తనకోసం తాను
ఉదయం ఆరుగంటలకే కాలింగ్ బెల్ మోగడంతో ఏమిటీరోజు పనిమనిషి పద్మ అప్పుడే వచ్చేసిందే అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది మాధురి.
ఎదురుగా చెల్లి మాలతి.
ఆమెకేసి కళ్లింతవిచేసుకుని విస్మయంగా చూసింది. "ఏంటే ఉరుముల్లేని పిడుగులా ఊడిపడ్డావ్. రాత్రి మాట్లాడినప్పుడు కూడా వస్తున్నట్టు చెప్పనేలేదు" చెల్లి చేతిలోని బ్యాగ్ చూసి ఆశ్చర్యంగా అడిగింది మాధురి.
"ఏం.. నీ ఇంటికి రావడానికి కూడా ముందు చెప్పి పర్మిషన్ తీసుకుని రావాలా ..?" దబాయిస్తూ ఎదురు ప్రశ్న వేసి బాత్రూంలోకి దూరింది మాలతీ.
మొహం కడుక్కొచ్చిందేమో ఆమె మొఖమంతా తడితడిగా ఉంది. ఆ తడి చీర చెంగుతో అద్దుకోవడం చూసి టవల్ అందించింది మాధురి.
అక్కచేతిలోని టవల్ అందుకుని మొఖానికి అడ్డుకుంటూ "అక్కా .. నాలో ఏమన్నా మార్పు కనిపిస్తోందా" అకస్మాత్తుగా సూటిగా అక్క మొహంలోకి చూస్తూ అడిగింది.
దబ్బ పండులా మిసమిసలాడుతూ ఉండే చెల్లి ఇలా వేలాడిన తోటకూరలా అయిపోయిందేమిటి? మనసులో అనుకుంటూ కిచెన్లోకి నడుస్తూన్న మాధురి ఆగిపోయి చెల్లినే అయోమయంగా చూస్తూ "అదేం ప్రశ్నే ...." అంది కానీ .. పాలిపోయినట్లున్న చెల్లెల్ని చూస్తే దిగులేసింది.
"అమ్మా, నీలో చాలా మార్పు వచ్చింది. నువ్వు ఇదివరకటి మా అమ్మలాగా లేవు.
నీలో కోపం, ఆవేశం, అసహనం తొందరపాటు పెరిగిపోయాయి. నువ్వు చెప్పింది వినకపోతే వెంటనే వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నావ్ " ఒక్క క్షణం ఆగి, అయోమయంగా చూస్తున్న అక్కనే చూస్తూ "ఈ మాట నాది కాదు. స్నేహాది. దాదాపు రోజూ ఈ మాట నాకు దానినోట వినిపిస్తోంది. అక్క చెప్తున్నది నిజమేనంటాడు సౌహార్ద్. నీ మరిదిదీ వాళ్ళ మాటే. కాకపొతే స్నేహ చెప్పినట్లుగా పదే పదే ఆ విషయం చెప్పరు. అంతే తేడా" లోపల నిక్షిప్తమైన అగ్నిపై నవ్వు పూత పూస్తూ అన్నది మాలతి.
చెల్లెలు నవ్వుతూనే చెప్పినా ఆ నవ్వులో జీవం ఉన్నట్టనిపించలేదు మాధురి కళ్ళకి. ప్రశాంతంగా ఉండేందుకు, దిగులు మేఘాల్ని తరిమేసేందుకు శతవిధాలా ప్రయత్నం చూస్తూ మాలతి.
చెల్లెలి కుటుంబంలో ఏదో జరిగింది. ఆమె మనసును బాగా గాయం చేసేదేదో జరిగింది. లోలోన అగ్నిగుండాలే బద్దలవుతున్నట్టుగా ఉంది. పైకి కన్పించనీకుండా పెదవులపై నవ్వులు పులుముకుని మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇద్దరమూ ఉండేది ఇదే సిటీ లో, చెరో మూల ఉత్తర దక్షిణాల్లా... ఎప్పుడూ ఇంత ప్రొద్దున రాలేదు. వచ్చినా వాళ్ళాయనతోనే వస్తుంది.
ఇప్పుడిలా బాగ్ తో వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనుకున్న మాధురి "నీకేమనిపిస్తోంది ?" చెల్లికేసి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుప్రశ్న వేసింది.
మొహంలో మారుతున్న భావాల్న, రంగుల్ని కన్పించనీకుండా నొక్కిపెట్టిన పెదాల్ని వదిలి "ఏమో... నాకేమయింది .. మామూలుగానే ఉన్నాగా .. "అంటూ భుజం ఎగురవేసి అక్కకేసి చూసే ధైర్యం చేయలేక కిందకి చూస్తూ అన్నది.
ఆ వెంటనే, "అయ్యో ఫోన్ ఎక్కడ పెట్టాను .. "అని వెతుక్కోవడం మొదలుపెట్టింది మాలతి.
ఆమె ఫోన్ కి రింగ్ చేసింది మాధురి.
"ఓ ఇక్కడే ఉంది" అంటూ ఫ్రిజ్ పై నుండి మొబైల్ చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నది మాలతి.
ఉదయపు నీరెండ మీదపడుతుండగా "వాళ్ళు అన్ని సార్లు చెబుతున్నారంటే నిజంగానే ఏమన్నా తేడా వచ్చి ఉంటుంది . పెద్దవాళ్ళం అవుతున్నాం కదా .. మార్పులు సహజమే .. వచ్చాయేమో .." సాలోచనగా అన్నది మాధురి
"లేదక్కా .. చూడు నేను మామూలుగానే ఉన్నాగా ..
నువ్వేమన్నా చెప్పు.. నా కయితే వాళ్ళ మాటల్తో నన్ను పిచ్చి దాన్నిగా మారుస్తున్నారనిపించింది" గొంతులో జీర అడ్డుతగులుతుండగా అసహనంగా లేచి నిల్చుని అటూఇటూ కదులుతూ అన్నది మాలతి
చెల్లెలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి తట్టుతూ ఆమె చేతిని పట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది మాధురి. ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఒక్కసారిగా బావురుమంది మాలతి . చెల్లెలు అట్లా ఏడుస్తుంటే మాధురికీ దుఃఖం పొంగుకొచ్చింది.
అందర్లోకి చిన్నది మాలతి. చాలా గారాబంగా పెరిగింది. పెళ్ళై అత్తింటికి చేరాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కష్టాలు పడింది. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. ఏనాడూ నోరు తెరిచి తన కష్టాన్ని, బాధని చెప్పుకోలేదు. ఇట్లా గుండెపగిలి ఏడవను లేదు. ఇప్పుడేంటి అంతా సుఖంగా, సజావుగా సాగిపోతున్న వేళ.. కొద్దీ క్షణాల తర్వాత తనను తాను సముదాయించుకుని చెల్లెలి బాధకి, దుఃఖానికి మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడింది మాధురి.
" ఛ .. ఛా .. ఏమిటే ..మరీ చిన్న పిల్లల్లా .. ఆ పిచ్చిమాటలేంటి ? " చిరుకోపంతో కసురుతూనే చెల్లెలి తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది.
అక్క మొహంలోకి లిప్తపాటు అలా చూసి దీర్ఘశ్వాస వదిలి కళ్ళు తుడుచుకుంటూ పక్కకు ఒత్తిగిలింది మాలతి.
"మాలతీ ... నువ్వు ఏదో బాధలో ఉన్నవని నాకు అర్ధమవుతున్నది . అదేంటో ఈ అక్కదగ్గర కూడా చెప్పుకోలేవా .. అక్క నీకంత పరాయిదై పోయిందా .. " నిష్ఠురమాడింది మాధురి. ఆ విధంగానైనా చెల్లిలోపల మరుగుతున్నదేదో బయటికి వస్తుందన్న ఆశతో .
ఆ తర్వాత " అక్కాచెల్లెళ్ల బంధానికి అర్థమేముంది .. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడవ్వకపోతే..
అమ్మ ఉంటే అమ్మకి చెప్పుకునేదానివి కాదా .. అమ్మ తర్వాత ఆ బాధ్యత నాదే కదా .. " చెల్లెలి తల నిమురుతూ అనునయిస్తూ అన్నది మాధురి.
ఆ తర్వాత నెమ్మదిగా "నాకెవరున్నారు .. నువ్వు తప్ప .. అందుకేగా .. అక్కడ ఉండలేక నీదగ్గరకొచ్చింది " వెక్కుతూనే అన్నది మాలతి
"నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతకడమే స్నేహ పని . నువ్వు మాట్లాడింది ఇది తప్పు . అది తప్పు .
ఇలా కాదు అలా మాట్లాడాలి. అలా ఉండాలి. ఇలా చెయ్యాలి అంటూ ఎప్పుడూ నాలో తప్పులు వెతకడం ... నాకు క్లాసులు పీకడమే దాని పని అయిపొయింది.
ఒకటి అని మరోటి చెప్తున్నావ్ ..అంటుంది ఒకసారి . అడిగిన దానికి సూటిగా చేప్పకుండా చుట్టూ తిప్పి ఏదేదో చెప్తున్నావ్ అంటూ విసుక్కుంటుంది మరోసారి.
పిల్లలిద్దరూ నాతో మాట్లాడేదే తక్కువ.
ఎప్పుడయినా ఏదైనా మాట్లాడితే నా మాటల్లో ఎప్పుడూ తప్పులెన్నడమే, పూచిక పుల్లలాగా తీసిపడెయ్యడమే వాళ్ళ పనయిపోయింది . సూటిగా జవాబులు చెప్పట్లేదు అంటుంది.
నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. ఏమి తప్పులు తీస్తారోనని.
వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఏదో తత్తరపాటు. పదాలు తొందరగా గుర్తురావు. ఒకటి అనబోయి ఒకటి అనేస్తున్నాను. అది నాకూ తెలుస్తోంది.
ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఎక్కడలేని దిగులు వచ్చేస్తోంది. నిద్ర పట్టడం లేదు. ఒంటరితనం భరించలేకపోతున్నా. నిండా యాభైఏళ్లు లేవు.
ఇప్పుడే నా పరిస్థితి ఇట్లా ఉంటే ..
భవిష్యత్ ఇంకెంత భయంకరంగా మారుతుందో.. తలుచుకుంటే విపరీతమయిన ఆందోళన కలుగుతోంది.
నిద్రలేక నీరసం .. చేసే పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా ..
ఒక్కోసారి పిల్లల్ని ఏమనలేక నన్ను నేనే హింసించుకోవడం లేదా నా కోపమంతా పనిమనిషిమీద చూపడం జరుగుతోంది.
అమ్మ కేమయింది ఉత్తగానే అరుస్తుంది. ఇట్లా అయితే ఈ ఇంట్లో పనిచేయడం నా వల్లకాదని అల్టిమేటం ఇచ్చింది పనిమనిషి.
బయట ఎవరూ ఇంతవరకూ నాతో పిల్లలు చెప్పినట్లు చెప్పలేదు.
ఆ మాటే అంటే బయటివాళ్లేందుకు చెప్తారు. నీ వాళ్ళం కాబట్టి, నీ మంచికోరేవాళ్ళం కాబట్టి మేం చెబుతాం అంటుంది స్నేహ.
ఆలోచిస్తే అదీ నిజమే అనిపిస్తుంది " చేతికున్న ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ మాలతి అంతరంగాన్ని అక్కముందు పరిచింది.
"అంటే .. స్నేహ అంటున్నట్లు నిజంగా నీవు కూడా ఫీలవుతున్నావా .. నీలో మార్పు వచ్చిందని" చెల్లెలి కళ్ళలోకి గుచ్చ్చి గుచ్చి చూస్తూ అడిగింది మాధురి.
"ఏమోనే .. అదే నాకేమీ అర్ధం కావడం లేదు" కొన్ని క్షణాలాగి మళ్ళీ తానే
"పరిస్థితులను బట్టి, మారుతున్న వయసును బట్టి నా భావోద్వేగాల్లో తేడా వస్తే వచ్చి ఉండొచ్చునేమో .. .
ప్రశాంతమైన జీవితం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది చెప్పు. ప్రతివారికీ ఏదో ఒక ఆందోళన, వత్తిడి ఉంటుంది కదా ..
ఈ మధ్య నేను ఒంటరినైపోయినట్లుగా అన్పిస్తోంది. ఏం మాట్లాడినా పిల్లలది, వాళ్ళ నాన్నది ఒకే మాట. నన్ను వేరు చేసేస్తున్నారు . నేను పిలిస్తే ఒక్క అంగుళం కదలరు. పలకరు. అదే వాళ్ళ నాన్న పిలిస్తే ఏంటి నాన్నా.. అంటూ వెంటనే రెస్పాండ్ అవుతారు.
నేనంటే గౌరవం లేదు . నాకూ , నేను చేసే పనికీ విలువేలేదు.
అటువంటి చోట నేనెందుకు ఉండాలి .. ఎన్నోరోజుల నుండి ఈ ప్రశ్న నన్ను వేధిస్తున్నది ..
చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారు. ప్రతిదీ నాతో పంచుకునే వారు. అప్పుడు వాళ్ళకి అమ్మే లోకం. ప్రపంచపు రంగులు తెలియని అమాయకత్వం.
ఇప్పుడు వాళ్ళ ప్రపంచం పెద్దదైపోయింది. రంగు రంగుల లోకం ఇరవైనాలుగు గంటలూ ఇంట్లో ఉండే అమ్మకి ఏమి తెలుసూ .. ఏమీ తెలియదు.
అందుకే వాళ్ళప్రపంచంలో అమ్మ స్థానం ఏమూలనో ... రంగువెలిసిన బొమ్మలా ..
వాళ్ళ నాన్నసంపాదనకోసం, స్నేహితుల కోసం బయటి ప్రపంచంలో నలుగురితో తిరిగొస్తారు. ఆయనకు చాలా విషయాలు తెలుసు. లోక జ్ఞానం తెలుసు అనుకుంటారు. అన్నిటికంటే ముందు తమకోసం కావలసినన్ని డబ్బులు ఇస్తారుగా అందుకే అయన ఏమి చెప్పినా వాళ్ళకి వేదవాక్కు.
వాళ్ళ దృష్టిలో నేనో కరివేపాకు.. ఇంకెందుకే .. నేనింకా ఆ ఇంట్లో ఉండడంలో అర్ధముందా .. చెప్పక్కా..
వాళ్ళ పద్దతి చూస్తే .. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది ... " హృదయంలోని బాధ వడిపెడుతుండగా లేని నవ్వు పెదవుల చెదరనీకుండా అక్క కళ్ళలోకి చూస్తూ అన్నది మాలతి
"అలా ఎందుకనుకుంటావే .." అనునయంగా అన్నది మాధురి
"ఏం ఎందుకనుకోకూడదు ..?
అయినా .. నీకేం తెల్సు .. వాళ్ళ ప్రవర్తన .. రోజూ నేనెంత వ్యధకు, రంపపుకోతకు గురవుతున్నానో .. వాళ్ళు చేసిన గాయాలు ఎలా సలుపుతుంటాయో.. ఎన్ని సార్లు నాలో నేను ఏడ్చుకుంటూ ఉన్నానో ..
ఇన్నాళ్ళు నన్ను నేను సమాధాన పరుచుకుంటూ వచ్చా.. గాయానికి పై పై పూత పూసుకుంటూ వచ్చా .. ఇక నా వల్లకాదు" గబగబా చెప్పింది.
ఆ వెంటనే "నీకూ తెలుసుగా .. మా పెళ్లినాటికి సతీష్ కి సరైన ఉద్యోగమే లేదాయె. నా ఉద్యోగంతోనే కదా సంసారాన్ని నడుపుకొచ్చింది. ఆ తర్వాత తనకి మంచి ఉద్యోగమే వచ్చినా టూరింగ్ జాబ్. ఇంట్లో ఉండేది తక్కువ . అన్నీ నేనే చూసుకునేదాన్ని కదే ...చివరికి వాళ్ళ అమ్మానాన్నలు .. చెల్లెళ్ళ పురుళ్ళు అన్నీ నేనే కదే చేసింది .. " చెల్లెలు తన ధోరణిలో చెప్పుకుపోతూన్నది.
నిజమే, చాలా ఇబ్బందులు పడింది. గుట్టుగా సంసారాన్ని ఉన్నంతలో బాగానే లాక్కొచ్చింది. కానీ ఏనాడూ ఇట్లా బయటపడలేదు. అన్ని ఒత్తిళ్ళనీ తట్టుకుని నిలబడింది. గడ్డుకాలం దాటిపోయింది. హాయిగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడేమిటో.. సమస్య
మధ్యలో సతీష్ ఆరోగ్యం దెబ్బతిని ఉద్యోగాన్నిహెడ్ ఆఫీసుకు మార్చుకున్నాడు.
పిల్లలూ కాలేజీలకు వచ్చారు. తాను డాక్టర్ కావాలని కలలు కని ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేకపోయిన సతీష్ కి తన కొడుకు డాక్టర్ కావాలని కోరిక. అందుకోసం చెల్లెలు ఎంతకష్టపడిందో తనకు తెలియనిది కాదు అనుకుంది మాధురి.
" సౌహార్ద్ ని ట్యూషన్స్ కి ఎట్లా తిప్పానో .. స్నేహని మ్యూజిక్ క్లాసులకూ, డాన్స్ క్లాసులకూ ఎలా తీసుకెళ్లానో .. వాళ్లకిష్టమైనవి చేయడం కోసం నేనెంత వదులుకున్నానో వాళ్లకేం తెల్సు .. చెప్పినా ఇప్పుడు వాళ్ళకవేమీ పట్టవు. అదొక విషయమే కాదు.
