(April,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
పెళ్లూరు సునీల్, సుంకర గోపాల్ మరియు దోర్నాదుల సిద్దార్థ గార్లు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
పెళ్లూరు సునిల్: మాది నెల్లూరు జిల్లా కోట గ్రామం. పెళ్ళూరు శేషయ్య సుదర్శనమ్మ నా తల్లిదండ్రులు. ముగ్గురు అక్కల తర్వాత నేను నాలుగో సంతానం. ఎంఏ తెలుగు, బియిడి చేశాను. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి చేశాను. ప్రస్తుతం కోటలోని బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నాశ్రీమతి సుప్రజ ఉపాధ్యాయురాలు. చంద్రశేఖరేంద్ర సుస్వర్ కుమారుడు. సాయి సుభిక్ష కుమార్తె. నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం. కానీ అందులోని మూఢాచారాలు, చాందస భావాలకు నేను వ్యతిరేకిని.
సుంకర గోపాల్: మాఊరు ఓజిలి రాచపాలెం. నెల్లూరు జిల్లా. పల్లె కావడం తో బాల్యం లో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయ్. దూరదర్శన్ కాలం. చదువులో ఎప్పుడూ ముందే. తెలుగులో పీజీ చేసాను. కొద్ది రోజుల్లో పి.హెచ్ డి పూర్తి అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ విద్య. మిగతా అంతా దూరవిద్య. అమ్మ నారాయణమ్మ. నాన్న కృష్ణయ్య.
దోర్నాదుల సిద్దార్థ: మాది చిత్తూరు జిల్లా పలమనేరు. ప్రస్తుతం నేను తెలుగు ఉపాధ్యాయుడు పెద్దపంజాణి పాఠశాల నందు పని చేస్తున్నాను. మా అమ్మ భువనేశ్వరి నాన్న ప్రసాదరావు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే వాడిని. ఆటలలో లేకపోయినా వ్యాసరచన , వక్తృత్వ పోటీలలో పాల్గొనేవాడిని 2005లో లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గా ఉద్యోగ జీవితం ప్రారంభించాను.
బీఎస్సీ చదివాక తెలుగు మీద ఉన్న ఆసక్తి వలన ఎమ్మే చేసి తెలుగు ఉపాధ్యాయునిగా 2012లో నియమించబడ్డాను. ప్రస్తుతం ద్రవిడ విశ్వవిద్యాలయములో PhD చేస్తున్నాను.
2015లో వివాహం అయింది ప్రస్తుతం ఒక పాప, బాబు.
ఖాళీ సమయాలలో కవిత్వం చదవడం, రాయడం, కథలు చదవడం చాలా ఆసక్తి.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
పెళ్లూరు సునిల్: చిన్నప్పటి నుంచి చదవడం ఇష్టం. తరగతిలో అందరికంటే ముందే ఉండేవాడిని. సాహిత్య,ఆధ్యాత్మిక గ్రంథాలను ఎన్నింటినో చదివాను. చదివిన ప్రతి పుస్తకం నన్ను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. నా గురువుల నుంచి నేను ఎంతగానో స్ఫూర్తి పొందాను. సాహిత్యరంగంలో రాధేయ గారు, ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు,ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అద్దేపల్లి గారు,ఆశారాజు ,భగవాన్ కొప్పర్తి ఇలా ఎందరో నన్ను ప్రభావితం చేశారు, చేస్తూనే ఉన్నారు. నా కులాన్ని గాక నాలోని భక్తిని చూసి శ్రీవిద్యను నాకు ఉపదేశించిన నా గురువు చంద్రశేఖర స్వామి గారు అనుక్షణం నాకు స్ఫూర్తి. భగవద్గీత , కవిసేన మేనిఫెస్టో, కొయ్యగుర్రం ఇష్టమైన పుస్తకాలు. ఎప్పటికైనా మగ్గం బతుకు లాంటి గొప్ప కావ్యం రాయాలనీ,మేడిపల్లి గారిలాగా జలపాతం లాంటి ప్రసంగం చేయాలనీ అలవికాని కోరికలు నావి.
