(January,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
క్రీ.పూ. 1500లోని రుగ్వేదంలో 164వ సూక్తంలోని కవితల్లో దివి, పృథ్వి ఎవరు ముందుపుట్టారు? ఎవరు తరువాత పుట్టారు? పృథ్వి నుంచి ప్రాణం ఎలాపుట్టింది? ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమికి అంతం ఎక్కడ? లోకాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న ప్రశ్నలు ప్రాచీన మానవుడు వేసుకున్చాడు. ఆనాటికి విజ్ఞానం వికసించని దశలో సమాధానంగా అంతా దేవుడే అన్న విశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు.
భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తులో (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యు రూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే.
ప్రకృతిలోని భౌతిక పదార్థం, దానిలోని జీవం కలయిక వల్లే జీవం ఏర్పడుతోందని ప్రశ్నోపనిషత్ (క్రీ.పూ. 500-400) చెపుతుంది. ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో దార్శనికులు కొద్దిపాటి భౌతికవాద దృష్టితో చెప్పినారు.
ప్రాచీన సాహిత్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి విషయాలను ప్రపంచ విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రారంభదశ అని భావించారు. దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు.ప్రత్యక్ష పరిశీలన ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వస్తువు గురించి కొంత జ్ఞానంఏర్పడుతుంది. ఏ కారణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సూత్రీకరణ చేయమన్నారు. దీన్నే అసమాన ప్రమాణం” అని అన్నారు. ఈ సూత్రీకరణలు వాటంతటవే సత్యాలు కాజాలవు. వీటిని ఆచరణలో చూసి రుజువైతే సత్యంగా అంగీకరించమని చెప్పినారు. ఇది నేటి పరిశీలన, విశ్లేషణ, ప్రయోగం, సూత్రీకరణ పద్ధతులను పోలి ఉంది. చరకుడు, అసితకేశ కంబరుడు, కణాదుడు మొదలైన భౌతికవాదులు మత గ్రంధాలలో చెప్పిన వాటికన్నా భిన్నమైన అభిప్రాయాలు చెప్పినారు. ప్రధానంగా అవి;
1. భూమి, నీరు, అగ్న్ని ఆకాశం, గాలి కలయికతో (పంచభూతాలతో) ప్రకృతి ఏర్పడింది.
2. ఈ పదార్థాల విభిన్న కలయికల వల్లే ప్రకృతిలోని విభిన్న వస్తు జాలం ఏర్పడింది.
నిర్దీవదశనుండి సజీవదశకు, సజీవదశనుండి నిర్దీవదశకు నిరంతరం రూపాంతరం చెందుతాయి. ఇది నేటి వస్తు నిత్యత్వ సూత్రాన్ని పోలివుంది.
3. నిరంతరం మార్పు చెందే లక్షణం వాటిసహజ లక్షణం. నిప్పువేడిగా, నీరుచల్లగా ఎట్లానో అట్లా మార్పుకూడా.
4. ప్రకృతిలోని పంచభూతాలలో మనిషి తయారుచేయబడినాడు. దీనిని రసోత్పత్తి అన్నారు.రసమంటే నిరంతర చలనం అని అర్థం. అగ్ని వలన ఆహారం రస గా మారుతుంది. ఈ రస మరల రక్తం, మాంసం, కొవ్వు, మూలుగ, ఎముక, నీరులాగా మారుతుంది.
బుద్ధుడు (క్రీ.పూ. 563–483) ఒక పదార్థం వేరొక పదార్థంగా మారుతుందేగాని ఎన్నటికీ ధ్వంసం కాదని చెప్పాడు. మార్పునకు లోనుకానిదేదీ లేదు. ప్రపంచమంతా చలసశీలమైనది. మార్పు ప్రపంచ అస్థిత్వానికి మూలసూత్రమని చెప్పాడు. గ్రీసు దేశపు ' హెరాక్లిటస్' కూడా ఇదే సూత్రాన్ని చెప్పినాడు.
క్షణక్షణం మనం చూసే ప్రపంచం కొత్తదని బుద్ధుని భావన. ప్రపంచం గతిశీలమైనదని (మార్పుకు లోనవుతుందని) చెప్పిన బుద్ధుడు పరిణామవాదాన్ని అంగీకరించాడు.కార్యాకారణ సంబంధ సూత్రాన్ని ప్రతిపాదించాడు.
