గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకురాజు దొగ్గలగారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.
నా పేరు రాజు మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం,నాన్న పేరు సుధాకర్, అమ్మ పేరు స్వరూప, నాకు తోడు అక్క ఉంది,వ్యవసాయ మరియు శ్రమ ఆధారిత కుటుంబం నాకు తోడు అక్క తనకి పెండ్లి అయ్యింది.చిన్ననాటి నుండి విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే జరిగింది ప్రస్తుతం కరీంనగర్ లోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక శాస్త్రాలవిభాగంలో డిగ్రీ చేస్తున్న..
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నాకు మొట్టమొదట బాగా ప్రభావితం చేసిన వాటిలో ప్రథమ పాత్ర TVV విద్యార్థి సంగం యొక్క "స్టూడెంట్ మార్చ్" అనే పత్రిక.అందులో అచ్చు అయిన వ్యాసాలు కవితలు నన్ను సాహిత్యం దిక్కు ప్రభావితం అయ్యేలా చేసాయి. పాలకులు ప్రజలను చేస్తున్న దోపిడీ దానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్మించుకుంటున్న పోరాటాలు నాకు ముందుగా తెలిసింది స్టూడెంట్ మార్చ్ వల్లనే.అలాగే స్పార్టాకస్, అంటరాని వసంతం,ఏడు తరాలు,ఎర్ర నక్షత్రం,అమ్మ,సరిహద్దు లాంటి నవలలు నన్ను బాగా ప్రభావితం చేశాయి, "భగతసింగ్ వీలునామా" అనే పుస్తకం నాకు నిరంతర నూతన ఉత్తేజం. విరసం,వీక్షణం,శ్రామిక వర్గ ప్రచురుణలు లాంటి సాహిత్య సంస్థల ప్రభావం నా మీద ఉంది,అలాగే అలిశెట్టి ప్రభాకర్,శ్రీ శ్రీ ,వరవరరావు, శివ సాగర్,గుఱ్ఱం జాషువా, లాంటి కవుల రచనలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తోడ్పడ్డాయి.సమాజంలో స్త్రీ లు ఎదుర్కొంటున్నా సమస్యల మీద చాలా మంది రచనలు చేశారు.అలా స్త్రీల మీద వచ్చిన రచనల్లో నన్ను చాలా ఆకర్షించింది హైమావతి అక్క రాసిన "జోలే విలువ".ఆ పుస్తకంలో అక్క పితృస్వామిక పురాషాధిపత్య సమాజం స్త్రీని ఎలా దోపిడీకి గురి చేస్తుందో క్షుణ్ణంగా చెప్పింది.నన్ను కవిత్వం,వ్యాసాలు రాయడంలో ప్రతి క్షణం ప్రోత్సాహించిన ప్రియమైన TVV సహచరులకు,మరియు నా స్నేహితులకు ముఖ్యంగా స్నేహితురాలు మానసకి నన్ను వెన్నంటి ఉండి నా సాహిత్యాన్ని ఆదరించే సాహిత్య ప్రేమికులకు హృదయపూర్వక ప్రేమతో కూడుకున్న కృతజ్ఞతలు...
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.
ముఖ్యంగా ఇంత ఆధునిక కాలంలో కూడా సమాజంలో వివక్షలు, దోపిడీ,అణిచివేతలు, అసమానతలు ఉంటాయా..? అని చాలా మంది ఉన్నత అధికారుల్లో ఉన్న మేధావుల నుండి ప్రపంచ బ్యాంకు సామ్రాజ్యవాద దోపిడీకి గురి అవుతున్న ప్రజలు కూడా ఇప్పటికి అలాగే అనుకుంటున్నారు.పాలక వర్గాల ప్రజలను ఆ భ్రమల్లో ఉంచడంలో ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.అలా అనుకున్న వాడిలో నేను ఒక్కడిని. కానీ 2016 సంవత్సరంలో నాకు TVV విద్యార్థి సంగంతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో నేను విద్యార్థి ఉద్యమంతో పాటు,సమాజంలో ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆ క్రమంలో సాహిత్యం పై కూడా దృష్టి సారించాను.ఈ క్రమంలోనే రక్త సంబంధం కన్నా వర్గ సంబందం ఉన్నతమైంది అనే భావన నాలో బలంగా నాటుకుంది.క్రమ క్రమంగా ప్రజా ఉద్యమాలలో భాగమవుతున్న క్రమంలో పీడిత ప్రజల జీవిన స్థితి గతులు,నన్ను ఆలోచింప చేశాయి ఆ ఆలోచనలు నన్ను ప్రజల పక్షాన రచనలు చేసే విధంగా తోడ్పడ్డాయి.
4. మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?
నాకు స్కూల్ లో ఉన్న సమయం నుండే పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది.మా నాన్న నా చిన్నప్పటి నుండే ఇంటికి పేపర్ తీసుకొచ్చేవాడు తప్పకుండా పేపర్ లో వచ్చే కొన్ని కొన్ని కథలు చదివే వాడిని.కానీ అందులో ఏది పాలకుల సాహిత్యం..? ఏది ప్రజల సాహిత్యం అని నిర్ధారించే జ్ఞానం నాకు ప్రజాఉద్యమాలు పరిచయం అయ్యే వరకు తెలియదు. అప్పుడు నేను అవి చదివిన కూడా ప్రతి చిన్న సమస్యకి మానసిక ఒత్తిడులను అధిగమించలేకపోయాను కానీ ప్రజల వైపు నిలబడ్డ సాహిత్యాన్ని చదవడం అలవాటు పడ్డాక ప్రతి సమస్యని మానసికంగా అధిగమించే ధైర్యం వచ్చింది, నాకు విద్యార్థి,ప్రజా ఉద్యమాల గురించి చదవడానికి సమాచారం దొరికింది సాహిత్యం వల్లనే. క్రమంగా ఆ సాహిత్యం చదవడం వల్లనే నాకు సమాజం మీద బాధ్యత పెరిగింది.
5. మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?
నేను నా సాహిత్యం ఇచ్చే గుర్తింపు గురించి ఎప్పుడు ఆలోచించలేదు.కేవలం నా సాహిత్యం నా కవిత్వం,రచనలు పీడిత ప్రజల పక్షాన, వాళ్ళ కష్టాల గురించి, ప్రజా ఉద్యమాల పక్షాన ఉండేలా జాగ్రత్త పడుతూ ఆ రాసే క్రమంలో ప్రజల నుండి నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ.ఆ నేర్చుకున్నది మళ్ళీ ప్రజల గురించి రాసినప్పుడు ప్రజలు ఆదరించే విధానమే నా గుర్తింపు అనుకుంటా...
6. ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా కాలం,యువత పుస్తకాల కన్నా ఫోన్ లోనే ఎక్కువ గడుపుతున్నారు.అందుకు నేను అతిథుణ్ణి ఏమి కాదు.ప్రశ్నించే సమాజం కన్నా సోషల్ మీడియాలో ఉండే సమాజం ఎక్కువ అయిపోయింది.ఇది పాలక వర్గాలు పన్నినా కుట్రలో భాగమే సమాజాన్నీ ఆలోచింప చేయడం మానేసి పూర్తిగా బానిసలుగా తయారు చేస్తున్నారు.ఇదే అదునుగా ప్రజా ఉద్యమాలపై నిషేధాలు కూడా విదిస్తున్నారు అందులో భాగంగా ప్రజా పక్ష మేధావులను,కవులను,నిర్బంధంలో కి గురి చేస్తున్నారు ఈ ప్రక్రియ కు ప్రజా పోరాటాల ద్వారా ముగింపు పలకకపోతే ప్రజలపై నిర్బంధం రోజు రోజుకి తీవ్రమవుతుంది కాబట్టి సాహిత్యాన్ని కాపాడుకోవలంటే విశాల ప్రజా పోరాటాలే శరణ్యం..
అలాగే విద్యార్థులు చదువుతున్న చదువులు,పాఠ్య పుస్తకాలు సంస్కరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చాలా మంది ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.మరి ఆత్మహత్యను ప్రేరేపించే చదువులు ఎందుకోసం చదువుతున్నామో అవి మనకు అవసరమా..?లేదా మరి వాటి స్థానంలో ఎటువంటి చదువులు చదువాలి.వాటి కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనేది సమాజంలో చర్చ జరగాలి...