గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు నూతనగంటి పవన్ కుమార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నేను నూతనగంటి పవన్ కుమార్. మాది వరంగల్ జిల్లాలోని కటాక్షపూర్ గ్రామం.
నిరుపేద బీసీ కుటుంబం మా నాన్న గారి పేరు నర్సయ్య, అమ్మ పేరు సరోజన. అమ్మ ప్రతిరోజూ నెత్తిమీద గాజుల గంపతో ఊరూరా తిరుగుతూ గాజులు అమ్ముతూ నన్ను ఎమ్మెస్సీ ఫిజిక్స్,బి.ఏడ్. వరకు తమ్ముడు సాంబరాజుని ఎంటెక్ వరకు చదివించింది.ఇంటర్ విద్య మినహా నా విద్యాబ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల,
కళాశాలలోనే జరిగింది.ఇక ప్రస్తుతం నేను ఉపాధ్యాయ విద్యనభ్యసించిన పాతికేళ్ల నిరుద్యోగిని..
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నా పై మిత్రుడు కవి,రచయిత అమృత రాజ్ ప్రభావం చాలా ఉంది. అతను ఎల్లప్పుడూ అన్యాయాలపై తన కలాన్ని సందిస్తున్నాడు.అతని ప్రోత్సాహంతోనే శ్రీశ్రీ కవిత్వం,భాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి,అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదివి ఎంతో ప్రేరణ పొందాను.ఆ ప్రేరణ తోనే సాహిత్య విత్తులను సమాజ మార్పుకై చల్లుతున్నాను.ప్రముఖ వార్త పత్రికల్లో వచ్చే విశ్లేషణలు కూడా నాలోని ఆలోచనలకు మరింత పదును పెట్టాయి.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.
నేను ఏ రోజు అనుకోలేదు సాహిత్యం వైపు నా అడుగులు పడతాయని మొదటిసారిగా ఓ అందమైన అమ్మాయి అందాన్ని వర్ణించడానికి కలం పట్టాను నిజం చెప్పాలి అంటే ఆమెతో మాట్లాడే దైర్యం లేక అక్షరాలతో అందమైన కవితలు రాసాను.ఆ తర్వాత నిజాన్ని,పేద ప్రజల భాదను నలుగురికి తెలియజేయడమే సాహిత్యమని తెలుసుకున్నాను.ఇంకా సామాజిక అసమానతల పెరుగుదలను చూసి.
అందిన కాడికి దోచుకుతింటున్న కొందరు అవినీతి రాజకీయ నాయకుల ప్రసంగాలను గమనించి, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వ్యక్తిత్వాన్ని,అధికారాన్ని నోట్ల కట్టలకి తాకట్టు పెట్టిన కొందరు అధికారులను కళ్ళారా చూసి అసహ్యమేసింది.ఇది మారాలనేభాద్యతగా రాయడం మొదలుపెట్టాను.దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకి జరుగుతున్న అన్యాయం చూసి నా గుండె బరువెక్కింది "తప్పదు ప్రతిఘటన" అనే కవితతో రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాను.ధరల పెరుగుదలవలన సామాన్యుడు అనుభవిస్తున్న బాధలను "సతమతం" అనే కవిత ద్వారా వివరించాను.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
సాహిత్యం ఎల్లప్పుడూ ప్రజా పక్షాన వుంటున్నది కవులు రచయితలు తమ జీవితాలను, అక్షరాలను ప్రజా శ్రేయస్సు కొరకు అంకితం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.ఇదంతా నాకు సాహిత్యంలోకి వచ్చాకే అర్దమైంది.ఇంకా నేర్చుకుంటున్నా.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
చాలా సంతోషాన్ని కలిగించింది.సమాజ మార్పు పట్ల నా బాద్యతను మరింత పెంచింది
ప్రజా పక్షాన పోరాడటానికి ప్రేరణ కలిగించింది.
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ప్రస్తుత సాహిత్యం నేటి సమాజం లోని అస్పృశ్యత లను అసమానతలను సమాజం నుండి వేరుచేయుటకు ఎంతగానో ప్రయత్నిస్తున్నది.లింగ బేదాన్ని వ్యతిరేకిస్తూసామాజిక సమానత్వం కొరకు పాటుపడుతున్నది.పాలకుల అవినీతిని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నది..!నాలాంటి యువత ఎంతో మంది సీరియస్ గా రాస్తున్నారు అని భావిస్తున్నాను.వారందరికీ నా తరపున శుభాకాంక్షలు.