పిల్లలకీ వాళ్ళ నాన్నకు నేనో వ్యక్తిని ఇంట్లో ఉన్నాననే ధ్యాసే ఉండదు ..
ఏదో సందర్భంలో మీ కోసం నేనన్నీ వదులుకున్నానంటే ..
నిన్నెవరు చేయమన్నారు .. మేమేమన్నా నీ వెంటబడి తీసుకెళ్ళమన్నామా .. అన్నీ చేయమన్నామా.. ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటావు .. అని కయ్ మంది స్నేహ.
రోజంతా ఇంట్లో ఉన్న నాతో వాళ్ళ అవసరాలకు తప్ప మాటలుండవు . నన్నొక మనిషిలాగా చూడరు.
వాళ్ళ నాన్నతో మాత్రం చాలా చాలా మాట్లాడతారు. జోకులేసుకుంటారు .. కలసి సినిమాలు చూస్తారు. వాటి గురించి చర్చించుకుంటారు ..
నేను మధ్యలో వెళ్తే నాకేమీ తెలియదని .. నా మాటల్లో .. చేతల్లో తప్పులు వెతుకుతారు ..
వేళకు తిండి తినరు. బయటి తిండి తినడమే గొప్ప అనుకుంటున్నారు. నేను వాళ్ళకోసం వండిందంతా వృధా అవుతుంటే మనసు చివుక్కుమంటున్నది.
రాత్రి పగలు లేకుండా బయట తిరుగుళ్ళు .. చెప్తూనే ఉంటాను. వింటేగా .. పాత చింతకాయ పచ్చడి అంటారు
అసలే రోజులు బాగోలేవు . ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు .. ?
అలాంటప్పుడు సతీష్ వాళ్ళని కోప్పడొచ్చుగా ..
ఊహూ .. అలా చేయడు .. ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు .. మరి నాకు మండదా .. చెప్పక్కా ..
మళ్ళీ తనే .. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్ .. ఆ మాత్రం ఆడపిల్లకి నేర్పుకోలేవా.. అర్ధరాత్రి దాకా తిరిగొస్తుంటే చెప్పొద్దా .. అంటాడు నీ మరిది .
కానీ తాను చెప్పడు . తండ్రే కదా .. చెప్పొచ్చు కదా .. ఊహూ .. అది చెయ్యడు ..
అది చెయ్యొద్దు .. ఇది చెయ్యొద్దు. అట్లా ఉండు, ఇట్లా ఉండు అని చెప్పి నేను చెడ్డదాన్నయిపోతున్నా ..
నా మాటలు వాళ్ళ బుర్రకెక్కవు. చాదస్తపు మాటలకింద తీసి అవతల పడేస్తారు. "
"అయితే .. " మాట పూర్తి కాకుండానే
" వాళ్ళ పనులు చేసిపెట్టే రోబోని కాదుగా... విలువలేని చోట , గౌరవించని చోట ఉండడం ఎంత కష్టమో ..ఎంత ఉక్కపోతగా ఉంటుందో నీకేం తెల్సు .. ? ఆ గాయపు రంగులేమిటో లోతు ఎంతో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
రెక్కలు విరిగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటున్నానక్కా ..
అందుకే.. అక్కడి నుండి , వాళ్ళనుండి దూరంగా వచ్చేశాను . అప్పుడు వాళ్ళ కోసమే నా జీవితాన్ని ఇంటికి పరిమితం చేసుకున్నాను . కానీ ఇప్పుడు, జీవితం దశదిశా లేకుండా సాగిపోతుండడాన్ని భరించలేక పోతున్నాను.
విరిగిన రెక్కలను అతికించుకుని నన్ను నేను ఆవిష్కరించుకోవాలని, స్వేచ్చా విహంగంలా విహరించాలని తపన .. అందుకే నాకోసం నేనొచ్చేశా .. "
"వచ్చేశావా ..?" అప్రయత్నంగా మాధురి నుండి
" అవును, వచ్చేసా .. చచ్చి పోదామన్న ఆలోచనను అక్కడే సమాధిచేసి నా జాడని నేను వెతుక్కునే ప్రయత్నంలో ఆ ఇంట్లోంచి వచ్చేశా..
నేనిలా రావడం నీకు ఇష్టం లేదా .. కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా.. బరువయితే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదంటే ఏదో ఒక ఉద్యోగం దొరికే వరకూ ఇక్కడ నీతో ఉంటాను ". నా కళ్ళలో నా జవాబు వెతుకుతున్నట్లుగా సూటిగా చూస్తూ .. స్థిరంగా తన నిర్ణయాన్నినొక్కి చెప్పింది మాలతి.
తన చేయి చేతిలోకి తీసుకుని ఆత్మీయంగా నొక్కుతూ "మంచి పని చేసావ్ .. నీకు నేనున్నానన్న నమ్మకం ఉన్నందుకు సంతోషం .. దిగులు పడకు.
అన్నీ సర్దుకుంటాయి . ముందు స్థిమితపడవే .. . అన్ని విషయాలూ నింపాదిగా మాట్లాడుకుందాం " అని బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసే మిషతో అక్కడ నుండి లేచింది మాధురి.
ఆ కాసేపటికే స్నేహ ఫోన్ " అమ్మ..వచ్చిందా పెద్దమ్మా.." ఆ అడగడంలో ఎంతో కంగారు.. దుఃఖం పొంగుకొచ్చి మాట్లాడలేకపోయింది.
కూతురి చేతిలో ఫోన్ తీసుకుని "వదినా .. మాలతి అక్కడికి .. " సతీష్ అడుగుతుండగా ..
"వచ్చింది. తాను మానసికంగా చాలా డిస్ట్రబడ్, డిప్రెస్డ్ గా ఉంది". నేను మళ్ళీ మాట్లాడతా ముక్తసరిగా చెప్పి కాల్ కట్ చేసింది మాధురి.
చెల్లెలు స్థితికి కారణమైన ఆ కుటుంబ సభ్యులపైన చాలా కోపంగా ఉంది మాధురికి.
తనకంటూ సెలవు దినం లేకుండా గడియారం ముల్లులా నిత్యం ఎవరికి ఏం కావాలో సమయానికి అమర్చిపెట్టడం తన బాధ్యతగా భావించే మాలతికి ఒక ప్రశంస ఇవ్వకగా ఆమె శ్రమకు విలువ ఇవ్వకపోగా చిన్న చూపు చూడడం, చులకన చేయడం .. చాలా కష్టంగా ఉంది మాధురికి.
ఆలోచిస్తున్నదామె .. ఈ సమస్య మాలతిది ఒక్కదానిదేనా ..
చాలా ఇళ్లలో గృహిణుల సమస్యే .. కాదు కాదు ఆడవాళ్ళ సమస్యే ..
ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగబాధ్యతలతో సతమతమవుతూ నేనూ అనేకపాట్లు పడ్డదాన్నేగా...
చాలా మంది గృహిణులు నిరాశా నిస్పృహలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు .. ఆందోళన కుంగుబాటు కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
తోడికోడలు వాళ్ళ అక్క ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది.
ఆవిడకిదేం పోయేకాలం అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇట్లా చేసిందని అందరూ ఆశ్చర్యపోయారు. ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవు. ముత్యాల్లాంటి పిల్లలు. చక్కని సంసారం. నిండుకుండని కాళ్లతో తన్నేసుకుంది అనుకున్నారంతా. బహుశా .. ఆమె కూడా జీవితం పట్ల నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా కుంగిపోయి అలా చేసుకొన్నదేమో... ! అనేక సందేహాలు ..
చెల్లెలు ఏమి చేస్తున్నదోనని చూస్తూ ఫ్రిజ్ లో ఉన్న దోశ పిండి తీస్తున్నది మాధురి.
చేతిలో రిమోట్ పట్టుకుని ఛానెల్స్ అటూ ఇటూ తిప్పుతున్నది. ఏ ఒక్క ఛానెల్ చూడడంలేదు. ఆమె చూపులు గోడపై ఉన్న పెయింటింగ్ పై ఆగాయి. తదేకంగా చూస్తున్నాయి.
అస్థిమితంగా ఉన్న మాలతిని ఆకట్టుకున్న పెయింటింగ్ కాలక్షేపం కోసం ఈ మధ్య మాధురి వేసిందే ..
మాలతికి చిన్నప్పుడు చిత్రకళలో ప్రవేశం ఉంది . కాలేజీ రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నది. ఆ తర్వాత ఉద్యోగం , పెళ్లి, సంసారజీవితంలో అన్నీ ఏ గంగలోకి కొట్టుకుపోయాయో ...
భర్త , పిల్లలు ఆమె మొదటి ప్రాధాన్యతలో నిలవడంతో ఆమె వేసిన పెన్సిల్ ఆర్ట్, పెయింటింగ్, హ్యాండీ క్రాఫ్ట్స్ ఆసక్తులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కొంతకాలం చెల్లిని ఇక్కడే ఉంచుకుని జీవితం పట్ల నూతనోత్సాహం కలిగించాలి.
సతీష్ వస్తే .. వచ్చి బతిమాలితే .. వెళ్తుందా .. ఏమో .. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె మాత్రమే .. ఆమె మనసు పొరల్లో ఏముందో ..
నా దగ్గర ఉన్నంత సేపూ చెల్లిని గతం చేసిన గాయాల నుండి బయటపడే మార్గాలు ఆలోచించాలని మాలతి గురించే ఆలోచిస్తున్నది మాధురి.
శరీరానికి అయిన గాయం కనిపిస్తుంది. దానికి సపర్యలూ జరుగుతాయి. కానీ మనసుకు అయిన గాయం పైకి ఏమీ కనిపించదు. లో లోపలే విస్తరిస్తూ గాయాన్ని మరింత పెంచుతుంది. అది మనం గమనించలేం. గమనించినా దానికి తగిన వైద్యం చేయించాలని అస్సలు ఆలోచించం ...
శరీరంలో మిగతా భాగాలకు లాగే మనసుకు తగిలే దెబ్బల్ని చికిత్స అవసరం.
నిజానికి, ఈ సమయంలో కుటుంబ సభ్యులందరి సహకారం కావాలి. వారి మధ్య ఉన్న అనుబంధం మరింత గట్టిబడాలి కానీ పలుచన కాకూడదు.
మాలతి మనసుకి అయిన గాయం చిన్నా చితకా గాయం కాదు. ఈ ఒక్కరోజుది కాదు. లోలోపలే రక్తమోడిన గాయం ఇప్పుడు పక్వానికొచ్చింది. ఆ పుండు పగిలి డిప్రెషన్ కు లోనయింది. దానికి తోడు మోనోపాజ్ సమస్యలు.
మాలతి మామూలుగా అవ్వాలంటే అందరి సహకారం చాలా అవసరం. నచ్చచెప్పి ఇంటికి పంపడం కంటే కొంతకాలం ఇక్కడ ఉంచడమే ఉత్తమం.
మధురికి ఒకప్పుడు తన కుటుంబం ఇచ్చిన సహకారంతో మోనోపాజ్ సమస్యలనుండి బయటపడిన వైనం గుర్తొచ్చింది. భర్త కాలంచేసినా, పిల్లలు విదేశాల్లో ఉన్నా ఒంటరినన్న దిగులు, అభద్రతాభావం లేకుండా ఆనందంగా గడిపేస్తున్నది.
మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్లలో హెచ్చు తగ్గులు మందులతో సవరించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల డిప్రెషన్ కు లోనైన మాలతిని మామూలు మనిషిని చేయడం కొంత సున్నితమైన వ్యవహారమే కానీ తగ్గని, పరిష్కారం కాని సమస్య ఏమీ కాదు.
నిజానికి ఆ డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు మాలతి కూడా అన్వేషిస్తున్నదని స్పష్టమవుతున్నది.
కుటుంబం కోసం తన సర్వశక్తులూ ధారపోసే తల్లులు, అదే తమ లోకం అనుకునే తల్లులు తమదనుకున్న లోకం తమకు దూరంగా జరిగిపోతుంటే బెంబేలు పడిపోతుంటారు. అదే సమయంలో తమను చేతకానివాళ్లుగా తీసిపడేస్తుంటే కుంగిపోతుంటారు. లోపలికి ముడుచుకు పోతుంటారు.
కానీ చెల్లెలు ఆ స్థితిని అధిగమించాలని ప్రయత్నించడం, అందులో భాగంగానే ఇక్కడికి రావడం.. అంటే చెల్లెలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని సుస్పష్టం..
క్షణం తీరిక లేదు . చిల్లి గవ్వ ఆదాయం లేక చిన్నచూపుకు లోనవుతున్నానని భావించే ఉద్యోగ అన్వేషణలో పడింది. తన ఆత్మగౌరవం తాను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నది. తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతున్నది. తన అస్థిత్వాన్ని తాను నిరూపించుకోవడానికి ఘర్షణ పడుతున్నది . అందుకు ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే ..
కొన్నాళ్ళు మాలతి ఆ ఇంట్లో లేకపోతే.. అప్పుడు తెలిసి వస్తుంది ఆమె ఏమిటో .. ఆమె విలువ ఏమిటో ..
మబ్బుల మాటున దాగిన వెన్నెల్లాటి వారి ప్రేమను ఒకరికొకరు అర్ధం చేసుకోవడానికి, వ్యక్తం చేసుకోవడానికి కొంత సమయం, సంయమనం అవసరం. కాలమే వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.
ఈలోగా తన చెల్లి మానసిక పరిస్థితి, మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులు .. హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే ఇబ్బందులు, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యల గురించి వివరంగా సతీష్, స్నేహ, సౌహార్ద్ లకు తెలియజేయాలి.
నిండైన ఆత్మవిశ్వాసంతో మాలతి తన కుటుంబంతో ఆనందంగా ఉండడంతో పాటు, ఓ వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో చేతనయినంత తోడ్పాటు అందించాలని ఆలోచనలతో దోశప్లేటు చెల్లెలుకి అందించింది మాధురి.
పసితనం వీడి యుక్తవయస్సు రాక ముందే ఆటా పాటాకు దూరమయిన పిల్ల.
స్నేహితురాళ్ళు ఆడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే తప్ప తాను కొట్టించుకోవడం తెలియని పిల్ల. తన లోని కోరికల్నిలోనే ఇగుర్చుకున్న పిల్ల.
ముది వయసుకు దగ్గరవుతున్న సమయంలో హర్షధ్వానాల మధ్య అభినందనలు అందుకుంటూ .. తీవ్రమైన ఉద్వేగానికి లోనయింది ఆమె.
100 మీ , 200 మీ, 400మీటర్ల పరుగులో మొదటి బహుమతి
డిస్క్ త్రో మొదటి బహుమతి, షాట్ ఫుట్ ద్వితీయ బహుమతి, జావలిన్ త్రో మొదటి బహుమతి అని తన పేరు పిలిచినప్పుడల్లా మనసు దూదిపింజలా తేలిపోతున్నది.
ఇక్కడ మైక్ లో ప్రకటిస్తున్న మాటలు నాలో అనంతమైన శక్తి నింపిన మిత్రకి చేరితే ఎంత బాగుంటుంది .. మనసులో థాంక్స్ చెప్పుకుంటూ అనుకున్నది ఆమె.
నిజంగా నాలో అంత సామర్ధ్యం ఉన్నదా .. తన కంటే చాలా ముందు నుంచీ ఉన్న వారిని వెనక్కి తోసేసి తను ముందు నిలిచిందా .. ఆశ్చర్యపోయింది ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ.
అంతలోనే నేను నేనేనా.. అన్న సందేహం కలుగుతున్నది ఆమెలో. కాలు భూమి మీద ఆగడం లేదు. మనసు ఆనందంతో పక్షిలా గిరికీలు కొడుతున్నది.
ఆమెలో ఒక్కో గెలుపు మరో గెలుపుకి ఉత్సాహాన్నిస్తూ ఉత్ప్రేరకంగా మారుతున్నది.
సరిగ్గా అదే సమయంలో 55 - 59 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో అట్లెటిక్స్ ఛాంపియన్ గా పూర్ణిమ అంటూ ఆమె పేరు ప్రకటించారు .
కలలోనైనా ఊహించని బహుమతి. ఒకదాని వెంట ఒకటి తన ఖాతాలో జమవుతూ.. విడ్డురంగా అనిపిస్తున్నది.
మహిళల వెటరన్ స్పోర్ట్స్లో ఉవ్వెత్తున ఎగుస్తున్న కెరటం పూర్ణిమ అంటున్నారెవరో ..
నిజ్జంగా తనలో అంత శక్తి ఉన్నదా .. అయితే, ఇన్నాళ్లు ఏమైంది ..? రకరకాల ఆలోచనలు పోటెత్తుతుండగా ఉద్వేగంతో వెళ్లి ఛాంపియన్ షిప్ షీల్డ్ అందుకోవడానికి వెళ్ళింది.
జీవితపు పరుగులో తన ప్రమేయం లేకుండానే పరుగులు పెట్టిందిన్నాళ్ళూ .., కాలం ఆడించే ఆటలో ఎన్నెన్నో ఆటంకాలు, ఉచ్చులు , ప్రమాదాలు దాటుకు వచ్చి అలసిపోయింది. ఇక నడవ లేక డీలా పడిపోయింది . ముందుకు సాగలేనని నిస్సత్తువతో కూలబడిపోయిన స్థితి నుండి .. కొత్త శక్తి నింపుకుంటూ పరుగు పెట్టింది.
శరీరం మనసు ధ్యాసంతా దాని మీదే పెట్టి ఆడింది . అందరితో పోటీలలో పోటీ పడుతున్నందుకే ఉప్పొంగిపోయింది.
అలాంటిది, తనే విజేతగా నిలవడం.. సంభ్రమాశ్చర్యం ఆమెలో ..
హర్షధ్వానాల మధ్య అభినందనలు అందుకుంటూనే.. తన ఈ స్థితికి కారణమైన మిత్రని పదే పదే తలచుకొంటున్నది.
అంబరాన్ని అంటే సంబరాన్ని అందించడానికి కారకురాలైన మిత్రకి ఈ విషయం తెలియజేయాలని ఆమె మనసు తహతహలాడుతున్నది.
ఫోన్ చేయబోతుంటే ఓ మీడియా ప్రతినిధి పలుకరించింది . మేడం .. మీతో మాట్లాడాలి అంటూ ..
ఆ వెనకే మరి కొందరు వచ్చి చేరారు.
నాతోనా .. అంటుండగానే..
"పరుగు పందెం లో మీ టైమింగ్ రికార్డ్. ఎలా సాధించగలిగారు" అడిగారొకరు.
"అవునా .. అదంతా నాకు తెలియదు. పోటీ కదా.. . ఇతరులతో పోటీపడి నాకు చేతనయినంత పరిగెత్తానంతే.
చిన్నప్పుడు చెంగు చెంగున లేడి పిల్లలా పరుగులు పెడతానని అనేది మా నాయనమ్మ బహుశా ఇప్పుడూ అలాగే పరుగు పెట్టానేమో .. చిన్నగా నవ్వుతూ చెప్పింది పూర్ణిమ.
ఓ చిన్నప్పటినుండీ పరుగుల రాణి అన్నమాట అన్నదామె .
లేదండి, నేను పరుగు పందెంలో పాల్గొంటానంటే ససేమిరా ఒప్పుకునేది కాదు మా నాన్నమ్మ. ఆడ పిల్లవు కాదూ .. అని తిట్టి పోసేది. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదారోజుల్లో. ' వెలుగుతున్న మొహంలో సన్నటి నవ్వు రేఖలు.
అంటే.. ఇప్పుడు ఈ వయసులో మీ కోరిక తీర్చుకుంటున్నారా ..?
నిజానికి కోరిక తీర్చుకోవడం కోసమో, బహుమతులు అందుకోవడం కోసమో నేను పరుగులు ప్రారంభించలేదు . అది నా లక్ష్యం కాదు.
మానసిక. శారీరక ఆరోగ్యం మెరుగు పరుచుకోవడం కోసం నడక ప్రారంభించాను. అందులోంచి పరుగులోకి వెళ్ళాను . అనుకోకుండా పోటీలో పాల్గొన్నానంతే...
అంతే, ఏంటి మేడం? ఇన్ని బంగారు పతాకలందుకుని. ఇంతకీ కోచింగ్ ఎన్నాళ్ళ నుండి తీసుకుంటున్నారు? జర్నలిస్ట్ ప్రశ్న.
కోచింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు.
ఈ మధ్యనే అంటే రెండు నెలల నుండి వారానికి రెండు రోజులు మాత్రమే ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా.
త్రోస్ వేరే వాళ్లు ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నేనూ నేర్చుకున్నా. పదిహేను రోజులయింది ప్రాక్టీస్ మొదలు పెట్టి.
ఆశ్చర్యంగా ఉందే .. ఇంత తక్కువ వ్యవధిలో ఆత్మవిశ్వాసంతో పోటీకి రావడం అన్నది మొదట పలకరించిన జర్నలిస్ట్.
అసలు ఈ రోజు నేను మీ ముందు ఉన్నానంటే కారణం నేను కాదు నా గురువు. తనే నన్ను తిరిగి మనిషిగా నిలబెట్టి మీ ముందు ఉంచింది . తాను లేకపోతే ఇప్పటి నేను లేను.
నిజానికి నాలోని ఆత్మవిశ్వాసం కొట్టుకుపోయింది . దుఃఖం, నిర్లిప్తత, నిస్సహాయత, బద్దకం మేటలువేసుకు పోయింది.
అటువంటి తరుణంలో ..
Crying , Trying ఈ రెండు పదాలు ఒకేలా ఉన్న రెండు పదాలు. మీకు తెలుసు కదా ..
రెండింటికీ ఒకే ఒక అక్షరం తేడా .
కానీ అవి మనమీద మన జీవితాల మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.
మొదటిది మన ఆత్మవిశ్వాసాన్ని అతలాకుతలం చేసి కుంగదీసి శిథిలం చేసుకు పోతుంది .
మరొకటి మనలో కొత్త శక్తులు తట్టి లేపి నూతనోత్సాహంతో ముందుకు నడిపిస్తుంది . జీవితం పట్ల ఆశ కలిగిస్తుంది.
ఏది ఎంచుకుంటావో.. నీ ఇష్టం .
అది ఏదైనా నీ చేతుల్లోనే, చేతలలోనే..
నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నీవేనని మర్చిపోవద్దని నా గురువు ఉద్బోధ.
ఓ.. రియల్లీ, ఎవరా గురువు .. ఏ సందర్భంలో ..? పూర్ణిమ మొహంలోని వెలుగు చూస్తూ ఉత్సాహంగా ప్రశ్నించింది యువ జర్నలిస్ట్
నా గురువంటే...
నాకంటే ఓ పాతికేళ్ళు వెనక ఈ భూమ్మీదకి వచ్చిన వ్యక్తి . నా ఆప్తమిత్రురాలు, నా పేగు తెంచుకు పుట్టిన నా కూతురు అని ఆగి అందరి మెహాల్లోని భావాల్ని చదవడంలో నిమగ్ననైంది పూర్ణిమ.
అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు.
ముందు తేరుకున్న జర్నలిస్టు నోరు తెరిచి, అంటే .. మీ అమ్మాయా .. ఆమె మీ గురువా .. ఆశ్చర్యంగా అడిగారు
అవును, మీరు విన్నది నిజమే..
మా అమ్మాయే.
ఏం .. కడుపున పుట్టిన పిల్లలు గురువు కాకూడదా .. ఆ స్థానంలో ఉండకూడదా ..మిత్రురాలు కాకూడదా .. అంత ఆశ్చర్యపోతున్నారు.
చిన్నగా నవ్వుతూ, నా కూతురే, పోస్ట్ మోనోపాజ్ సమయంలో వచ్చిన డిప్రెషన్ ఛాయలను గమనించింది. రోజు రోజుకి నాలో బలహీనమవుతున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపింది.
దుర్భలమవుతున్న మనసుని గట్టిపరిచే విధంగా వ్యవహరించింది.
మరింతగా ఆ ఊబిలోకి పోకుండా నేనేం చేయగలనో నాకు తెలిపింది , ఏం చేయాలో సూచనలు , సలహాలు ఇస్తూ నాకు అండగా నిలబడింది . నాకు గురువైంది . అమ్మకు అమ్మై కాపాడుకుంది- చెబుతున్నది పూర్ణిమ కంఠం గద్గదమవుతుండగా
క్వయిట్ ఇంటరెస్టింగ్ ..
అసలు ఎలా ఈ మార్గం ఎంచుకున్నారో వివరంగా చెప్పగలరా .. నిండా పాతికేళ్లు లేని ఔత్సాహిక జర్నలిస్ట్. కొందరు వెళ్లిపోయారు. నలుగురు యువ మహిళా జర్నలిస్ట్ లు మాత్రం పూర్ణిమ చెప్పేది వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
*** ***
అమ్మా.. నువ్వు నువ్వేనా ..
నువ్వసలు మా అమ్మవేనా అన్న సందేహం వస్తోంది . నిన్ను చూస్తే చాలా కోపం వస్తోంది . బాధ కలుగుతోంది అన్నదో రోజు నా కూతురు మిత్ర
ఈ మాటలు అనడం అది మొదటిసారి కాదు. ఇది రెండో సారో .. మూడో సారో .. సరిగ్గా గుర్తులేదు.
ఎందుకో అంత సందేహం .. మరెందుకో నాపై కోపం , ఆపై బాధ అని నవ్వుతూ అడిగనైతే అడిగాను. కానీ, దాని గొంతులో సీరియస్ నెస్ ధ్వనించిందన్న గమనింపులోకొచ్చి అకస్మాత్తుగా ఇట్లా అంటున్నదేంటి అని ఆలోచనలో పడిపోయాను.
దానికి నాపై అంత కంప్లయింట్స్ ఏమున్నాయి.. అసలు ఏముంటాయి .. ఏమో .. ఆలోచనలో నేను.
ప్రతిసారి నా మాటల్ని తేలిగ్గా తీసేసి తెలివిగా టాపిక్ మార్చేస్తావ్ .. అక్కడితో అసలు విషయం ఆగిపోతుందని నిష్టురంగా అన్నది మిత్ర .
అసలేంటే నీ బాధ .. ఊ .. చెప్పు వింటానన్నాను . తెచ్చిపెట్టుకున్న విసుగు ప్రదర్శిస్తూ
నేను నవ్వులాటగా అనట్లేదమ్మా... నిజ్జంగానే చెప్తున్నా .. నువ్వు నమ్ము నమ్మకపో ..
నువ్వు మాత్రం ఇది వరకటి మా అమ్మలా లేవు.
నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్న అమ్మలా లేవు అంటున్న ఆమె మాటల్ని తుంచేస్తూ .. .
నీ పిచ్చి గానీ .. ఎలా ఉంటారే ... ఎలా ఉంటారు ? మారతారుగా .. నువ్వున్నావా చిన్నప్పటిలాగే .. మారలేదూ .. నేనూ అంతే .. అన్నాను విసుగ్గా.
ఊహూ అలా కాదు . ఈ మార్పు అది కాదు. నేను ఎదుగుతున్నాను. నువ్వు అట్లాకాదు .. ఎట్లా చెప్పాలో తెలియక కొద్దిగా ఆగింది . ఆ తర్వాత, నువ్వెంత ఉత్సాహంగా ఉండే దానివి. ఎంత చురుకుగా ఉండేదానివి. ఎన్ని పనులు చకచకా చేసేదానివి. అవన్నీ నాకు తెలియనివా ..
మన ఇంటి చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి నిన్ను చూస్తే ఆశ్చర్యం . ఆఫీసు ఇల్లు , నానమ్మ తాతయ్య ల పనులు, మా పనులు చేసేదానివి. మాకు అందమైన బట్టలు కుట్టేదానివి, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ చేసేదానివి. మా చదువు సంధ్య చూసేదానివి. వాకిట్లో ముగ్గులేస్తే నువ్వే .. అన్ని పనుల్లో నువ్వే .. విసుగు, విరామం లేకుండా .. మొఖం మీద నవ్వు చెదరనీకుండా..
ఇంటి పట్టునే ఉన్నవాళ్ళు చేయని పనులెన్నో నువ్వు ఉద్యోగం చేస్తూ చేసేదానివి.
వాళ్ళు ఒకరోజు బయటికి వెళ్లి వస్తే తలనొప్పి అని మంచమెక్కేవారు.
నువ్వేమో గిరగిరా తిరిగివచ్చి కూడా అన్ని పనులూ శుభ్రంగా చేసేదానివి. అందరిలో మా అమ్మ చాలా గొప్పగా అనిపించేది.
నువ్వు ఇప్పుడలా ఉన్నావా .. లేవు. చాలా మారిపోయావు. చాలా డల్ గా ఉంటున్నావు అనేది నా బిడ్డ.
కాలం మారుతున్నట్టే వయసు పెరగడంలా .. వృద్యాప్యంలోకి రావడంలా .. నచ్చచెబుతున్న ధోరణిలో చెప్పేదాన్ని నేను.
అదిగో .. అదే.. అదే నాకు నచ్చడం లేదు.
ఆ మాటలే అస్సలు నచ్చట్లేదు.
ఎంత .. ఆ .. నీ వయసు ఎంతనీ .. ?
నిండా అరవై లేవు. దానికింకో మూడేళ్ళ సమయం ఉంది. అప్పుడే ముస్సలైపోయావా .. మూడుకాళ్ల ముసలమ్మవైనట్లు మాట్లాడుతున్నావ్ అని తగవులాడేది.
నిన్నటి నిన్ను చూసి, నీ పనితనం, నేర్పరితనం చూసి అన్నిట్లో ముందుగా ఉండే నిన్ను చూసి ఎంతో మంది అమ్మలు అసూయ పడడం, అలా తాము లేకపోయినందుకు, చదువు లేకపోయినందుకు, ఉద్యోగం చేయలేక పోయినందుకు బాధ పడడం చూశా. ఆర్ధిక స్స్వాతంత్య్రం, భావ స్వాతంత్య్రం లేవని బెంగపడే వాళ్ళను చూసా.
నిన్ను చూసి అసూయ పడేవాళ్ళను చూశా.
అలాంటిది, ఇప్పుడు వాళ్ళలో నీ వయసు వాళ్ళు, నీ కన్నా పెద్ద వాళ్ళు తమ జీవితాన్ని తాము కోరుకున్న విధంగా మార్చుకుంటుంటే.. నువ్వేమో వెనక్కి అని సణిగేది.
విజయలక్ష్మి వాళ్ళమ్మ నీకూ తెలుసుగా .. ఎప్పుడో పదో తరగతితో చదువు మానేసింది. ఇప్పుడు, విజ్జి యూకే లో ఉంది కదా .. అక్కడికి వెళ్తే ఇబ్బంది కాకూడదని ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు.
మాలతి వాళ్ళమ్మ మొన్న మొన్న స్కూల్ లో తెలుగు టీచర్ గా చేరింది. ఇట్లా తనకి నచ్చిన వ్యాపకాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుసా .. అంటూ నా వెన్ను తట్టే ప్రయత్నం చేసేది.
నువ్వు నీ జీవితాన్ని నీ చేతినించి వదిలేశావ్. నిన్ను నువ్వు చేజార్చుకుంటున్నావ్. అదేనమ్మా నా బాధ అని విలవిల లాడేది.
అబ్బా ఏదో లేవే.. ఇలా అలవాటు పోయింది.. నన్నిట్లా బతకనీ .. నా ప్రాణం తినకు..
నా ఆరోగ్య సమస్యలు నీకు తెలియనివా చెప్పు అని విసుగు ప్రదర్శించేదాన్ని
ఆ .. అదే చెబుతున్నానమ్మా.. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది అని ఎత్తి పొడిచేది.
ఆ .. ఏమంటున్నావ్ .. నా దగ్గరా .. నేనేం చేశానని అని అరిచే నన్ను పట్టించుకునేది కాదు. అవునమ్మా .. నీలోనే ఉంది. అందుకే నువ్వంటే నాకు నచ్చనిది . నిక్కచ్చిగా చెప్పేయడం మొదలు పెట్టింది.
అదేంటని నాలో కోపం బుసబుస పొంగేది . మాట్లాడ్డం మానేసేదాన్ని.
అమ్మా ప్లీజ్ .. నా మాట వినమ్మా ..
మీ అమ్మ వాళ్ళింట్లో నువ్వు చేయలేని పనులు కొన్ని పెళ్లయ్యాక చేశావ్.
నాన్న కుటుంబ విషయాలు పట్టించుకోకపోయినా పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డావ్.
ఎటువంటి సహకారం లేకుండానే కుటంబ బాధ్యతల్ని మోస్తూనే చదువుకున్నావ్ . ఉద్యోగంలో చేరావు. ఇంటాబయట పని ఒత్తిడి, పిల్లల, అత్తమామల ఆలన పాలన, బంధుమిత్రుల మర్యాదలు అన్నీ నువ్వే.. వేధింపులు , సాధింపులు, నిందలు , నిష్టూరాలు , ఆరళ్ళు అగచాట్లు అన్నీ నీకే .. అవమానాల అగ్నిప్రవేశాలు నీకే ..
కంటి చివర చిట్లే నీటి చుక్కల్ని ఘనీభవింపచేస్తూ గండశిలలా మారిపోయావ్. అలసిన మొఖంలోని పెదవులపై నవ్వులు అద్దుకుంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని, చేతులతో అష్టావధానం చేశావ్.
ఎందుకలా చేయగలిగావ్ ..
భవిష్యత్ పై నీకున్న ఆశ, నమ్మకం, పనిపట్ల ఉన్న నిబద్దత, నీ మీద నీకున్నవిశ్వాసం నిన్ను ముందుకు నడిపించింది.
కానీ నీకోసం నువ్వు చేయాలనుకున్నవి, నీ బాధ్యతల బందిఖానాలోంచి బయటికి వచ్చి ఆలోచించలేక వాటి పీక నొక్కేశావ్ ..
నువ్వేం చేసినా అవన్నీ కుటుంబం కోసం చేశావ్ . నీ చుట్టూ అల్లుకుపోయిన జీవితాల కోసం ఆరాటపడ్డావ్. నీకోసం నువ్వేం చేసుకోలేదు. మా అందరికీ చేసిన పనుల్లోనే తృప్తిని వెతుక్కున్నావ్.
ఇప్పుడు అందరం ఎవరి దారి వాళ్ళం చూసుకున్నాం. నువ్వు పెంచిన ఆ పిల్లలూ ఎదిగి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళున్నారు.
ఇప్పుడు నువ్వు ఒంటరివయ్యావు. ఆ ఒంటరితనంలోంచి వచ్చిన సమస్యలే నీవి.
