గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు దిలీప్.విగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1 మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
మాది కొత్తగా ఏర్పడ్డ ములుగు జిల్లాలోని ములుగు మండలానికి చెందిన మల్లంపల్లి గ్రామం. నిరుపేద దళిత కుటుంబం. అమ్మానాన్నలు రవి లలిత లకు ముగ్గురు పిల్లలం. ఇద్దరు చెల్లెళ్ళు, నేను. మా చిన్నతనంలో అమ్మ నాన్న ఇద్దరు ఎర్ర మట్టి గుట్టల్లో లారీలు నింపడానికి పోయేవారు. నాన్న ముఠా మేస్త్రీగా ఉండేవారు. యాంత్రికరణ చాలా మంది జీవితాలను రోడ్డున పడేసినట్టే క్వారీలలో యంత్రాలు వచ్చి మా గ్రామంలో చాలా కుటుంబాలను రోడ్డున పడేసింది.ఆ రోడ్డున పడ్డ కుటుంబాలలో మాది ఒక కుటుంబం. అట్లా రోడ్డున పడ్డ అమ్మనాన్నలు మమ్ములను,కుటుంబాన్ని సాధడానికి నాన్న ఆటో డ్రైవర్ గా,అమ్మా వ్యవసాయ కూలీగా కొత్త అవతారం ఎత్తారు.ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లో అయినా ఉన్నత పాఠశాల విద్యా స్టేషన్ ఘన్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అయిపోయింది. పరకాల లో ఉపాధ్యాయ విద్యా ట్రైనింగ్ చేసి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నియమితుడనై వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లీ మండలంలోని ముచ్చిoపుల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.
ఘన్పూర్ గురుకులంలో ఉన్నపుడు లైబ్రరీలో తెలుగు వెలుగు మాసపత్రిక,కథల పుస్తకాలు చదివేవాడిని. ఆ తర్వాత సామజిక స్పృహ కలిగిన తర్వాత ఏది పడితే అదే చదివేవాడిని. నా సామాజిక రాజకీయ గురువు హరికృష్ణ గారి పరిచయం తర్వాత వారు పరిచయం చేసిన తాపి ధర్మారావు గారి "దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు?" పుస్తకం నాలో కొత్త ఆలోచనలు, నూతన ప్రశ్నలను ,అధ్యయన ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత భిన్నమైన సామాజిక సాహిత్యాన్ని చదివాను. చలం నవలలు, ఓల్గా కథలు,
రాహుల్ సంకృత్యాన్ రచనలు,శ్రీ శ్రీ ,కలేకూరి,బహుజన కవుల కవితలు ఇంకా అనేకమంది కవితలు, బాలగోపాల్ సామాజిక తాత్విక రచనలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?
దళితులు అంటేనే నూటికి 90శాతం పేదలు .అందుకే పేదలకు పర్యాయపదంగా దళితులు అని చెప్పుకోవచ్చు అనుకుంట. ఇప్పటివరకు పుట్టిన సామాజిక సాహిత్యం మొత్తం కూడా పేదలు,దళితులు బహుజనుల నుండే పుట్టింది. అట్లా నా పుట్టుకతో నా ఉనికిని గుర్తించే ఈ సమాజంలో నేను పడ్డ అవమానాల నుండే నన్ను నేను నూతన మానవుడిగా నిర్మించుకోడానికి నా చుట్టూ పరిస్థితులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.
4. మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.
నేను సాహిత్యం అనేది ఒకటి ఉంటుందని తెలియకముందే నా జీవిత అనుభవాలు, నా మది ఆలోచనలతో రాయడం మొదలు పెట్టా. అట్లా...9వ తరగతిలో ఉన్నపుడు
"పదునులేని కత్తి పనికి రాదు
చెల్లని పైసకు విలువ లేదు
నీటిలో నడవని పడవ అక్కరకు రాదు అలాగే...
విద్యలేని మానవునికి
సమాజంలో విలువ లేదు" అని విద్యా నాకు ఎంత అవసరమో నాకు నేను రాసుకున్న. అట్లా రాసుకుంటూ రాసుకుంటూ మిగతా సాహిత్యాలను చదువుకుంటూ ఈ సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాకు ఒకప్పుడు చాలామంది నూతన రచయితలకు సీనియర్ రచయితల సలహాలు, మెళకువలు, లభించేవి. అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండింది ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితులు లేకపోవడమే కాకా రాసే వారిపై నిర్బంధం కూడా కొత్త రచయితలు రాయకుండా చేస్తుంది. బలమైన సామాజిక, ప్రజా సాహిత్యం రాకపోవడానికి ఇది ఒక కారణం.ఒకప్పుడు విప్లవ సాహిత్యం సమాజంలో బలంగా దూసుకువస్తే నేడు అస్తిత్వవాద సాహిత్యం బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. కొత్తతరం చాలామంది కవులు, రచయితలు వీటినుండే రావడం మనం గమనించవచ్చు.
