"ఇక్కడి ఏ రాయిని పలకరించినా చెపుతాయి వేవేల కథలు అంటూ పౌరుషాలకు పురుడుపోసిన ఓరుగల్లు గడ్డ నుంచి తన పౌరుషాన్నంత "గునుగు పూలు" లో చూపెట్టింది ఓరుగల్లు ఆడబిడ్డ శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారు.ఈ పేరు సాహితీ ప్రపంచానికి సుపరిచతమే...
కవిత్వం ఎప్పటి నుంచో రాస్తున్నప్పటికీ చాలా ఆలస్యంగా తన ఈ తొలి సంపుటిని మనకందించారు.
తెలంగాణలో గునుగుపూలకు ఎంతో విశిష్టత కలదు.బతుకమ్మను పేర్చడంలో తంగేడు తర్వాతి స్థానంలో ఉండేది ఈ గునుగుపూలే ...పూవై పుట్టాక పూజకో...సిగకో వచ్చి చేరుతుంటాయి.
కానీ గునుగుపూలు మాత్రం వాటికి నోచుకోకుండా తెలంగాణ ఆడబిడ్డల బతుకు చిత్రాన్ని చూపించే బతుకమ్మలో సింగిడి రంగులనద్దుకొని హుందాగా కూర్చుంటాయి.చెలకలల్లో వనంలా పెరిగే ఈ పూలు చూడటానికి గరుకుగా కనిపించినప్పటికీ...తాకితే మాత్రం సుతిమెత్తగా తగులుతుంటాయి.ఈ లక్షణమే ఉదయశ్రీ గారి ఈ కవిత్వ సంపుటిలో కనబడుతుంటుంది.తన చుట్టూ కనబడే సమస్యలకు,తనలోని జ్ఞాపకాలకు,స్పర్శించిన అనుభూతులకు అక్షరాన్ని తొడిగి రంగురంగుల ఈ సమాజ తత్వాన్ని గునుగు పూలు గా పూయించారు.తను తీసుకున్న కవితా వస్తువుల్లో ఎక్కువ భాగం స్త్రీ గురించే అయినప్పటికీ..రైతును,ప్రకృతిని, మట్టిని,జీవన ప్రవాహాన్ని,పల్లెను,పట్నపు సంస్కృతిని,పువ్వులను,కులాన్ని,నాన్నను,వృద్దులు...ఇలా చాలా అంశాలు వస్తువులుగా మారి కవిత్వంగా కనబడుతుంటాయి.ఈ బుక్ ని వస్తువు పరంగా పరిశీలిస్తే ఒక మల్టీ విటమిన్ లా గోచరిస్తది.ఇందులోని 51 కవితలను చదివాక స్త్రీ పక్షపాతి అని చెప్పకుండ ఉండలేము.కొన్ని మచ్చుకు చెప్పుకుంటే..
తను "అనంత సాగర స్వరూపం" కవితలో ఆమెను ఇలా అంటారు...
"అంతరాలలో రగులుతున్న
బడబాగ్నులున్నా చిరునవ్వులు చిందిస్తూ
ఆకాశాన్ని తనలో దాచే సంద్రంలా
రాగద్వేషాలను తనలో ఇముడ్చుకునే
స్థిర గంభీర రూపం ఆమె "
ఒక స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించే వాక్యాలు ఎంతమంది ఎంత రాసినా ఈ వాక్యాలు మాత్రం నిలిచిపోయేవని చెప్పుకోవచ్చు.మనిషై పుట్టాక జీవన వేట తప్పదు.ఆ వేటలో మనిషి చుట్టూ అల్లుకుపోయిన బంధాలు బలపడొచ్చూ...తెగిపోవచ్చూ.ఏది జరిగినా చివరకు చేరేది మాత్రం మట్టిలోకే! ఆ మట్టితో మనిషికి బంధాన్ని జతకడుతారు మన ఉదయశ్రీ గారు."మట్టి బంధాలు " కవితలో చివరి వాక్యాలు మాత్రం మనసును గుచ్చుకుంటాయి...అవి
"మట్టి పరిమళంలో దాగుంది
మనిషి బతుకు చిత్రం
ఎవరి ప్రయాణం ఎటువైపు సాగినా
మమతల ముడులు తెంచుకుని సాగినా
మనసు బంధాలకు మసిపూసిన
మనిషి బంధాలన్నీ చివరకు మట్టి బంధాలే"
చిరు వ్యాపారుల వెన్నుముకల మీద కట్టుకున్న మాల్స్ లోకి ప్రవేశిస్తే మధ్యతరగతి కుటుంబీకుడు చేతిలోని డెబిట్/క్రెడిట్ కార్డు లబోదిబోమని మొత్తుకుంటది.అదొక మాయాబజార్... అందులో నుండి బయటపడాలంటే తనకు తాను ఏకాగ్రతను గట్టిగా పట్టుకోవాల్సిందే...ఇదే విషయాన్ని "చూపులు చిక్కనీయకు" అనే కవితలో ఇలా అంటారు...
"అవసరాల వెతుకులాట ఆనాడు
దర్జాల ప్రదర్శణకై ఆర్భాటాలు నేడు
డెబిట్ కార్డులకు రెక్కలొస్తాయి
క్రెడిట్ కార్డులు బరువెక్కుతాయి
చూపులను చిక్కనీకు మాల్స్ మాయల
చిక్కాలకు..."
ఆడపిల్లలకు నాన్నలపైనే ఎక్కువ ప్రేముంటుందనేది లోకం పోకడ.ఉదయశ్రీ గారి "నాన్న" కవితను చదివాక ఈ విషయం మరోసారి రుజువైంది.నాన్నపై తను రాసుకున్న కొన్ని వాక్యాలను చూస్తే ...
"బాధ్యతలు ఎన్నున్నా నిటారుగా నిలిచే
ఆకాశంలా...
అంతరాలలో అలల అలజడులకు చెదరని
సంద్రమై నిరీక్షిస్తాడు తీరం చేరే నీ నవ్వుల
కోసం...!"
"గునుగు పూలు" గా తీసుకొచ్చిన ఈ కవిత్వ సంపుటిలో "గునుగు పూలు" కవితలో కొన్ని వాక్యాలు తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను చూపిస్తాయి....
"తెలంగాణలో విరిసిన పూల వనాలు
మా గునుగు పూల వనాలు
పరుగు పరుగున వస్తున్నాయి
బతుకమ్మ వచ్చిందని..."
ఈ సంపుటిలో మరో కవిత "గీత కార్మికుడు".ఇందులో గౌడన్న వృత్తి ఎంత రిస్క్ తో కూడుకున్నదో ఉదయశ్రీ గారు ఆసాంతం అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ కవితకు ప్రాణం పోసిండ్రని చెప్పొచ్చు...ప్రతీ స్టాంజా కూడా మనసును మెలిపెట్టేలా ఉన్నాయి.కొన్ని వాక్యాలను చూస్తే...
"ప్రాణాన్ని పదే పదే దేవుడికి తాకట్టు పెట్టి
చెట్టుని తనతో ముడివేసుకొని
ప్రేమగా జతకడతాడు...
"ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లు
చెట్టు శిఖరాగ్రం చేరుతాడు..."
"పుడమి తల్లిని తాకగానే
మరో రోజు దొరికినట్లో
మరో జన్మే దొరికినట్లో ఆనందించే
నిత్య సంతోషి గీత కార్మికుడు"
ఇప్పుడు ఎక్కడ చూసిన చిన్న కుటుంబాల సంస్కృతినే ఏలుతుంది.ఇంట్లోని పెద్ద మనుషులను కూడా భరించే స్థాయిలో లేని ఒంటరి మనుషులే కనబడుతున్నారు.
తమకది సుఖంగానే ఉందనుకున్నప్పటికీ కలుషిత మనసులు తయారవ్వడానికి ఇదొక పెద్ద కారణమనే చెప్పాలి.ఈ
వయోధికులను దూరం చేసుకోవడం వలన ఈ సమాజమెంత కోల్పోతుందో...వాళ్ల నుండి ఎంత నేర్చుకోవచ్చో... "వయోధికులు..." కవితలో ఈ విధంగా చెప్పుతారు....
"అనుభవాల ఘనులు వారు
యువతకు దారిచూపు నీతి సూర్యులు
కొత్త దారులకు బాటలు చూపే మైలురాళ్ళు
ఎన్నో గ్రంథాలయాల సారం వారి మాటలు"
అలాగే "నేనవరిని?" అంటూ మనిషి యొక్క
జన్మ అంతరాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు...
"అంతరాలలో నివసిస్తున్న విభాజక
సమాజంలో నాలోని గొప్పతనాలన్నీ
కొట్టుడుపోయి శేషం సున్ననే...
తరతరాల లెక్క ఇదే
ఎవరు భాగించినా ఫలితాలివే.."
ఈ కవిత్వ సంపుటిలోని కవితలన్నీ కూడా గునుగు పూలకు రంగులద్దినట్లుగా... తీసుకున్న వస్తువును బట్టి యాసను చూపెట్టారు.ఇందులో పుస్తక భాష కనబడుతుంది...తెలంగాణ యాసా కనబడుతుంది.మంచి కవిత్వం రాయడానికి పుస్తక పఠనం ఒక కారణమైతే...
వ్యక్తులను..సమాజాన్ని చదవడం కూడా మరో కారణమవుతుంది.ఉదయశ్రీ గారిలో ఈ రెండూ మెండుగా ఉన్నాయని అర్థమవుతుంది.దాదాపుగా ప్రతీ కవి యొక్క తొలి సంపుటి భావం,వస్తువు ప్రాధాన్యతను సంతరించుకుంటుందనే విషయం తెలుసు ...ఇందులో కూడా అదే కనబడుతుంది.తన ఆలోచనలకు మరింత పదునుపెడితే మంచి శిల్పంతో ఎంతో చక్కని కవిత్వం రాయగలరు...ఉదయశ్రీ గారిలో ఆ పట్టుదల ఉందని...రాయగలరని భావిస్తున్నాను."గునుగు పూలు" కవిత్వ సంపుటిని ఈ సాహిత్య ప్రపంచానికి అందించినందుకు మనసార అభినందనలు తెలుపుకుంటున్నాను.
****