సుంకర గోపాల్: మొదటిలోకవిత్వం విపరీతంగా చదివాను. దొరికిన ప్రతి కవితాసంపుటి ఇష్టంగా చదివాను. ఆధునిక కవులను ఎవరిని వదిలిపెట్టలేదు. శివారెడ్డి అభిమాన కవి. ఆశారాజు కవిత్వం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కువగా కథలు చదువుతూ ఉన్నాను. కవిత్వం, కథ రెండు నన్నుబాగా ప్రభావితం చేశాయి. సామాజిక చింతన, మానవ సంబంధాల ఆవిష్కరణను నేను ఆవిష్కరించే ప్రయత్నం చేసాను. చేస్తున్నాను. ఏ ఒక్కరో ప్రభావితం చేశారు అని చెప్పలేముగానీ, చదివిన ప్రతీకవి ప్రభావితం చేసినవారే.
దోర్నాదుల సిద్దార్థ: చిన్నప్పట్నుంచి తెలుగు మీద అభిమానం తో చిన్నచిన్న ప్రాస పదాలతో తో ఏదో కవిత్వం రాసే వాడిని. కానీ మొట్టమొదట రాధేయ గారి వలన అసలైన కవిత్వంతో నాకు పరిచయం ఏర్పడింది. కాబట్టి నేను ఆయనను నా కవి గురువుగా చెప్తాను. శ్రీ శ్రీ , తిలక్ నుండి నేటి శివారెడ్డి కొప్పర్తి ప్రసాదమూర్తి ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా నన్ను ప్రేరేపించిన వారే. ప్రత్యేకించి ఒక్కరి ప్రభావమే అని నేను చెప్పలేను. ఇక పలమనేరులో పలమనేరు బాలాజీ గారి ప్రభావం కూడా కొంత ఉంది. నా వెంట ఎప్పుడూ ఉండి ప్రోత్సహిస్తున్నారు.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
పెళ్లూరు సునిల్: నాకు ప్రత్యేకంగా సాహిత్య వారసత్వం అంటూ ఏమీ లేదు చిన్నప్పట్నుంచి నా చుట్టూ ఉన్న సమాజాన్ని నాలకి ఒంపుకుంటూ వెళుతున్న వాడిని. చిన్నప్పట్నుంచి ఎదుర్కొన్న పేదరికం కష్టాలు కన్నీళ్లు అనారోగ్యాలు లు ఆప్యాయతలు అనుబంధాలు నన్ను సున్నితమైన వ్యక్తిగా మార్చాయి. అందుకేనేమో నా కవితల్లో ఎక్కువ మానవసంబంధాల పట్ల ప్రాకులాట కనిపిస్తుంది. ముక్కుసూటితనం నిజాయితీగా పని చేయడం నా వ్యక్తిత్వం.వాటితోనే నా అక్షరాలకు పదును పెట్టుకుంటుంటాను.
సుంకర గోపాల్: మా నాన్న వీధీభాగవతం ఆడేవారు. నాకు బాగా తెలిసే నాటికి వాటి ప్రభావం తగ్గింది. ఏప్పుడైన తాగి వచ్చినప్పుడు కొన్ని దరువులు పాడేవారు. ఆ ప్రభావం నా మీద ఉంది. సామాజిక చింతనే నా రచనలకు నేపధ్యంగా చెబతాను.
ఉడుకు రక్తం లో ఉన్నప్పుడు సమాజం పరిస్థితులు చూసి ఆవేశం గా ఏదో చేయాలి అనే ఆలోచన ఉండేది. అది కాస్త ఆలోచన గా మారడానికి చదివిన పుస్తకాలు ఉపయోగపడ్డాయి. పేదరికం నుండే వచ్చాము. కానీ చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటం వలన పెద్దగా ఇబ్బంది లేదు. రాజకీయం గా జరిగే మార్పుల పట్ల ఎరుక ఉంది.
దోర్నాదుల సిద్దార్థ: మాది మధ్య తరగతి కుటుంబం నాన్నగారు బాగా చదువుకున్న వారైనప్పటికీ సినిమా వ్యాపారంలో ప్రవేశించి నష్టపోయారు తర్వాత ఏ వ్యాపారం చేసిన కలిసిరాక చాలా నష్టపోయి అనేక ఊర్లు మారవలసి వచ్చింది. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఉ ఆయన అప్పులకు భయపడి ఇల్లు విడిచి వెళ్లి పోయేవారు దానితో కుటుంబ పరిస్థితులు బాగా దిగజారింది బంధువుల సహాయంతో చదువు కూడా ఇంటర్మీడియట్ వరకు కొనసాగింది ఇలా అనేక ఊర్లు తిరగడం ఇంటి ఆర్థిక పరిస్థితి సమాజంలోని అసమానతలు నన్ను సహజంగానే కవిత్వం వైపు నడిపింది కొన్ని సందర్భాలలో డబ్బు లేకపోవడం అన్నిటికన్నా పెద్ద గురువు అది మనల్ని సమాజాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.