5. 5 సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
సాహిత్యం నాకు తెచ్చిన గుర్తింపుకంటే కూడా నా సామాజిక బాధ్యతను మరింత పెంచినది అనుకుంటున్నా. నా కవితలు,వ్యాసాలు చదివి నన్ను ఫోన్లో అభినందించడానికి కాల్ చేసే చాలామంది మరిన్ని సామాజిక రచనలు చేయాలనీ కోరేవారు.ఇదే నాకు సాహిత్యం ఇచ్చిన గుర్తింపు. నా కవితలు,వ్యాసాలు చదివిన వారిని నాకు ఫోన్ చేసేలా స్పందింప చేసిందంటేనే సాహిత్యం నాకు ఎంతటి గుర్తింపును తెచ్చిoదో అర్ధం చేసుకోవచ్చు.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?
ఏ సాహిత్యమైన అది వెలువడ్డనాటి కాలమాన పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచం ముందు ఉంచినపుడే అది నిజమైన సాహిత్యం అనిపించుకుంటుంది. సాహిత్యం ఇట్లానే ఉండాలని అనే వాదనను ఇట్లా రాస్తేనే సాహిత్యం అవుతుంది అనే వాదనను రెండింటిని ఒప్పుకోలేను. ఈ విషయంలో "సాహిత్యం అంటే జీవితంలో ఖాళీలను పూరించడం" అన్న బాలగోపాల్ మాటలు..మరియు "ఎవడో చెప్పినట్టుగా కాక నీకు నచ్చినట్టుగా రాయి"అన్న కలేకూరి మాటలు నా రచనకు స్పూర్తి. ఏ సాహిత్యం ఐన బాలగోపాల్ అన్నట్టు ఆయా వ్యక్తుల , ఆయా సమాజాల జీవితంలో ఖాళీలను పూరించడానికి తోఢ్పడినపుడే ఆ సాహిత్యానికి ఒక అర్ధం ఏర్పడినట్టు. ప్రస్తుత సాహిత్యంలో అట్లాంటి వాటా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఓల్గా "ప్రయోగం" కథ చదివిన నాకు అన్ని సంవత్సరాల క్రితం అంత ఆధునికంగా యెట్లా ఆలోచించినదా? అని నాకు నేనె ఇప్పటికీ అనుకుంట. నా జీవితంలో ఆలోచనలకు అద్దం పట్టిన కథ. రిజర్వేషన్స్ గురించి వచ్చే వాదనలు విన్న ప్రతిసారి బలమైన ప్రతిపాదన యెట్లా పెట్టాలా అని ఆలోచించే నాకు బాలగోపాల్ "రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం" చదివిన తర్వాత "ప్రతిభ" యొక్క తార్కిక నిర్వచనం నాలో చాలా అనుమానాలను నివృత్తి చేసింది. బలమైన వాదన పెట్టడానికి తోఢ్పఢ్ఢది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇట్లా ఆయా సందర్భాలలో మానవ జీవితంలో ఏర్పడ్డ ఖాళీలను పూరించే సాహిత్యం ప్రస్తుత పరిస్థితిలో రావలసినంత, ఆశించినమేర రావడం లేదు.
ఖాళీలను పూరించడానికి...
కవిత్వం చిటికెలు, చప్పట్లు చరిపించుకోవడానికి కాదు
సాహిత్యం సత్కారాలు సన్మానాల కోసం కాదు
అంటరాని బ్రతుకుల ఆవేదనను
అనగారిన వర్గాల ఆక్రోశాన్ని
పేద వారి వెతలను
బడుగు బలహీన వర్గాల బాధలను
'సిరా' సుక్కలుగా మార్చి
కళ్ళు మూసినట్టుగా నటించే నాయకుల
కనుల ముందు వాస్తవాల వెలుగులు పరుచడానికి
ఆకలి దప్పులు లేవని
జాతి మత కుల లింగ వివక్షలు లేవని
పుచ్చు మాటలు పలికే చచ్చు మూకల పై
అక్ష"రాళ్ళెత్తి" దండ యాత్రలు చేయడానికి
కవిత్వం, సాహిత్యం
సమత, సౌభ్రాతృత్వం
స్వేచ్ఛా ,స్వాతంత్రం సాధించడానికి
జీవితంలో ఖాళీలను పూరించడానికి
సాహిత్యం పట్లా సూక్ష్మoగా ఇది నా అభిప్రాయం.