ప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్ మరణం తెలుగు దళిత సాహితీ లోకానికి తీరని లోటు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వారితో నాకు పరిచయం ఉంది. ఇంకా వారు ‘వర్తమానం’ కవితా సంపుటిని ప్రచురించక ముందే నేను ‘రహస్య చిత్రం’ కవితా సంపుటి వెలువరించాను. దాన్ని వారు పోస్టులో తప్పించుకొని, చదివి, బాగుందని ఒక కార్డుముక్క రాశారు. ఆ తర్వాత వారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కావడం, నేను కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యుడిగా అపాయింట్ కావడం వలన మా స్నేహం బలపడింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో కలుసుకున్నప్పుడు సాహిత్య చర్చలు చేసుకునేవాళ్ళం. నేనెప్పుడూ రాజమండ్రికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసే వాడిని. తర్వాత వారు రైల్వే స్టేషన్ వరకు వచ్చి రైలు ఎక్కించి వెళ్లేవారు. వారెప్పుడూ వరంగల్ కు వచ్చినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇ వెళ్లేవారు. ఒకసారి సుధాకర్ గారు, వారి శ్రీమతి హేమలత గారు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారు. తరచూ సెల్ ఫోన్ లో సంభాషించే వాళ్ళం. వారి పెద్దమ్మాయి మానస వివాహం రాజమండ్రి లో జరిగింది. ఆ వివాహానికి వారు ఆహ్వానిస్తే వెళ్లి వచ్చాను.
కొన్నాళ్లకు హేమలత గారు మరణించడం, వారు మానసిక వేదనకు గురి కావడం, ఒకటి రెండు సార్లు ఆ బాధను కూడా పంచుకున్నారు.
సుధాకర్ గారికి షుగర్ తీవ్రంగా ఉండడం వలన వారి కాలు తీసేసిన విషయం సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య మిత్రుడొకరు చెప్పగా చాలా బాధపడినాను. వారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించి మానేశాను. కాలు తీసేశాక మాట్లాడే ధైర్యం చేయలేక పోయాను. వారు ఎక్కడో ఒక చోట కలుస్తారు, అప్పుడు మాట్లాడవచ్చు అని అనుకున్నాను. కానీ సుధాకర్ గారు శాశ్వతంగా ఈ లోకంలోంచే వెళ్లిపోయాక వారితో ఒక్క మాటైనా మాట్లాడాల్సి ఉండే కదా అని బాధపడుతున్నాను.
మంచి కవి, మంచి వక్త, స్నేహశీలి మరణం వ్యక్తిగతంగా నాకు సాహిత్యపరంగా అందరికీ తీరని లోటే. వారి ఆత్మకు శాంతి చేకూరాలి; వారిద్దరి పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి.
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్