పూర్తిగా భౌతిక వాదంతో చెప్పినాడు అసితకేశకంబరుడు. ఇతను బుద్ధునికి (క్రీ.పూ. 500) సమకాలికుడు. ఇతను జీవం అనేది నీరు, నిప్పు, గాలి, మట్టి కలయికతో ఏర్పడిందన్చాడు. ఒకజీవి మరణిస్తే ఆజీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో నిప్పు నిప్పులో మట్టి నేలలో కలిసిపోతుందన్నాడు. స్వర్గం, నరకం, దేవతలు అంటూఏమీలేవు. ఉన్నవి ఈనాలుగే అని అన్నాడు.
ప్రకృతి కాత్యాయనుడు బుద్ధుని సమకాలికుడు. ఇతని ప్రకారం ప్రకృతి అచంచలమైనదీ, నిత్యమైనది. ప్రకృతిని ఎవరూ సృష్టించలేదు, ఎవరిచేతా నిర్మింపబడలేదు, అది స్వయం సిద్ధంఅని చెప్పినాడు. ప్రకృతి 7 తత్వాలుగా ఉందన్నాడు. పృథ్వీతత్వం, జంతు తత్వం, వాయుతత్త్వం, సుఖం, దు:ఖం, జీవితం. ఇవి ఒకదానికొకటి కారణం కావు. పరస్పరం హాని చేసుకోవు. నీరు నిప్పు, గాలి నేలతోపాటు సుఖం, దుఃఖం, చైతన్యంల కలయికతో జీవం పుట్టిందన్నాడితను.
క్రీ.పూ. 400లో కపిలుడు సాంఖ్య దర్శనాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ప్రకారం “ప్రకృతి ముందువుంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులో ఉంటుంది. అది నిత్యమైనది. ఈ సృష్టంతా దాని రూపాంతరాలే” నన్నాడు. నీరూ, గాలి, నిప్పు, నేల - ఈ నాలుగు అంశాలతో జీవం (చైతన్యం) పుడుతుందని చెప్పారు చార్వాకులు.
కొంత మంది అభిప్రాయంలో క్రీ. శ. 150లో కణాదుడనే రుషి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను వైశేషిక దర్శనానికి కర్త. ఇది షడ్దర్శనాలలో ఒకటి. ఇతని సిద్ధాంతం ప్రకారం ప్రతిపదార్థం పరమాణువులనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైంది. సృష్టికర్తను ఆమోదించలేదు. సృష్టి నిర్మాణానికి పరమాణువుల్లో చలనం అవసరమన్నాడు. కణాదుడు వైశేషిక దర్శనంలో ప్రతిపదార్థం పరమాణువు అనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైనదన్నాడు. పరమాణువులో చలనం ఉంటుందన్నాడు. ఇదే సృష్టికి మూలం అన్నాడు. అణువుల సంయోగవియోగాల వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయన్నాడు. ఇవి నేడు కనుగొన్న అనేక సైన్సు సత్యాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రతి పదార్థంలో పరమాణువు ఉంటుంది.పరమాణువులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ వెలుపల ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి. న్యూక్లియస్ లోపల ప్రొటాన్లు, న్యూట్రాన్లు చలిస్తుంటాయి. ప్రతి అణువు పరమాణువుల ద్వారా ఏర్పడి ఉంటుంది. అణువుల కలయికల వలనే పదార్థాలు ఏర్పడుతున్నాయి.
అణువుల సంయోగ వియోగాలవల్లే పదార్థాలు రూపొందుతాయన్నది కణాదుడి దృఢమైన అభిప్రాయం. ఇలా సాగిన భారతీయ భౌతికవాదం శంకరుని మాయావాదంతో మళ్లీ భావవాదంలోకి కూరుకుపోయింది. భగవద్గీతతో అది పరాకాష్టకు పోయి తిరిగి లేవలేనంతగా చతికిలపడిపోయింది. భారతీయ విజ్ఞానాన్ని అంధకారం అలుముకుంది. ఇదంతా మాకెప్పుడో తెలుసు, అన్ని వేదాల్లోనే ఉన్నాయంటూ నైరాశ్యంతో మాటలు వల్లించే అజ్ఞానులుగా మతఛాందసవాదం తయారుచేసింది భారతీయులను.