4. కవిగా, మీ కవిత్వం గురించి, మీ కవిత్వ సంపుటుల గురించి చెప్పండి?
పెళ్లూరు సునిల్: ఇప్పటివరకు చాలా కవితలు రాశాను.వాటిలో చాలా మటుకు జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు అనేకం పొందాయి. కవితా సంపుటి మాత్రం ఇంకా తీసుకురాలేదు. ఏడేళ్ల పాటు నేను చేసిన పరిశోధన "దీర్ఘకవితా వికాసం" అనే పేరుతో పుస్తకంగా వెలువరించాను. ఈ పుస్తకం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఎంతో మంది పెద్దల ఆశీస్సులు అభినందనలు అందేలా చేసింది. శ్రమకు తగ్గ గుర్తింపు అంటారే అలాంటిది అన్నమాట. ఎప్పటికప్పుడు నా పాత కవితలు నాకే నచ్చక పోవడం వల్ల పుస్తకం తీసుకు రావడం ఆలస్యం అవుతోంది.
సుంకర గోపాల్: మొదట ప్రాస పదాల తో ఏవో రాసే వాడిని. అనంతపురం వెళ్ళాక ప్రాసతో పాటు భావానికి ప్రాధాన్యం ఇవ్వడం తెలిసింది.
కవి కాకి కోగిర జయ సీతారాం జయంతి సభ నవంబర్14,2002 లో పెనుగొండ వినాయక మైదానం లో ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది సభకు హాజరయ్యారు. ఆ సభలో బాల్యం మీద రాసిన కవిత చదివాను. మంచి స్పందన వచ్చింది. అది నా మొదట రచనగా చెప్పుకుంటున్నాను.
నేను మొదట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయడి గా ఉద్యోగం పొందాను. సాహిత్యం చదవడం బాగా అలవాటు. ఆ క్రమంలో తెలుగు లో పి.జి చేయాలని ఆలోచన వచ్చింది. అధ్యయనం విస్తృతం అయింది. ఏ రోజు చదవడం మానలేదు. ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధన చేసే సమయంలో అప్పటికప్పుడు గేయాలు అల్లేవాడిని. తర్వాత ఉన్నత పాఠశాలలోకి , తెలుగు అధ్యాపకుడిగా వెళ్ళాను. తెలుగు భాష బోధకుడిగా మంచి అవకాశం కనుక వృత్తి, ప్రవృత్తి జమిలి గా సాగిపోయాయి.
సీసాకాలుష్యం అని మద్యపానం మీద రాసిన కవిత విశాలాక్షి పత్రికలో వచ్చింది. ఆ పత్రికలో యండమూరి గారి నవల కూడా వస్తుంది. ఆ పత్రిక వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి. ఆ పత్రిక సంపాదకులు ఈతకోట. సుబ్బారావు గారు ఒక రోజు ఫోన్ చేసి , పత్రిక వార్షికోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకు దొరుకుతుంది అన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో సభ. యండమూరి అతిధి గా రావడంతో సభ నిండిపోయింది. ఆయన ప్రసంగం ప్రారంభం లోనే విశాలాక్షి పత్రికలో పోయిన నెల నేను ఒక కవిత చదివాను. ఆ కవిత సీసాకాలుష్యం, కవి సుంకర. గోపాల్ అని ప్రకటించి వారికి నేను గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నా, వేదిక మీదకు స్వాగతం అని ప్రకటించారు. ఇది నేను మర్చిపోలేని సంఘటన. తర్వాత ఆంధ్ర జ్యోతి వివిధ లో వచ్చిన కురుస్తున్నదుఃఖం, ఖాళీ అయిన ఇల్లు,24 గంటలు కవితలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రముఖ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య గారు కవిసంగమంలో నా కవితలపై సమగ్ర వ్యాసం రాశారు. ఇది కూడా నేను ఊహించని సంఘటన.
దోర్నాదుల సిద్దార్థ: 2004 నుండి కవిత్వం రాస్తున్న ప్పటికీ ఇంతవరకు కవితాసంపుటి అయితే వేయలేదు.
చిత్తూరు జిల్లా ఉత్తమ కవిగా వరుసగా మూడు సంవత్సరాలు ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను
2014 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి పురస్కారం
2015లో X - ray పురస్కారం అందుకున్నాను.
NATA వారు మొదటిసారి ప్రారంభించిన అంతర్జాతీయ పురస్కారం మొదటి బహుమతి నేను అనుకున్నాను ఈ పోటీలో మన జెండా గురించి వర్ణిస్తూ నేను రాసిన కవితను చంద్రబోస్ గారు సిరాశ్రీ గారు భువన చంద్ర గారు రామజోగయ్య శాస్త్రి గారు మెచ్చుకుంటూ ఏకగ్రీవంగా నన్ను ఎంపిక చేయడం మరచిపోలేని అనుభూతి నా కవిత్వంలో ఎక్కువగా తాత్విక ధోరణి కనబడుతుంది మనుషుల మధ్య మనిషి లోపల జరిగే ఘర్షణలను ఎక్కువగా మా కవిత్వంలో కనిపిస్తుంది.
5. మీ ముగ్గురికి పరిచయం స్నేహం ఎలా జరిగింది?
అంతకు ముందు ఏ మాత్రం పరిచయం లేని మేం ముగ్గురం అనంతపురం జిల్లా బుక్కపట్నం లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకోవడానికి వచ్చి ఒకే గదిలో అద్దెకు దిగాం. ముగ్గురి భావాలు చాలా విషయాల్లో ఒక్కటే విధంగా ఉండేవి. విచిత్రంగా ముగ్గురమూ సాహిత్యం పట్ల అనురక్తి గలవాళ్ళమే. 2002 నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సాగిపోతున్నది మా స్నేహం. కవిత్వంలోనే కాదు వ్యక్తిగత వృత్తిగత జీవితాల్లోనూ ఒకరికొకరు సాన పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం.
6. రాధేయ గారితో మీ పరిచయం ఎలా జరిగింది?
ఉపాధ్యాయ శిక్షణ కోసం అనంతపురం జిల్లా బుక్కపట్నం వెళ్లడం జీవితంలో మంచి మలుపు. ఆ పక్కనే ఉన్న కొత్తచెరువు జూనియర్ కళాశాల లో అధ్యాపకులు గా ఉన్న డాక్టర్. రాధేయ గారి పరిచయం సాహిత్యం వైపు తీసుకు వెళ్ళింది. అయస్కాంతానికి ఇనుప ముక్కలు అతుక్కున్నట్టు మేము కవిత్వానికి అతుక్కుపోయాం అంటే నమ్మండి. మా చేత వందల పుస్తకాలు చదివించారు. కవిత్వంలో మెళకువలు నేర్పించారు.
అట్లా ఏది కవిత్వం కాదో తెలుసుకున్నాము. ఉమ్మడిశెట్టి అవార్డు సభల్లో మేము పాల్గొనే వాళ్ళము. తర్వాత మేము ఆయన పేరు మీద ఓ కవితా పురస్కారం కూడా నడుపుతున్నాము. అలా సాహిత్యం వైపు కదలడం జరిగింది.
7. రాధేయ కవితా పురస్కారం మరియు ఉమ్మడిశెట్టి సాహితీ సంస్థతో మీ అనుబంధం చెప్పండి.
రాధేయగారి ఉమ్మడిశెట్టి అవార్డును మొదటినుంచి గమనిస్తూ వస్తున్నాం. ఆయన నిబద్ధత మమ్మల్ని బాగా ఆకర్షించింది.ఉద్యోగంలో జీవితంలో కాస్త నిలదొక్కుకుని, సాహిత్యరంగంలో కొద్దిగా గుర్తింపు వచ్చాక మేము కూడా కవిత్వానికి ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి గురువుగారి పేరుతోనే అవార్డును స్థాపించి 2010 నుంచి ఇప్పటివరకు నిరాఘాటంగా కొనసాగిస్తున్నాం.
ప్రామాణికంగా అవార్డ్ ప్రకటన ఉంటుంది. ప్రలోభాలు ఉండవు. మంచి కవిత రాసిన కవికే ఇప్పటి వరకు పురస్కారం అందింది. ఉమ్మడిశెట్టి సంస్థ తో మాకు 18 సంవత్సరాల అనుబంధం ఉంది. పరిచయం కలిగిన దగ్గర నుండి రాధేయ గారితో కలసి నిర్వహణ లో పాలు పంచుకొంటూ ఉన్నాము.
8. మీ ముగ్గురు కలిసి ఇప్పటిదాకా నిర్వహించిన సాహితీ కార్యక్రమాల గురించి, ఒకరికి ఒకరు ఎలా సాహితీ సహకారాన్ని అందించుకున్నారో.. తెలియజేయండి ?
కుటుంబ కార్యక్రమాలు గాని సాహిత్య కార్యక్రమాలు గాని ఒకరినొకరు సంప్రదించకుండా జరిగింది లేదు. ఒకరి అభిప్రాయాలను మిగిలిన వారు గౌరవిస్తాం. దాపరికాలు దబాయింపులు లేకపోవడమే మా విజయ రహస్యం.
మేము ముగ్గురం రాధేయకవితా పురస్కారం నిర్వహిస్తున్న సంగతి తెలుసు. కరోన కాలంలో జూమ్ వేదిక గా నిర్వహించిన సాహిత్యంలో కి అనే కార్యక్రమం తెలుగు సాహితీ లోకంలో విశిష్ట మైనది గా గుర్తింపు పొందింది. కవులు, రచయితలు సుమారు 50 మంది తమ సాహితీ అంతరంగాన్ని గొప్పగా ఆవిష్కరించారు.
9. సాహిత్యంలో మీది నుంచి స్నేహబంధం కదా. దీని గురించి సాహితీవేత్తలు ఎవరైనా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారా?
ఎంతోమంది మా కవితా స్నేహాన్ని అభినందించారు. వ్యక్తిగతంగానూ సభలలోనూ మమ్మల్ని గురించి గొప్పగా పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
10. ముగ్గురు కలిసి ఒక కవిత ఎప్పుడైనా రాసారా?
రాశాం.
మేము ముగ్గురం కలసి రాధేయ గారి సాహిత్యం మీద తీసుకువచ్చిన అభినందన సంచికలో ఒక కవిత రాశాము. బుక్కపట్నం లో ఉన్నప్పుడు శిక్షణా సంస్థ లో చాలా నాటకాలు రాసి, ప్రదర్షించిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పటికీ మా ముగ్గురిలో ఎవరు కవిత రాసినా మిగిలిన వాళ్ళు అందులో లోపాలు సవరణలు చేస్తారు.
11. ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్య విమర్శ ఎలా ఉంది ?
పెళ్లూరు సునిల్: పాత పద్ధతుల్ని వదిలేసి కొత్త విధానాల్లో వినూత్నంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు సాహిత్య విమర్శ అప్డేట్ అవుతోంది. ఇలా ఉండడమే ఒక ప్రక్రియను కలకాలం నిలుపగలుగుతుంది.
సుంకర గోపాల్: నేడు తెలుగు సాహిత్య విమర్శ సంధి కాలంలో ఉంది. విమర్శను స్వాగతించే వారి సంఖ్య తక్కువగా ఉంది. పొగడ్త విమర్శకాదు. అలాగే తక్కువ చేయడం విమర్శ కాదు విమర్శకుల సంఖ్య పెరగాలి. రచయితలు సహృదయంతో స్వీకరించాలి.
దోర్నాదుల సిద్దార్థ: ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు విమర్శ ఎక్కువగానే వస్తోంది అనేక రకాల సామాజిక మాధ్యమాలు అంతర్జాల పత్రికలు ఎందుకు ముఖ్య భూమికగా నిలుస్తున్నాయి ఒక తరాన్ని మొత్తం రాచపాళెం గారు లక్ష్మీ నరసయ్య గారు ఇలాంటి విమర్శకులు నడిపిస్తే ఇప్పుడు శ్రీరామ్ లాంటి ఆధునికులు విమర్శలో రాటుదేలుతున్నారు. కానీ కానీ చాలామంది విమర్శ పేరుతో పుస్తక సమీక్షలు కేవలం పొగడ్తలతో నింపి వేయడం బాధాకరం. మంచి విమర్శ మాత్రమే మంచి కవిత్వం రావడానికి దోహదపడుతుంది తప్పులు చూపించకపోతే వాటిని సరిదిద్దకపోతే ఇక విమర్శ ఎందుకు?
12. రచయితలుగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
పెళ్లూరు సునిల్: వెయ్యి చేతులతో చెడుపై యుద్ధం చేస్తున్నా కాళీ మాత లాగా నేటి సాహిత్యాన్ని చూస్తున్నాం.
సుంకర గోపాల్: కవిత్వం కంటే కథకు మంచి స్పందన ఉంది. యువతరం సాహిత్యం వైపు తక్కువగా వస్తున్నారు. పాఠకుల సంఖ్య పెరగాలి.
దోర్నాదుల సిద్దార్థ: ప్రస్తుతం సాహిత్యం సవ్యమైన దిశలోనే ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఉన్న కవులను మూడు తరాలుగా విభజించవచ్చు శివారెడ్డి లాంటి వారు మొదటి తరం కవులుగా భావిస్తే మాతోపాటు ఉ మా వయసున్న అనేకమంది మూడవ తరంగా భావించవచ్చు. పుప్పాల శ్రీరామ్ అనిల్ డాని ,మౌళి,తగుళ్ళ గోపాల్ పల్లెపట్టు నాగరాజు ఇలా ఎంతోమంది వారిదైన శైలితో కవిత్వాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తున్నారు వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. గోపాల్, నాగరాజు ఇలాంటి కవులు లు మట్టి వాసనతో తమ యాసతో కవిత్వాన్ని రాస్తున్నారు.
అనంతపురంలో అక్షరమాలి సురేష్ ముందుండి సాహిత్యాన్ని నడిపిస్తున్నారు.
ప్రస్తుత కవులందరూ పైన ప్రపంచీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది వారు ఏ వాదం లో నుంచి మాట్లాడిన అంతర్ముఖం గా ప్రపంచీకరణ ధ్వని స్తోంది.
13. మీరు సాహిత్యం లోకి రాకముందు, సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
రాక ముందు సంగతి మాకు తెలియదు గానీ ఇరవై ఏళ్ళ సాహిత్య సహవాసంలో వాతావరణం చాలా మార్పులకు లోనయింది అని మాత్రం చెప్పగలం. కవిత్వం రాసే వాళ్ళు బాగా పెరిగారు. వస్తువైవిధ్యం కనిపిస్తోంది. గొప్ప భావనలు, కొంగొత్త అభివ్యక్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి ఆహ్వానించదగ్గ పరిణామాలు. వీటితో పాటు కవిత్వంలో కమర్షియలిజం కూడా బాగా పెరిగింది అని చెప్పక తప్పదు.
14. భవిష్యత్తులో మీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?
డాక్టర్ రాధేయ కవితా పురస్కారాన్ని ఇప్పటి లాగే నిజాయితీతో పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రణాళిక. మంచి కవిత్వం రాయాలి, అందరితో రాయించాలి.
మేము 20 సంవత్సరాల నుండి కవిత్వం రాస్తున్నాము. కవిత్వం సంకలనం గా తీసుకురావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అలాగే పాఠశాల, కళాశాల పిల్లలకు సాహిత్యాన్ని దగ్గర చేయాలి అనే ఆలోచన ఉంది. దీని కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.
15. పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు?
ఎక్కువగా చదవండి తక్కువగా రాయండి. రాసే ప్రతి మాట మనలోంచి రావాలి మనమై ఉండాలి. ప్రతి కవితలోనూ మనల్ని మనం ఆవిష్కరించుకోగలగాలి. మన బతుకు మూలాల్లో నుంచి , ఉద్యమ తాత్విక కోణాల్లోంచి నిప్పు రాజేసుకోవాలి. వస్తువే కాదు శిల్పం మీదా దృష్టి పెట్టాలి.
గోదావరి పత్రిక లో మంచి అంశాలు వస్తున్నాయ్. అన్ని ప్రక్రియలుకు చోటు కల్పిస్తున్నారు.
తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ గొప్పగా ఉంది. అన్ని తరాల వారికి చోటు కల్పిస్తున్నారు.
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు