ముఖచిత్రం నుంచి ముద్రణ సంస్థ దాకా ..... సంపాదకత్వం నుంచి రచనల ద్వారా.... ఆవిష్కరణ నుండి సమీక్షదాకా .... అంతేందుకు ఆఖరికి రోగం కూడా స్త్రీ జాతి .... కరోనా మహమ్మారి.
కరోనా కాలం కథలు..... శతాధిక రచయిత్రుల కథలు, కధనాల బృహత్ గ్రంధం 630 పేజీలు, 106 మంది రచయిత్రులు, అ కథలు 24 కథనాలు, గౌరవ సంపాదకులుగా డా॥ తిరునగరి దేవకిదేవి సంపాదకులు, అనిశెట్టి రజిత, డా॥ కొమర్రాజు రామలక్ష్మి, డా॥ బండారి సుజాత, సహ సంపాదకులుగా డా॥ మురాడి శ్యామల, తమ్మెర రాధికా గార్లు, ముఖచిత్రాలు చిత్రకారిణి డా॥ జి. అవనీరావుగారు, రుద్రమ ప్రచురణ సంస్థ, 21,11,2021న కరీంనగర్ ప్రెస్ భవన్లో డా॥ కాత్యాయనీ విద్మహే గారి చేత పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఒక సాహసోపేత శ్రమ, ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన చారిత్రక ఘటనల గ్రంధస్థం చేయడం. అది సంపూర్తిగా మహిళల భాగస్వామ్యంలో జరగడం హృదయ పూర్వకంగా గర్వించదగ్గ అభినందించ దగ్గ దృగ్విషయం.
ఒక రకంగా వేల సంవత్సరాలుగా కాలపు పొరల క్రింద అణచి వేయబడ్డ, అక్షరీకరింపబడిని, అంధకారంలోనివెలుగు చూడని విప్పిచెప్పబడని అంశాలు, దృశ్యాలు, ఘటనలు, సత్యాలు కథలుగా, కథనాలుగా మొదటిసారిగా ధైర్యంగా, సున్నితంగా, వేదనాభరితంగా మానవీయంగా చూపబడ్డాయి.
ముఖచిత్రంలో ఎక్కువ భాగాన్ని గద్దమొహం ఆక్రమించుకోగా, మన నాలుగుసింహాల రాజముద్ర మధ్యగాను ఓ ప్రక్క రెక్కలుసాచి వేటకు సిద్ధమైన గద్ద, పి.పి. సూట్స్లో ఉన్న వైద్యసిబ్బంది, వెనక పేజీలో పి.పి. సూట్స్లో మహిళ, గ్లోవ్స్ ఉన్న చేతులు, కరెంటు తీగలపై పక్షుల సమూహం వలసలకు సింబాలిక్ కావచ్చు లేదా.... గద్దరూపంలో ఉన్న వ్యవస్థలకు ఎరలుగా మారే పక్షుల రూపంలో కావచ్చు..... అర్థవంతమైన చిత్రీకరణ డా॥జి. అవనీరావుగార్కికి అభినందనలు.
ముఖాచిత్రంలో గద్దమొఖపు వైశాల్యముందు మన రాచముద్ర తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండటం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వైఫల్యానికి సూచిక కాబోలు.
కారోనా కాలం కథలు తొలిదశ లాక్ డౌన్ వరకు గల కాలాన్ని మనముందుంచాయి. ఈ గ్రంధం నుండి అనేక అంశాల విభిన్న కోణాలపై అనేక చర్చలు చేయవచ్చు.
ప్రఖ్యాత రచయిత్రులు, ఆచార్యులు, సంస్థల స్థాపకులు, జాతీయస్థాయి అవార్డులు పొందినవారు, అనేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరినవారు, సామాజిక సేవలకే అంకితమైనవారు అనేక విద్యా, వైద్య, విభిన్న రంగాలలో పేరు ప్రతిష్ఠలు కలిగిన వారి నుండి మొదలుకొని మొదటిసారిగా వ్రాసిన పిన్నవారి వరకు రచయిత్రులున్నారు. మేలిమి, వజ్రాలు కొందరయితే సానపెట్టుకొని వేలుగులీనాల్సిన ముడివజ్రాలు కొందరు. 18 మందికి పైగా డాక్టరేట్స్ చేసిన వారి నుండి గృహిణులు, విద్యార్థులు వరకు ఉన్నారు. విభిన్న అస్తిత్వవాద దృక్కోణపు రచయిత్రుల నుండి మైనారిటీ వర్గ వాద రచయిత్రుల వరకు ఉన్నారు. విభిన్న కోణాల్ని ప్రతిఫలించిన ఈ గ్రంధం సాహిత్య ప్రపంచంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకొందని చెప్పవచ్చు.
పుస్తకంలోని కొన్ని ఛాయాచిత్రాలు, వర్ణచిత్రాలు కరోనా కల్లోలాలను మన కళ్ళముందు ఆవిష్కరించి మన హృదయాల్ని కల్లోల పరచుతాయి.
దాదాపుగా కథలన్నింటిలో కరోనా కాలమనేకాదు ఈ కోణంలోనైనా, అనాదిగా మహిళల జీవితాలపై గల అణచివేత వివక్ష, హింస, దోపిడిల తాలూకు అన్ని రకాల సమస్యల చర్చ జరిగింది. రచనల్లో చాలా భాగం స్త్రీవాద దృకోణంలోనే చర్చ జరిగింది. ఆ చూపు తనని దాటి వలస కార్మికుల, భవన నిర్మాణ, అవ్యవస్థీకృత రంగ, ప్రజల, ప్రైవేట్ రంగంలో ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయిన వారి, పల్లె పట్టణాల, విభిన్న రాష్ట్రాల మొత్తంగా భారతదేశం నుండి ప్రపంచ దేశాల దాక కథలు కథనాలు కొనసాగాయి.
ఏ కథాకథనంలో కృతక లేదు. ఎందుకంటే అన్ని వారి అనుభవాలు, పరిశీలనలు కాబట్టి సత్యం ఎలా చెప్పినా సత్యమే కనుక అవాస్తవికత ఎక్కడ కానరాదు.
స్త్రీ జీవితపు అన్ని కోణాలు ఆవిష్కరింపబడ్డాయి. అన్ని రకాల వివక్షలు, అణచివేతలు చూపబడ్డాయి. దేశ మేదయినా, మతం, ప్రాంతం, ఉపాధి, ఉద్యోగం ఎదైనా స్త్రీల స్థితిగతులస్థాయి అదే అధోస్థాయి అని తెలుస్తుంది.
పుట్టుక, బాల్యం, కౌమారం, యవ్వనం, వైవాహిక, గృహస్త జీవినాలు, నెలసరి రోజులు, గర్భిణిగా, చూలింత, బాలింతగా, ప్రసవ వేదనలు, వైధవ్య బాధలు, విడిచివేతల వ్యధలు, విడాకుల, ఒంటరి మహిళల జీవితాలు, వృద్ధాప్యపు తిరస్కారాలు, బలత్కారాలు, బలవన్మరణాలు..... వంటిల్లు నుండి జీవితపు అన్ని రంగాలదాకా మహిళలుగా వారి వారి కుటుంబాలు, సమాజాలుగా సమస్త ప్రపంచపు స్థితిగతులు నగ్నంగా ఆవిష్కరింపబడ్డాయి.
పల్లె, పట్టణ విశ్వనగరాల నుండి విదేశాలదాకా, గుడారాలు, గుడిసెలు, గూనపెంకులు, మిద్దెలు, అద్దె ఇల్లు, అపార్ట్మెంటుల నుండి రోడ్డు ప్రక్క, చెట్ల క్రింది ఆవాసాల దాకా అనేకానేక ఇతివృత్తాలతో కథాకథనాలు కొనసాగాయి.
కరోనా కాలం కధలన్నింటిలో ద్వితీయశ్రేణి జీవితాలే, ఈ సంపుటిలోని కథలో లాగా స్త్రీలంతా ద్వితీయశ్రేణీ కదా అందులో మళ్ళీ అత్తా, ఆడబిడ్డల కంటే దిగువజాతి కదా !
ఈ కథలన్నీ మధ్య తరగతి, దిగువ మధ గతి, పేద, నిరుపేద, దళిత, ఆదివాసీ, మైనారిటీ వారి కరోనా కష్టాల్ని, నిత్య కష్టాల్ని ఆవిష్కరించింది. జీవితాల్ని కలలోకాల్లో తేలించే సినిమాల, సీరియళ్ళ స్వప్న లోకాల పూలపాన్పులపై నడిచే ప్రేక్షకుల్ని కఠినాతి కఠిన, కన్నీటి పర్యంతపు వాస్తవాల ఎండకు కాలిబొబ్బలెక్కిన అరిపాదాల నెత్తుటి రహదారులపై నడిపించి ఒక్కింత ఆర్ద్రతను, మానవీయతను తట్టి లేపడంలో సార్థకతను సాధించింది.
అట్టడుగు జీవనాలైనప్పటికి అసూర్యంపశ్యల అతిగుప్త వెలుగుచూడని జీవన చిత్రాల కఠిన సత్యాల్ని జాతీయ రహదారుల్లోకి నగ్నంగా ఆవిష్కరింప చేసి, సమాజపు ఆలోచనకు మరింత కొనసాగింపును, చూపును అందించింది.
ప్రపంచపు 80% ప్రజల జీవితాల చిత్రణ ఇదే కదా ఒక మహవిపత్తు ప్రపంచవ్యాప్తంగా సంభవించినప్పుడు జరిగిన విపరీత పరిణామాల అఘాతం నుండి తేరుకొని, సవరణలు, సంక్షేమాలు, రక్షించడాలు దాకా ప్రభుత్వం నుండి వివిధ వ్యవస్థలదాకా (కుటుంబ కూడ) జరిగిన పరిణామాల్ని, జరగకూడని, జరగాల్సిన, ఇకముందు సంస్కరించుకోవాల్సిన, ఆలోచించాల్సిన అంశాల, స్పష్టీకరణలు కూడా కరోనా కాలం కథలు మనకు తెలుపుతాయి.
శాంతిశ్రీ బెనర్జీ (4) ఆత్మస్థైర్యంలో 500 కి.మీ.లపైగా మల్లీశ్వరి గాయపడిన తండ్రిని కూర్చోబెట్టుకొని చేసిన సైకిల్ ప్రయాణంలో ఆడపిల్లలు తలుచుకొంటే ఎదైనా చేయగలరని చెబుతూనే వలస కష్టాలు చూపుతూనే సాటి మానవులలోని మానవీయతను దర్శింపచేసారు.
టీ, యాకమ్మగారి 8వ కథ దుఃఖనదిలో...... అత్తాకోడళ్ళ విషాద విలాపంతో.... ఆమె ఆకలి చచ్చిపోయింది..... కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టారు.... కాని ఆకలికి ఎవరైనా లాక్డౌన్ పెట్టుంటే బాగుండు...... జూపాక సుభద్ర గారి (23) కొన్ని నూకలు మిగిలే ఉండోచ్చులో..... ఆకలికి మించిన వ్యాధి లేదంటారు. ప్రపంచంలోని అతి పేద వర్గాలన్ని 360 రోజులు ఈ బాధితులే అంటారు. ఎండ్లపల్లి భారతిగారి కూటికుంటే కోటికున్నట్లే (9) లో దొంతులే నా బింకం....... నా సంపాదన అంతా ఆ దొంతులలోనే అంటూ స్త్రీల అతిపెద్ద సమస్య కుటుంబ ఆకలి తీర్చడమేనంటూ, కరోనాకు ముందైనా ఆ తరువాతైనా అత్యధిక శాత ప్రజలది ఆకలి బాధేనంటూ చెబుతుంది. తిరనగరి నవతగారి (10) గౌరమ్మ కథ.... ప్రభుత్వ ఖజానా నింపడం కోసం...... కొడుకు తలకు కొరివి పెట్టిన తల్లికథ ప్రభుత్వ విధాన వైఫల్యం కారణంగా.... తాగుడుకు లాక్ డౌన్ లేని కారణంగా ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయో తెలుపుతుంది. శైలజామిత్ర గారి (25) నడిచే యంత్రంలో.... కరోనాతో ప్రపంచానికి విశ్రాంతి వచ్చినా తల్లికి, వంటింటికి రాలేదని..... వెలకట్టని మహిళల అవిశ్రాంత శ్రమ నిర్వేదపు కథ..... ఇదే అంశంతో గట్టురాధికా మోహన్ గారి (60) కొంచెం రెస్టుకావాలి...... రోబోకాయినా కొంత సమయం...... చార్జింగ్ కోసం..... కనీసం మాకు అది లేదంటూ.........
నెల్లుట్ల రమాదేవి గారి (29) తల్లివేరులో మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని, ఆర్థికంగా నిలవలేని స్త్రీల అగచాట్లని, వృద్ధ మహిళల దైన్యాన్ని తెలుపుతుంది. డా॥ త్రివేణి గారి (35) ముళ్ళల కంచె, డా॥ తెన్నేటి సుధాదేవి (39) నిరీక్షణలో కరోనా క్వారంటైన్ గూర్చి వృద్ధాప్యంలో కొడుకు వద్ద సేద తీరాల్సిన తల్లి, ప్రసవ సమయంలో భర్త తోడును, కాన్పు అనంతరం బిడ్డకౌగిలిని ఎంత నిర్ధయగా దూరం చేసిందో చూపుతాయి.
మల్లవరపు విజయ (48) కరోనా కౌగిట్లో మనీషాలో, అమానవీయ, ఆర్థిక దురాశలకు ప్రతి సందర్భం కలిసివచ్చేది. ఒంటరి అమాయక బాలిక దయనీయ స్థితిని ఆమె కిడ్నీని అపహరించేందుకు వాడుకొనే వారి పాశవికతను తెలుపుతుంది. బాలబోయిన రమాదేవి (52) స్త్రీల నెలసరి సమస్యనే శీర్షికగా చేసిన కథ.... కరోనాకు భయపడి ఆ అవసరం ఆగేనా... సహచరులకే అర్థంకాని సమస్యను వెలుగులోకి తెచ్చిన కథ.
పాఠకుల హృదయమంతటిని కదిపి కుదిపి, కన్నీటిని రాల్పించే కథ, అమ్మతనపు ఔన్నత్యాన్ని, పసితనపు సున్నితత్వాన్ని, మానవత్వాన్ని మానవుల అమానవీయతను, స్త్రీల జీవన చిత్రంలో తాను మాత్రమే మోసే బాధ్యతల్ని సూటిగా, స్పష్టంగా చిత్రించిన కథ పద్మ VLS సత్తిరాజుగారి (65) ఎంతెంతదూరం కథ..... జీవిత భారం మోయలేక పారిపోయిన భర్త తలపై మోత, కడుపులో బిడ్డ, చేయందుకొని సరిగ్గా నడవనైనా నడవలేని మరో బిడ్డ.... తల్లి చాకచక్యంగా నడవ అలసిన బిడ్డను ఎంతెంత దూరం అంటూ పరుగెట్టించిన విధం అటు పాత్రల్ని, పాఠకుల్ని, ఆలోచనల్ని చాలా చాలా దూరం నడిపిన అద్భుత కథా చిత్రణ.
మామిడాల శైలజగారి విధివిలాసం (78) శైలజా శేఖరల్ అపురూప దాంపత్యం, కరోనాకాటు ఆర్థిక పరిణామంగా రైల్వే ట్రాక్పై శేఖర శవంగా మారటం, సంధ్య ఒంటరిగా మిగలటం..... ఆత్మహత్యల కారణాల్ని చూపుతుంది.
కరోనాకు చైనా కారణమంటూ, మర్క్ సమావేశం కారణమంటూ ముస్లింలపై మతకోణంలో జరిగిన అమానవీయత వారి బ్రతుకుల్ని ఎలా కాకవికలం చేసిందో, ముస్లిం సమాజాన్ని ఎంత అభద్రతకులోను చేసిందో తెలిపిన కథలు 19, 21 వ కథలు, డా|| షాజహానా గారి పరించాలో.... ముస్లింల వెనకబాటుతనం గూర్చి ... నేను నమ్మకం అనే పదాన్ని సింక్ లో వేసి నీళ్ళదిలాను...... కరోనా కంటే విషపూరిత వ్యాధి మతం అన్నారు...... ఎంతటి విషాదమిది. మనం ఎన్నిగా చీలిపోదాం, మతం, కులం, వర్గం, వర్ణం, లింగ, ఆర్థికపరులు.
కనీజ్ ఫాతిమా గారి (27) అపనమ్మకంలో పాల్షాప్ సలీమ్న మరణ్కు పోకున్నా క్వారంటైన్కు తీసుకుపోవడం, వారికి పనులు ఇవ్వకపోవడం...... ఒక రకంగా ...... వెలివేయటం.
డా॥ జయంతి గారి కథనం (90) నేనో విషాద కావ్యాన్నిలో ప్రజాస్వామ్య రాజకీయాలు మైనారిటీ, మధ్య దిగువ మధ్య తరగతి దళితులకు ఎంత అందనంత దూరంలో ఉన్నాయో...... 33% రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ అయిన కవిత ప్రజల బాధ్యతా రహిత్యం, అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరుల కారణంగా జరిగిన నేపథ్య చిత్రీకరణల చూపుతుంది. కవితచే చెప్పించబడిన... మానవతకు, వైద్య, ఆర్థిక వ్యవస్థలకు కరోనా ఒక మచ్చ అంటూ......
11 వ కథ 33, 72, 82, 91 కథల్లో చివరిదైన డా॥ కొమర్రాజు రామలక్ష్మి గారి (86) మళ్ళీ చిగురించాలి కథలు పాజిటివ్ దృకోణంలో కరోనా కాలంలో వెల్లివిరిసిన మానవత్వాన్ని, బలపడిన కుటుంబ బంధాల్ని, ప్రకృతి, గాలి, నీరు స్వచ్ఛంగా మారటాన్ని, వైద్య, పోలీసు, మున్సిపాలిటి, స్వచ్ఛంధ వ్యక్తిగత సేవల ఔన్నత్యాల్ని, కరోనాను జయించి ఆత్మ విశ్వాసాన్ని నింపే కథలు.
రేహనాగారి (93) వలసవెనక్కిలో కరోనాకారణంగా వివిధ దేశాల వారీగా ఆయా వలస కార్మికులు వెనక్కిరావటాన్ని చెప్పడంతో పాటు లాక్డౌన్ ప్రకటనకు ముందు ప్రభుత్వం ఏ ఏర్పాట్లు లేకుండా చేసిన అనాలోచిత చర్య సృష్టించిన విధ్వంసం గూర్చి తెలిపారు.
కొండవీటి సత్యవతి గారి (96) కరోనా కష్టకాలంలో సమాంతా సాహసం నిజాంగా ఓ సాహసోపేత కథనం ఒక స్త్రీవాద కోణపు విశాలతను, ట్రాన్స్ జెండర్స్ను తమ సమాజంలో భాగంగా స్వీకరించటం కన్పిస్తుంది. 3000 కి.మీ. తన ఆటోలో తిరిగి 2500 మంది ట్రాన్సజెండర్స్కు నిత్యవసరాల్ని అందించటం..... మీ వాళ్ళు భిక్షాటన చేస్తారనే అపవాదు వాడేందుకు ఆటోనడపడం..... వారివైపుగా వారి కష్టాలు, ఆత్మగౌరవాల వైపుగా మన చూపును తిప్పన కథనం.
103వ కథ మేడ్చల్ ఫుడ్ & ట్రావెల్ క్యాంపు గూర్చి భూమిక సౌజన్యంతో జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాల గూర్చి వచ్చిన కథనాలు మనలో మనకు ఒక నమ్మకాన్ని, మానవత్వం బతికే ఉందన్న ధైర్యాన్ని ఇస్తాయి.
108, శాంతిరెడ్డి గారి కరోనా రక్కసి కోరలు 110 అనిశెట్టి రజితగారి ఇదేం బతుకులో వలస కార్మికుల్ని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కొన్ని నెలలపాటు ఉండే విభిన్న ఆదివాసి, దళిత ప్రజలను ఇక్కడి ప్రజలు వారి సమాజంలోకి స్వీకరించరన్ని నగ్న సత్యం వలసలకి ఒక ముఖ్య కారణంగా చూడవచ్చు.
అనిశెట్టి రజిత గారు తన కధనపు స్వగతంలో తనలో తాను, తానుగా సమస్య అంతటిని అవలోకనం చేసుకొని అర్థాలు, అంతరార్థాలు, అనర్థాలు, జరగాల్సిన విధానాల అంతర్మధనంలోని చింతనలో ఒక నిర్వేదం, మనుషుల, ప్రభుత్వాల వ్యవస్థల తప్పొప్పుల తర్కం, తాత్వికతాలను తన నుండి మనలోకి ప్రవహింప చేస్తుంది. నిశ్శబ్దాన్ని ఇష్టపడే నేను..... ఖాళీతనాన్ని భరించలేనంటూ, మనంగా మానవీయంగా ఏం చేయాలో ఒక ఆశవహదృక్పధంతో ముగించారు.
కరోనా కాలం కథల శతాధిక రచనల్లో బహుశా మనం వెయ్యికి పైగా కుటుంబాల్ని చూసి ఉంటాం. అన్ని రకాల అట్టడుగు వర్గాల జీవన చిత్రాల్లో ప్రతికథలో కనీసం వందలకు పైగా మహిళల జీవితాల్ని, అన్ని వ్యవస్థల పని విధానపు డొల్లతనాన్ని, ఆర్థిక, మత కోణాల్ని ప్రభుత్వ పనివిధాన వైఫల్యాల్ని, అంగీకరించి అర్థం చేసుకొంటాం.
ఒక అతిపెద్ద కరోనా విపత్తు మరణాలకన్నా, మానవ పని విధానాలు, పథకాల విలువల, వ్యవస్థల ఆలోచనా రాహిత్యం, ఆర్థిక కారణాల వల్లనే ఎక్కువ వేదన, హింస, మరణాలు సంభవించాయన్నది సత్యం, ముందు మనందరం, సిగ్గుతో తలదించుకోవాల్సిందే.
వైద్య, ఫార్మసీ, ప్రైవేట్ కార్పోరేట్ రంగాలలో ఎంత విలువల పతనపు అమానవీయతను, పై వ్యవస్థలని నియంత్రించలేని ప్రభుత్వ అసమర్థత ఎంతగా గ్రహించామొ అంతే స్థాయిలో వ్యక్తిగత, స్వచ్ఛంద సంస్థల స్థాయిలో మానవీయ కోణాల్ని దర్శించాం.
పై చాలా కథల్లో కుటుంబ పనిలో మహిళలకు సహాయంగా పనిచేసే మహిళల్ని చాలా సహృదయతతో పనికి రాకున్నా జీతం ఇవ్వడం, ఆదుకోవడం గమనించిన మనం, పదులు, ఇరవై సంవత్సరాలపైగా కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలలో తమ సేవల ద్వారా యాజమాన్యానికి కోట్లాది రూపాయల లాభాల్ని చేకూర్చిన ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం చర్య తీసుకొని వారికి కనీస 30 నుండి 40% జీతం అన్నా ఇప్పించకుండా ముష్ఠిలాగా అది చాలాకాలం తరువాత 2,000 రూపాయలు, ఓ 50 కిలోల బియ్యంతో సరిపెట్టడం శోచనీయం. మనం మనంగా, వ్యవస్థలుగా, ప్రభుత్వాలుగా ఎంత ఎదగాలో పై కథల్లో మన చూస్తాం..
ఈ కరోనా కాలం కథల్లో ఎక్కడా భాషాడంబరం లేదు. అతి సహజంగా, సరళంగా స్పష్టంగా చెప్పదలచుకొన్నది పాఠకుల మనసుల్ని చేర్చడం ద్వారా ఈ పుస్తకం తన గమ్యాన్ని చేరిందన్నది అభినందనీయ విషయం. ముందుకాలంలో కరోనా విపత్తుకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకొనేందుకు ఈ గ్రంధం ఉపకరిస్తుంది.
సంపాదక, రచయిత్రులంతా తిరిగి మరిన్ని గ్రంధాలను రూపొందిస్తారని ఆశిస్తూ అందరికి అభినందనలు.