బుద్ధుని కాలంలోనే పాయసి అనే రాజు ఇహ పరలోకాలు లేవన్నాడు. చనిపోయినవారు తిరిగిపుట్టరు. ఇంతవరకు చచ్చిన వాడెవుడూ తిరిగి వచ్చి పరలోకముందని చెప్పలేదు. ధర్మాత్ములు, ఆస్తికులు (దేవుని నమ్మేవారు) చావంటే భయపడుతున్నారు. నిజంగా మోక్షం ఉన్నదని నమ్మితే చావంటే వారికి భయమెందుకు? చనిపోయిన శరీరాలనుండి ఆత్మ వెళ్ళినట్లు గుర్తు ఎక్కడుంది?అని ప్రశ్నించాడు.
చార్వాకులు, లోకాయతులు కూడా సృష్టి పరిణామాన్ని చెప్పినారు. వాక్చాతుర్యం గలవారిని చార్వాకులు అన్నారు. లోకమంతా విస్తరించినవారిని లోకాయతులు అన్నారు. వీరి ప్రకారం ఈ ప్రపంచం నిత్యం, సత్యం. ఈ ప్రపంచాన్ని గాని మానవున్ని గాని ఎవరూ సృష్టించలేదు. ప్రపంచం తనకు తానుగా ఆవిర్భవించింది.
జ్ఞానం పొందాలటే ఆచరణలో చూడాలన్నారు. ఆత్మ ప్రబోధం, అంతర్ దృష్టి వలన జ్ఞానం రాదన్నారు. అగ్ని, నీరు, భూమి, గాలి పదార్థానికి మూలం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచేతన పదార్ధాలకు చెతన్యం వస్తుంది. ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది శరీరాన్ని విడిచి బయట విడిగా ఉండలేదు. మనిషి మరణిచగానే శరీరం, ఆత్మ రెండూ నశిస్తాయని చెప్పినారు. ఇది నేడు ప్రాణం ఎలా ఆవిర్భవించిందో చెప్పే దానికి దగ్గరగా ఉంది. నీటిలో కొన్ని వాయువులు ప్రత్యేక పరిస్థితుల్లోకలిసినపుడు ప్రోటోప్లాజం ఏర్పడి ప్రాణం వచ్చిందని నేడు సైన్సు చెపుతోంది.
సృష్టిని గురించి ప్రాచీన సాహిత్యంలో రెండు రకాలు వాదనలు సాగినాయి. పై వాదనలు ప్రజాసామాన్యంలో ప్రచారంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ పైవాదనలకు భిన్నంగా ఉన్నవన్నీ మత సాహిత్యంలో భాగంగా ఉండి పోయినాయి. మొట్టమొదటగా హిందూ మతంలో ఉన్న భావనలు పరిశీలిద్దాం.
హిందూమతం ప్రకారం ప్రారంభంలో విశ్వం ఓంకారం నుంచి జనించిందన్నారు. ఓంకారం నుంచి ఆదిశక్తి పుట్టిందన్నారు. ఆదిశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు. బ్రహ్మ సృష్టికర్త పాత్రను, విష్ణువు పాలననూ మహేశ్వరుడు లయకారకుని పాత్రను తీసుకున్నారన్నారు.బ్రహ్మ తన ముఖం నుంచి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించినట్లు చెప్పినారు. చండాలుర గురించి, గిరిజనుల గురించి ఎక్కడా చెప్పలేదు.
బ్రహ్మఆకాశాన్ని సృష్టించాడు. దాని నుండి జలం, జలం నుండి అగ్ని దాని నుండి వాయువు పుట్టించినాడు. అగ్ని వాయువుల కలయికతో భూమి ఏర్పడింది. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు.
బైబిల్ ప్రకారం దేవుడు ఒకరోజు ఆకాశాన్ని, మరోరోజు భూమిని, ఇలా సముద్రాన్ని, వృక్షాలను, జంతువులను చివరిగా ఆడమ్, ఈవ్లను సృష్టించాడు. వారిని ఒక ఆపిల్ పండు తినొద్దని చెప్పినాడు. కానీ వారు దేవుడు పంపిన దేవదూతల్లో ధిక్కార స్వరం వినిపించిన ఒకదేవదూత(దయ్యం) ఆ ఆపిల్ను తినమని చెపుతుంది. ఆడమ్, ఈవ్లు ఆపిల్ తినడంతో జ్ఞానం కలుగుతుంది.తాము దిగంబరులమని తెలుసుకుంటారు. వారి మధ్య సెక్సు కోరికలు ఏర్పడతాయి. వారికలయికతోమానవులు పుట్టుకొచ్చారు. ఇలా సృష్టి జరిగిందని క్రైస్తవ మతం చెపుతుంది.