దానికి తోడు శరీరం మనస్సుతో నీ హార్మోన్స్ ఆడుకోవడం మొదలు పెట్టాయి . వాటిని అదుపులో పెట్టగల శక్తి నీకు మాత్రమే ఉందమ్మా ..
చెబితే పట్టించుకోవు. నిన్ను నువ్వు కోల్పోతుంటే నాకు చాలా బాధగా ఉంది.
మాకు ఎవరికీ ఏ కష్టం వచ్చినా నీదైనట్లు బాధపడతావ్. మాకు అన్నీ అయి సేవలందిస్తావ్.
నీలో గూడుకట్టుకున్న ఒంటరితనం నాకు తెల్సున్నది . కానీ, పోగొట్టడానికి మేమెవరం దగ్గరలో లేం.
నువ్వు ని ప్రపంచంలోంచి బయటకు రాకుండా మా గురించి ఆలోచిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నావ్.
నీకు నువ్వే ఏవో సాకులు చెప్పుకుంటూ సోమరిగా కాలం వేళ్ళ బుచ్చుతున్నావ్. మరింత బలహీనంగా మారుతున్నావ్.
నువ్వు మానసికంగా దృఢంగా మారితే నువ్వెంత చురుగ్గా ఉంటావో నాకు తెలుసు.
నీతో నువ్వు పోరాటం చెయ్యి. నీకోసం నువ్వు ఆలోచించు. ఏం చేస్తే నీ మనసు చెంగు చెంగున పరిగెడుతుందో ఆలోచించు. ఏం చేస్తే నీ మొఖం అరవిరిసిన మందారంలా నవ్వుతుందో ఆలోచించు. ఏం చేస్తే .. గాలిలో తేలిపోతుంటావో ఆలోచించు. ఏం చూస్తే నీ కళ్ళు పరవశిస్తాయో ఆలోచించు ..
ఉత్సాహం ఉరకలేస్తుందో చూడు. మేమెవరం లేని నీదైన ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించు అని సుతి మెత్తగా చెప్పేది.
మాట్లాడ్డం మానేస్తే మెసేజ్ లు పెట్టేది.
నేను వాటిని గురించి ఆలోచించడం లేదనీ, ఆ ప్రయత్నం చేయడంలేనీ కోప్పడేది.
నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో. నీకు నువ్వు పని కల్పించుకో. అది ఏదైనా సరే .. నీకు ఏది నచ్చితే అది. నువ్వు సంతోషంగా చేయగలిగే పని ఏదైనా నువ్వే ఎంచుకో .. ఎంత సేపు చేయగలవో అదీ నువ్వే చూసుకో .. నాకందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇది చెయ్యి అని నాకు నచ్చినవి నీమీద రుద్దలేను. నీకు నచ్చిన నీ ఆసక్తులలోకి వెళ్లమంటున్నా. నువ్వు చెయ్యాలనుకుని చేయలేని పనులు చెయ్యి. నీకు తీరని కోరికలు ఏమున్నాయో వాటిని తీర్చుకొమ్మంటున్నా. పెన్షన్ లేని ఉద్యోగం చేసిన నీకు ఇప్పుడు చేతిలో డబ్బులు లేవని తెలుసు. వీ కంటూ నయాపైసా లేదనీ తెలుసు. నీ మొహమాటమూ తెల్సు.
నీ కోసం కొంత డబ్బు నీ ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసాను. అది నీ అవసరాలకు వాడుకో అంటూ మిత్ర పదేపదే చెప్పేది.
నా ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి తెలిసీ ఎప్పుడూ ఏదో ఒక క్లాస్ పీకుతుంటుంది అని లోనే తిట్టుకునేదాన్ని. కూతురికి పెట్టాలి కానీ దాని దగ్గర తీసుకోవాలా అని అసహనం, కోపం, విసుగు మరింత పెరిగేవి. ఒక్కోసారి మా ఆయన మీద విరుచుకుపడేదాన్ని.
తన మాట వినడం లేదని మిత్రకి చాలా బాధ కలిగినట్లుంది. నాకు ఫోన్ చేయొద్దు. నువ్వు చేసినా నేను మాట్లాడను.
నీకోసం కొత్త ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఆ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాతే, నీకు నచ్చిన పని ఏదైనా చేసిన తర్వాతే నీతో మాట్లాడేది అని మెసేజ్ చేసి మాటలు మానేసింది.
ఇన్నాళ్లూ బతిమాలింది. బాధపడింది. కోప్పడింది. ఏంచేసినా నేను మారడం లేదని చివరి అస్త్రంగా మాటలు మానేసింది. దాని పట్టుదల గురించి నాకు తెల్సు. అది మాట్లాడక పోతే లోకమంతా శూన్యంగా ఉంటుంది నాకు. నా ఏకైక నేస్తం అదేగా ..
అది నా గురించి ఎక్కువ ఆలోచించి నన్ను ఇబ్బంది పెడుతున్నదని మొదట అనుకునేదాన్ని.
సావధానంగా ఆలోచించడం మొదలు పెట్టాను.
నిజమే ..
నేను ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ తీరిక అందని ద్రాక్ష పండే. పుల్లవిరుపు మాటలూ, నోటితో మాట్లాడుతూ నెసటితో వెక్కిరింతలు ఉన్నప్పటికీ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగానే ఉండేదాన్ని. ఆర్ధిక సమస్యలూ లేవు. జీవితంలో వచ్చిన సవాళ్ళను ఎదుర్కొన్నాను. ధైర్యంగానే పరిష్కరించుకున్నాను. అప్పుడు తీరికగా, హాయిగా, రికామీగా ఉండడం నాకొక లగ్జరీ.
ఇంటిపట్టున ఉండి జీవితాన్ని షాపింగ్ లు, కిట్టీపార్టీలు, పేరంటాలు ఇలా రకరకాలుగా నలుగురూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న జీవితం పట్ల ఓ ఆకర్షణ.
నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిపోవడంతో కొత్త ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళలేదు. కారణం వాళ్ళలా నేనూ ఎంజాయ్ చేద్దామనే. కొంత కాలం రెస్టు తీసుకుందాం అనుకున్నా.
ఆ వెసులు బాటుతో నాలుగు రకాల సమూహాలతో కలయికలు సందడిగానే, సరదాగానే ఉంది. కానీ రాను రాను తెలియని అసహనం మొదలయింది.
నా తీరిక సమయం వినోదాన్ని, ఆనందాన్ని ఇవ్వక పోగా అసంతృప్తిని తెచ్చిపెట్టాయి. ,
షాపింగ్ లు, కిట్టీ పార్టీలు వగైరా వగైరా లేవీ తృప్తి నివ్వలేదు. చీరలు, నగలు, ఒకరిపై ఒకరు పోటీపడుతూ ఇల్లు, ఒళ్ళు అలంకరణ కిట్టీ పార్టీలు, పేరంటాలు, డాబుసరి మాటలు .., ఎత్తి పొడుచుకోవడాలు, లేదంటే సినిమాలు .. ఆ వాతావరణంలో ఇమడలేనని అర్ధమైపోయింది.
స్వేచ్ఛ సమానత్వం పేరుతో పబ్ లు, పార్టీల్లో తాగడం, పేకాట ఆడడం చేయలేకపోయా.
భక్తి పేరుతో పూజలు పునస్కారాల పేరుతో జరిగే ఆడంబరం, గుళ్ళు, దేవుళ్ళు, తీర్ధయాత్రల లోకంలోనూ కలవలేనని అర్ధమై పోయింది.
ఆ సమూహాల్లో డొల్లతనాన్ని, హిపోక్రసీని తట్టుకోలేకపోయాను. నేను కోరుకున్నది అదేదీ కాదని తేలిపోయింది.
లోపం వాళ్లలో ఉన్నదో నాలో ఉన్నదో అర్థంకాలేదు. నాలోనే ఏదో లోపం ఉన్నదేమో.. సందేహం . నలుగురితో నారాయణ అనలేనితనం నాది కదా ... ఇంట్లోనే ఉండిపోవడం మొదలు పెట్టా.
ఇంట్లోనే ఉంటున్నాను కదా .. ఎక్కువైన అనుకోని అతిథులు. పెరిగిన పనులు, తరిగిన ఓపిక, తీరిక.
నేననుకున్నది ఏంటి ? జరుగుతున్నది ఏంటి ? ఎందుకిలా జరుగుతున్నది అని నాపై నాకే చిరాకు, కోపం, విసుగు. నీరసం. బతుకు మీద వైరాగ్యం.
మళ్లీ ఉద్యోగంలో చేరదామా అనుకుంటూనే కొంత కాలయాపన...
ఈ వయసులో నాకెవరిస్తారులే అని నాకునేను చెప్పుకున్నాను. సమర్ధించుకున్నాను. మభ్యపెట్టుకున్నాను.
ఏదో అసంతృప్తి నన్ను ముంచెత్తుతున్నది. అనాసక్తంగా మారిపోయాను.
నలుగురిలోకి వెళ్లడం తగ్గిపోయింది. ఇంట్లోంచి బయటకు కదలాలంటే బట్టలు మార్చుకోవాలి. అదీ చేయాలనిపించేది కాదు. జీవితం శూన్యంగా కనిపిస్తున్నది.
రిటైర్ మెంట్ ప్లాన్స్ ఏమీ చేయని జీవితం నన్ను ఆందోళన పరచడం మొదలెట్టింది.
ఉన్నంతలో పిల్లల్ని కోరిన చదువులు చదివించగలిగాం. మా పిల్లలతో పాటు ఆపదలో ఉన్న కొంతమంది పిల్లలకి చదువు అందించడంతో పాటు మా చేతనయిన సాయం చేస్తూ వచ్చాము . మా కోసం మేం ఏమీ చేసుకోలేదు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకునే సమయంలో ఆర్ధికంగా కోలుకొని దెబ్బతగలడం చాలా కుంగదీసింది డెమోనిటైజేషన్ .. ఆ వెంటనే వచ్చిన జిఎస్ టి మా వారి వ్యాపారంలో ఒడిదుడుకులు .. తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన సమయంలో ఇరవై నాలుగుగంటలూ ఇంట్లోనే ఉండడం మరింత కుంగదీసింది.
అదే సమయంలో పక్కింటి అతను హఠాత్తుగా గుండెపోటుతో పోవడం శవాన్ని ఇంటికి రానీయని ఇంటివాళ్లు ..ఆ సంఘటన చాలా కదిలించింది.
రేపటి మా పరిస్థితిని అద్దంలో చూపింది.
ఇప్పుడు మీతో నవ్వుతూ ఇలా చెప్పగలుగుతున్నాను కానీ అప్పుడు నాలో వచ్చే వ్యతిరేక ఆలోచనలు పంచుకునే అవకాశం లేదు ,పిల్లలు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ..
మా ఆయన తన పనుల వత్తిడిలో.. చతికిల పడిన వ్యాపారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో తలమునకలై...
స్వీడన్ లో ఉన్న కొడుక్కి ఈ విషయాలేమి పట్టవు.
మిత్ర చెప్పినా ఎవరికీ కావలసినట్లు వాళ్ళుంటారు. అమ్మకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుంది . అది అమ్మ ఇష్టం . తనకి ఎందులో ఆనందం ఉంటే అదే చేయనీ ..
నువ్వెందుకు అమ్మపై అంత వత్తిడి తెస్తావ్. అని వాడి వాదన.
మగపిల్లవాడు, అందునా దూరంగా ఉన్నాడు. అమ్మ మానసిక పరిస్థితి పసికట్టలేకపోయాడు.. అర్ధం చేసుకోలేక పోయాడు.
దూరంలో ఉన్నప్పటికీ మిత్ర అర్ధం చేసుకుని నా పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నది . కానీ అది స్వీకరించే స్థితిలో నేను లేను.
నాకు తెలియకుండానే నాలో పోగుపడుతున్న నిరాసక్తత. నిర్లిప్తత . ప్రవహించడం ఆగిపోయాను. నిలువ ఉంటే ఏమవుతుంది. మురిగి కంపు కొడుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది.
నేను విసుక్కున్నా, కోపగించుకున్నా నా కూతురు నన్ను ప్రక్షాళన చెయ్యాలని, ప్రవహింప చేయాలనీ తన ప్రయత్నం మానలేదు.
నన్ను నన్నుగా నిలబెట్టాలని ఆమె తాపత్రయం.
నా మానాన నన్ను ఉండనీయకుండా ఇదొకటి నా వెనకాల పడింది. నేను చెప్పింది నువ్వు వినాలా .. నువ్వు చెప్పింది నేను వినాలా ? అంటూ మాట్లాడ్డం తగ్గించేశాను.
అయినా అది వినలేదు. వెంటబడింది. ఇన్నాళ్లు నువ్వు చెప్పింది నేను విన్నా. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలి అనేది.
ఇక్కడ చూడు ఆడవాళ్లు ఎలా తిరగేస్తుంటారో అని అక్కడి బామ్మల గురించి చెప్పేది . వీడియో కాల్ చేసి చూపించేది.
అది అమెరికా. ఇది ఇండియా అంటూ కొట్టి పారేసేదాన్ని.
అమెరికా అయినా, ఇండియా అయినా అమ్మ అమ్మేగా. అమ్మ ఆరోగ్యం బిడ్డకి ముఖ్యమేగా .. అని అనేది.
నీకేమన్నా పిచ్చా .. నాకేమయింది. నేనిప్పుడు బాగానే ఉన్నాగా .. ఎందుకింత సతాయిస్తావ్ అని ఎగిరిపడే దాన్ని.
తనూ ఒక్కోసారి విసుక్కునేది. ఒక్కోసారి ఓపికగా చెప్పేది.
ఇండియాలో కూడా పరిస్థితులు మారాయమ్మా. మీ నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ లాగే నువ్వు ఎందుకుండాలి? ఆ కాలం కాదిది. నిన్ను నువ్వు శోధించుకుంటూ ఎదగడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఉపయోగించుకో..
మా అమ్మ లాగా ఉండాలి. నువ్వు నువ్వుగా ఉండాలి అంటూ ఎంతో ఓపికగా ఓ తల్లి బిడ్డకు చెప్పినట్టుగా చెప్పేది.
వాళ్ళ నాన్నకి ఏమి చెప్పిందో .. మా అయన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు . ఏవో మందులు ఇచ్చారు . కానీ ఆందోళన. భయం. దూరాన ఉన్న పిల్లలగురించి ఆలోచించి బెంగ పెట్టుకుంటావ్ గానీ నా గురించి ఆలోచించడంలేదని మా ఆయన ఫిర్యాదు.
ఒకరోజు ఒక లింక్ పంపింది. లేడి లా పరిగెడతావా .. అంటూ. అది మహిళల స్పోర్ట్స్ క్లబ్ ది
మిత్ర దూరాన ఉన్నది. రావాలంటే వీసా సమస్యలు ఉన్నాయి. కానీ దాని మనసంతా అమ్మ మీదే. దాని జీవితాన్ని వదిలేసి ఈ అమ్మ గురించి ఆలోచిస్తూన్నది.
దానికోసమైనా చూసి రావాలనుకున్నా.
అంతలోనే, అయినా .. ఈ వయసులో నాకు ఆటలేంటి ? ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకోడానికి కాకపొతే.. ఎక్కడైనా పడిపోతే .. ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు ? దానికి మతి లేకపోతే నాకుండాలి కదా అనుకున్నాను.
ఇంటికి దగ్గరలోనే ఉన్నది కదా .. సర్లే .. ఒకసారి వెళ్లి చూసి వస్తే వచ్చిన నష్టం ఏంటని దుర్బలమైన మనస్సుకు నచ్చ చెప్పుకున్నాను.
వెళ్లి వచ్చి ఏదో ఒకటి చెప్పి దాని గోల వదుల్చుకుందామని అయిష్టంగానే స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్లాను.
నేను వెళ్లేసరికి నా కంటే చాలా పెద్ద వాళ్ళు తల పండిన వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళనలా వింతగా చూశాను.
కొందరు ట్రాక్ లో రన్నింగ్ చేస్తున్నారు . మరో ప్లేసులో సైక్లింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడుతున్నారు. చాలా చలాకీగా ఆడుతూ ఛలోక్తులేస్తూ నాకు బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నారు . నాకు చాలా ఆశ్చర్యమేసింది.
మొదటి పరిచయంతోనే నన్ను వాళ్లలో కలిపేసుకున్నారు. వయసు ఒక సమస్య కాదని వాళ్ళ చలాకీతనాన్ని చూస్తే అర్ధమైంది. అక్కడ నేను చూసిన దృశ్యాలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి.
ముఖ్యంగా 70 ఏళ్ల బామ్మ గారు ఈత కొట్టడం నన్ను చకితురాల్ని చేసింది.
అక్కడి పరిచయాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నేను మలుచుకుంటున్నాను.
ఏమి నేర్చుకున్నారు మేడం? శ్రద్దగా వింటున్న ఆ నలుగురిలో ఓ జర్నలిస్ట్ అడిగింది
పెద్దవాళ్ళయ్యామని గంటల కొద్దీ కూర్చొని ఉండడం వల్ల ఇతరులపై ఆధారపడడం మొదలవుతుందని తెలుసుకున్నాను.
మన శరీర కదలికల్ని ఎంత తగ్గిస్తే అంత త్వరగా వ్హాధుల పాలవుమని. మనం ఎంత చలాకీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని అర్ధమయింది.
ఏదో ఒక వ్యాపకం అది ఎంత చిన్నదైనా సరే ఉండడం మనిషికి చాలా శక్తినిస్తుంది. వేదన తగ్గిస్తుంది. ఇదంతా నేను ప్రాక్టికల్ గా అనుభవించినదే చెబుతున్నాను.
ఇవన్నీ నాకూతురు చెప్పినప్పుడు అంతగా పట్టించుకోలేదు. కొట్టి పడేశాను. కానీ నా కంటే పెద్దవాళ్ళని అక్కడ చూశాక, వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాలు చూశాక రియలైజ్ అయ్యాను.
ఇప్పుడు నన్ను నేను, నేను చేస్తున్న పనిని నేను ప్రేమిస్తున్నాను. గౌరవిస్తున్నాను. పటిష్టం చేసుకుంటున్నాను.
ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీ తోటి మహిళలకి మీరేం చెప్పదలచుకున్నారు? మరో జర్నలిస్ట్ ప్రశ్న.
నిన్నటి నాలాగా ఎందరో .. కానీ, నేనిప్పుడు అందరిలా కాదు.
కొందరిలా ..
మళ్ళీ జీవితం మొదలైనట్లున్నది . సామజిక జీవితంలో మార్పులొచ్చాయి. కొత్త కొత్త మనుషుల్ని కలుస్తున్నా.
చాలా కొత్త అనుభవాలతో వచ్చే ఉత్సాహం కొత్త శక్తిని, సామర్ధ్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా నన్ను నేను కొలుచుకునే అవగాహననిచ్చింది.
దారి మళ్ళిన నాకు, నా ప్రయాణంలో నన్ను నేను ఎలా మలచుకోవాలో మెరుగుపరుచుకోవాలో, స్పష్టత వచ్చింది.
నా జీవితానికొక లక్ష్యం ఇచ్చింది. ఇవన్నీ ఎమోషనల్ ఫిట్ నెస్ తో ఉండడం వల్లే సాధ్యమయింది .
ఆత్మవిశ్వాసం మనిషికి దివ్యౌషధమని అనుభవపూర్వకంగా చెబుతున్నా ..
అయితే, మానసిక ఆరోగ్యం సరిగాలేదని గుర్తించేదెవరు? మెరుగుపరచుకునే అవకాశం, అండ ఎందరికి ఉంటుంది ? అనే ప్రశ్న నన్ను తొలుస్తున్నది.
ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నా మదిలో రూపొందిన ఆలోచన ఇది , మీతో పంచుకుంటున్నా ..
మనం శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకున్నంతగా మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోము. కానీ, అది చాలా అవసరం. దాని గురించిన అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నాలాగా ఎందరో పిల్లలు, పెద్దలు మానసిక సమస్యల్లో ఉన్నారు.
మన బడులు, కుటుంబాలు ఏవీ ఆ దిశగా ఆలోచించడం లేదు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
మార్చి ఎనిమిదో తేదీన నుండి అరవై రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా.
మానసిక ఆరోగ్యం పట్ల మనలో ఉన్న నమ్మకాల్ని పోగొట్టే విధంగా కార్యక్రమం రూపొందించుకుని, స్థానిక బడులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, సామజిక కార్యకర్తలు అందరినీ కలుస్తూ ముందుకు సాగాలని అవగాహన కలిగించాలని ఆలోచన.
ఎలా .. ఎక్కడినుండి అని అడగకండి. త్వరలో నా కార్యాచరణ విషయాలూ ప్రకటిస్తా అని ముగించింది పూర్ణిమ.
పచ్చని అడవి. చిక్కని అడవిలో పచ్చిక బయలు.
ఆ అడవిలో ఉండే జీవజాలం తప్ప మరో జీవి అక్కడి జీవులకు తెలియదు. ఎప్పుడూ చూడలేదు.
అయితే , ఈ అడవి దాటితే పెద్ద ప్రపంచం ఉందనీ, ఆ ప్రపంచంలో మానవులు ఉంటారనీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళనీ, వాళ్ళు పక్షుల్లా ఆకాశంలో విహరిస్తారనీ, సముద్రంలో చేపల్లా ప్రయాణిస్తారని, చుక్కల్లో చందమామ దగ్గరకి వెళ్ళి వచ్చారనీ ఏవేవో చాలా విషయాలు చుట్టపు చూపుగా వచ్చిన కాకమ్మ ద్వారా విన్నాయి కొన్ని జంతువులు. అందులో ఒకటి తోడేలు.
అదిగో, అప్పటినుండి ఆ మానవ ప్రపంచం లోకి పోయి అక్కడ వింతలు విశేషాలు పోగేసుకురావాలని తహతహలాడి పోతున్నది తోడేలు.
ఒకరోజు తనతో సమావేశమైన మిత్ర బృందంతో ఎన్నాళ్ళుగానో కంటున్న కల గురించి విప్పి చెప్పింది తోడేలు.
"జరిగేది చెప్పు. అనవసరపు కలలు కనకు. వంటికి మంచిది కాదు " అన్నది రైనో.
"ఆమ్మో .. మానవ లోకంలోకా... బాబోయ్ "భయంభయంగా కళ్ళు టపాటపలాడించింది దుప్పి.
"ఆకాశానికి నిచ్చెన వేద్దామంటే పడి నడ్డివిరగ్గొట్టుకున్నట్టే .. "నవ్వింది నక్క .
"నాకా వయసయిపోతున్నది . కోరిక తీరకుండానే పోతానేమో బెంగగా ఉన్నది" మిత్రుల మాటలు పట్టించుకోని తోడేలు దిగులు పడింది.
మిత్రుడి కోరిక ఆమోదయోగ్యంగా లేదు. ముక్కు మొహం తెలియని మానవ లోకంలోకి వెళ్తుందంట. చుట్టుపక్కలున్న తమ వంటి రాజ్యాల్లోకే ఎప్పుడూ తొంగి చూసే ధైర్యం చేయని తోడేలుకు పోయే కాలం వచ్చిందని మనసులోనే విసుక్కుంది ఏనుగు.
"ఆరు నూరైనా ఈ నెలలో మానవ ప్రపంచంలోకి వెళ్లి తీరాల్సిందే .. మీరెవరైనా నాతో వస్తానంటే సంతోషం. లేకున్నా నేనెళ్ళేది వెళ్ళేదే .. ఆ ప్రపంచం చూడని బతుకు వృధా .. " తనలోతాను అనుకుంటున్నట్లుగా అన్నది తోడేలు.
వయసు మళ్లుతున్న మిత్రుడి కోరికని తీర్చలేమా అన్నట్లుగా మిగతా నలుగురు మిత్రులూ ఒకరినొకరు చూసుకున్నారు.
కొన్ని ఇబ్బందులు, కష్టాలు పడితే పడదాం. పడమటి పొద్దులో ఉన్న మిత్రుడ్ని ఒంటరిగా కొత్త లోకంలోకి పంపడం మంచిది కాదేమోనన్నది దుప్పి.
నిజమే, మిత్రుడి కోరిక తీర్చడం మన ధర్మం అని నక్క, రైనా సిద్దపడ్డాయి. ఏనుగు మాత్రం తన పరిస్థితుల దృష్ట్యా రాలేనని ఖచ్చితంగా చెప్పింది. మీరు వెళ్తే మీ నాలుగు కుటుంబాల మంచి చెడు నేను చూసుకుంటానని మాటిచ్చింది.
గతంలో కాకమ్మ ద్వారా విన్న అనేక విషయాలు మననం చేసుకున్నాయవి. తమ రూపాలతో వెళ్తే వచ్చే ఇబ్బందులను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకున్నాయి. మరో లోకపు జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి.
*** *** ***
ఆకురాలు కాలం అది . కొన్ని చెట్లు ఆకురాలుస్తుంటే కొన్నిమోడు వారిపోయి, మరికొన్నిలేలేత ఆశలతో చిగురిస్తున్నాయి.
నిశ్చలంగా నిశ్చబ్దంగా సాగిపోతున్న అక్కడి జీవితాల్లో ఏదో హడావిడి. ఉత్సవమేదో జరుగుతున్నట్లు సందడి. ఆ నోటా ఈ నోటా విషయం తెలిసిన జీవులెన్నో ఎగుడుదిగుడు కొండ లోంచి చీలికలు చీలికలుగా ఉన్న సన్నని బాటల్లో వచ్చి, పచ్చిక బయలులో సమావేశమయ్యాయి. మరో లోకపు ముచ్చట్లు తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి . నిన్నమొన్నటి వరకూ తమతో తిరిగిన నలుగురు నేస్తాలు మానవ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఏడాది దాటింది. ఈ జీవాలు అసలున్నాయో లేవోననే సందేహంలో సందిగ్ధంలో ఉన్న సమయంలో అవి తమ రాజ్యానికి తిరిగి రావడం ఆ జంతు లోకానికి పండుగ్గా ఉంది. అదీకాక ఆ లోకపు వింతలు విడ్డురాలు, విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం వాటినక్కడికి రప్పించాయి . ఇప్పుడు వాటి మాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.
తమ యాత్ర పూర్తి చేసుకొచ్చిన మిత్ర బృందం తోడేలు, నక్క , రైనో , దుప్పి రాకతో ఆ ప్రదేశమంతా హర్షధ్వానాలతో మార్మోగింది. అందరి వైపు చూస్తూ చేతులూపుతూ సంతోషంగా పలకరించింది మిత్ర బృందం.
అప్పటివరకూ ఉన్న కలకలం సద్దుమణిగింది. ఆకు రాలితే వినపడేంత నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రాంతం. జీవులన్నీ ఊపిరి ఉగ్గబట్టుకుని కూర్చున్నాయి . అక్కడున్న వారంతా సుశిక్షితులైన సైనికుల్లా .. కానీ వాటి శ్వాస నిశ్వాసలు పక్కన ఉన్న వాటికి వినిపిస్తున్నాయి.
ఆ ప్రశాంతతను ఛేదిస్తూ .. "ఆ రోజు మేం బయలుదేరినప్పుడు పలికిన వీడ్కోలు , మీ ఆదరాభిమానాలు మా వెన్నంటే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ.. ఇంత మంది, చిన్నా పెద్దా, పిల్లా పాపా .., మిమ్ములని చూస్తుంటే కడుపు నిండి పోయింది. మాయా మర్మం లేని మనమంతా ఒక్కటేనని రుజువవుతున్నది.
మరో లోకపు లోతుపాతులు తెలుసుకోవాలని స్వచ్ఛమైన హృదయాలన్నీ ఆశపడడం ఆరాటపడడం చూస్తే మహదానందంగా ఉంది. మా అనుభవాలు మీకు ఎలాంటి అనుభూతినిస్తాయో తెలియదు. ఏడాది కాలపు అనుభవాలను, అనుభూతులను కొద్ది మాటల్లో చెప్పడం కష్టమే .. కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాం.
మేము మానవలోకంలో మేమెలా బతికామన్నదానికన్నా, మా నిశిత పరిశీలనలో అక్కడి ప్రజల జీవితమెలా ఉన్నదో, ఆ లోకపు నగ్న స్వభావం గురించి చెప్పాలనుకుంటున్నామన్నది తోడేలు.. సరేనన్నట్టు తలూపింది మిత్ర బృందం.
మన మన్యంలో రకరకాల జంతు జాతులున్నట్టు మానవుల్లోనూ జాతులున్నాయి . అంతేకాదు కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, భాషా భేదాలు ఎన్నో ఉన్నాయి. అంతా బయటకు ఎంతో అందంగా, ఆనందంగా రంగురంగుల్లో కనిపించే సంక్లిష్ట లోకం. స్వార్థ లోకం.
ఒకే జాతి అయినా అంతా ఒకే స్థాయిలో ఉండరు . ఒకే రీతి నడవరు. ఒకే రకం తిండి తినరు . ఒకే రకపు ఇంట్లో ఉండరు . ఒకే రకపు బట్ట కట్టరు. ఎక్కడ చూసినా కులం , మతం , జాతి , అంతస్తుల తేడాలే .. మిరుమిట్లు గొలిపే వెలుతురులో అద్దాల మేడల్లో కొందరుంటే చీకటి గుయ్యారాల్లో ఆకాశమే కప్పుగా మరికొందరు .. ఆకాశ వీధుల్లో విహరించే వాళ్ళు కొందరయితే చీలికలైన కాళ్లతో గమ్యం కేసి ప్రయాణించే వాళ్ళు మరికొందరు ...
ఎవరికివారు తామే గొప్పని విర్రవీగుతారు. ఎవరి అస్తిత్వం వారికి గొప్పదే కావచ్చు. ఎవరి మత నమ్మకాలు , పద్ధతులు వాళ్ళకుండొచ్చు. అవన్నీ వాళ్ళింటికే పరిమితం కావాలి. గడప దాటిన తర్వాత అందరూ సమానమే కదా .. ఈ చిన్న విషయం వీళ్ళకెందుకు అర్ధంకాదో ..గొడవలు పడిచస్తారు. కొట్టుకుంటారు . నరుక్కుంటారు . యుద్ధాలే చేసుకుంటారు . ఏంమనుషులో ఏమో .. నమ్మినవాళ్ల మీదనుంచే తొక్కుకుంటూ పోతుంటారు... " అంటున్న తోడేలు మాటలకు అడ్డొస్తూ .. "అయ్యో .. ఎట్లా .. " చెట్టుమీద బుల్లిపిట్ట సందేహం వెలిబుచ్చింది.
" మనుషులకెనెన్నో నమ్మకాలూ, విశ్వాసాలు. వాటినే పెట్టుబడిగా చేసుకుని మఠాధిపతులు , పాస్టర్లు , ముల్లాలు గొప్పగా బతికేస్తున్నారు. ప్రజల నమ్మకాలను, భక్తిని మార్కెట్ వస్తువులుగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నారు . ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.
మనం అన్నది కనిపించక అంతా నేనులే .. మైదాన ప్రాంతాల్లో ఒకచోట కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక నగరం కాదు ఎక్కడికిపో .. అదే తంతు. ఒకనినొకడు దోచుకోవడమే .. కప్పను పాము మింగినట్టు మింగేయడమే..
కులాన్ని, మతాన్ని, రిజర్వేషన్లను అడ్డంపెట్టుకుని చేసే రాజకీయంలో చిన్న పిల్లలకు బిస్కట్ ఇస్తామని ఆశ పెట్టినట్లు రకరకాల పథకాల హామీలు ఆశపెట్టి మనుషులను తమ తిండి కోసం తాము కష్టం చేయలేని సోమరులుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు.
వారి అస్తిత్వాలు ఏవైనా ఆ జనం రెండుగా కనిపించారు. శ్రమ చేసేవారు , ఆలోచన చేసేవాడు. చెమటచుక్క చిందించే, ఉత్పత్తి చేసే శ్రామికులను గుప్పెడు మంది ఆలోచనాపరులు ఎప్పుడూ లొంగదీసుకుని తమ కాళ్ల కింద అట్టే పెట్టుకుంటున్నారు. ఆరోగ్యం నుంచి ఆర్ధికం వరకు, రక్షణ నుంచి సామాజిక భద్రత వరకు అన్ని రంగాల్లో ఆడ మగ వ్యత్యాసాలే .. "కంచుకంఠంతో చెప్పుకుపోతున్న తోడేలు కొద్దిగా ఆగి అందరి వైపు నిశితంగా చూసి ఓ దీర్ఘ శ్వాస విడిచింది.
" అన్నా .. ఏమైనా వాళ్ళు మనకంటే తెలివిగల వాళ్ళు.." అంటున్న రైనో ని "ఆహా .. ఏమిటో అంత గొప్ప తెలివితేటలు .. " తానే తెలివైనదాన్ననుకునే నక్కపిల్ల ప్రశ్నించింది.
"ఒకప్పుడు మనలాగే అడవుల్లో బతికిన మనిషి తన తెలివితేటలతో పక్షిలా ఆకాశంలో ఎగరడానికీ విమానాలు , చేపలా నీళ్లలో ప్రయాణానికి ఓడలు, ఆకాశంలో చుక్కల్లా కనిపించే గ్రహాలను, చందమామను చేరే రోదసీ నౌకలు ఇలా లెక్కలేనన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు" అన్నది రైనో
"ఓ అవునా .. ఇంకేం చేశారు .. చెప్పు మిత్రమా .. చెప్పు " తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు లా ఉత్సుకతతో చూస్తూ మిడత.
"తల్లి గర్భంలోంచి పుట్టే మనిషి మరమనిషిని తాయారు చేసి తాను చేసే పనులన్నీ దానితో చేయిస్తున్నాడు. అది ఊహకందడం లేదు కదూ .. కానీ అది నిజం. అంతేకాదు , మనం ఇక్కడుండి మన పొరుగు రాజ్యంలోనున్న మనవాళ్లతో మాట్లాడగలమా..? చూడగలమా .. లేదు. కానీ, వాళ్ళు ఇక్కడుండి ఎక్కడెక్కడో ఉనోళ్లను చూస్తారు. ఇక్కడ ఉన్నట్లు మాట్లాడుకుంటారు .. ." చెప్తున్న రైనో మాటలకు అడ్డు వస్తూ .. "ఏమిటేమిటి మళ్ళీ చెప్పు " అన్నది చిరుత.
"అవునన్నా, వాళ్ళ చేతిలో ఇమిడిపోయే ఫోన్ లున్నాయి. నేను నీతో మాట్లాడాలంటే నీ దగ్గరకొచ్చి మాట్లాడాలి. కానీ వాళ్ళు రాకుండా ఎక్కడివాళ్ళక్కడుండి చూసుకుంటూ మాట్లాడుకుంటారు.. " వివరించింది రైనో.
"అవును నిజమే, చేతుల్లో మొబైల్ ఫోన్లకు బందీలైపోయారు మానవులు. అవి అందరి దగ్గరా లేవు గాని చాలామంది దగ్గర కనిపిస్తాయి. మొదట్లో వింతగా ఆశ్చర్యంగా ఉండేది. అబ్బురంగా తోచేది . పోనుపోనూ విసుగొచ్చేసిందనుకోండి. మనిషి జీవితం, వారి ఆలోచనలు వారి చేతిలో నుండి టెక్నాలజీ చేతుల్లోకి పోతున్నట్లనిపించింది. సోషల్ మీడియా.. అతనికి తెలియకుండానే కండిషనింగ్ చేస్తున్నది. ఇంటర్నెట్ పెను తుఫానులా మనుషుల్ని తూర్పార పడుతున్నది. ఊకలాగా గాలికి కొట్టుకుపోతున్నాడు మనిషి. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే.. మనిషి ఒంటరే.. ఆ మానవ సంబంధాల నిండా బోలు.." విచారపు గొంతుతో నక్క.
"అవునవును మన తెలివి మనని ముందుకు నడిపించాలి. మొద్దుశుంఠల్నిచేసి వెనక్కి నడిపిస్తే ఎలా .. " గొంతు సవరించుకుంటూ ఎలుగుబంటి.
"వాళ్ళ సంగతొదిలెయ్ .. ఏ చావు చస్తారో చావనిద్దాం .. అటు ఇటూ చేసి మన మనుగడకే ముప్పు తెచ్చేస్తున్నారు కదా .. నింగి , నేల , నీరు , నిప్పు , వాయువు అన్నీ తన సొంత ఆస్తి అనుకుంటున్నాడు మానవుడు. నిన్నమొన్నటి వరకూ దట్టంగున్న దండకారణ్యాలు తరిగిపోతున్నాయి. అక్కడి జీవరాశులు నిరాశ్రయులైపోతున్నయి" దిగులుతో దుప్పి.
దూరంగానున్న జలపాతపు సవ్వడిని గాలి మోసుకొస్తుండగా "మీరేం చెబుతున్నారో నాకైతే ఒక్క ముక్క అర్ధంకాలే.. " తలగోక్కుంటున్న అడవి పంది.
" నీకర్థమయ్యేటట్లు మరోసారి చెబుతాలే .. "అని అందరివంకా పరిశీలనగా చూస్తూ " ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకున్నానని విర్రవీగుతున్నాడు కానీ, తన అహంకారానికి , తీరని దాహానికి , స్వార్ధానికి ఈ ప్రకృతిలోని సమస్త జీవజాలం తో పాటు అనాదిగా తానభివృద్దిచేసుకొస్తున్న సంస్కృతి, జ్ఞానం-విజ్ఞానంతో పాటు తాను కూడా ధ్వంసమైపోతున్నాని, నాశనమైపోతన్నాని అతనికి ఎందుకర్ధం కావడం లేదో... ప్రకృతితో పర్యావరణంతో వికృతమైన ఆట లాడుతున్నాడు " అన్నది దుప్పి.
అసహనంగా కదిలాయి పులి , సింహం , మరికొన్ని జంతువులు. " అంటే .. మనం సమిధలమా.. అట్లెట్ల .. ?" కోతి చిందులేసింది.
" మన కాళ్ళ కింద అతనికి అవసరమయ్యే తరగని ఖనిజ సంపద ఉన్నది. అతని కన్ను దీనిపై ఉన్నది. రేపోమాపో మనమంతా మన తావులొదిలి తలో దిక్కు వలస పోవాల్సిందే " హెచ్చరించింది నక్క.
" నిజమే నేస్తమా .. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతిలో భాగంగా మనమున్నాం . స్వచ్ఛంగా, స్వేచ్ఛగా సంచరిస్తాం. మానవ నివాసాలలో నాకు ఊపిరి సలప లేదంటే నమ్మండి . అంతా కాలుష్యం. వాయు కాలుష్యం, జల కాలుష్యం , శబ్ద కాలుష్యం .. మానవ ప్రవృత్తి లోనే కాలుష్యం .. తినే తిండి, పీల్చే గాలి , చూసే చూపు, మాట్లాడే మాట అన్నీ కలుషితం .. వాళ్లకు సృష్టి పట్ల , ప్రకృతి పట్ల భవిష్యత్తు పట్ల గౌరవం లేదు " అన్నది తోడేలు.
"ప్రకృతి విరుద్ధంగా సాగే నడక, నడత వల్ల కొత్తకొత్త రోగాలొస్తున్నాయక్కడ. ఉన్న పుట్టెడు రోగాలకు తోడు కంటికి అగుపించని క్రిమి వారిని అతలాకుతలం చేస్తున్నది . మనిషితనం మరచిన మనిషికి హెచ్చరికలు జారీ చేస్తున్నది . మేము వెళ్ళినప్పుడు కళకళలాడిన లోకం, తళతళ లాడిన మనుషులు ఇప్పుడు వెలవెల బోతూ పెద్ద సంక్షోభంలో .. " అన్నది రైనో.
"ఆ అదృశ్య క్రిమిని దుమ్మెత్తిపోస్తున్నారు " అన్నది దుప్పి.
"ఆ క్రిముల పుట్టుకకు కారణం వాళ్ళే. వ్యాప్తికి కారణం ఆ మనుషులే. వాటి పేరుతో ప్రజల రక్తం తాగేది వాళ్ళే. ప్రజలని కాపాడటానికి ఏవిటేమిటో చేసేస్తున్నాం, చాలా కష్టపడి పోతున్నామని షో చేసేది వాళ్లే. ఈ క్రమంలో బలహీనులంతా లోకం నుండి సెలవు తీసుకుని పోతుంటే మిగిలిన వారి ప్రాణ భయాన్ని సొమ్ము చేసుకుంటూ చికిత్స రూపంలో , వాక్సిన్ ల రూపంలో కొల్లగొట్టేస్తున్నారు " తోడేలు.
"నన్ను నిందిస్తారు కానీ అక్కడందరూ గుంట నక్కలే. మిత్ర సంబంధాలు శత్రు సంబంధాలుగా , శత్రు సంబంధాలు మిత్ర సంబంధాలుగా మారిపోతాయి. అక్కడ సంబంధాలన్నీ అర్ధంతోనో, అధికారంతోనో, అహంతోనో ముడిపడినవే. కష్టమొకడిది. సుఖం మరొకరిది. సొమ్మొకడిది . సోకొకడిది. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులకు సమాన హక్కు ఉన్నదన్న జ్ఞానం లేదు. అంతా తమదే నన్న పోకడలతో నాశనం పట్టిస్తున్నారు " అన్నది నక్క.
"మనలో మనకు వచ్చే గొడవలు, దాడులు ఆ పూట కడుపు నింపు కోవడానికే కానీ తరతరాల తరగని సంపద పోగెయ్యడానిక్కాదు" గంభీరంగా అన్నది మధ్యలో అందుకున్న పులి.
మానవ అభివృద్ధి దీపాల వెలుగులో నిప్పురవ్వలు రాజుకుని తమ అడవినంతా కాల్చేస్తాయేమోనన్న భయంతో .. తమ కాళ్లకింద నేలనంతా పెకిలిస్తాయేమోనన్న అనుమానంతో .. మసక మసకగా కనిపిస్తున్న భవిష్యత్ చిత్రపటం మదిలో చిత్రిస్తూ కొన్ని జీవులు. వాటి ఆలోచనల్ని భగ్నం చేస్తూ
"విచిత్రమేమంటే, అదే లోకంలో గుండె తడి ఆరని మనుషులు ఆకాశంలో చుక్కల్లా సేవ తీరుస్తారు. అడవి పుత్రులకు సేవ చేస్తారు. మర్చిపోయిన మానవత్వాన్ని తట్టి లేపుతుంటారు. మనసును కదిలిస్తూ మానవీయ బంధాలను గుర్తు చేస్తుంటారు. మనిషి మూలాలను తడిమి చూస్తుంటారు. అపారమైన ప్రేమ అందిస్తుంటారు . ఏపుగా పెరిగిన రాచపుండుకు చికిత్స చేస్తుంటారు.
ముక్కలు ముక్కలవుతున్న మానవ సంబంధాలకు మాటువేసి అతికించే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారి నుంచి తీసుకోవడం కన్నా ఎదుటివారికి ఇవ్వడానికి ఇష్టపడతారు . తమ చుట్టూ ఉన్న నలుగురినీ సంతోషపెట్టడానికి యత్నిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తగలబడుతున్న మానవ ప్రపంచాన్ని కొత్త తోవలో ఆవిష్కరించడానికి తపన పడుతుంటారు. జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ప్రేమిస్తారు" వెలుగుతున్న మొహంతో అందరి వంకా చూస్తూ అన్నది తోడేలు.
ఆకాశంలో తమ నెత్తి మీదుగా ఎగురుతున్న లోహవిహంగం కేసి చూస్తూ
స్వార్ధం పడగ నీడ నుండి కాపాడేది, బతికించేది ఆకుపచ్చని మనసులే .. వారితో కలిసి అడుగేయాలి "చెట్టుమీద చిలుక పలికింది.
ఆకుపచ్చని కలగంటూ వెనుదిరిగాయి ఆ జీవులన్నీ.
ఆ నిశిరాత్రి ప్రపంచమంతా నిద్రలో జోగుతున్నది. నిశాచర పక్షులు రెక్కలు తపతప లాడిస్తూ సంచరిస్తున్నాయి. కీచురాళ్ళు అదే పనిగా తమ రణగొణ సంగీతం వినిపిస్తున్నాయి
ఆరుబయట అనువైన ప్రదేశంలో వైరస్ బృందం సమావేశమయ్యాయి.
చాలాకాలం తర్వాత అనుకోకుండా కలిసిన బంధు -మిత్ర బృందం అలాయ్ బలాయ్ ఇచ్చుకొని ఒకరినొకరు అభిమానంగా నఖశిఖపర్యంతం పరీక్షగా చూసుకుంటున్నారు. అంతలో కోవిద్-19 కేసి చూస్తూ "ఏమోయ్ మస్తు జోష్ మీదున్నావే . దునియా అంతా దున్నేస్తున్నావ్ గద.. ఇందుగలడందు లేనట్లు ఎక్కడ చూసినా అలలు అలలుగా ఎగిసిపడుతున్న నీ సంతతే. మీ తలపులే " అన్నది ఎబోలా.
"మీరు నంగనాచిలా ఉంటారు కానీ .. ఒకటా రెండా... ఎన్నెన్ని సంక్షోభాలు మీ వల్ల.
ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక సంక్షోభం ఇలా ఎన్నెన్నో సంక్షోభాలు సృష్టించేశావ్..ఘటికురాలివే .. " దీర్ఘం తీసింది మార్స్
"లోకంలో ఎక్కడ చూసినా నీ పాదముద్రలే. నీ గురించిన ఆలోచనలే. గ్లోబంతా గిరగిరా తిరిగేస్తున్నావ్. అదీ..పైసా ఖర్చు లేకుండా' చిన్నగా నవ్వుతూ అన్నది ఇన్ఫ్లూయంజా
కూర్చున్న చోటు నుంచి కొద్దిగా కదులుతూ "చూడడానికి నాజూగ్గా, అందంగా ఉంటావ్. ఎక్కడేస్తే అక్కడ జంతువుల దగ్గర పడుండే సోంబేరువనుకునేవాళ్లం. ఇప్పుడేంటి ..?! నువ్వు నువ్వేనా.. నన్ను మించి పోయావ్ " ఎకసెక్కం గా నవ్వింది హెచ్ ఐ వి
"ఊ.. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చదువులు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు అన్నీ చట్టుబండలైపోయే.. జనం దగ్గర పైసలు లేవు.
రోగం-రొష్టు, ముసలి-ముతక అందర్నీ తుడిచేస్తున్నావ్.. ఓ యబ్బో..
తమరి మహిమ అంతా ఇంతా కాదుగా .. "అందరి వైపు చూస్తూ అన్నది మార్స్.
మళ్ళీ తానే "ఆసుపత్రుల్లేవు. వైద్యం లేదు. చావుకి బతుక్కి మధ్య వేలాడుతున్న జనం.. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పేద వాళ్ళ త్యాగాలతో వారి సమాధుల వరుసల్లో రాళ్లు ఏరుకు తినే రాక్షసగణం తయారయ్యారు.
ఆ అయినా .. పోయేకాలమొస్తే మనమేం చేస్తాం.. " అన్నది మార్స్
నీ ధాటికి భయపడి సూర్యుడు వణుకుతూ సూర్య మండలంలోనే హోమ్ క్వారైటైన్ లో ఉండి పోయాడట కదా.. అనుకోగా ఆ నోటా ఈ నోటా అనుకోగా విన్నాలే.. నిజమేనా.." కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న ఎబోలా గొంతులో దాచుకుందామన్నా దాగని అసూయ కనిపించింది మిగతా వైరస్ లకు.
నిన్ను కట్టడి చేయడానికి ప్రపంచమంతా కంకణం కట్టుకున్నదట కదా .. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేయడం అంత సులభమా " దీర్ఘం తీసింది హెచ్ ఐవి
"అవును మరి, బుసలు కొట్టి కాటువేసే సర్పాన్ని ఎవరు మాత్రం ప్రేమగా పెంచుకుంటారు చెప్పండి. కోరలు పీకి పడేస్తారు. పీక నులిమి పాతరేస్తారు గానీ .. " తన వెనుక పుట్టిన దాని కింత పేరుప్రఖ్యాతులు రావడం కంటగింపుగా ఉన్న మార్స్ దీర్ఘం తీసింది.
"ఎందుకర్రా.. దాన్నలా ఆడిపోసుకుంటారు..అది పడగవిప్పి బుసలు కొడుతూ వెంటాడితే లోకమిలా ఉంటుందా .. లాక్ డౌన్ ఎత్తేస్తుందా .. ప్రపంచమంతా ఇప్పటికీ లాక్ డౌన్ లోనే మగ్గిపోయేది కదా ..
జీవావరణం లో అన్ని జీవులతో పాటు, కణజాలం తో పాటు మనమూ ఉన్నాం.
అదంతా ఇప్పుడెందుగ్గానీ .. చాన్నాళ్ల తర్వాత కలిశాం . కాసేపు సరదాగా గడుపుదాం " అప్పటి వరకు అందరి మాటలు విన్న జికా అన్నది.
కొన్ని క్షణాలు జికా వైపు అభిమానంగా చూసి "బంధు మిత్రులంతా నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావడం లేదు" అయోమయంగా అన్నది కోవిద్19 .
ఆ వెంటనే "కాలం నన్ను కౌగలించుకుంది. తనతోపాటు తీసుకు పోతున్నది. ఎటు తీసుకుపోతే ఆటుపోతున్నా అంతే. నేను నిమిత్త మాత్రురాలిని ..
జనమే అనుకున్నా మీరు కూడా నన్ను కేంద్ర బిందువు చేసి ఆడిపోసుకుంటున్నారు" ఉక్రోషంగా మిత్ర బృందం కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నది కోవిద్-19.
మళ్ళీ తానే "ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టినట్లే నేను పుట్టాను. నాకు నేనుగా ఈ పుట్టుక కావాలని కోరుకుని పుట్టలేదుగా..
నా మనుగడ కి అనువైన ఆవాసాలు తెలియక ఎవరి కంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడెక్కడో అనామకంగా పడి ఉన్నానేమో..!
మానవ శరీరంలో నా పునరుత్పత్తికి అనువైన కేంద్రాలున్నాయని తెలిసుకున్నా.
ఈ సృష్టి ధర్మం ప్రకారం జీవమున్న ప్రతి కణం చేసే పని నేనూ చేసుకు పోతున్నా..
అంతే తప్ప స్వార్ధంతో, ఎవరిమీదో కక్షతో, కసితో కోపంతో కాదుగా.. " అదేమన్నా తప్పా అన్నట్లు అందరి వైపు చూస్తూ భుజాలెగరేసి చెప్పింది కరోనా అని పిలుచుకునే కోవిద్ 19.
"రెచ్చిపో బ్రో.. రెచ్చిపో.. ఇంత మంచి తరుణం మళ్ళీ మళ్ళీ వస్తుందా..!
ప్రపంచ రాజ్యాలకు ప్రజల ఆరోగ్యం ఎలాగూ ప్రాధాన్యం కాదు. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళవి .
యుద్ధాలు .. ఆయుధాలు.. వర్తక వాణిజ్యాలు .. ఎవరి ప్రయోజనాలు వారివి.
హూ.. సామాన్య జనం, ఉంటే ఎంత .. పోతే ఎంత ... ఆఫ్ట్రాల్.. ఏం ఫరక్ పడదులే భాయ్.. విజృంభించడానికి మంచి సమయం ఎంచుకున్నావ్ "అన్నది మార్స్
"కోవిద్ 19 ఎంచుకున్నదనుకుంటున్నారా.. ఉహు లేదు లేదు..
నెత్తుటి కూడు తినే మానవ గణాలు కొన్ని ఉన్నాయి.. ఏమీ ఎరగని పత్తిత్తుల్లా కనిపిస్తాయి కానీ మహా జిత్తులమారులు. తమ పబ్బం గడుపుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతుంటాయి . అవే ఒలిచిన పండును మన ముందు పెడతాయి.. మనకి పండగే పండుగ. తిన్నవాళ్లకు తిన్నంతని విజృభించేస్తాం" తన ధోరణిలో అన్నది హెచ్ ఐ వి
"నీలాగా, నా లాగా దీనిది ఉగ్ర తత్త్వం కాదులే. సాధు స్వభావి. దానికది పోయి మానవుడిని కౌగలించుకోదు. తనను కలిసిన వారినొదలదు. తెలిసో తెలియకో మానవులే ఆకాశమార్గం పట్టిచ్చారు. నౌకల్లో మోసుకుపోయారు. సముద్రాలు దాటించారు. ఖండాంతరాలు విస్తరింపజేశారు.." ఎబోలా ను చూస్తున్న మార్స్ అన్నది
"నిజమే..మానవుని నడక, నడతదే తప్పు. మనని మనం ఆట పట్టించుకోవడం, నిందించుకోవడం సరైంది కాదేమో " పెద్దరికంగా అన్నది జికా
"ఇదేమన్నా ఎడ్ల బళ్ళు , గుర్రబ్బగ్గీల కాలమా .. జెట్ యుగంలో ఉన్నాం మరి!
మానవుడు రోదసీలో కెళ్లి వస్తున్నప్పుడు అతనితో మనం ఆ మాత్రం ప్రయాణం చేయలేమా ఏమిటి? ఎక్కడికైనా అలాఅలా వెళ్లిపోగలం" జికా మాటని పట్టించుకోని హెచ్ ఐ వి అన్నది
"అవునవును, కానీ .. జీవితంలో ఎన్నో గెలిచిన వాళ్ళు, అంటువ్యాధుల జాడలేని పూదోటగా మారాయనుకునే దేశాల వాళ్ళు కంటికి కనిపించనంత అతిసూక్ష్మ క్రిమికి బెంబేలెత్తి పోవడం, భయపడిపోవడం, మరణశయ్య నెక్కడం విచిత్రం!" బుగ్గన వేలేసుకుని ఎబోలా .
"అదే నాకు అంతు చిక్కడం లేదు. అసలు నేనెంత వాళ్ళ ముందు .. ఆ.. చెప్పండి.
మానవ మేధ, జ్ఞానం, విజ్ఞానం ముందు మనమెంత? నలుసులో వెయ్యోవంతో, లక్షోవంతో కూడా లేని నేనెంత? నాపై ఇంత ప్రచారమా.. ఎన్ని నిందలో.. మరెన్ని కట్టుకథలో ..
వింటుంటే మొదట్లో బాధేసేది. కానీ ఇప్పుడవన్నీ వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకు పోతున్నా.
నాకా స్థితి కల్పించిన రాక్షసగణం మనోగతం అర్థమయింది. ఈ భాగోతంలో మనిషికీ మనిషికీ మధ్య, దేశానికి దేశానికి మధ్య , రాజకీయాలకి రాజకీయులకు మధ్య ,రాజ్యాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాల మధ్య , వ్యాపార వాణిజ్య ప్రయోజనాల మధ్య ఎన్ని రకాల సిద్ధాంతాలు .. మరెన్ని ప్రచారాలు .. ఎన్ని అపోహలు , ఎన్ని అపనమ్మకాలు ..
ఏవీ నేను సృష్టించినవి కాదు. నన్నడ్డం పెట్టుకుని కొన్ని గణాలు తెరవెనుక ఆడుతున్న పెద్ద ఆట.
ఆ క్రీడలో భాగమే ఇప్పటి సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు, దాడులు.. "వివరణ ఇస్తున్నట్లుగా అన్నది సార్స్ కోవిద్ 19
"నీ ప్రతాపాన్ని, ప్రకృతి ప్రకోపాన్ని కూడా మానవుడికి అంటిస్తావేం .." కొంచెం విసుగ్గా అన్నది ఎబోలా
" బ్రో .. ఆ జీవి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేమైనా జరగొచ్చని అతని అతి తెలివితేటలే కాదు చరిత్ర చెబుతున్నది. చరిత్రలోకి తొంగి చూడండి. వనరులకోసం, సంపద కోసం, స్వార్థం కోసం, అధిపత్యం కోసం జరుగుతున్న దేనని స్పష్టమవుతుంది" నిదానంగా అందరి కేసి చూస్తూ అన్నది కోవిద్ 2
అప్పటివరకూ సరదాగా మాట్లాడుతున్న మిత్ర బృందం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. కోవిద్ 19 మాటల్లో అంతరార్థం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు .
"ఆలోచిస్తే నువ్వన్నది నిజమేననిపిస్తుంది మిత్రమా.. చేతులతో గరళం విరజిమ్మదానికి సిద్ధమవుతూ నాలుక నుంచి తేనెలూరించే మురిపించే మాటలు, చేతలు ఎన్ని చూడడం లేదు" అన్నది జికా
"ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరా చేసుకుని ఆందోళన సృష్టించారు. ఒక మామూలు వైరస్ ని బూచాడుని చేశారు. భూతద్దంలో చూపారు .
బ్రహ్మాండంగా జేబులు నింపుకుంటున్నారు. ఒకప్పుడు నా విషయంలో జరిగిందదే" హెచ్ ఐవి
"అయ్యో .. ఈ మనుషులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదంటే నమ్మండి.
మానవులలో కొందరు కొందరిని అంటరాని వారిగా చూస్తూ, అవహేళన చేయడం గురించి చరిత్ర ఎన్నో సాక్ష్యాలు చూపుతుంది. ఇప్పుడు కోవిద్ ఎవరితోనైనా కనిపిస్తే చాలు అలాగే వారిని అంటరానివారిగా చూస్తున్నారు. బంధుమిత్రులు దూరంగా పెడుతున్నారు.
నిన్నటివరకూ ఆత్మీయతానురాగాలు కురిపించిన వాళ్లే అంటరానివారిగా చూడటం భరించలేని కొందరు ప్రాణత్యాగం చేస్తున్నారట." అన్నది ఇన్ఫ్లూయెంజా
"నిజమే.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి పాజిటివ్ రాగానే నడిరోడ్డుపై అనాథలా వదిలేసిన ప్రబుద్ధుల్ని చూస్తున్నా.
అంతేనా .. పాపం, ఆయనెంతో మందికి విద్యాబుద్ధులు చెప్పారు . ఇప్పుడు వాళ్లంతా ఆయన శవం ఖననాన్ని అడ్డుకున్నారు
మరొకాయన గొప్ప వైద్యుడు. తుమ్మినా దగ్గినా ప్రజలకు ఉచిత వైద్యం చేసిన మహానుభావుడు నిన్నటివరకూ.. నేడాయన శవాన్ని అక్కడ కాల్చడానికి ఆ ప్రజలంతా వ్యతిరేకమే .
ఊళ్ళ మధ్య ముళ్ళకంపలు, పాజిటివ్ ల వెలి, తోటి మనిషిని అక్కున చేర్చుకోలేనితనం... అయ్యో .. ఏమని చెప్పను .. ఎన్నని చెప్పను .. కొల్లలు కొల్లలుగా కథలుకథలుగా విషయాలు బయటికొస్తున్నాయి. అయ్యయ్యో .. ఏది మానవత్వం..? ఏవీ మానవీయ విలువలు..? మననంటారుగానీ మనకంటే తీవ్రమైన నీచమైన వైరస్ మనిషిలోని స్వార్థం. ఆ జబ్బుతో సహజీవనం చేస్తూ మనను ఆడిపోసుకుంటారు" వాపోయింది హెపటైటిస్.
ఏ మాత్రం వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా వైరస్ జాతులున్నాయి. కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. మనిషిలో మార్పు వచ్చినట్లు వాటిలో కొద్దోగొప్పో మార్పొచ్చిందేమో.. అయినా తట్టుకుంటూ, కాపాడుకుంటున్న మానవుడు ఇప్పుడెందుకు చిగురుటాకులా వణికిపోతున్నట్లు, రాలిపోతున్నట్లు?
మానవ ప్రవృత్తిలో, ఆహార విహారాలలో మార్పు తెచ్చే కుట్రలు చాపకింద నీరులా సాగించిన రాక్షస మూకకి ఇప్పుడు పండుగగా ఉంది.
పెద్ద పెద్ద కబుర్లు చెప్పే గొప్ప దేశాలన్నీ చతికిలబడి అదృశ్యక్రిమిని ఎదుర్కోలేక పోవడం అభివృద్ధి నమూనా విచిత్రం. కారణం ఎవరు..?
అలక్ష్యం, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్ధత, నేరపూరిత నిర్లక్ష్యం కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి వైరస్ ని నిందిస్తున్నారు
మెరుగైన ఆరోగ్య సదుపాయాలు సాధించామనుకుంటూ ప్రజా ఆరోగ్య వ్యవస్థల విచ్ఛిన్నం చేసుకున్నారు.
వైద్యం, ఆరోగ్యం లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. జబ్బు పడితే జేబుకు చిల్లే నా యే.. ఐదు నక్షత్రాల వైద్యం, మూడు నక్షత్రాల వైద్యం కొనలేక కొందరు, తప్పని పరిస్థితిలోనో, బతుకుమీద తీపితోనో ఉన్నదంతా ఊడ్చి తర్వాత చిప్పట్టుకుంటున్న వైనం.. కళ్లారా చూస్తున్నా.. అయినా, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కార్పొరేట్ వైద్యం చుట్టూ తిరుగుతారు . ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని అనుకుంది వైరస్ మిత్ర బృందం మాటలు మౌనంగా ఆలకిస్తున్న గబ్బిలం
"ఎగిరే పక్షికి వల పన్నినట్టు మన చుట్టూ వలపన్ని మనను మట్టుబెట్టడానికి యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ డ్రగ్స్, వాక్సిన్స్ కోసం వాటిపై ఆధిపత్యం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఏవేవో కనిపెట్టామంటున్నారు. అయినా అన్ని తట్టుకుని మనం పుట్టుకొస్తూనే ఉన్నాం. మన ఉనికి వల్ల, మనం ప్రాబల్యం చూపడం వల్ల కొంతమంది జనం ఎప్పుడూ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.
ప్చ్.. పాపం పుణ్యం ఎరుగని బీదాబిక్కి బలైపోతున్నారు అది వేరే విషయమనుకో.. " అన్నది కోవిద్ 19
"ఇందుగలడందు గలడు అన్నట్లు ఎక్కడ చూసినా నువ్వే, నిరంతరంగా పరివర్తన చెందుతుంటే మేతావులు తయారు చేసుకున్న మందులు పనికిరాకుండా పోతున్నాయి. హహ్హహ్హా ..." గుంపు లోంచి పగలబడి నవ్విందో వైరస్
నిజమేనోయ్ .. మానవులెంతో తెలివిగలవారనుకున్నా.. మనని వల్లకాట్లో కలపడం వాళ్ళకి తెలియక కాదు. బాగా తెలుసు. అయినా పీడకలలుగా కలవరిస్తూనే ఆదమరచి నిద్దురపోతారు.
అప్పుడప్పుడు మొద్దు నిద్దుర లేచి హడావిడి చేస్తారు తప్ప నిజంగా కల్లోలాన్ని ఆపాలని చిత్తశుద్ధితో కాదు." అన్నది మార్స్
" వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయిగా.. అవి తేలాలిగా.." నవ్వింది కోవిడ్ 19
పెరిగిపోతున్న జనాభాని తగ్గించడానికి దేవుడు కోవిద్ ప్రవేశపెట్టాడట..
చప్పట్లు , దివ్వెలు .. మంత్రాలకు చింతకాయలురాలడం ఎప్పుడైనా ఎక్కడైనా చూశామా
పిచ్చిమూక. లోగుట్టు ఎరగక, మనుషుల పాపానికి దేవుడు విధించిన శిక్ష అనే మత గురువులు, ప్రార్థనలతో వైరస్ తరిమికొడతానని ప్రార్థనలు చేసే ఫాస్టర్, రాగి వస్తువులతో నయం చేస్తాననే వైద్యులు, పూజలు, దైవప్రార్థన తో తగ్గిస్తానని పూజారి, ఎండమావుల్లో నీళ్లు తెస్తాననే ముల్లా అందరూ బాధితులై మట్టిలో కలిసిపోతుంది మంత్ర తంత్రాలకు గిరాకీ తగ్గలేదు. మనుషులు ఉన్నపళాన ఎగిరిపోతున్నా, పవిత్ర గంగానదిలో కళేబరాలు ప్రవహిస్తున్నా.. బుద్ది లేని జనం ఎట్లా నమ్ముతున్నారో..
కన్నీళ్లు పోగుపడుతున్నా వాక్సిన్ వేసుకోవడానికి మీనమేషాలు లెక్క బెడుతున్నారు.
మాస్క్ లేకుండా శానిటైజ్ చేసుకోకుండా ఎడం ఎడం లేకుండా తిరుగుతారు.
కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు, సభలు, పబ్లిక్ మీటింగులు ఏవీ తగ్గవు. కానీ ప్రాణం అంటే చచ్చేంత భయం. డబల్ స్టాండర్డ్ మనుషులు .. థూ.. అంటూ తుపుక్కున ఊసింది మౌనంగా ఇప్పటివరకు వైరస్ ల మాటలు వింటున్న గబ్బిలం.
అలలు అలలుగా కోవిద్ రాకపోయుంటే జనం వాక్సిన్ తీసుకునే వాళ్ళు కాదేమో.. అనుకుంది నిద్ర లో మెలుకువ వొచ్చి వైరస్ బృందం మాటలు వింటున్న చీమ
"నాది సమదృష్టి . కుల మత, వర్ణ, వర్గ, ప్రాంత, జెండర్ వివక్షతలు నాకు లేవు. నాకు అందరూ ఒకటే. గుళ్లో పూజారి, చర్చి ఫాస్టర్, మసీదులో ముల్లా, దేశ ప్రధాని, ప్రెసిడెంటు ఎవరైనా నాకంతరం తెలియదు. నా దగ్గర కొస్తే.. నా పాత్ర నేను పోషిస్తా. వారు నన్నెదుర్కున్న దాన్నిబట్టే ఫలితాలు.." తనని నిందిస్తున్నారని బాధ మొహం లో కన్పిస్తుండగా కోవిడ్ 19.
మానవులలో ఉన్నన్ని తారతమ్యాలు మరెక్కడైనా ఉన్నాయా ..? వాళ్లలో కుల , మత , వర్గ , వర్ణ , రాజకీయ, ఆర్థిక, ప్రాంతం, జెండర్ ఇలా ఎన్నెన్నో వివక్షలు .. భేదాలు .. గురించి పుట్టెడు విని ఉంది . మందిరాల్లోనో, మసీదుల్లోనో, చర్చిల్లోనో తమ గోడు వెళ్లబోసుకున్న వాళ్ళ ఊసులు ఎన్నో వింటూనే ఉన్నానుగా.. ఈ వైరస్ ల మాటల్లో అతిశయం ఏమి లేదనుకుంది గబ్బిలం .
"కురచ మనుషుల వాదనలకు నువ్వేం బాధపడకు బ్రో.. ఇదేమన్నా ఇప్పటికిప్పుడు ఊడిపడిన ఉత్పాతమా.. నింగి నుంచి నేల రాలిన ఉల్కాపాతమా.. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత" ఊరడిస్తూ అన్నది మార్స్
"మానవ మనుగడకు, అస్తిత్వానికే ప్రమాదం తెస్తూ నెత్తుటి కూటి కోసం కాచుకునే మాయావుల ఇనుప డేగరెక్కల చప్పుడు వినలేదా ..
ఆ మాయావులే కదా మన వ్యాప్తికి కారణమయ్యేది. ఆ మాయావి డేగలే వ్యాధి వ్యాప్తికి కారణమంటూ జాతి, మత దురహంకారాన్ని రెచ్చగొట్టేది. విద్వేష ప్రచారం చేసింది. విషపూరిత వాతావరణం సృష్టించింది" అన్నది జికా
"అవును మిత్రమా, ఆ టక్కు టమారపు గారడీ విద్యలతో సముద్రంలో నీళ్లంతా తోడేసుకుందామని ఆశపడేది. అందుకోసం పావులు కదిపేది ఆ తాంత్రికులే " అన్నది హెచ్ ఐ వి
ఆ ఆశతోనే కదా అభివృద్ధి మంత్రం జపిస్తూ అధిక ఉత్పత్తి పేరుతో అత్యాశతో సహజత్వానికి దూరమయింది. సహజంగా, స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చే వాటిని తీసుకోవడం మానేసి ప్రకృతిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కృత్రిమత్వాన్ని అలవాటు చేశారు..
సహజంగా తినే వాటిలో, సహజమైన గాలిలో, ఎండలో తిరిగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ఒళ్ళు కదలకుండా, కండ కరగకుండ కొత్త రుచులు, కొత్త కొత్త సుఖాలతో అంబర మెక్కి ఊరేగుతున్నామనుకుంటున్నారు కానీ అధః పాతాళం లోకి వెళ్తున్నామని తెలుసుకోలేకపోతున్నారు.
పిచ్చి సన్నాసులు. తాను చూస్తున్న మానవజాతిని తలచుకుని జాలిపడింది చీమ .
వైరస్ బృందం మాటలు వింటూ చప్పుడు చేయకుండా చుట్టూ చూసింది. నిశాచరి గబ్బిలం కనిపించింది. నెమ్మదిగా గబ్బిలం చెంతకు బయలుదేరింది చీమ .
"ఎండమావుల్లో నీళ్ళెతుక్కునే వాళ్ళు కొందరయితే నేతి బీరకాయలో నెయ్యి పట్టుకుంటామనేవారు కొందరు .. మనమేం చేస్తాం ..
తన ఇంటిని తానే తగలబెట్టుకుంటూ మనమీద పడి ఏడుస్తున్నాడు .. " వైరస్ మిత్ర బృందం నుంచి మాటలు వినిపిస్తున్నాయి
ఒకపక్క దట్టమైన మేఘంలా కమ్ముకొస్తున్న ముప్పుని కప్పేస్తున్న వ్యాపార, వాణిజ్య విధానాలతో పర్యావరణ విధ్వంసం నిర్విరామంగా జరిగిపోతున్నది. తమ చేతకానితనాన్నో, రాజకీయ ప్రయోజనాలకో, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికో, లాభసాటి వ్యాపారం కోసమో, ఒక మామూలు వైరస్ ని సంక్షోభంగా, పెను విపత్తు గా మార్చేసిన వారిని చూస్తే దుఃఖం గా ఉంది. రేపు తమ గతేంటి.. గొణుక్కుంటూ గబ్బిలాన్ని చేరింది చీమ.
"మిత్రమా.. ఈ దెబ్బతో ప్రపంచం మారిపోతుందా.. కొత్త యుగంలోకి ప్రవేశిస్తుందా.. భవిష్యత్ చిత్ర పటం ఎలా ఉంటుందంటావ్" గబ్బిలాన్ని ప్రశ్నించింది చీమ.
"నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదురా... వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చి కోట్లాది మంది పోయారు. అంతకు ముందు ఇలా చనిపోయి ఉంటారు. అయినా మనిషి బుద్ది మారిందా .. లేదే .. ప్రజాసమస్యల్లోనూ లాభాల వేట తప్ప ప్రజాసంక్షేమం శూన్య మైనప్పుడు, వ్యక్తిగత ప్రయోజనం ప్రాధాన్యం అయినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి?
శవాల మీద నెత్తుటి పంట పండిద్దామనుకునే క్రూరులున్నారుగా.., వాళ్ళున్నది పిడికెడే. కానీ ప్రపంచ సంపదంతా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ అదుపాజ్ఞల్లోనే , అజమాయిషీలోనే ..
ఆకలి కేకల చీకటి బతుకులకు బాసటై తమకు తోచిన విధంగా సహాయం చేసే వాళ్ళు మానవత్వం ఉన్నవారు పెరగాలి.
అదిగో.. ఆ గుడిలో ఉండే దేవుళ్లు చేయలేని పనులంటే చెడ్డ పనులు కాదు మంచి పనులు చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఎంతటి కష్టం లో నైనా తోడు ఉండేవాళ్లు పెరిగినప్పుడు, భరోసా ఇచ్చేవాళ్ళు పెరిగినపుడు మారుతుందేమో ..! " ఆశగా అన్నది గబ్బిలం
ప్రతి ప్రయాణానికి అనివార్య ముగింపు ఉంటుంది అనుకుంటూ చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగు దిశగా కదిలింది చీమ.
దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ రైతక్కల కృషి
పొయ్యివెలగని రోజుల్లో బుక్కెడు బువ్వ దొరకని కాలంలో కాళ్ల కింది మట్టినే బుక్కి మెలిపెడుతున్న పేగుల బాధ తీర్చిన ఆకలి పోరాటం వారిది.
రాళ్లురప్పలతో నిండిన బీళ్లలో అడవిని సృష్టించిన గొప్పదనం వారిది.
ప్రకృతితో మమేకమై, మరచిపోయిన పాత పంటలకి పునరుజ్జివనం ఇచ్చే వ్యవసాయం వారిది.
కాసుల కోసం కాదు, కడుపు ఆకలి తీర్చుకోవడం కోసమే వారి ఆరాటం.
సొమ్ముకోసం చేసే మాయాజాలం నుండి భూతల్లిని కాపాడుకోవడం, తమ చుట్టూ ఉన్న జీవావరణాన్ని సజీవంగా ఉంచుకోవడం కోసం ఎంత శ్రమైనా చేయడం వారి నైజం.
వారు నమ్మిన దాన్ని నలుగురికి పంచడం వారికి అలవాటు. ఆయితే, ప్రకృతికి, ప్రకృతి న్యాయానికి విరుద్ధంగా వెళ్ళరు.
జీవితాల్ని నిలుపుకునే ఆహారపంటలు, జీవావరణం కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యం.
పనికిరాని భూముల్ని సాగులోకి తెచ్చి, రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ బతుకులో వెలుగులుపూలు పూయించడం వారి విజయం
అట్లాగని టెక్నాలజీ వాడరని కాదు. అధునాతన టెక్నాలజీ అంది పుచ్చుకుంటూనే ప్రకృతితో మమేకమవ్వడం వారికే సొంతం.
పాత కొత్త విధానాల మేలుకలయికతో ప్రపంచమంతా తమ గొంతు వినిపించడం ఆ భూమిపుత్రికలకే సాధ్యం.
అవును, అది కల కాదు నిజం.
అసాధ్యంగా కనిపించేదాన్ని సుసాధ్యం చేసిన వాళ్లెవరో కాదు, అతిసామాన్యంగా కనిపించే అసాధారణ మహిళలు.
అందరూ అసుంట .. ఇసుంట అంటూ చెరబెట్టిన వాళ్ళతోనే భేష్ అనిపించుకున్న ధీరలు.
అతిపేదరికంలోంచి నిలువెత్తు వృక్షాల్లా ఆకాశానికి ఎదిగిన దళిత రైతక్కలు.
వీళ్ళకి చిన్నా చితకా అవార్డు కాదు అంతర్జాతీయ అవార్డు ప్రకటించారు . ఆ ప్రకటన చేసింది ఊరూ పేరూ లేని వాళ్ళు కాదు, ఐక్యరాజ్యసమితి.
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతిగా భావించే నోబెల్ కు సమానంగా చూసే మహోన్నతమైన ఈక్వేటర్ పురస్కారాన్ని అందుకున్న పర్యావరణవేత్తలు ఆ మహిళలు.
ఆ మహిళల గురించి మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపుకోవాలని వాళ్ళనిక్కడ పరిచయం చేస్తున్నాను.
2019 కి గాను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డిడిఎస్ )కి ఈక్వేటర్ పురస్కారాన్ని ప్రకటించింది. రెండేళ్ళకొకసారి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ UNDP ఈక్వేటర్ పురస్కారం ప్రపంచ దేశాల్లోని సంస్థలను ఎంపికచేసి పురస్కారం అందిస్తుంది. 127 దేశాలనుండి వచ్చిన 847 దరఖాస్తులనుండి కేవలం 22 సంస్థలను ఈ పురస్కారానికి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. అందులో ఒకటి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ ఏడాది మనదేశంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఒక్కటే ఈ పురస్కారానికి ఎంపికైంది. గతంలో తొమ్మిది సంస్థలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది.
స్థానిక వనరులతో ప్రకృతి సిద్దమైన పరిష్కారాలతో పర్యావరణాన్ని కాపాడుతూ, వారి ఆరోగ్యాన్నే కాక భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ అభివృద్ధి సాధించడంలో అసాధారణ ఉదాహరణగా నిలిచినందుకు చేసిన కృషికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళలకు ఈక్వేటర్ పురస్కారం అందజేస్తున్నామని జూన్ 5, 2019 న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
'మేము డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సాధించిన ఘనకార్యాలు వ్యక్తిగతంగా అభినందించాలి . మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. మీ ప్రయాణ ఖర్చులు , వసతి ఏర్పాట్ల బాధ్యత ఈక్వెటర్ ఇనిషియేటివ్ తీసుకుంటుందని ' అని ఐరాస బాధ్యులు స్పష్టంగా చెప్పారు.
ఈ క్రమంలో న్యూయార్క్ నుండి ఇద్దరు సభ్యుల బృందం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కి వచ్చి 15 రోజులుండి ఇక్కడి గ్రామాలలో చేస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అంతా వీడియో చిత్రీకరించుకొని వెళ్ళింది. మూడున్నర దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం వంటి వివిధ రంగాలలో ఈ మహిళలు చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చిందని సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు.
మూడుతరాల ప్రతినిధులైన అనసూయమ్మ, మొగులమ్మ, మయూరి లతో కూడిన ముగ్గురు సభ్యులను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్లేందుకు ఎంపిక చేసింది. అవార్డు అందుకోవడానికి వెళ్లడం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికీ వీసా తిరస్కరణకు గురవ్వడంతో కొంత నిరాశ చెందారు. కానీ .. చివరికి సాధించారు. వారితో పాటు డిడిఎస్ కో డైరెక్టర్ చెరుకూరి జయశ్రీ వెళ్లారు.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP ) వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి సెప్టెంబర్ 24 వ తేదీన న్యూయార్క్ లోని టౌన్ హాల్ లో జరిగే ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొని పదివేల డాలర్ల బహుమతిని (దాదాపు ఏడు లక్షలు ) స్వీకరించారు డిడిఎస్ రైతక్కలు.
అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనడంతో పాటు 2019 ,సెప్టెంబర్ 19 నుండి 26 వరకూ న్యూయార్క్ లో జరగిన కమ్యూనిటీ వర్క్ షాప్స్ , చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చిక్కపల్లి అనసూయమ్మ (50)
మూడున్నర దశాబ్దాల పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం అడవుల పెంపకంలో ద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా, ముంచుకొస్తున్న ముప్పునుంచి బయటపడడం మొక్కలను నాటడం , చెట్లను పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ వేదికపై చెప్పిందామె . తన తోటి మహిళలతో కలసి 1200 ఎకరాల పోరంబోకు భూముల్లో ఇరవై లక్షల చెట్లు నాటింది. అడవిని పెంచింది. ఇప్పుడు అది ఎంతో మంచి ఫలితాలను ఇస్తున్నదని ఆనందంగా తన అనుభవాలు ప్రపంచ వేదికపై పంచుకున్నది అనసూయమ్మ .
తొమ్మిదేళ్లకే పెళ్లయింది. భర్త సరిగ్గా చూడకపోవడంతో 14 ఏళ్లకే పుట్టింటికి చేరింది. కూలికి వెళ్ళేది. ఒకప్పుడు కడుపు నింపుకోవడం కోసం డిడిఎస్ సభ్యురాలిగా చేరింది. మొక్కల పెంపకంపై తీసుకున్న శిక్షణ ఆమె జీవిత గతినే మార్చేసింది. కొండప్రాంతాల్లోను జహీరాబాద్ ప్రాంతంలో గుబ్బడి అంటారు. ఆ గుబ్బడిల్లో మొక్కలు పెంచింది కాబట్టి జనం ఆమెను గుబ్బాడి అనసూయమ్మ అంటారు. ఇప్పుడామె నాటిన మొక్కలు వృక్షాలై మహా వృక్షాలై మనకగుపిస్తాయి.
"రేపు బయలుదేరతామనే వరకూ మేం పోతామో తెలియని పరిస్థితి . 18 వతేది మా ప్రయాణానికి ఏర్పాట్లయ్యాయి. 17 వ తేదీ మాకు వీసా మంజూరీ అయింది. గంటలకొద్దీ ప్రయాణం చేసి అమెరికా చేరాం. 22 సంస్థల నుంచి వచ్చిన వారిని కలిశాం. అందరినీ పరిచయం చేసుకున్నాం .
150 అంతస్థుల భవనంలో 46 అంతస్తులో మాకిచ్చిన బస. మూడునాలుగు కిలోమీటర్లు నడిచి మీటింగ్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ మా అనుభవాలు పంచుకున్నాం. నాలుగు రోజులు మీటింగుల్లోనే ఉన్నాం . ఎప్పుడూ ఊహించని అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం కలిగింది " అని తన ప్రయాణం గురించి చెప్పింది అనసూయమ్మ.
మొగులమ్మ (35)
అత్తాకోడళ్ల సంఘం ,భారతీయ చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు మిల్లెట్స్ సిస్టర్స్ నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషిస్తున్నది పొట్లపల్లి మొగులమ్మ. కేంద్రప్రభుత్వం వారి నారిశక్తి పురస్కారం రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతులమీదుగా అందుకున్నది మొగులమ్మ. భారతదేశ చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్యలో 5000 మంది సభ్యులున్నారు. ,సేంద్రియ వ్యవసాయం, భూసారాన్ని పెంచడం, చిరుధాన్యాల సాగు, కలిపి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించింది. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలతోనే దేశ భవిష్యత్ ఉన్నదని అందరూ గుర్తించాలని కోరింది.
మనదేశంలో అధికంగా వాడుతున్న పురుగుమందులు, రసాయన ఎరువుల వల్ల ఎదురవుతున్న అనర్ధాలు , మానవ మనుగడకు ముంచుకొస్తున్న ముప్పును వివరించింది.
అంతర్జాతీయ ఆహార భద్రత కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం చిరుధాన్య హక్కులు మహిళలకే చెందుతాయని మేము గట్టిగా నమ్ముతున్నామని అంటున్నది మొగులమ్మ.
అందరం ఐకత్యంతో ఉండి ఐకమత్యపు పంటలు మనం పండిస్తున్నం. అట్లనే అందరు పండించాలని కోరుకుంటున్నది మొగులమ్మ.
మయూరి (18)
మూడవ తరం ప్రతినిధి. మయూరి 18 ఏళ్ళ పస్తాపూర్ గ్రామస్తురాలు. మొదటిసంవత్సరం కమ్యూనికేషన్స్ డిగ్రీ విద్యార్థిని.
జీవవైవిధ్యంపై డాక్యూమెంటరీలు రూపొందిస్తుంది మయూరి. ఆసియాలో బయోడైవర్సిటీ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్న పిన్న వయస్కురాలు మయూరి.
ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు అందుకునే అసాధారణ అవకాశం నాకు వచ్చింది.
అక్కడ కూడా జరిగిన సమావేశాలను వీడియో డాక్యుమెంట్ చేశాను.
వాళ్ళ చేతిలో బంజరు నేలలు పంట భూములుగా మారిపోయాయి. ఎందుకూ పనికిరాని రాతినేలలు, గులకరాతి భూములు చేలుగా , చెలకలుగా, చిట్టడువులుగా, అడవులుగా దర్శనమిస్తాయి. వారి సంకల్ప బలం, శ్రమ శక్తి ఇచ్చిన ఫలాలు అవి.
బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీళ్లకోసం తన్లాడిన బతుకులు, చేయి చాచి చుట్టూ చూసిన బతుకులు ఇప్పుడు చెయ్యి చాచవు. చివరికి విత్తనాలు, ఎరువులు, కరెంట్, బోర్లు , మోటార్లు, నీళ్లు, మార్కెటింగ్ ఇలా వేటికీ బయటినుండి వచ్చే సహాయం కోసం ఎదురు చూడరు వీళ్ళు. ప్రభుత్వం నుండి ఏ పథకం వస్తుంది.. ఏమి సాయం వస్తుందని మోరలెత్తుకోని ఎదురుచూసే పరిస్థితే వీళ్లకు లేదు.
తామెవ్వరి ఆధీనంలో ఉండమని తమ స్వాధీనంలోనే ఉంటామని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు ఈ రైతక్కలు . తమకు కావలసిన ఆరోగ్యకరమైన తిండి, మందులు, ఎరువులు, పురుగుమందులు, మార్కెటింగ్ అంతా వారిచేతుల్లోనే ఉంది.
అంతేనా .. తమ పనిని, తమ పంటలని, తమతిండిని, తమ ఆరోగ్యాన్ని, తమ ఆచార వ్యవహారాలని, భాషా సంస్కృతుల్ని ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేస్తుంటారు వీళ్ళు. అందు వాళ్ళు వాడుకునే సాధనాలు రెండు. ఒకటి రేడియో. రెండోది వీడియో.
అక్షరం ముక్కరాకపోయినా అద్భుతంగా వీడియో డాక్యూమెంటరీలు చేస్తారు వీళ్ళు . డాక్యూమెంటరీ చేయడమొక్కటేనా .. ఆ డాక్యుమెంటరీ చేయడమెలాగో శిక్షణ ఇస్తారు. ఇక్కడి వాళ్ళకే కాదు బంగ్లాదేశ్ , పెరూ వంటి దేశాంతర వాసులకు కూడా శిక్షణ ఇచ్చి వచ్చారు.
అమాయక గ్రామీణ మహిల్లా కనిపించే వీళ్ళని కదిలిస్తే వినిపించే విజ్ఞానం అనంతం. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పార్లమెంట్ హౌస్ లో కూడా తమగొంతు వినిపించే అవకాశం వారికి వచ్చింది.
ఆ మహిళల్ని కదిపితే ఒక్కొక్కరూ వాళ్ళు తిరిగిన దేశాల లిస్టు ఇరవయ్యో .. పాతికో ఉంటాయి . ఈ ముగ్గురే కాదు ఇలా చంద్రమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, చిన్ననర్సమ్మ, పూలమ్మ, జనరల్ నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, కమలమ్మ, మంజుల, నాగమ్మ, స్వరూపమ్మ .. ఇలా ఎందరో ...
వాళ్ళు చూసిన ప్రపంచం, అదిచ్చిన జ్ఞానం ముందు నేను మనం పుస్తకాల్లో చదువుకున్న జ్ఞానం చాలా చిన్నది ..
మీరెప్పుడైనా జహీరాబాద్ వైపు వెళితే దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కి వెళ్లి అక్కడి రైతక్కల కృషిని చూడడం మరవకండి.
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు