమెను దగ్గరగా చూసిన వారందరికీ ఆ విషయం తెలుసు. ఏదో ఒకటి కొనుక్కొని తింటూనే ఉంటారు కొందరు టీచర్లు .
వస్తామమ్మా రమ్య .జాగ్రత్తని టీచర్లందరూ బస్సెక్కారు.
నేను కూడా చదువుకుంటే అలా వెళ్ళే దాన్నేమో అని వెళ్ళిన బస్సు వంక చూస్తూ పనిలో పడింది రమ్య.
మంచి జీవితాన్ని పాడు చేసుకున్నదనుకున్నది సుమన.
ములుగు హాస్టల్ లో ఉండి చదువుకునేది రమ్య. అప్పుడు ఎనిమిదవ తరగతి నుండి తమ్మిదవ తరగతి వచ్చింది. చదువుకంటే ఇతర విషయాల మీద ఎక్కువగా మక్కువని గ్రహించింది సుమన.
క్లాస్ టీచర్ గా సుమన చాలా స్ట్రిక్ట్ గా ఉండేది .ఆ పక్కనే బాయ్స్ స్కూలు కూడా ఉండేది. ఇంటర్వెల్ కాగానే బయటకు వెళ్లిపోయేవారు ఆడపిల్లలు. వాష్ రూమ్స్ ఉండేవికావు. ఉపాధ్యాయులూ ఇబ్బందిపడేవారు .ఒకటే వాష్ రూం ఉండేది . అటెండర్ కు డబ్బులిచ్చి నీళ్లు పెట్టించుకుని శుభ్రం చేయించుకునేవారు టీచర్లు .
అప్పుడప్పుడూ "బాయ్స్ " స్కూల్ నుండి ఒక రిద్దరు పిల్లలు క్లాసురూముల దగ్గర తచ్చాడుతుండేవారు .వారిని అటెండర్ బెదిరించి పంపేది .
ఉన్న టైంలో కొంత నీతి బోధ చేసి తమ పాఠాలు చెప్పుకునేవారు కొందరైతే , పిల్లల ప్రవర్తనను డేగ కళ్ళతో చూసే వారు కొందరు .అందులో మొదటి వ్యక్తి సుమన.
అటెండర్ లక్ష్మిని ఇంటర్వెల్ కాగానే బయటనే నిలబడమనేది సుమన. పిల్లలు ఎటు వెళ్తున్నారో కనిపెట్టి చూడమనేది. ఒకటి రెండు సార్లు రమ్య ఇంటర్వెల్ కాగానే మల్లీ స్కూలుకు రాలేదు. ఇలా ఐతే పిల్లులు చెడిపోతారని, పిల్లల గురించి ఆలోచించాలని ,ప్రతి క్లాసులో అటెండెన్స్ తీసుకొని క్లాస్ టీచర్ కుఇచ్చేవారు .అలా బయటికి వెళ్లి ఎప్పుడు వచ్చిందో చెప్పి ఎక్కడికెళ్లావ్ అంటూ అందరిని ఆరాతీసేవారు సుమన, మిగతా క్లాసు టీచర్లు.
పెరుగుతున్న వయసు తప్పటడుగులు వేస్తే కష్టమని మంచి చెడుల గురించి క్లాస్ కు ముందు ఐదు నిమిషాలు నీతి వాక్యాలు చెప్పేవారు టీచర్లు.
ఎంత చెప్పినా వినని పిల్లలకు హెచ్ ఎంతో పాటు ఓ నలుగురు టీచర్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు.
ఒక రోజు తమ స్కూల్ లో రమ్య ,బాయ్ స్కూల్ లో టెన్త్ క్లాస్ అబ్బాయి ప్రకాష్ అన్న రవి తో వెళ్ళిపోయిందని తెలిసి టీచర్లందరూ బాధపడ్డారు. అప్పుడు వెళ్లిపోయిన రమ్య ఇన్ని సంవత్సరాలకు కనిపించిందనుకుంటు ఆలోచనలోవున్న సుమనతో మేడం ఇంకా ఏమాలోచిస్తున్నారు మన స్టేజీ వచ్చింది దిగండన్నారు టీచర్లు .
స్కూలుకు వస్తుంటె కొన్నిరోజులవరకు రమ్య గురించి ఆలోచనలే వెంటాడేవి సుమనను .చాలా రోజులవరకు మళ్ళీ రమ్య కనిపించలేదు .ఆమెగురించి ఆలోచనలు మరుగు పడుతున్న వేళ ఒకరోజు సరాసరి స్కూల్ కె వచ్చింది రమ్య .
"నమస్తే మేడం. మీతో కొంచెం సేపు మాట్లాడాలని వచ్చానన్నది" రమ్య.
"సరే అమ్మ ఇంటర్ వెల్ తరువాత నాకు లీజరుంది అప్పుడు మాట్లాడుకుందామన్నది" సుమన.
"చెప్పమ్మ రమ్య ,ఏం కావాలన్నది "సుమన .
ఏమీలేదు మేడం మీరు ఇక్కడే పనిచేస్తున్నారని తెలియదు. తెలిస్తే మిమ్మల్ని కలిసే దాన్ని" అన్నది రమ్య .
"ఆ రోజుల్లో మీరు అలా చెప్తుంటే మీ మీద నాకు చాలా కోపం వచ్చేది . మీరు చెప్పేవన్ని మా మంచికని నాకు తరువాత అర్థమైందన్నది" రమ్య .
"అసలేం జరిగిందన్నది " సుమన.
హాస్టల్ కు అప్పుడప్పుడు మా కోసం రవి వచ్చేవాడు కాసేపు చెట్టు కింద కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయేవాడు. డిగ్రీ చదివి ఆపేసానని చెప్పాడు. అప్పుడప్పుడు నాకొరకు తెచ్చే బహుమతులు చూసి సంబర పడేదాన్ని .
కొన్నిరోజుల తర్వాత నాతో వస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు. మాది చాలా పేద కుటుంబం. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఇంటికి పోతే తినడానికి కూడా ఉండేది కాదు.
ఇంటికి పోగానే అమ్మ నాన్న నన్ను కూలికి తీసుకు పోయేవారు . చెల్లెల్లు మాఊర్లోనే చదువుకునే వాళ్ళు. అతను చెప్పిన మాటలు నమ్మి వెళ్తానంటే కీర్తన వద్దని చెప్పింది. మీకు చెప్తానని బెదిరించింది .ఐనా వినక బడి లో పుస్తకాలుపెట్టి వెళ్ళిపోయాము .నా దగ్గర ఎక్కవ డబ్బులు ఏమి లేవు . యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంటానని నన్ను తీసుకు వెళ్ళాడు రవి .రెండు మూడు రోజులు హోటల్ లో ఉన్నాము. ఇది తెలుసుకున్న మా వాళ్ళంతా మన దగ్గర వున్న గుళ్ళన్నీ వెతికారట. ఎర్రగట్టు గుట్ట , కీసర గుట్ట యాదగిరిగుట్టదగ్గర వెతకడం మొదలుపెట్టారట . ఈ విషయం రవికి తెలిసిందేమో నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. లాడ్జి వాళ్ళు అతను రూం కాళీ చేసాడని ,నన్ను బయటకుపంపి లాక్ వేసుకున్నారు. నాకు ఏం చేయాలో తోచక గుడి దగ్గర కూర్చున్నాను. నన్ను మా పెద్దమ్మ కొడుకు గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చాడు .పంచాయితీ పెట్టి మా బావకిచ్చిపెళ్లి చేశారు .మా బావకు చిన్నప్పుడే ఫిట్స్ వచ్చాయట.మందులిప్పిస్తున్నాము. ఏదైనా చెప్తే చేస్తాడు లేదా లేదు. అందుకే అతన్ని నా వెంటే తీసుకొని వస్తాను . ఇంకా మందులు వాడాలంటున్నారన్నది " రమ్య.
ఇప్పటికైనా మంచి జీవితంలో కాలు పెట్టావు అన్నదిసుమన.
మేడం ఇక నన్ను మళ్ళీ బడికి పంపలేదు .వెంట ఒక మనిషి కాపలాగా ఉండే వాడు. నేను ఎక్కడికైనా వెళ్తాననో ఏమో, కొన్నాళ్ల తర్వాత నేను ఎక్కడికి పోను నన్ను వెంబడించకని చెప్పాను. మా పెళ్లై ఇప్పుడు నాలుగేళ్లయింది . నాకు చదువుకోవాలని వుంది. కానిఎలాగో తెలియటం లేదు. ఇద్దరం కూలీ ,నాలీ చేసుకుంటూ, గురువారం మాత్రం ఇక్కడ కూరగాయలమ్ముతూ , బజ్జీలమ్ముతుంటాను మేడం అన్నది రమ్య.
మీ టీచర్లందరికీ బాగా చదివే పిల్లలు గుర్తుంటారు. మాలాంటి వాళ్ళు గుర్తు ఉండరు అన్నది రమ్య.
"అది నిజమే కాని రమ్య తప్పటడుగు వేసే వాళ్ళని కాపాడుకుంటేనే మాకు తృప్తి. బాగా చదివే వాళ్ళ కన్నా చదువు నేర్పితే నేర్చుకున్నవాళ్ళకుమేము, మాకువాళ్ళుఎక్కువగా గుర్తుంటారు .బాగా చదివే పిల్లలతోపాటు మిగతావాళ్ళు చదవాలన్నదే మాఆశ అన్నది " సుమన.
"అది సరే నీకు చదువుకోవాలనుకుంటున్నావు కదా !, నేను ఇక్కడే ఉన్నాను కనుక టెన్త్ ప్రైవేటు కట్టిస్తా .మేము ఇచ్చిన నోట్సు చదువుకో డౌట్స్ ఉంటే మా దగ్గరకు రా !టీచర్లందరు నీకు సహాయం చేస్తారన్నది సుమన.
"సరేమేడం మీరు చెప్పినట్లు విని చదువుకుంటానన్నది " రమ్య .
"నేను ఏ ఊర్లో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ చేయూతనిస్తూ నే ఉంటానని మీ అందరికీ తెలుసు కదా అన్నది "సుమన.
రమ్య !ఇప్పటికైనా,
అడ్డదారులు వెతుక్కోకుండా మంచి పేరు తెచ్చుకొమ్మన్నది సుమన .
"నా తప్పు నేను తెలుసుకున్న ఇక ఎప్పుడూ పొరపాటు చేయను మేడం "అన్నది రమ్య
"మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని రమ్య భుజం తట్టింది" సుమన.