ఇస్లాం మత (గ్రంథం ఖురాన్ (ప్రకారం సృష్టినంతా ఇల్లాహ్ ఎనిమిది రోజులలో చేశాడు.ఆకాశాన్ని, భూమిని, తన రాజ్యపీఠాన్ని సృష్టించాక సూర్యున్ని, చంద్రున్ని నక్షత్రాలను సృష్టించాడు.తరువాత మానవున్ని మట్టితో తయారుచేసి అతనిలో ఇల్లాహ్ తన ఆత్మను ఊదాడని రాసినారు. ఆ మానవుని పక్కటెముక నుంచి ఒక స్త్రీని తయారుచేసి ఆమెకు కూడా తన ఆత్మను ఊదినాడు. ఇలా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడని ఖురాన్ చెపుతుంది.
క్రీ.శ. 1440లో యూరప్ సమాజం సాంస్కృతిక పునరుజ్జీవనం పొంది చీకట్లను తెంచుకొని విజ్ఞానపు వెలుగులోకి దౌడుతీస్తే భారతదేశం మాత్రం ఛాందసవాదపు చీకట్లలోనే ఉండిపోయింది.
డార్విన్ ప్రకృతిని విపరీతంగా పరిశీలించి, శోధించి చివరకు జీవజాతుల పుట్టుక (ఆరిజన్ ఆఫ్స్పీషీస్)ను ప్రపంచానికి అందించాడు. సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను తోసేసి అదికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ తరువాత జరిగిన అనేక పరిశోధనలు ఆయన సిద్ధాంతాన్ని నిరూపించాయి. ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్న పరిణామ వాదం ప్రకారం ప్రకృతిలో ఉన్న కార్బన్, హైడ్రోజన్, ప్రాణవాయువు(ఆక్సిజన్), నైటోజన్ ఇవి అనేక విధాలుగాకలియడం వల్ల సేంద్రీయ పదార్థాలు వాతావరణంలో ఏర్పడి, అవి వానలతో పాటూ కలిసిసముద్రంలో చేరివుంటాయి. ఆ సేంద్రీయ పదార్థాలు తిరిగి అనేక విధాలుగా కలవడం వల్ల సంకీర్ణమైన కొత్త పదార్థాలు ఏర్పడినాయి. అలా ఏర్పడిన క్రమంలో ఆల్టిహైడ్స్, కీటోన్స్, ఎమైనోయాసిడ్స్ మొదలైనవి ఏర్పడినాయి. జీవానికి కావలసిన ఎమైనోయాసిడ్లు (ప్రోటీన్లు) ఏర్పడటం తద్వార ప్రాథమిక జీవలక్షణాలను ప్రదర్శించే కణాలు ఏర్పడటం జరిగింది. 1924లో రష్యాకు చెందిన శాస్త్రవేత్త 'ఒపారిన్', 1929లో ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త హాల్డెన్ 'లు నిర్జీవ పదార్థం నుంచే జీవం ఆవిర్భ వించిందనే దానికి బలమైన ఆధారాలు కనుగొన్నారు. దానితో దీన్నే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసమ్మతంగాఆమోదిస్తున్నారు. 1995లో బైబిల్ చెప్పింది మాత్రమే నమ్మేమ పోప్ జాన్ పాల్ (వాటికన్ సిటీ)పదార్థం నుంచే జీవం వచ్చిందని, భగవంతుని సృష్టికాదనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించాడు కూడా.
జీవానికి ప్రోటీన్ల వలెనే న్యూక్లియోటైడ్స్ కూడాచాలాఅవసరం. న్యూక్లియోటైడ్స్ రకరకాలుగా చేరడం వల్ల డి.ఎన్.ఎ, ఆర్.ఎన్.ఎ మాలిక్యూల్స్ఏర్పడతాయి. ఇవి జీవుల వారసత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయోతెలుసుకోవడమేగాకుండా వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. భారతీయ శాస్త్రవేత్తహరగోవింద ఖొరానా అమెరికాలో కృత్రిమ జీన్స్ సృష్టించాడు.ఈ రకంగా జీవం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు కనుగొని ప్రపంచానికి సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పడంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు
Jan 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు